రామాయణము
యుద్ధకాండ -నలుబదిరెండవసర్గ
రాక్షసులు రావణుడి వద్దకు వెళ్లి శ్రీరాముడు తన సైన్యముతో లంక నాలుగు వైపులా ద్వారములను ముట్టడించినవిషయము తెలియచేసిరి . లంకా నగరము ముట్టడికి గురి ఐన విషయము తెలుసుకుని ,క్రుద్ధుడై రక్షణ ఏర్పాట్లని రెట్టింపు చేసెను . పిదప రావణుడు తన ప్రాసాదము ఫై కి ఎక్కి ,శత్రు సైన్యమును చూసేను .
లంకా నగరద్వారమునకు చేరుకున్న శ్రీరాముడు దాడి చేయుటకు తన సైన్యమునకు ఆజ్ఞను ఇచ్చెను . కామరూపులైన ఆ వానరులు" శ్రీరామునికి జయము,లక్ష్మణ స్వామికి జయము ,వానరారాజైన సుగ్రీవునికి జయము ,అని బిగ్గరగా పలుకుచు ,సింహ గర్జనలు ,చేయుచు ,లంక యొక్క ప్రాకారముపైకి చకచకా పాకిరి .
రావణుడు పై నుండి ఇది గమనించుచు ,తన సైన్యమునకు ఆజ్ఞను ఇచ్చెను . వెనువెంటనే రాక్షస సైనికులు పెద్దగా గర్జనలు చేయుచు వానరసైనికుల వైపుగా పరుగులు పెట్టిరి . వెంటనే రాక్షస వానరుల మధ్య ,పూర్వము దేవాసురల సంగ్రామము వలె భయంకరమైన యుద్ధము మొదలయ్యెను . దృఢకాయులైన వానరయోధులు జయజయద్వానములు పలుకుతూ ,గోళ్ళతో రక్కుతూ ,దంతములతో కొరుకుతూ చాలామంది రాక్షసులను హతమార్చిరి . అప్పుడు భయంకరులైన రాక్షసులు ముండ్లగదలతో ,ఖడ్గములతో ,శూలములతో వానరసైన్యములో దొరికిన వారిని దొరికినట్టు చంపసాగిరి . అప్పుడు వానరులు గోడపైకెక్కి అక్కడ తమపైకి ఆయుధములను ప్రయోగించుచున్న రాక్షసులను పడదోసిరి . ఈ విధముగా ఆ ప్రాంతమంతా రక్తముతో తడిసిపోయెను .
రామాయణము యుద్ధకాండ నలుబదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment