Thursday 30 December 2021

రామాయణము, ఉత్తరకాండ ---- డెబ్బది ఏడవసర్గ

                             రామాయణము 

                              ఉత్తరకాండ ---- డెబ్బది ఏడవసర్గ  

అగస్త్యుడు శ్రీ రాముడితో " రామా! పూర్వం ఒక మహారణ్యం ఉండేది . దాని వైశాల్యం వంద యోజనములు . అందులో మృగములు కానీ , పక్షులు కానీ లేకుండెను . ఆ వనం లో తపస్సు చేయదలచి అరణ్యమంతా తిరిగితిని . అక్కడ అనేక రకముల వృక్షాలు రుచికరములైన ఫలములు కలవు . ఆ అరణ్య మధ్యభాగంలో ఒక మహా సరస్సు కలదు . ఆ సరస్సులో అనేక పద్మములు, కలువలు కలవు . హంసలతో చక్రవాకంతో మిక్కిలి మనోహరంగా కలదు . దానిలోని నీరు మధురంగా ఉండెను . ఆ సరస్సు సమీపంలో ఒక ఆశ్రమం కలదు . అది పురాతనమైనదీ అత్యంత పవిత్ర మైనది . అందులో ఎవరు లేకుండిరి . పురుషోత్తమా! అక్కడ వేసవికాలమునందు నేను ఒక రాత్రి నివసించితిని . 
ప్రాతఃకాలమే లేచి స్నానమునకై సరోవర తీరమునకు వెళ్లితిని . అక్కడ దృడంగా ఉన్న ఒక యువకుని శవం  కనిపించింది "ఇది ఏమి?" అని ఆలోచిస్తూ నేను అక్కడ నిలబడి ఉన్నాను .అప్పుడు అత్యద్భుతంగా ఉన్న హంసలు పూన్చబడి ఉన్న ఒక దివ్య విమానం కనిపించింది . ఆ విమానంలో వేలకొలది  అప్సరసలచే సేవింప బడుచున్న దివ్యమైన ఆభరణాలను ధరించిన ఒక మహా పురుషుడు ఉన్నాడు . అతడు నేను చూస్తుండగానే విమానం నుండి కిందకి దిగి అక్కడ ఉన్న శవమును భక్షించుచున్నాడు . పిమ్మట అతడు సరస్సులోకి దిగి శుద్ద ఆచమనము (చేతులు , నోరు  శుభ్రపరుచుట ) గావించి, తిరిగి విమానము ఎక్కుటకు సిద్దపడగా నేను అతనితో "అయ్యా! దేవతా స్వరూపుడవైన నీవు ఎవరు ? నింద్యమైన ఇట్టి ఆహారము ఎలా భుజించితివి ? దయతో తెలుపుము . " అని ప్రశ్నించితిని .  

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియేడవసర్గ సమాప్తము . 

                                                                                       శశి ,

                                                                                   ఎం . ఏ ,ఎం. ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment