Tuesday 4 January 2022

రామాయణము , ఉత్తరకాండ--- ఎనబదిమూడవసర్గ

                            రామాయణము  

                          ఉత్తరకాండ--- ఎనబదిమూడవసర్గ 

రాముని యొక్క ఆజ్ఞను అనుసరించి ద్వార పాలకుడు లక్ష్మణ భరతులకు రాముని ఆగమన వార్త గురించి తెలిపెను . ఆ వార్త విన్న వెంటనే భరత లక్ష్మణులు పరుగు పరుగున రాముని వద్దకు వచ్చిరి . శ్రీ రాముడు తమ్ముళ్ళని ఇరువురిని అక్కున చేర్చుకొని " సోదరులారా! నేను వాగ్దానము చేసిన విధముగా సర్వ శ్రేష్టమైన బ్రాహ్మణ కార్యమును నెరవేర్చితిని . ఇప్పుడు రాజసూయ యాగము చేయగోరుచున్నాను . ఈ యాగము అక్షయ సంపదలను ఇచ్చును . శాశ్వత ఫలములను ప్రసాదించును . దీని వలన ధర్మం వృద్ధి చెందును . సకల పాపములు నశించును . మీరు బాగుగా అలోచించి నాకు యుక్తములైన సూచనలను చేయుడు " అని పలికెను . 
శ్రీ రాముని మాటలు విన్న భరతుడు అంజలి ఘటించి " మహా పురుషా నీవు మిక్కిలి పరాక్రమశాలివి.  ఈ భూమండల మంతయూ నీ అధీనములో ఉన్నది . నీవు పరమ ధర్మాత్ముడవు . నీ కీర్తి ప్రతిష్టలు అజరామరములు . రాజా! ఈ యజ్ఞము చేయుట వలన ఈ భూమండలమును కల రాజ వంశములన్నియూ దెబ్బతినే  అవకాశము కలదు . కావున అట్టి యజ్ఞమును మహాత్ముడవైన నీవు ఎలా చేయుదువు ?"అని పలుకగా శ్రీ రాముడు ఉత్తమోత్తమమైన రాజసూయ యాగమును చేయవలెనని అభిప్రాయపడితిని . సహేతుకములైన నీ మాటలు విన్న పిమ్మట నేను ఆ ప్రయత్నము నుండి విరమించుకొనుచున్నాను . భరతా ! తెలివి కల వారు లోకమునకు బాధాకరమైన పనులు చెయ్యరాదు . లోక కళ్యాణ  కారకములైనప్పుడు బాలుర వచనములు కూడా గ్రాహ్యములు " అని పలికెను .   

రామాయణము ఉత్తరకాండ ఎనుబదిమూడవసర్గ సమాప్తము . 

                                                                  శశి ,

                                                              ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

No comments:

Post a Comment