రామాయణము
ఉత్తరకాండ -ఎనుబదియొకటవసర్గ
మిక్కిలి ప్రభావశీలి అయిన దేవర్షి అగు శుక్రాచార్యునకు శిష్యులద్వారా విషయము తెలిసెను . వెంటనే ఆ మహర్షి శిష్యులతో కలిసి ఆశ్రమమునకు వచ్చెను . అక్కడ కుమార్తెను చూసి ,ఆమె దీనస్థితిని చూసి ,ఆగ్రహోదగ్రుడయ్యెను . మండిపడుతూ తన శిష్యులతో "శిష్యులారా !దండుడు చేసిన అపరాధమునకు గాను ,అతడు సపరివారంగా ఏడు రోజులలో నశించి తీరును . దేవేంద్రుడు ఈ దుర్మార్గుడి యొక్క దేశమునకు వందయోజనముల విస్తీర్ణము వరకు తీవ్రమైన దుమ్ము వర్షము కురిపించి ఈ దేశమునకల సకల ప్రాణులు నశింపచేయును . కావున ఆశ్రమవాసులారా !మీరంతా వెంటనే ఈ దేశమును వదిలి వేరొకచోట నివసించుము . "అని ఆదేశించి
తన కుమార్తె అరజతో "దండుని అకృత్యమునకు గురి అయితివి కావున ఆ దోష నివృత్తికై ,విముక్తి కాలము వరకు ,ఇక్కడే దైవధ్యానము నందు నిమగ్నమై ఈ సరోవరంలో నీటిని త్రాగుతూ ఇక్కడే ఉండుము . ఆ సరస్సు తీర ప్రాంతమంతా నా అనుగ్రహము వలన ఎటువంటి ప్రమాదం రాదు "అని పలికి ఆయన మరో చోట తన ఆశ్రమమును ఏర్పాటుచేసుకుని అక్కడ నివసించసాగెను . శుక్రాచార్యుడు శపించినట్లుగానే ఏడు రోజులలో దండుడి రాజ్యము నాశనమయ్యెను . ఒక్క ప్రాణి కూడా ప్రాణములతో నిలవలేదు . ఆనాటి నుండి ఈ ప్రదేశము దండకారణ్యముగా ప్రసిద్దిచెందెను .
రామాయణము ఉత్తరకాండ ఎనుబదియొకటవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment