Wednesday 19 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదిఆరవసర్గ

                                      రామాయణము 

                                       యుద్ధకాండ -తొంబదిఆరవసర్గ 

లంక లో ఇంటింటా రాక్షస స్త్రీల ఆర్తనాదములు రావణునికి వినపడెను . అప్పుడు రావణుడు దీర్ఘముగా నిట్టూర్చి ,క్షణకాలం ఆలోచనలో పడెను . పిమ్మట రావణుడు పరామక్రుద్ధుడై భీకరాకారుడయ్యెను . కన్నులనుండి నిప్పులు గ్రక్కుచు రాక్షసులతో ఇలా చెప్పెను . "వెంటనే సైన్యమును సన్నద్ధపరచండి . ఇది నా ఆజ్ఞ . "అని పలికెను . 
వెంటనే అక్కడ కల రాక్షసులు యుద్ధమునకు సిద్ధముగా లేని యోధులందరిని యుద్ధమునకు ప్రోత్సహించిరి . ఆ విధముగా యుద్ధమునకు సిద్దమయిన యోధులతో రావణుడు "వీరులారా !నేడే నేను శత్రువులను వధించివేసెదను . భర్తలను ,సోదరులను ,కొడుకులను కోల్పోయిన రాక్షస స్త్రీ ల కన్నీళ్లను నేను తుడిచెదను . నేడు నా బాణపరంపరలతో వానరులందరిని హతమార్చెదను . అలా వారి కళేభరములతో రణభూమి ఏ మాత్రమూ కనపడకుండా చేసెదను . వెంటనే నా రధమును సిద్దము చేయండి . నా ధనుర్భాణములను తీసుకు రండి . మీరందరూ నన్ను అనుసరిస్తూ యుద్ధమునకు రండి . "అని పలికెను . 
రావణుని ఆజ్ఞలను అందుకుని వెంటనే రాక్షసవీరులు భీకరముగా గర్జించుచు ,వివిధ ఆయుధములను చేతబూని ,క్షణ కాలములో బయలుదేరిరి . వారందరూ లంకా నగరమునకు కల ఉత్తర ద్వారము గుండా బయటకు వచ్చిరి . అక్కడ రామలక్ష్మణులు యుద్ధసన్నద్దులై ఉండిరి . ఆ సమయములో సూర్యకాంతి సన్నగిల్లెను . అన్ని దిక్కులందు చీకట్లు కమ్ముకొనెను . భూమి దద్దరిల్లునట్లుగా పక్షులు ఘోరముగా అరిచినవి . మేఘములు రక్తమును వర్షించెను . రధాశ్వముల నడకలు తడబడెను . ధ్వజాగ్రముపై గ్రద్దవాలెను . అశుభ సూచకంగా నక్కలు కూసెను . రావణుని ఎడమకన్ను అదిరెను . అతని ఎడమభుజము చలించెను . ఇలా అనేక అపశకునములు ఎదురయినప్పటికీ రావణుడు వాటిని ఏమాత్రము లెక్కచేయక ,మృత్యుప్రేరితుడై శత్రువులను వధించుటకు బయలుదేరెను . ఆ రాక్షసులయొక్క రథముల చప్పుడు వినగానే వానరులు యుద్ధమునకు సన్నద్దులయ్యిరి . కపివీరులు ,రాక్షసయోధులు జయేచ్ఛతో క్రుద్ధులై ,పరస్పరము కవ్వించుకొనుచు సంకుల సమరం చేసిరి . 
అప్పుడు రావణుడు తనబాణములను ప్రయోగించుచు వానరసేనపై విరుచుకుపడెను . వీరావేశముతో అతడు ప్రయోగించే బాణములవర్షమునకు కొందరి వానరుల తలలు తెగిపడినవి . కొందరికి వక్షస్థలములు దెబ్బతిన్నవి . కొందరికి చెవులు త్రేగిపడినవి . కొందరికి చేతులు మరికొందరికి కాళ్ళు తెగినవి . రావణుని దాటికి వానరవీరులు తట్టుకోలేకపోయిరి . 

రామాయణము యుద్ధకాండ తొంబదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 





రామాయణము యుద్ధకాండ -తొంబదియైదవసర్గ

                                       రామాయణము 

                                        యుద్ధకాండ -తొంబదియైదవసర్గ 

శ్రీరాముడి చేతిలో చావగా మిగిలిన రాక్షసులు ,ఈ వార్త విన్న రాక్షస స్త్రీలు అందరూ ఒక చోటికి చేరి ,ఏడుస్తూ ,ఒకరినొకరు కౌగిలించుకుంటూ ,పెడబొబ్బలు పెడుతూ తమలో తాము ఇలా మాట్లాడుకోసాగిరి . "శ్రీరాముడు మన్మధుడి వలె మిక్కిలి అందగాడు . ఎంతో శక్తిమంతుడు . సమస్త ప్రాణుల హితము కొరకు పాటుపడువాడు . ఇక శూర్పనకేమో ముసలిది . లావైన పొట్ట కలిగినది . వీరిద్దరికి ఏమాత్రము జోడు కుదరదు . ఈ శూర్పణఖ ఆ రాముడిని ఎలా చేరినది ?జనస్థానములోని ఖర దూషణాది రాక్షసుల వినాశము కోసమే  ఆ మహానుభావుడితో బరితెగించి ప్రవర్తించింది . ఆ కారణముతోనే రావణుడు శ్రీరాముడితో వైరమునకు పూనుకున్నాడు . రాక్షసుల అందరి చావు కోసమే రావణుడు సీతను అపహరించుకువచ్చాడు . ఎంతగా వేధించినా జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవి మాత్రము ఈ దశగ్రీవుడికి దక్కదు సరికదా !శ్రీ రాముడితో వైరము కారణముగా మనకు కూడా చావు రానున్నది . 
విరాధుడు సీతాదేవిపై ఆశపడిన కారణముగా రాముడు ఒక్కడే ఆ వీరుడిని చంపివేసెను . జనస్థానములోని పదునాలుగువేలమంది రాక్షసులను ,ఖరదూషణాది రాక్షసవీరులను శ్రీరాముడు ఒక్కడే హతమార్చెను . కబంధుడిని కూడా రాముడు పరిమార్చెను . ఇంద్రుని వరముతో పుట్టిన మహావీరుడైన వాలి కూడా రాముని చేతిలో మరణించాడు . ఆనాడు విభీషణుడు నిండు సభలో పలికిన పలుకులు రాక్షసులందరికి హితమునుకూర్చెడివి . కానీ రావణుడుకి  సీతాదేవిపై కల మోహము వలన ఆ మాటలు రుచించలేదు . ఆనాడే విభీషణుడి మాటలు రావణుడు విని ఉంటే ఈ రోజు లంకా నగరము ఈ విధముగా స్మశానముగా మారి ఉండెడిది కాదు . 
మహాకాయుడు (పెద్ద శరీరము కలవాడు ),గొప్పవీరుడు ,ఓటమి ఎరుగనివాడు ఐన కుంభకర్ణుడు రాముడి చేతిలో మరణించాడు . రావణుడి ప్రియ పుత్రుడైన ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో చచ్చాడు . ఇంతటి గొప్ప వీరులు మరణించినా ,రావణునికి బుద్దిరాలేదు . రావణుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ దేవుడి నుండి దేవదానవరాక్షసుల వలన తనకు మరణము లేకుండా వారము కోరినాడు . మనుష్యలను ప్రస్తావించలేదు . అందువలన రావణునికి మనుష్యులైన ఈ రామలక్ష్మణుల చేతిలోనే చావు రాసి ఉన్నట్టు తెలుస్తోంది . శ్రీరాముడి వలన వచ్చిపడిన ఈ సంకట స్థితి నుండి మనల్ని ఆడుకొనువాడు ఈ లోకము నందు ఎవడును కనుపడుటలేదు . మహాత్ముడైన విభీషణుడు శ్రీరాముడి వలన కలుగు ప్రమాదమును ముందుగానే ఊహించాడు . అందువలనే బుద్ధిశాలియై శ్రీరాముని శరణు వేడాడు . "ఈ విధముగా లంకా నగరంలోని స్త్రీలు మిక్కిలి విషాదమునకు లోనయ్యిరి . వారు మిక్కిలి భయముతో కృంగిపోయి ఒకరినొకరు కౌగిలించుకుంటూ బిగ్గరగా ఏడవసాగిరి . 

రామాయణము యుద్ధకాండ తొంబదియైదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 




Saturday 8 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదినాలుగవసర్గ

                                   రామాయణము 

                                  యుద్ధకాండ -తొంబదినాలుగవసర్గ 

అంతులేని దుఃఖముతో దీనుడై వున్న రావణుడు సభలోకి ప్రవేశించి ,సింహాసనమును అలంకరించెను . అప్పుడు సభలోనివారితో "వీరులారా !సమస్త గజబలములను ,అశ్వికబలములను ,రథములను ,కాల్బలమును తీసుకుని వెంటనే యుద్ధమునకు బయలుదేరుము . రాముడిని ఒంటరిగా చేసి మీరు అతడిని చుట్టుముట్టి శరములను కురిపించి అతడిని సంహరించండి . ఒకవేళ మీరు చంపలేకపోతే ,మీ శరముల దాటికి గాయపడి ఉన్న అతడిని అందరూ చూస్తూఉండగా నిన్నే సంహరించెదను "అని పలికెను . 
రాక్షసరాజు ఆజ్ఞ వినన వెంటనే లంకలో కల సమస్త బలములు యుద్ధమునకు బయలుదేరి వెళ్ళినవి . ఇరుపక్షముల మధ్య పోరు ఘోరముగా సాగుచున్నది . యుద్ధముచేసే వీరుల పాదముల కదలికల వలన దూళి చెలరేగినది . గాయపడిన వానర ,రాక్షస వీరుల శరీరము నుండి స్రవించిన రక్తము వలన ఆ దూళి అణిగిపోయినది . వానరులు రాక్షసుల కేశములను ,చెవులను, పాలభాగములను ,ముక్కులను తమ దంతములతో కొరుకుతూ ,గోళ్ళతో రక్కుతూవారిని ముప్పతిప్పలు పెట్టసాగిరి . ఒక్కొక్క రాక్షసునిపై వందలకొలది వానరవీరులు విరుచుకుపడిరి . రాక్షసవీరులు బలమైన గదలతో ,పదునుతేరిన ఈటలతో ,ఖడ్గములతో ,గండ్రగొడ్డళ్ళతో వానరవీరులను చావగొట్టుచుండిరి . రాక్షసుల దాటికి తట్టుకోలేక ,వానరవీరులు దయాళువైన శ్రీరాముడిని శరణువేడిరి . 
శ్రీరాముడు రాక్షసులపై శరములను వర్షములా కురిపించెను . పిమ్మట రాముడు ప్రయోగించిన గాధర్వాస్త్ర ప్రభావంతో రాక్షసవీరులంతా సమ్మోహితులయ్యిరి . అందువలన వారు తమ వారిని అంతమొనర్చుచున్న శ్రీరాముని మాత్రము చూడలేకుంటిరి . బీతిల్లివున్న ఆ రాక్షసులకు సమరభూమిలో ఒక సారి వేలకొలది రాముడులు కనపడుచుండిరి . ఇంకోసారి ఒక్కడే రాముడు కనపడుచుండెను . శ్రీరాముని చేతిలో రధాశ్వగజబలములు నాశనము అవ్వగా ధ్వజపతాకములన్ని ముక్కలవ్వగా ,మిగిలిన రాక్షసులు బ్రతుకుజీవుడా అనుకుంటూ లంక వైపుగా పరుగులు తీసిరి . రణమున మరణించిన గజాశ్వకాల్బలముల కళేబరములతో నిండిన ఆ సమార భూమి లయకారుడైన రుద్రుని యొక్క విహారభూమిలా వున్నది . అప్పుడు దేవతలు గంధర్వులు ,సిద్దులు ,మహర్షులు బాగుబాగు అని శ్రీరాముని పరాక్రమమును పొగిడిరి . అప్పుడు శ్రీరాముడు తన పక్కనే వున్న సుగ్రీవుడు ,విభీషణుడు ,హనుమంతుడు ,జాంబవంతుడు మొదలగు వానరవీరులతో "ఈ దివ్యాస్త్ర బలము నాకు మరియు పరమేశ్వరునికి మాత్రమే కలదు "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ తొంబదినాలుగవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు )  ,తెలుగు పండితులు . 







Wednesday 5 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదిమూడవసర్గ

                                   రామాయణము 

                                       యుద్ధకాండ -తొంబదిమూడవసర్గ 

రావణుని మంత్రులు యుద్దములో ఇంద్రజిత్తు మరణించిన వార్త విని ,స్వయముగా చూసి ధ్రువ పరుచుకుని రావణుని వద్దకు వెళ్లి "మహారాజా !దేవేంద్రుడి అంతటి వాడిని జయించిన మహావీరుడు ,లక్ష్మణుడితో తలపడి , అతడి చేతిలో హతుడైనాడు . కానీ ప్రభూ !మీ కుమారుడు ఆ లక్ష్మణుడిని తన శరములతో ముప్పతిప్పలు పెట్టిన తర్వాతే పుణ్యలోకమునకు చేరినాడు "అని పలికెను . తన కుమారుడు యుద్దములో భయంకరముగా పోరాడి మరణించిన విషయము విన్న రావణుడు ,వెంటనే మూర్చితుడయ్యెను . కొంతసేపటికి స్పృహలోకి వచ్చి ,పుత్రశోకమును తట్టుకోలేక ,మిక్కిలి దీనుడై "అయ్యో !ముద్దుల కుమారా !నీవు రాక్షస యోధులలో ముఖ్యమైనవాడివి . మహారధుడివి . మహేంద్రుని జయించిన పరాక్రమశాలివి . అట్టి నీవు లక్ష్మణుడికి ఎలా వశమయితివి ?శత్రువులను గడగడలాడించు మహావీరా !నీ మాతృమూర్తిని ,నన్ను ,నీ భార్యను ,రాక్షసులను యువరాజ్యమును ,లంక ను విడిచి ఎక్కడకు వెళ్ళితివి . సాధారణముగా నేను ముందు మరణించుట , నీవు నాకు ప్రేత కార్యములను నిర్వహించుట జరగవలెను . కానీ నేడు అది తారుమారయినది . "అని పరిపరి విధములుగా దుఃఖించసాగెను . 
రావణుడు తీవ్రదుఖముతో విలపించుచుండెను . పుత్రవియోగము కారణముగా అతడిలో కోపము కట్టలు త్రెంచుకొనెను . రావణునికి ఆలోచించినకొలది సీతను వధించుటే యుక్తమని తోచెను . అప్పుడు రాక్షసరాజు కన్నులు నిప్పులు కక్కసాగినవి . మామూలుగానే అతడి రూపము భయంకరమైనది . ఇప్పుడు క్రోధాగ్నిచే  రుద్రిడిలా చూచుటకు భయంకరముగా ఉండెను . అతడు కోపముతో పళ్ళు పటపటమని కొరుకుతుండగా ,ఆ శబ్దములు భయంకరముగా వినపడసాగినవి . ఆ సమయములో ఆ మందిరములో వున్న రాక్షసులందరూ రావణునికి ఎదురుగా వచ్చుటకు బయపడి స్తంభముల చాటున దాక్కోనిరి . 
మిక్కిలి కోపముతో ఊగిపోతున్న రావణుడు బయపడి దాక్కున్న రాక్షస వీరులను తిరిగి యుద్ధమునకు సన్నద్దులను చేయుటకు వారితో "మిత్రులారా !పూర్వము నేను వివిధరీతులలో వేలకొలది సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించాను . నా తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ,అసురులవలనకానీ ,దేవతలవలన కానీ ఎప్పుడు ఎక్కడా భయము లేకుండా వారము ఇచ్చినారు . నేను ధరించిన సూర్యకాంతులతో వెలిగిపోతున్న ఈ కవచమును కూడా బ్రహ్మ దేవుడే  నాకు ఇచ్చినాడు . దేవతలతో ,ఇతరవీరులతో యుద్ధములు చేసిన అనేక సందర్భములలో ఎటువంటి ఆయుధములు కూడా ఈ కవచమును ముక్కలుచేయలేకపోయినవి . అటువంటి కవచమును ధరించి రధము ఎక్కి నేను సమరభూమిలో నిలబడితే నన్ను ఎదిరించి నిలబడే వీరుడే లేనేలేడు . దేవేంద్రుడు కూడా నన్ను జయించలేడు . దేవాసుర సంగ్రామములో నా పరాక్రమమునకు మెచ్చుకుని అతడే నా ఈ ధనుస్సుని నాకు ఇచ్చాడు . నేను ఇప్పుడే ఏ ధనుస్సుని తీసుకుని యుద్ధమునకు బయలుదేరెదను . "అని పలికి తన ఒరనుండి ఒక ఖడ్గమును బయటకు తీసెను . ఆ ఖడ్గమును చేతబూని తన భార్యలు మంత్రులు ,రాక్షసులు తన వెంట నడుస్తుండగా రావణుడు సీతాదేవి ఉన్న అశోకవనమునకు బయలుదేరెను . 
తన మిత్రులు ఎంతగా వారించినా వినకుండా తన వైపుగానే వచ్చుచున్న రావణుని చూసిన సీతాదేవి వ్యధచెందెను . సుపార్శ్వుడు అను రాక్షసుడు రావణునితో "మహారాజా !నీవు సమస్త వేదములను అధ్యయనము చేసినవాడివి . సకల శాస్త్రములను పుక్కిట బట్టినవాడవు . రామునిపై నీ ప్రతాపము చూపుము . నీవు రథముని అధిరోహించి యుద్ధరంగమునకు వెళ్లి ,ఆ రాముని సంహరించు . పిదప సీతాదేవి నీకు తప్పక వశమవగలదు . "అని పలికెను . అప్పుడు రావణుడు ఆ మాటలు విని అందుకు సమ్మతించెను . వెంటనే అతడు అక్కడినుండి వెనుతిరిగి ఇంటికి వెళ్లెను . అనంతరము అతడు తన మంత్రులతో కూడి సభాభవనమున ఆసీనుడయ్యెను . 

రామాయణము యుద్ధకాండ తొంబదిమూడవసర్గ సమాప్తము . 

                      శశి ,

 ఎం , ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Tuesday 4 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదిరెండవసర్గ

                                  రామాయణము 

                                      యుద్ధకాండ -తొంబదిరెండవసర్గ 

ఇంద్రజిత్తు మరణించిన పిమ్మట సంతోషిచిన లక్ష్మణుడు ,విభీషణుడు ,ఆంజనేయుడు ,ఇతర వానరయోధులతో కలిసి శ్రీరాముడు ,సుగ్రీవుడు వున్న ప్రదేశమునకు వెళ్లెను . అన్నగారికి కొద్దీ దూరములో వినయముగా నిలబడి తన అన్నతో ఇంద్రజిత్తు మరణించిన విషయము చెప్పెను . అప్పుడు విభీషణుడు" లక్ష్మణుడే ఇంద్రజిత్తును హతమార్చినాడు "అని తెలిపెను . అది విన్న శ్రీరాముడు సంతోషముతో లక్ష్మణుని దగ్గరకి పిలిచి లక్ష్మణుని నుదిటిపై ముద్దు పెట్టి ,కౌగిలించుకొనెను . పిమ్మట లక్ష్మణుని తన పక్కన కూర్చుండపెట్టుకుని అతడిని భుజము నిమురుతూ లక్ష్మణుడి ఒంటిపై కల గాయములను గమనించేను . 
అప్పుడు శ్రీరాముడు లక్ష్మణునితో "తమ్ముడా !ఇంద్రుని సైతము ఓడించిన మిక్కిలి పరాక్రమము కలిగిన ఇంద్రజిత్తుని నీవు సంహరించినావు . నీ పరాక్రమము తిరుగులేనిది . నీ ఈ విజయముతో మనకు విజయము కాయమయినట్టే . విభీషణుడు ,హనుమతో కలిసి మూడు రోజులు రణరంగమున నీ తిరుగులేని పరాక్రమమును చూపి విజయము సాధించినావు . నీ వంటి తమ్ముడు నా పక్కనే ఉన్నట్టయితే సీతను,కోసల రాజ్యము ను కూడా తేలికగా సాధించగలను . "అని పలికి సుషేణుడిని పిలిచి లక్ష్మణుడికి ,విభీషనుడికి ,హనుమకు ,ఇంకా వానర యోధులకు వారి దెబ్బలకు వైద్యము చేయమని చెప్పెను . 
అప్పుడు సుషేణుడు ఒక వన మూలికను తీసుకువచ్చి ,లక్ష్మణుడి ముక్కు దగ్గర పెట్టెను . ఆ వాసన పీల్చిన లక్ష్మణుడి వంటి మీద గాయములన్నియు తగ్గిపోయెను . బాణముల గుర్తులు కూడా మటుమాయమయ్యెను . శ్రీరాముడి ఆజ్ఞ ప్రకారము విభీషనుడికి ,హనుమకు వానర యోధులకు కూడా ఆ మూలిక వాసన చూపించగా వారి గాయములు కూడా మాయమయ్యెను . అప్పుడు వానరయోధులు అందరు మిక్కిలి సంతోషముతో "లక్ష్మణ స్వామికి జై ,శ్రీరామునికి జై "అని జయజయ ద్వానములు చేసిరి . 

రామాయణము యుద్ధకాండ తొంబదిరెండవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
   









Sunday 2 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదియొకటవసర్గ

                                     రామాయణము 

                                        యుద్ధకాండ -తొంబదియొకటవసర్గ 

సమరభూమి అందు నేలపై నిలబడిన ఇంద్రజిత్తు తన సైన్యముతో "రాక్షస శ్రేష్ఠులారా !నలుదిశలఅందు చీకట్లు చుట్టిముట్టినవి . అందువలన మన పక్షము వారెవరో ,శత్రుపక్షము వారెవరో తెలియకున్నది . కనుక నేను లంకా నగరము లోకి వెళ్లి మరియొక రధమును తెచ్చుకొనెదను . ఇక్కడ నేను లేని విషయం శత్రువులకు తెలియకుండా ధైర్యముగా యుద్ధము చేయండి . ఆ వానరులు నా వెనక పడకుండా చూడండి "అని పలికి లంకా నగరంలోకి  వెళ్లి ,మరో రధమును అధిరోహించి ,సమర భూమికి వచ్చెను . 
ఇంద్రజిత్తు వందలవేలకొలది బాణములను వర్షములా ప్రయోగించి ,వానరులను బాధించెను . వానరులు ఇంద్రజిత్తు దాటికి తట్టుకోలేక లక్ష్మణుని శరణు వేడిరి . లక్ష్మణుడు ఇంద్రజిత్తు ధనస్సును ముక్కలుగా చేసెను . అప్పుడు ఆ నిశాచరుడు మరొక ధనుస్సుని తీసుకొనగా లక్ష్మణుడు దానిని కూడా విరుగకొట్టెను . లక్ష్మణుడు అయిదు బాణములతో ఇంద్రజిత్తు వక్షస్థలముపై కొట్టగా అతడి కవచము ముక్కలయ్యేను . ఇంద్రజిత్తు నోటినుండి రక్తము వచ్చెను . అప్పుడు ఇంద్రజిత్తు మరో ధనస్సు తీసుకొని లక్ష్మణునిపై శరముల వర్షము కురిపించసాగెను . లక్ష్మణుడు చాకచక్యంగా వాటిని ఖండించెను . పిమ్మట లక్ష్మణుడు ఒక్కో రాక్షసుడిని మూడేసి బాణములతో కొట్టెను . 
లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారధి శిరస్సుని ఖండించి వేసెను . సారధి లేకున్నా గుఱ్ఱములు ఏ మాత్రమూ తొట్రుపాటు లేకుండా మండలాకారములో తిరగసాగెను . ఆ దృశ్యము మిక్కిలి రమణీయముగా ఉండెను . ఇంద్రజిత్తు లక్ష్మణుని పది బాణములతో వక్షస్థలం పై కొట్టెను . కానీ అవి కవచమును తాకి కింద పడిపోయెను . బాణములు లక్ష్మణుని ఏ మాత్రము బాధించకుండుట చూసిన ఇంద్రజిత్తు మూడు బాణములతో లక్ష్మణుని నుదిటిపై కొట్టెను . అప్పుడు లక్ష్మణుడు అయిదు బాణములతో ఇంద్రజిత్తు నుదిటిపై కొట్టెను . ఇంద్రజిత్తు విభీషణుడిని ,వానరవీరులను ఒక్కో బాణముతో కొట్టెను . వెంటనే విభీషణుడు ఇంద్రజిత్తు రధాశ్వములను కొట్టెను . అప్పుడు రధాశ్వములు మరణించగా ఇంద్రజిత్తు రథములో వున్న శక్తి అనే ఆయుధమును తీసుకుని రధము దిగి దానిని విభీషణుడిపై ప్రయోగించెను . అది గమనించిన లక్ష్మణుడు తన బాణములతో ఆ ఆయుధమును ముక్కలు చేసెను . 
లక్ష్మణుడు వారుణాస్త్రము ప్రయోగించగా ,ఇంద్రజిత్తు రౌద్రాస్త్రముతో దానిని నిర్వీర్యము చేసెను . ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రము ప్రయోగించగా ,లక్ష్మణుడు సౌరాస్త్రము (సూర్య దేవాత్మక అస్త్రము )తో దానిని వమ్ము చేసెను . ఇంద్రజిత్తు అసురాస్త్రము ప్రయోగించగా లక్ష్మణుడు మహేంద్రాస్త్రముతో దానిని ముక్కలు చేసెను . ఆ వీరుల మధ్య సమరం మహా భయంకరముగా సాగుచున్నది . ఆ సమయములో ఆకాశములో పక్షులన్నియు లక్ష్మణుని చుట్టూ చేరినవి . అప్పుడు ఋషులు ,పితృదేవతలు ,సురులు గంధర్వులు ,గరుడుడు ,నాగులు మొదలగు వారందరు ఇంద్రుని నాయకత్వము న రణభూమి అందున్న లక్ష్మణుని రక్షించుచుండిరి . అప్పుడు లక్ష్మణుడు ఇంద్రాస్త్రము ను ఆ చావు మూడిన రావణుని సుతుడపై ప్రయోగించగా ఆ అస్త్రము . తిన్నగా దూసుకుపోయి ఇంద్రజిత్తు తలను ఖండించివేసెను . అప్పుడు ఇంద్రజిత్తు శిరస్సు మొండెము నుండి వేరుపడి నేలపై పడిపోయినది . 
ఆ విధముగా ఇంద్రజిత్తు సమర భూమికి బలియైపోగా విభీషణుడు ,వానరయోధులందరూ సంతోషముతో జయజయ ద్వానములు చేసిరి . దేవతలు ,మహాత్ములైన ఋషులు ,గంధర్వులు అప్సరసలు సంతోషముతో చేసిన జయజయద్వానములు అన్ని దిక్కులా వ్యాపించినవి . ఆ సమర భూమిలో వున్న వందలకొలది రాక్షసులు తమ  మారణాయుధములను అక్కడే వదిలిపెట్టి అన్ని దిక్కులకు పారిపోయిరి . కొందరు లంక లోకి పారిపోయిరి . మరికొందరు సముద్రములో దూకిరి . ఇంకొందరుపర్వతములలోకి పోయి దాగుకొనిరి . ఆకాశములో దేవదుందుభులు మ్రోగినవి . అప్సరసలు నాట్యము చేసినారు . గంధర్వులు గానము చేసినారు . దేవతలు పుష్ప వర్షము కురిపించారు . అందరూ లక్ష్మణుని ప్రశంసలతో ముంచెత్తిరి . 

రామాయణము యుద్ధకాండ తొంబదియొకటవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు 




Saturday 1 February 2020

రామాయణము యుద్ధకాండ -తొంబదియవసర్గ

                             రామాయణము 

                       యుద్ధకాండ -తొంబదియవసర్గ                           

విభీషణుడు లక్ష్మణుడి వద్దకు తన అనుచరులతో సహా వచ్చెను . విభీషణుడి అనుచరులు ఇంద్రజిత్తు సేనను అడ్డకత్తులతో బల్లెములతో వధించసాగిరి . పిమ్మట విభీషణుడు వానరులకు ఉత్సాహము కలిగించుటకై వారితో "ఓ వానరోత్తములారా !రావణునికి ఈ ఇంద్రజిత్తు ఒక్కడే దిక్కు . వారి బలములన్నియు హతమై పోగా మిగిలివున్నాది యితడు మాత్రమే . సమరభూమి అందు పాపాత్ముడైన ఇతడిని హతుడిని కావించినచో ఇక రావణుడు ఒక్కడు తప్ప ప్రముఖ రాక్షస వీరులందరూ మరణించినట్టే . ఇతడికి నేను పినతండ్రిని పుత్రుడితో సమానమైన ఇతడిని చంపుట యుక్తము కాదు . అయినా రామ కార్యము కోసము జాలి పక్కన పెట్టి వాదివలెనంటే నా కళ్ళు అశ్రువులతో మూసుకుపోయి కనపడకున్నవి . కావున ఇతడిని మన లక్ష్మణవీరుడు హతమార్చెదడు . వానరయోధులందరూ కలిసి ఇంద్రజిత్తు వెనక ఉన్న ఆ రక్కసి మూక పని పట్టాలి . "అని పలికెను . 
విభీషణుడు ఇలా ప్రేరేపించిగా వానరులందరూ సంతోషముతో రాక్షసి మూకను చుట్టుముట్టి  వధించసాగిరి . లక్ష్మణ ఇంద్రజిత్తుల యుద్ధము కూడా తీవ్రముగా ఉండెను . వారిరువురు ప్రయోగించిన అసంఖ్యాకమైన బాణములు ఆకాశమంతా అలుముకొని ఉండుటచే చిమ్మచీకట్లు కమ్ముకొనెను . ఎటు చూసినా బాణములే కనపడుచుండెను . యుద్ధ కుశులుడైన లక్ష్మణుడు తన ధనస్సు అందు వజ్ర తుల్యమైన బాణమును సంధించి ,ఆకర్ణాంతము లాగి ,వదిలెను . ఆ బాణపు దెబ్బకు ఇంద్రజిత్తు రధసారధి చనిపోయెను . 
ఇంద్రజిత్తు రధమును నడుపుటలో నిమగ్నుడై ఉండగా లక్ష్మణుడు అతడిని తన బాణములతో కొట్టెను . అనంతరము ప్రమాథి ,శరభుడు ,రభసుడు ,గంధమాధనుడు అను వానర ప్రముఖులు ఇంద్రజిత్తు గుఱ్ఱములపై పడి వాటిని చంపివేసి పిమ్మట రధమును కూడా ధ్వంసము చేసి  తిరిగి ,లక్ష్మణుడి చెంతకు వచ్చిరి . గుఱ్ఱములు ,రధము నాశనము కాగా ,సారధి మరణించగా ఇంద్రజిత్తు ఆ రధము నుండి దిగి ,నేలపై నిలబడి శరవర్షము కురిపించుచు ,లక్ష్మణుడి దగ్గరగా రాసాగేను . 

రామాయణము యుద్ధకాండ తొంబదియవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం .ఏ , ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














రామాయణము యుద్ద కాండ -ఎనుబదితొమ్మిదవసర్గ

                                    రామాయణము 

                                          యుద్ద కాండ -ఎనుబదితొమ్మిదవసర్గ 

లక్ష్మణుడు ధనుష్టంకారము చేసి ,రెచ్చిపోయిన పాము వలె బుసలు కొడుతూ ,ఇంద్రజిత్తుపై వాడి ఐన బాణములు ప్రయోగించెను .  బాణపు దెబ్బకి ఇంద్రజిత్తు శరీరము గాయము అయ్యి ఇంద్రజిత్తు కొద్దిసేపు మిన్నకుండెను . కొద్దిసేపటి తర్వాత కోలుకున్న ఇంద్రజిత్తు కోపముతో రంకెలు వేస్తూ ,లక్ష్మణుని ,హనుమంతుని ,విభీషణుని తన బాణములతో గాయ పరిచేను . పిమ్మట లక్ష్మణుడు కోపోద్రిక్తుడై ఇంద్రజిత్తుపై బాణములు ప్రయోగించేను . ఆ బాణముల దెబ్బకి ఇంద్రజిత్తు కవచము ముక్కలయ్యేను . ఇంద్రజిత్తు కూడా తన బాణములతో లక్ష్మణుడి కవచము కూడా ముక్కలయ్యేను . 
భయంకరముగా రణ గర్జనము చేస్తూ ఒకరిపై ఒకరు శరములను వర్షించుచుండిరి . చాలాసేపు వారిరువురు ఈ విధముగా యుద్ధము చేయుచున్నను ,వారికి విసుగు రాలేదు . బడలిక లేదు . వారు చేయు గర్జనలు ఆ యుద్ధ శబ్దములు విను వారికి భీకరములగు పిడుగుపాటు వలె ఉండెను . అప్పటివరకు లక్ష్మణునికి కొద్దీ  దూరములో ఉన్న విభీషణుడు లక్ష్మణునికి ఉత్సాహము కలిగించుటకు అతనికి దగ్గరగా వచ్చెను . 

రామాయణము యుద్ధకాండ ఎనుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .