Thursday 30 December 2021

రామాయణము , ఉత్తరకాండ ---- డెబ్బది ఎనిమిదవసర్గ

                             రామాయణము 

                         ఉత్తరకాండ ---- డెబ్బది ఎనిమిదవసర్గ 

రఘురామా! నేను పలికిన మాటలు విని ఆ మహాపురుషుడు అంజలి ఘటించి , " బ్రాహ్మణోత్తమా! నా పూర్వ వృత్తాంతమును తెలిపెదను వినుము . విదర్భ మహారాజు అయిన సుదేవ మహారాజు నా తండ్రి ఆయనకీ ఇద్దరు కుమారులు నా పేరు స్వేతుడు   , తమ్ముడి పేరు సురథుడు మా తండ్రి స్వర్గస్తుడైన పిమ్మట ప్రజలు నన్ను విదర్భకు రాజుగా పట్టాభిషిక్తుడిని చేసితిరి . నేను న్యాయముగా ధర్మ మార్గం లో ప్రజలను కాపాడుతూ , వేయి సంవత్సరములు రాజ్యపాలన చేశాను . ఒక రోజు నా ఆయుః ప్రమాణము తెలిసి నా తమ్ముడైన సురధుడిని రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి ఈ సరోవర తీరమునకు చేరి . మూడువేల సంవత్సరాల కాలము తీవ్రముగా తపస్సు చేసినాను . పిమ్మట సూక్ష్మ శరీరంతో సత్యలోకమును చేరాను . అయినను నన్ను ఆకలి దప్పులు బాధింప సాగినవి . ఆ భాధను తట్టుకోలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి " దేవా! బ్రహ్మలోకము వచ్చినను ఆకలి దప్పులు నన్ను విడిచి పెట్టుట లేదు . నేను చేసిన పాపము ఏది? . ఇప్పుడు నాకు ఆహారము ఏమిటో దయచేసి తెలుపుము . " అని ప్రార్ధించాను . 
నా మాటలు విన్న బ్రహ్మదేవుడు " నాయనా! నీవు తపస్సుకు ప్రాధాన్యమియ్యక నీ శరీర పోషణ యందే శ్రద్ద కనపరిచితివి . బిక్షాటన చేయుచూ వచ్చిన యతీశ్వరులకు గాని, అతిధి దేవుళ్ళకి గాని భిక్షపెట్ట కుంటివి . దేవతలకు గాని పితృ దేవతలకు గాని స్వల్పంగా అయ్యినా దానము చెయ్యక ఏకాగ్రతలేని , తపస్సు ఆచరించుచూ వచ్చితివి . కావుననే  నీకు స్వర్గము చేరినప్పటికీ ఆకలి దప్పుల బాధ తీరకుండెను . భూలోకంలో పడి  ఉన్న నీ శరీరమే నీకు ఆహరం నాయనా! మహా పురుషుడైన అగస్త్య మహాముని ఈ వనమున అడుగిడిన పిమ్మట నీవు ఈ పాపమునుండి విముక్తి పొందుదువు . సౌమ్యా! ఆ మహానుభావుడు దేవతలను సైతం తరింప చేయగల సమర్థుడు . ఇక నిన్ను ఉద్దరించుట ఆయనికి ఒక క్లిష్ట విషయం కాదు . " అని పలుకగా ఆ నాటి నుండి నేను నా కళేభరమునే ఆహారముగా భక్షించుచున్నాను . అనేక సంవత్సరముల నుండి నేను భక్షించుచున్నపటికి ఇది ఏమాత్రం తరుగలేదు . మహాత్మా! నాకు ఈ పాపము నుండి విముక్తి కలిగించుము . కారణం జన్ముడవైన నీకు తప్ప మరెవ్వరికీ ఇది సాధ్యముకాదు . ద్విజోత్తమా ! ఈ ఆభరణమును స్వీకరించుము . ఈ దివ్యాభరణము నీకు బంగారమును ధనమును , వస్త్రములను , భక్షభోజ్యములను , సమస్త  భోగ్య పదార్ధములను నీకు సమకూర్చ గలదు . ఇక నీవే నాకు దిక్కు " అని ప్రార్ధించగా ఆ మాటలు విని అతడు అందించుచున్న ఆభరణమును తీసుకున్నాను . వెనువెంటనే శవము అదృశ్యమయ్యెను . అది చూసి సంతోషించిన స్వెతుడు పరమానందంతో స్వర్గమునకు వెళ్లెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                                                                        శశి ,

                                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment