రామాయణము
అయోధ్యకాండ -తొంబదినాల్గవసర్గ
శ్రీరామునకు గిరులను దర్శించుట అందు ,వనములలో విహరించుట అందు మక్కువ ఎక్కువ . సీతాలక్ష్మణులతో కూడి ఆ పర్వతముపై వసించుచున్న శ్రీరాముడు విదేహరాజకుమారి అయిన సీతాదేవికి ప్రియమును కూర్చుటకు చిత్ర విచిత్రములైన చిత్రకూట పర్వత శోభను ఆమెకు చూపుతూ "ఓ సీతా !రాజ్యాధికారం ,నాకు హితులు ,మిత్రులు నాకు దూరంగా ఉన్నప్పటికీ ,ఈ చిత్రకూటము నందలి రమణీయ దృశ్యములను చూచుచు ఆనందించుటలో నిమగ్నమైన న మనసుకి ఆ విషయములు ఏమి కలవరపరుచుటలేదు . ఈ పర్వత అందములను చూడు
వివిధ పక్షుల మధుర ధ్వనులు ,ఎత్తైన ఆకాశమును తాను శిఖరములు ,ఆ శిఖరములనుండి జాలువారుచున్న గైరికాదిధాతువులు కనువిందు చేయుచున్నవి . ఆ శిఖరములు రకరకముల రంగులతో అలరారుచున్నవి రకరకాల చెట్లతో ఎంతో పచ్చగా ,శోభాయమానంగా వున్నది . ఆహ్లాదకరమైన కొండచరియలు అందు ప్రేమానురాగములతో జంటలు జంటలుగా తిరుగుచున్న ఈ కిన్నెరజాతి వారిని చూడుము . ఇచట కల జంతువులూ , క్రూర మృగములు జాతివైరమును మరచి ప్రశాంతముగా వున్నవి . ఈ చిత్రకూటము రుచికరములైన కందమూలములతో ,మధుర జలములతో మిగుల సంపన్నమయినది . ఓ ప్రాణేశ్వరీ !శ్రేష్ఠములైన వనవాస నియమములను పాటించుచు సత్పురుషుల మార్గమున మసలుచు నీతోను ,లక్ష్మణుని తొడను ఈ పదునాలుగు సంవత్సరముల కాలమును సంతోషముగా గడిపేడను . దాని వలన మన వంశ ప్రతిష్టలు ఇనుమడించును .
రామాయణము అయోధ్యకాండ తొంబది నాల్గవసర్గ సమాప్తము .
శశి ,
ఎం. ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment