రామాయణము
కిష్కింద కాండ -పదునెనిమిదవసర్గ
మరణావస్థలో వున్నవాలి శ్రీరాముని తనను వధించబూనటానికి కారణము అడుగగా శ్రీరాముడు ఇలా కారణము చెప్పనారంభించెను . "వానరా !ధర్మార్ధ విషయములు నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు . సరే నిన్ను శిక్షించుటకు కారణము చెబుతాను విను ,కొండలతో కొనలతో ,అరణ్యములతో కూడిన ఈ భూమి ఇక్ష్వాకు వంశ ఆధీనములో వున్నది . ఇప్పుడు ఇక్ష్వాకు వంశ ప్రభువు భరతుడు ,మేమందరము ఆయన అనుచరుల వంటి వారము ఆయనకు ధర్మపాలనలో సహాయపడు వారము . ఓ వాలి !పురుషుడు తనకంటే చిన్నవాడైన తన తమ్ముడిని ,తన పుతృడిని ,తన శిష్యుడిని ముగ్గురిని పుత్రుని వలె చూసుకొనవలెను . ఇది ధర్మజ్ఞులు చెప్పిన ధర్మము . ఆ ధర్మము ప్రకారము నీ సోదరుడైన సుగ్రీవుని భార్య నీకు కోడలుతో సమానము అనగా కూతురు వంటిది . అటువంటి ఆమెను నీవు కామాతురడవై చెరపట్టితివి .
నీవు చేసిన ఈ తప్పుకు నేను శిక్షవిధించితిని . రాజ్యములో తప్పుచేసినవాడికి శిక్షవిధించక పోయినట్లయియే ఆ పాపము రాజుకు తగులుతుంది . పూర్వము ఇట్టిపాపమునే శ్రవణుడు అనే వాడు చేసాడు . మా వంశము వాడైన మాంధాత చక్రవర్తి అతడికి భయంకరమైన శిక్షవిధించాడు . ఓ వానరా !నీకు నేను విధించిన శిక్ష సరియైనది ఇందు ఏ మాత్రము అనుమానము లేదు . అదీ కాక నేను సుగ్రీవునితో మైత్రి చేసుకున్నప్పుడు అతడి భార్యను అతడి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించెదనని మాట ఇచ్చాను . నేను నా మాటను ఎలా నిలబెట్టుకోకుండావుండగలను ?ఓ వాలి !ఇక నిన్ను చాటుగా చంపుటకు గల కారణము చెప్పెదను వినుము . మహారాజులు మృగములను చాటున ఉండి అయినా వాలా పన్ని అయినా చంపవచ్చు . అది ధర్మమే నీవు మనిషివి కావు మృగమువి కావున ఇలా నిన్ను చంపుటలో ఏ దోషమూ లేదు . "అని పలికెను .
శ్రీరాముని మాటలు విన్న వాలి "రామా !నీవు ధర్మపరుడవు ,నేను ఈ బాణపు దెబ్బకు తట్టుకోలేక ఏవో మాట్లాడాను నన్ను క్షమించు . నాకు నా మరణము గూర్చి చింతలేదు నా బాధ అంతా నా ఒక్కగానొక్క ముద్దులకుమారుడు అయినా అంగదుడు గురించే అతడిని అల్లారుముద్దుగా పెంచుకున్నాను . అతడి పరిస్థితి ఏమవుతుందో అనే నా భయము . నాయందు దయ ఉంచి నీవు అతడిని సంరక్షించుము . లక్ష్మణుడిని ,సుగ్రీవుని చూసినట్లే అతడిని చూడుము . నా భార్య తార మిక్కిలి తెలివికలది . ఆమె రాబోవు ఆపదను అంచనావేయుటలో సమర్థురాలు . ఆమె మాటలు పెడచెవినపెట్టి నేను ఈ మరణమును కొనితెచ్చుకున్నాను . సుగ్రీవుని ఆమెను ఏమి అనవద్దని చెప్పు "అని పలికెను .
అప్పుడు రఘురాముడు "వానరా !అంగదుడు ఇంతవరకూ నేనుండి పొందిన ప్రేమాభిమానములే నా నుండి సుగ్రీవుని నుండి పొందగలడు . శిక్ష అనుభవించినావు కావున నీ పాపము నుండి విముక్తుడవు అయ్యావు . కావున నీవు విచారించవలదు "అని పలికెను . ఆ మాటలు విన్న వాలి స్వామి !నా అపచారమును మన్నింపుము "అని వేడుకొనెను .
రామాయణము కిష్కిందకాండ పదునెనిమిదవసర్గ సమాప్తం .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment