Tuesday 4 January 2022

రామాయణము , ఉత్తరకాండ--- ఎనబదిమూడవసర్గ

                            రామాయణము  

                          ఉత్తరకాండ--- ఎనబదిమూడవసర్గ 

రాముని యొక్క ఆజ్ఞను అనుసరించి ద్వార పాలకుడు లక్ష్మణ భరతులకు రాముని ఆగమన వార్త గురించి తెలిపెను . ఆ వార్త విన్న వెంటనే భరత లక్ష్మణులు పరుగు పరుగున రాముని వద్దకు వచ్చిరి . శ్రీ రాముడు తమ్ముళ్ళని ఇరువురిని అక్కున చేర్చుకొని " సోదరులారా! నేను వాగ్దానము చేసిన విధముగా సర్వ శ్రేష్టమైన బ్రాహ్మణ కార్యమును నెరవేర్చితిని . ఇప్పుడు రాజసూయ యాగము చేయగోరుచున్నాను . ఈ యాగము అక్షయ సంపదలను ఇచ్చును . శాశ్వత ఫలములను ప్రసాదించును . దీని వలన ధర్మం వృద్ధి చెందును . సకల పాపములు నశించును . మీరు బాగుగా అలోచించి నాకు యుక్తములైన సూచనలను చేయుడు " అని పలికెను . 
శ్రీ రాముని మాటలు విన్న భరతుడు అంజలి ఘటించి " మహా పురుషా నీవు మిక్కిలి పరాక్రమశాలివి.  ఈ భూమండల మంతయూ నీ అధీనములో ఉన్నది . నీవు పరమ ధర్మాత్ముడవు . నీ కీర్తి ప్రతిష్టలు అజరామరములు . రాజా! ఈ యజ్ఞము చేయుట వలన ఈ భూమండలమును కల రాజ వంశములన్నియూ దెబ్బతినే  అవకాశము కలదు . కావున అట్టి యజ్ఞమును మహాత్ముడవైన నీవు ఎలా చేయుదువు ?"అని పలుకగా శ్రీ రాముడు ఉత్తమోత్తమమైన రాజసూయ యాగమును చేయవలెనని అభిప్రాయపడితిని . సహేతుకములైన నీ మాటలు విన్న పిమ్మట నేను ఆ ప్రయత్నము నుండి విరమించుకొనుచున్నాను . భరతా ! తెలివి కల వారు లోకమునకు బాధాకరమైన పనులు చెయ్యరాదు . లోక కళ్యాణ  కారకములైనప్పుడు బాలుర వచనములు కూడా గ్రాహ్యములు " అని పలికెను .   

రామాయణము ఉత్తరకాండ ఎనుబదిమూడవసర్గ సమాప్తము . 

                                                                  శశి ,

                                                              ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

Sunday 2 January 2022

రామాయణము ఉత్తరకాండ -ఎనుబదిరెండవసర్గ

                    రామాయణము 

                 ఉత్తరకాండ -ఎనుబదిరెండవసర్గ 

శ్రీరాముడు అగస్త్యుడు చెప్పిన దండకారణ్య వృత్తాంతమును విని ,పిమ్మట అగస్త్యుని ఆదేశము ప్రకారం ,పవిత్రమైన సరస్సు వద్దకు వెళ్లి ,స్నాన సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకుని తిరిగి అగస్త్యుని ఆశ్రమమునకు చేరెను . పిమ్మట శ్రీరాముడు అగస్త్యుడు పెట్టిన కందమూలములను ,కూరగాయలను ,శాల్యాన్నమును తృప్తిగా భుజించెను . ఆరోజు రాత్రి అక్కడే విశ్రమించి ,
మరునాడు ప్రాతఃకాలమే లేచి ,అగస్త్యుడి అనుమతి తీసుకుని ,ప్రయాణమునకు సన్నద్ధుడై పుష్పకము ఎక్కి అగస్త్యుడికి మిగిలిన మునులకు అభివాదం చేసెను . ఆ మునులందరూ శ్రీరాముని దీవించిరి . పిమ్మట శ్రీరాముడు పుష్పకముపై అయోధ్య చేరెను . పుష్పకమును పంపివేసి ద్వారపాలకునితో "నా రాకను గురించి లక్ష్మణునికిభరతునికి  తెలిపి ,వెంటనే వారిని నా వద్దకు రమ్మను "అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ ఎనుబదిరెండవసర్గ సమాప్తము . 

                                                         శశి ,

                                                                ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తరకాండ -ఎనుబదియొకటవసర్గ

                      రామాయణము 

                  ఉత్తరకాండ -ఎనుబదియొకటవసర్గ  

మిక్కిలి ప్రభావశీలి అయిన  దేవర్షి అగు శుక్రాచార్యునకు శిష్యులద్వారా విషయము తెలిసెను . వెంటనే ఆ మహర్షి శిష్యులతో కలిసి ఆశ్రమమునకు వచ్చెను . అక్కడ కుమార్తెను చూసి ,ఆమె దీనస్థితిని చూసి ,ఆగ్రహోదగ్రుడయ్యెను . మండిపడుతూ తన శిష్యులతో "శిష్యులారా !దండుడు చేసిన అపరాధమునకు గాను ,అతడు సపరివారంగా  ఏడు రోజులలో నశించి తీరును . దేవేంద్రుడు ఈ దుర్మార్గుడి యొక్క దేశమునకు వందయోజనముల విస్తీర్ణము వరకు తీవ్రమైన దుమ్ము వర్షము కురిపించి ఈ దేశమునకల సకల ప్రాణులు నశింపచేయును . కావున ఆశ్రమవాసులారా !మీరంతా వెంటనే ఈ  దేశమును  వదిలి వేరొకచోట నివసించుము . "అని ఆదేశించి 
తన కుమార్తె అరజతో "దండుని అకృత్యమునకు గురి అయితివి కావున ఆ దోష నివృత్తికై ,విముక్తి కాలము వరకు ,ఇక్కడే దైవధ్యానము నందు నిమగ్నమై  ఈ సరోవరంలో నీటిని త్రాగుతూ ఇక్కడే ఉండుము . ఆ సరస్సు తీర ప్రాంతమంతా నా అనుగ్రహము వలన ఎటువంటి ప్రమాదం రాదు "అని పలికి ఆయన మరో చోట తన ఆశ్రమమును ఏర్పాటుచేసుకుని అక్కడ నివసించసాగెను . శుక్రాచార్యుడు శపించినట్లుగానే ఏడు రోజులలో దండుడి రాజ్యము నాశనమయ్యెను . ఒక్క ప్రాణి కూడా ప్రాణములతో నిలవలేదు . ఆనాటి నుండి ఈ ప్రదేశము దండకారణ్యముగా ప్రసిద్దిచెందెను . 

రామాయణము ఉత్తరకాండ ఎనుబదియొకటవసర్గ సమాప్తము . 

                                                               శశి ,

                                                                          ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday 30 December 2021

రామాయణము ఉత్తరకాండ -ఎనుబదియవసర్గ

                         రామాయణము 

                          ఉత్తరకాండ -ఎనుబదియవసర్గ  

అగస్త్యుడు శ్రీరామునితో ఇంకా ఇలా చెప్పసాగెను . "రామా !అనంతరము దండుడు రాజ్యమునకు శత్రుబాధ లేకుండా పెక్కువేల సంవత్సరములు ప్రజలను పరిపాలించెను . ఒకరోజు ఆ దండ మహారాజు శుక్రాచార్యుని ఆశ్రమమునకు వెళ్లెను . అక్కడ అటుఇటు సంచరించుచున్న మిక్కిలి సౌందర్యవతి అయిన శుక్రాచార్యుని కుమార్తెను చూసి మోహించాడు . దండుడు ఆమెతో "శుభంగీ !నీవు ఎక్కడనుండి వచ్చితివి ?"అని ప్రశ్నించగా 
శుక్రాచార్యుని కుమార్తె ఆ రాజుతో"రాజా !నేను శుక్రాచార్యుని పెద్ద కుమార్తెను . నా పేరు అరజ . నేను ఈ ఆశ్రమములోనే నివసించుచున్నాను . మీరు నన్ను వివాహము చేసుకోనదలిచితే మా తండ్రిని ఆశ్రయించండి . అన్యధా ప్రవర్తించినచో నీవు మిక్కిలి అనర్ధములపాలగుదువు . మా తండ్రి కోపించినచో ముల్లోకములనూ దహించివేయగలడు . "అని పలుకగా 
దండుడు ఆమె మాటలు ఏమాత్రము లక్ష్య పెట్టక ఆమెను బలాత్కారముగా తన బాహువులతో బంధించెను . పిమ్మట దండుడు తన నగరమునకు వెళ్లిపోయెను . పిమ్మట ఆ అరజ భయపడుతూ ,ఆ ఆశ్రమ సమీపమునందే ఏడ్చుచు తన తండ్రి కోసము నిరీక్షించసాగెను . 

రామాయణము ఉత్తరకాండ ఎనుబదియవసర్గ సమాప్తము .  

                                                                            శశి ,

                                                                                       ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తరకాండ -డెబ్బదితొమ్మిదవసర్గ

                        రామాయణము 

                                   ఉత్తరకాండ -డెబ్బదితొమ్మిదవసర్గ  

అగస్త్య మహర్షి పలికిన మాటలు విని శ్రీరాముడు "పూజ్యుడా !ఘోరమైన ఆ వనమున విదర్భరాజగు ఆ స్వేతుడు తపస్సు చేసిన ప్రదేశము నందు మృగములు ,పక్షులు లేకుండుట ఏమిటి ?ఆ రాజు తనతపఃశ్చర్యకు అట్టి నిర్జనారణ్యమున నందు ఎట్లు ప్రవేశించెను ?"అని అడుగగా 
అగస్త్య ముని రామునితో "రామా !పూర్వము కృతయుగము నందు 'మనువు 'అనే మహారాజు కలడు . అతడు రాజ్యమును న్యాయసమ్మతముగా పాలించువాడు . వర్ణాశ్రమ ధర్మములను కాపాడినవాడు . ఆయన కుమారుడు ఇక్ష్వాకుడు . మనువు ఇక్ష్వాకుడిని రాజుగా చేసి "నాయనా !ధర్మమార్గమున ప్రజలను రక్షించుచు రాజ్యమును పాలించుము . నిరపరాధులను ఎవ్వరినీ దండించరాదు . అపరాధము చేసిన మానవులను దండించుట న్యాయసమ్మితము . అట్టి ధర్మప్రభువు మరణానంతరము స్వర్గసుఖములు పొందగలడు . "అని కుమారునికి ఉపదేశము చేసి ,అతడు మిక్కిలి సంతోషముతో యోగమార్గము ద్వారా శాశ్వత బ్రహ్మలోకమునకు  చేరెను . 
రాజైన ఇక్ష్వాకువు యజ్ఞములు ,దానములు ,తపస్సులు మొదలగు సత్కర్మలను ఆచరించి వందమంది కుమారులను పొందెను . వారు దేవకుమారులవలె మిక్కిలి తేజస్సంపన్నులు . ఆఖరువాడుమాత్రము మిక్కిలి మూర్ఖుడు . ఇక్ష్వాకువు 'మందబుద్ధియైన యితడు తన మూర్ఖత్వము కారణముగా మున్ముందు దండనార్హుడు అగును 'అని భావించి ,అతనికి 'దండుడు'అని పేరుపెట్టెను . 
ఇక్ష్వాకువు దండుడికి తగినట్లుగా ఒక ఘోరమైన ప్రదేశమును అప్పగించుటకై ఆలోచించి ,వింధ్యాద్రికి శైవలపర్వతమునకు మధ్యకల ప్రదేశమునకు అతనిని రాజుగా చేసెను . దండుడు అక్కడ ఒక ఉత్తమ నగరమును నిర్మించెను . ఆ నగరమునకు 'మధుమంతము ' అని పేరు పెట్టెను . దండుడు నిష్టాగరిష్ఠుడైన శుక్రాచార్యుని తన పురోహితునిగా చేసుకొనెను . అతని పాలనలో పురప్రజలు సుఖసంతోషములతో వర్దిల్లిరి . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                                                                    శశి ,

                                                                       ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





రామాయణము , ఉత్తరకాండ ---- డెబ్బది ఎనిమిదవసర్గ

                             రామాయణము 

                         ఉత్తరకాండ ---- డెబ్బది ఎనిమిదవసర్గ 

రఘురామా! నేను పలికిన మాటలు విని ఆ మహాపురుషుడు అంజలి ఘటించి , " బ్రాహ్మణోత్తమా! నా పూర్వ వృత్తాంతమును తెలిపెదను వినుము . విదర్భ మహారాజు అయిన సుదేవ మహారాజు నా తండ్రి ఆయనకీ ఇద్దరు కుమారులు నా పేరు స్వేతుడు   , తమ్ముడి పేరు సురథుడు మా తండ్రి స్వర్గస్తుడైన పిమ్మట ప్రజలు నన్ను విదర్భకు రాజుగా పట్టాభిషిక్తుడిని చేసితిరి . నేను న్యాయముగా ధర్మ మార్గం లో ప్రజలను కాపాడుతూ , వేయి సంవత్సరములు రాజ్యపాలన చేశాను . ఒక రోజు నా ఆయుః ప్రమాణము తెలిసి నా తమ్ముడైన సురధుడిని రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి ఈ సరోవర తీరమునకు చేరి . మూడువేల సంవత్సరాల కాలము తీవ్రముగా తపస్సు చేసినాను . పిమ్మట సూక్ష్మ శరీరంతో సత్యలోకమును చేరాను . అయినను నన్ను ఆకలి దప్పులు బాధింప సాగినవి . ఆ భాధను తట్టుకోలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి " దేవా! బ్రహ్మలోకము వచ్చినను ఆకలి దప్పులు నన్ను విడిచి పెట్టుట లేదు . నేను చేసిన పాపము ఏది? . ఇప్పుడు నాకు ఆహారము ఏమిటో దయచేసి తెలుపుము . " అని ప్రార్ధించాను . 
నా మాటలు విన్న బ్రహ్మదేవుడు " నాయనా! నీవు తపస్సుకు ప్రాధాన్యమియ్యక నీ శరీర పోషణ యందే శ్రద్ద కనపరిచితివి . బిక్షాటన చేయుచూ వచ్చిన యతీశ్వరులకు గాని, అతిధి దేవుళ్ళకి గాని భిక్షపెట్ట కుంటివి . దేవతలకు గాని పితృ దేవతలకు గాని స్వల్పంగా అయ్యినా దానము చెయ్యక ఏకాగ్రతలేని , తపస్సు ఆచరించుచూ వచ్చితివి . కావుననే  నీకు స్వర్గము చేరినప్పటికీ ఆకలి దప్పుల బాధ తీరకుండెను . భూలోకంలో పడి  ఉన్న నీ శరీరమే నీకు ఆహరం నాయనా! మహా పురుషుడైన అగస్త్య మహాముని ఈ వనమున అడుగిడిన పిమ్మట నీవు ఈ పాపమునుండి విముక్తి పొందుదువు . సౌమ్యా! ఆ మహానుభావుడు దేవతలను సైతం తరింప చేయగల సమర్థుడు . ఇక నిన్ను ఉద్దరించుట ఆయనికి ఒక క్లిష్ట విషయం కాదు . " అని పలుకగా ఆ నాటి నుండి నేను నా కళేభరమునే ఆహారముగా భక్షించుచున్నాను . అనేక సంవత్సరముల నుండి నేను భక్షించుచున్నపటికి ఇది ఏమాత్రం తరుగలేదు . మహాత్మా! నాకు ఈ పాపము నుండి విముక్తి కలిగించుము . కారణం జన్ముడవైన నీకు తప్ప మరెవ్వరికీ ఇది సాధ్యముకాదు . ద్విజోత్తమా ! ఈ ఆభరణమును స్వీకరించుము . ఈ దివ్యాభరణము నీకు బంగారమును ధనమును , వస్త్రములను , భక్షభోజ్యములను , సమస్త  భోగ్య పదార్ధములను నీకు సమకూర్చ గలదు . ఇక నీవే నాకు దిక్కు " అని ప్రార్ధించగా ఆ మాటలు విని అతడు అందించుచున్న ఆభరణమును తీసుకున్నాను . వెనువెంటనే శవము అదృశ్యమయ్యెను . అది చూసి సంతోషించిన స్వెతుడు పరమానందంతో స్వర్గమునకు వెళ్లెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                                                                        శశి ,

                                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము, ఉత్తరకాండ ---- డెబ్బది ఏడవసర్గ

                             రామాయణము 

                              ఉత్తరకాండ ---- డెబ్బది ఏడవసర్గ  

అగస్త్యుడు శ్రీ రాముడితో " రామా! పూర్వం ఒక మహారణ్యం ఉండేది . దాని వైశాల్యం వంద యోజనములు . అందులో మృగములు కానీ , పక్షులు కానీ లేకుండెను . ఆ వనం లో తపస్సు చేయదలచి అరణ్యమంతా తిరిగితిని . అక్కడ అనేక రకముల వృక్షాలు రుచికరములైన ఫలములు కలవు . ఆ అరణ్య మధ్యభాగంలో ఒక మహా సరస్సు కలదు . ఆ సరస్సులో అనేక పద్మములు, కలువలు కలవు . హంసలతో చక్రవాకంతో మిక్కిలి మనోహరంగా కలదు . దానిలోని నీరు మధురంగా ఉండెను . ఆ సరస్సు సమీపంలో ఒక ఆశ్రమం కలదు . అది పురాతనమైనదీ అత్యంత పవిత్ర మైనది . అందులో ఎవరు లేకుండిరి . పురుషోత్తమా! అక్కడ వేసవికాలమునందు నేను ఒక రాత్రి నివసించితిని . 
ప్రాతఃకాలమే లేచి స్నానమునకై సరోవర తీరమునకు వెళ్లితిని . అక్కడ దృడంగా ఉన్న ఒక యువకుని శవం  కనిపించింది "ఇది ఏమి?" అని ఆలోచిస్తూ నేను అక్కడ నిలబడి ఉన్నాను .అప్పుడు అత్యద్భుతంగా ఉన్న హంసలు పూన్చబడి ఉన్న ఒక దివ్య విమానం కనిపించింది . ఆ విమానంలో వేలకొలది  అప్సరసలచే సేవింప బడుచున్న దివ్యమైన ఆభరణాలను ధరించిన ఒక మహా పురుషుడు ఉన్నాడు . అతడు నేను చూస్తుండగానే విమానం నుండి కిందకి దిగి అక్కడ ఉన్న శవమును భక్షించుచున్నాడు . పిమ్మట అతడు సరస్సులోకి దిగి శుద్ద ఆచమనము (చేతులు , నోరు  శుభ్రపరుచుట ) గావించి, తిరిగి విమానము ఎక్కుటకు సిద్దపడగా నేను అతనితో "అయ్యా! దేవతా స్వరూపుడవైన నీవు ఎవరు ? నింద్యమైన ఇట్టి ఆహారము ఎలా భుజించితివి ? దయతో తెలుపుము . " అని ప్రశ్నించితిని .  

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియేడవసర్గ సమాప్తము . 

                                                                                       శశి ,

                                                                                   ఎం . ఏ ,ఎం. ఏ (తెలుగు ),తెలుగు పండితులు .