Thursday 30 April 2020

రామాయణము యుద్ధకాండ -------నూటయొకటవ సర్గ

                                  రామాయణము 

   

                         యుద్ధకాండ -------నూటయొకటవ సర్గ 

తన అసురాస్త్రము నిర్వీర్య మై పోవుట చే రావణుడు  రౌద్రము (మయుడిచే నిర్మింప బడిన అస్త్రము) ను శ్రీ రాముడి పై ప్రయోగించెను . శ్రీ రాముడు గాంధర్వం అనే అస్త్రము తో రౌద్రాస్త్రమును ముక్కలు చేసెను . అది చూసిన రావణుడు కోపము తో  సౌరాస్త్రము ప్రయోగించెను . రాముడు తన బాణ పరంపర తో  ఆ అస్త్రమును కూడా ఛేదించెను . 
రావణుడు పది బాణములతో శ్రీ రాముడి ఆయువు పట్టుల యందు కొట్టెను .  శ్రీ రాముడు మిక్కిలి కోపంతో పది బాణములతో రావణుని యొక్క వివిధ అవయవములపై గట్టిగా కొట్టెను . అపుడు లక్ష్మణుడు మానవ కపాల చిహ్నముగల రావణుని యొక్క ధ్వజమును తన బాణములతో ముక్కలు చేసెను . రావణుని రధసారధి చెవులకు ధరించిన  బంగారు కుండలములు లక్ష్మణుడు ఒకే బాణముతో ఖండించెను . పిమ్మట రావణుని ధనస్సును కూడా ముక్కలు చేసెను . 
రావణుడు తన ధనస్సు ముక్కలైపోవుటచే క్షణ కాలము పాటు ఏమీ తోచక  ఊరకుండెను . అప్పుడు విభీషణుడు పైకెగిరి రావణుని అశ్వాలను తన గదతో సంహరించెను . అప్పుడు రావణుడు వెంటనే తన రధమునుండి కిందకు దూకి  ఒక బల్లెమును విభీషణుని పైకి విసిరెను .  ఆ బల్లెము విభీషణుడిని చేరక ముందే లక్ష్మణుడు దానిని ఖండించివేసెను . అపుడు యుద్ధరంగమున వానరుల కోలాహలం చెలరేగింది . పిమ్మట రావణుడు విభీషణుని  చంపుటకు మరొక బల్లెము పైకి ఎత్తగ అది చూసిన లక్ష్మణుడు  రావణుని పై బాణ వర్షమును కురిపించెను . తన మీదకు వచ్చిపడుతున్న బాణాలను తట్టు కొనలేక విభీషణుణ్ణి చంపే ప్రయత్నమును రావణుడు విరమించుకుండెను . 
అప్పుడు రావణుడు లక్ష్మణుని పై శక్త్తి అను ఆయుధమును ప్రయోగించి పెద్దగా గర్జించెను  అపుడు శ్రీ రాముడు వేగముగా వచ్చుచున్న ఆ శక్తి ఆయుధమునకు నమస్కరించి "ఓ శక్తీ ఆయుధమా లక్ష్మణునకు శుభమగుగాక !నీ లోగల ప్రాణహరణ శక్తి నశించు గాక " అని పలికెను . అంతలో ఆ శక్తి ఆయుధము లక్ష్మణుని వక్షస్థలమున లోతుగా నాటుకొనుటచే లక్ష్మణుడు నేల పై పడిపోయెను . 
అది చూసిన శ్రీ రాముడు కోపముతో బాధతో రావణుని వధించుటకు గట్టి పూనిక తో నిశ్చయించుకొనెను. రావణుడు తీవ్రముగా కొట్టుచుట చే  ఆ శక్తి  లక్ష్మణుని గుండెలను  చీల్చుకొని అవతలకు వెళ్లి భూమికి గుచ్చుకొనెను . అక్కడి వానర ప్రముఖులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ లక్ష్మణుని శరీరమునుండి ఆ శక్తిని బయటకు లాగలేక పోయిరి అపుడు బలశాలి అయిన రాముడు భయంకరమైన ఆ శక్తిని తన రెండు చేతులతో పట్టుకొని బయటకులాగి దానిని విరిచివేసెను . స్పృహ తప్పి పడి  ఉన్న లక్ష్మణుని   చూసి  అతడిని కౌగలించుకొని శ్రీ రాముడు హనుమంతునితో ఇలా పలికెను . "కపివరులారా !  మీరు లక్ష్మణుని  చుట్టూ చేరి  ఇతడిని జాగ్రత్తగా చూసుకొనండి పాపాత్ముడు , క్రూరాత్ముడు అయిన  ఈ దశ గ్రీవుని సంహరించుటకు ఎప్పుడో సంకల్పించాను . ఇప్పుడు ఆ సమయము ఆసన్నమయింది . ఓ వానరులారా !ఇప్పుడే మీ ముందు సత్య ప్రతిజ్ఞ   చేయుచుఁన్నాను ఈ లోకంలో రావణుడో  రాముడో ఎవరో ఒకరే నిలిచి ఉండుట తధ్యము దీనిని మీరు త్వరలోనే చూడగలరు . " అని పలికెను. 
వానరులతో ఇలా పలికిన పిమ్మట శ్రీ రాముడు  యుద్ధ సన్నద్దుడై తన బాణములతో  రావణుని కొట్టెను . రావణుడు కూడా శ్రీ రాముని పై అనేక బాణములను వర్షింప చేసెను . రామరావణులు  ఒకరినొకరు  వధింపవలననే పూనికతో  ప్రయోగించుచున్న బాణములు  పరస్పరము  ఢీకొనుచుండగా  భీకర ధ్వనులు ఏర్పడుచుండెను . శ్రీ రాముని యొక్క బాణములు వరసగా తనపై వఛ్చి పడుతుండటం చే  రావణుడు  మిక్కిలి పీడితుడై  పెనుగాలికి తట్టు కోలేని  మేఘమువలె  భయముతో  పరుగులు తీసెను . 





రామాయణము ----యుద్ధకాండ ------నూటయొకటవ సర్గ -------సమాప్తము . 



శశి . 

ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు ) తెలుగు పండితులు . 












రామాయణము యుద్ధకాండ -నూఱవ సర్గ

                                        రామాయణము 

             

                                యుద్ధకాండ -నూఱవ సర్గ 

మహోదర మహాపార్శ్వులు మరణించుట చూసిన  రావణుడు కోపంతో రధమును ముందుకు నడుపమని సారథికి ఆజ్ఞాపించెను  . అప్పుడు రావణుడు తన సారధితో" ఆ రామ లక్ష్మణులను , హతమార్చి మన లంకా పుర వాసుల దుఃఖమును తొలగించెదను . "అని పలికెను. 
 రావణుడు రథముపై వేగంగా శ్రీ రాముడి వద్దకు వెళ్లుచుండగా అతడి రథచక్ర ఘోషలు నలు దిశలా వ్యాపించెను . వానర సైన్యము వద్దకు వచ్చిన రావణుడు తామసాస్త్రమును ప్రయోగించెను. బ్రహ్మ దేవుడు స్వయముగా నిర్మించిన ఆ అస్త్రము  వానరులను దహించి వేయ సాగింది . ఆ ప్రభావము తట్టుకొనలేక ఎటువారటు పారిపోయిరి . అప్పుడు రావణుడు శ్రీ రాముడను చూసి ఆయనతో  యుద్ధము చేయుటకై శ్రీ రాముని వైపుగా వెళ్లసాగెను . 
రావణుని రదము తన వైపుకు వచ్ఛుట చూసిన శ్రీ రాముడు ధనుష్టంకారము  చేసెను . ఆ శబ్దము భూమిని బద్దలు చేయునట్టుగా  ఉండెను . అప్పుడు లక్ష్మణుడు   రావణునితో  ముందుగా యుద్ధము చేయ దల్చి రావణునిపై బాణములను ప్రయోగించెను . వాటిని రావణుడు తన బాణములతో ఆకాశము లోనే ముక్కలు  చేసెను . పిమ్మట రావణుడు శ్రీ రాముడపై బాణముల వర్షము కురిపించెను . శ్రీ రాముడు వాటిని మధ్యలోనే ముక్కలు చేసెను . పిమ్మట శ్రీ రాముడు రావణునిపైన రావణుడు శ్రీ రాముడి పైన పరస్పరము వివిధ రకములైన  శరములను అతివేగముతో ప్రయోగించిరి . అయినను వారిలో ఎవ్వరు పరాజితులు కాకుండిరి . తీవ్రమైన వారిరువురి  యుద్ధ రీతులకు ప్రాణులన్నియూ  భయపడ సాగెను . 
రావణుడు రెచ్చిపోయిన  సర్పమువలె బుసలు కొడుతూ అసురాస్త్రము ద్వారా సింహ ములు , పెద్ద పులులు, రాబందులు, డేగలు, కాకులు, గ్రద్దలు, నక్కలు,తోడేళ్ళు , ఐదుతలలు గల సర్పములు, కుక్కలు, కోళ్లు, వరాహములు, గాడిదెలు,ముసళ్ళను  , కోళ్లు,మొదలగు ప్రాణుల యొక్క ముఖముల ఆకారములో ఉన్న బాణములను సృష్టించి శ్రీ రాముని దెబ్బ తీయుటకై ప్రయోగించెను . 
అది చూసియాసిన  శ్రీ రాముడు ఆగ్నేయాస్త్రము ద్వారా మండుతున్న అగ్ని , ప్రకాశిస్తున్న సూర్య చంద్రులు , అర్ధచంద్రుడు తోక చుక్కలు , నక్షత్రాలు ఉల్కలు , గ్రహములు, మెరుపుతీగలు, మొదలైన, వానివలె మెరయుచున్న పదునై న  బాణములనుఁ సృష్టించి రావణుడిపై ప్రయోగించెను . 
రావణు ని ఘోరభాణములు , శ్రీ రాముని ఆగ్నేయాస్త్రము దాటికి ఆకాసములోనే ముక్కలైపోయెను . అది చూసిన సుగ్రీవాది వానర ప్రముఖ వీరులందరు సంతోషముతో శ్రీ రాముని చుట్టూ చేరి కోలాహలధ్వనులు కావించిరి దిక్కులు పిక్కటిల్లు నట్లు  జయజయ ధ్వనులు  కావించెను. 




రామాయణము --- యుద్ధ కాండ----- నూఱవసర్గ -------సమాప్తము. 




శశి ,

ఎం.ఏ ఎం.ఏ  (తెలుగు ), తెలుగు పండితులు. 




Friday 3 April 2020

రామాయణమ- యుద్ధకాండ -తొంబదితొమ్మిదవ సర్గ

                                       రామాయణము 

                                   యుద్ధకాండ       -     తొంబదితొమ్మిదవ సర్గ 

సుగ్రీవుడి చేతిలో మహోదరుడు మరణించుట చూసి మిక్కిలి బల శాలి అయిన మహాపార్శ్వుడు కోపంతో , అంగదుడి సైన్యమును తన బాణములతో హింసించ సాగెను  .  వేగంగా వీచే గాలికి తొడిమెల  నుండి ఫలములు రాలి పడిపోయినట్లు ఆ రాక్షసుని బాణముల దాటికి  ప్రముఖులైన వానర యోధుల శిరస్సులు  శరీరముల నుండి  వేరై  రణభూమి అంతటా పడిపోయెను . మహాపార్శ్వుని  బాణపరంపర  కు  దెబ్బ తినిన  ఆ వానరులు  దాదాపు స్పృహలేని స్థితికి గురిఅయి విషాద గ్రస్తులై యుద్ధ విముఖులైరి .  
అపుడు తన బలములు భీతిల్లుట చూసిన అంగదుడు పున్నమినాటి సముద్రుడివలె విజృంభించెను . మహాపార్శ్వుడు, వాలిసుతుడు ఆ  సమరభూమి అందు  మిక్కిలి భీకరముగా  యుద్ధముచేసిరి  ఆ సంగ్రామములో  అంగదుడు మహాపార్శ్వుని  అంతమొందించెను . అది చూసిన రాక్షస సైన్యము  మిక్కిలి  భీతిల్లిరి  రావణుడు క్రోధముతో ఊగిపోయెను  .  
వానరులు పట్టరాని సంతోషముతో ఆకాసము తాకినట్లు సింహనాదం చేసిరి . అది విని రావణుడు కదనరంగమున  యుద్ధసన్నద్దుడై నిలిచెను . 



రామాయణము, యుద్ధకాండ - తొంబదితొమ్మిదవ సర్గ ---- సమాప్తము . 






శశి,

ఎం ఏ , ఎం ఏ( తెలుగు) ,
తెలుగుపండితులు .