రామాయణము
అరణ్యకాండ -ఇరువదినాల్గవసర్గ
ఖరుడు ,దూషణుడు అపారమైన పదునాలుగువేలమంది సేనతో శ్రీరాముని ఆశ్రమము వైపుగా వచ్చుచుండగా ,రామునికి దుశ్శకునములు కనిపించినవి . వాటిని గమనించిన రాముడు "లక్ష్మణా !ఈ దుశ్శకునములను బట్టీ ఎదో ఆపద రాబోవుచున్నదని అవగతమవుతున్నది . కనుక నీవు మీ వదినను తీసుకుని దగ్గరలోని గుహలో ఉండుము . నేను ఆ ఉపద్రవమును నాశనము చేయుదును "అని పలికెను .
ఆ దుశ్శకునములను గమనించిన లక్ష్మణుడు సైతం ధనుర్భాణములు ధరించుచు ,యుద్ధమునకు సిద్ధమగుచుండెను . రాముడు అతడిని వారించి సీతా దేవి రక్షణ బాధ్యతను లక్ష్మణునికి అప్పగించెను . లక్ష్మణుడు సీతను తీసుకుని గుహ లోకి వెళ్లెను . అప్పుడు శ్రీరాముడు ధనుర్భాణములు ,కవచము ,ఖడ్గము మొదలగున్నవి అన్నియు ధరించి యుద్ధమునకు సమాయత్తమయ్యెను .
ఖరుడి సైన్యము కదలికలకి అరణ్యములోని మృగములన్నియు భయముతో దూరముగా పారిపోవసాగినవి . దేవతలు ,యక్షులు ,కిన్నెరులు ,గంధర్వులు ,మునులు ,సిద్దులు మున్నగు వారంతా ఆ యుద్ధమును చూడవలెనని కోరికతో ఆకాశములోనుండి ఆసక్తితో గమనించసాగిరి . రాక్షస సైన్యము పదునాలుగువేలమంది ,శ్రీరాముడు ఒక్కడు అతడి పరాక్రమమును చూడవలెనని ఆత్రుతతో సమస్త దేవతలు ఎదురుచూడసాగిరి . రాక్ష స సైన్యము శ్రీరాముని ఆశ్రమముకు దగ్గరకు వచ్చిరి . వారు ప్రళయకాల రుద్రుడి వలె ఉన్న శ్రీరాముని చూసిరి . వారిలో వారు శత్రువును నేను చంపుతాను అంటే నేను చంపుతాను అని వాదించుకోసాగిరి .
రామాయణము అరణ్యకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment