Saturday 3 March 2018

రామాయణము కిష్కిందకాండ -పదమూడవసర్గ

                                        రామాయణము 

                                  కిష్కిందకాండ -పదమూడవసర్గ 

రామలక్ష్మణులు ,సుగ్రీవుడు ,ఆంజనేయాది వీరులు కిష్కింధకు పయనమయి కొండలను వాగులను దాటుతూ అడవిదారి వెంట నడకసాగించిరి . దారిలో  ఎన్నో పరిమళాభూరితమైన పుష్పములు కల వృక్షములు ,పెద్దపెద్ద చెట్లు కలవు అవి చూచుటకు మిక్కిలి రామణీయముగా ఉండెను వాటిని చూసిన రాముడు సుగ్రీవునితో "మిత్రమా !ఈ వృక్షముల యొక్క ప్రత్యేకత తెలుపుము "అని కోరగా సుగ్రీవుడు "మిత్రమా !ఇచట "సప్తజనులు "అని ప్రసిద్ధి చెందిన ఏడుగురు మునులు ఇచట కఠోరమైన తపో నియమములను పాటించుచు తలకిందులుగా వారమునకు ఒక్కసారిమాత్రమే వాయుభక్షణము చేయుచు ఆహారము ముట్టక తపము చేసిరి . 
వారి తపస్సు ఫలించి వారు సశరీరముతో స్వర్గమునకు వెళ్లిరి . అయినను వారు ఇచటికి వచ్చి యజ్ఞయాగాదులు నిర్వర్తించెదరని ఇచటి వారు చెప్పుకుందురు . ఆ ప్రదేశములోకి మనుష్యులు కాను పశుపక్షాదులు కానీ ప్రవేశించలేవు . వెళ్లిన వారు తిరిగి రాలేరు . "అని ఆశ్రమము చూపించి చెప్పెను . మరల సుగ్రీవుడు రాముని తో "మిత్రమా ఆ ముని ఆశ్రమమునకు నమస్కరించుము . వారికి నమస్కరించిన వారికి సకల కోరికలు తీరి శుభములు కలుగును "అని పలికి తానును నమస్కరించెను .పిమ్మట వారు పెక్కు దూరము పయనించి కిష్కింధకు చేరుకొనిరి . 

రామాయణము కిష్కిందకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Friday 2 March 2018

రామాయణము కిష్కిందకాండ -పన్నెండవసర్గ

                            రామాయణము 

                                     కిష్కిందకాండ -పన్నెండవసర్గ 
అప్పుడు సకల శుభదాయకుడైన శ్రీరాముడు సుగ్రీవుని మాటలు విని తన మనసుకి ధైర్యము నమ్మకము కలిగించుటకు తన విల్లు ధరించి వాడి ఐన శరమును బలిష్ఠముగా ఉన్న ఓ మద్ది చెట్టుపై వేయగా అది దానిని చీల్చి దానికి సమాంతముగా వున్న మరో ఏడు మద్దిచెట్లనీ ఏకకాలంలో చీల్చి ,కొండను చీల్చుకుంటూ పాతాళమున ప్రవేశించి తిరిగి రాముని తూణీరములోకి చేరెను .

 రాముని పరాక్రమమును కళ్లారా చూసిన సుగ్రీవుడు మిక్కిలి సంతోషించి ,శ్రీరాముని బలపరాక్రమములను పొగిడి ఆయనను ఆలింగనము చేసుకొనెను . 
పిమ్మట రాముడు చెప్పుటచే ,సుగ్రీవుడు తన అన్న ఐన వాలి పైకి యుద్ధమునకు వెళ్లి నగరము వెలుపల నిలబడి పెద్దగా పిలిచెను . అప్పుడు యుద్ధవీరుడైన వాలి ఆ కేక విని సమరోత్సాహముతో పరుగుపరుగున వచ్చి తమ్ముడితో తలపడసాగెను . ఆ మాహావీరులు ఇరువురు తమ ముష్టిఘాతములతో ఒకరినొకరు బలముగా మోసుకొనసాగిరి . ఒకేలా వున్న వారిరువురిలో సుగ్రీవుని రఘునందనుఁడు గుర్తింపలేకపోయెను . అందుచే తన బాణమును ప్రయోగించలేదు .

 అంతకంతకు బలము సన్నగిల్లగా ప్రాణభయముతో సుగ్రీవుడు తిరిగి ఋష్యమూక పర్వతమునకు పరుగు తీసెను . 
మతంగా మహర్షి శాపము గుర్తుండుటచే వాలి ఋష్యమూక పర్వతముపై అడుగు పెట్టక "బతికిపోయావుపో "అని వెనుతిరిగేను . ఋష్యమూక పర్వతము చేరిన సుగ్రీవుని చెంతకు రామలక్ష్మణులు ,హనుమదాది వీరులు చేరిరి . వారిని చూసిన సుగ్రీవుడు సిగ్గుతో తల వంచుకుని "రామా !నీవు రక్షించెదవనే ధైర్యముతో మా అన్నపైకి యుద్ధమునకు వెళ్లితిని . నీవు నాకు ఇచ్చిన మాటను ఏల నిలబెట్టుకోలేదు . నిన్ను నమ్మినందుకు ఇదేనా ఫలితము ?"అని ప్రశ్నించగా రాముడు 
"మిత్రమా !సుగ్రీవా !రూపురేఖలలోను ,కంఠ ధ్వనిలోను మీరిరువురు ఒక్కమాదిరిగా ఉంటిరి . మీలో ఎవరు నీవో ,ఎవరు వాళూ నేను పోల్చుకోలేకపోయితిని . పొరపాటున నీకు బాణము తగులునేమో అని నేను బాణ ప్రయోగము చేయకుంటిని .  ఈ సారి నీవు ఏదేని ఒక గుర్తును ధరించి యుద్ధమునకు వెళ్లుము . అప్పుడు నేను నిన్ను సులభముగా గుర్తించి వాలిని వధింపగలను "అని పలికెను . అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడి ఆజ్ఞను అనుసరించి అచట దొరుకు నాగకేసరి పూలను మాలగా కట్టి సుగ్రీవుడి మేడలో వేసెను . అనంతరము అందరూ కలిసి తిరిగి కిష్కింధకు పయనమయ్యిరి . 

                     రామాయణము కిష్కిందకాండ పన్నెండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .