Sunday, 15 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదినాలుగవసర్గ

                                  రామాయణము 

                                 యుద్ధకాండ -అరువదినాలుగవసర్గ 

కుంభకర్ణుని మాటలు విన్న మహోదరుడు "కుంభకర్ణా !'నేను ఒక్కడినే యుద్ధమునకు వెళ్లి శత్రువులను తుదముట్టించెదను '. అని నీవు పలికిన మాటలు సరిగా లేవు . దండకారణ్యములో రాముడు ఒక్కడే మన రాక్షసులను అనేక వేలమందిని చంపినాడు . అక్కడ మరణించగా మిగిలిన రాక్షసులు లంకకు వచ్చి తలదాచుకున్నారు . వారు ఇప్పటికి ఆనాటి రాముడి పరాక్రమమును తలుచుకుని వణికిపోతుంటారు . మన లంకలో వున్న సమస్త రాక్షసులుయుద్దమునకు వెళ్లినా రాముడిని ఎదిరించగలమని నమ్మకము లేదు . అటువంటిది నీవు ఒక్కడివే యుద్ధమునకు వెళ్ళుట వలన ప్రయోజనములేదు . "అని పలికి అక్కడే వున్న రావణునితో 
 "మహారాజా !మీరు అంగీకరించినచో నావద్ద ఒక ఉపాయము వున్నది . మహోదరుడు ,ద్విజిహ్వుడు ,సంహాద్రి ,కుంభకర్ణుడు ,వితర్దనుడు 'అను ఈ అయిదుగురు యుద్ధమునకు వెళ్ళినారని లంకలో దండోరా వేయించుము . మేము యుద్దములో మా శాయశక్తులా యుద్ధము చేస్తాము . రాముడిని అంతమొందించి వచ్చినచో అంతా సంతోషమే . అట్లు కానీ యెడల మేము రణరంగము నుండి దెబ్బలతో వచ్చెదము . మీ పాదములపై వాలి అందరూ చూస్తూ ఉండగా రామలక్ష్మణులను భక్షించేసాము  అని  అసత్యము చెబుతాము . వెంటనే నీవు ఆ విషయమును దండోరా వేయించి ,సంతోషముతో వున్నట్టుగా వుండు . ఈ విషయము జనుల ద్వారా తెలిసిన సీత వేరే దిక్కు లేక నిన్ను చేరును . అప్పుడు విజయము మనదే "అని పలికెను 

రామాయణము యుద్ధకాండ అరువదినాలుగవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment