Sunday 9 September 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదిఆరవసర్గ

                                  రామాయణము 

                                   కిష్కిందకాండ -ఇరువదిఆరవసర్గ 

వాలికి దాహంగా సంస్కారములు ముగిసిన పిమ్మట సుగ్రీవుడు ఒకచోట కూర్చుని బాధపడుచుండెను . తన అన్న ను తలచుకొని మిక్కిలి రోదించెను . అప్పుడు వానర ప్రముఖులందరూ సుగ్రీవుని వద్దకు వెళ్లి అతడిని ఓదార్చి ,శ్రీరాముని వద్దకు అతడిని తీసుకువెళ్ళేను . వారందరూ శ్రీరామునికి నమస్కారము చేసిరి . పిమ్మట  వాయునందనుడు శ్రీరామునితో "ఓ మహా వీరా !అనితర సాధ్యమయిన వాలి రాజ్యము నీ దయవలన సుగ్రీవుని కి దక్కినది . సుగ్రీవుడు నీ ఆజ్ఞకు బద్దుడు . అతడిని ఈ రాజ్యమునకు రాజుగా చేయుము . అతడు నిన్ను బాగుగా గౌరవించును . మాతో కిష్కింధకు రమ్ము . "అని పిలిచెను . 

అప్పుడు శ్రీరాముడు "హనుమా !నేను పదునాలుగు సంవత్సరముల కాలము గ్రామములో కానీ పట్టణములో కానీ ప్రవేశించరాదని మా ఆటీన్ద్రి ఆజ్ఞ . కావున మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఈ ప్రసవం గిరిపై ఉంటాను ఇచ్చటి ప్రక్రుతి రామణీయముగా ఉండును . గాలులు చల్లగా ఉండును . "అని పలికి పిమ్మట సుగ్రీవునితో "సుగ్రీవా !నీవు కిష్కింధకు రాజువి కమ్ము . నీ అన్న వాలి కుమారుడైన అంగదుడు వీరుడు . సర్వ శ్రేష్ఠుడు . అతడిని యువరాజుగా ప్పట్టాభిషిక్తుడిని గావింపుము . వానలు వుండు నాలుగు మాసములను వార్షికములు అందురు . ఈ సమయములో సీతాన్వేషణ కష్టము . కావున మీరు సుఖముగా కిష్కిందలో వుండండి . వర్షాకాలం పూర్తి అయిన పిదప కార్తీకమాస ఆరంభములో సీతాన్వేషణ కు ,రావణ వద్దకు సైన్యమును సంసిద్దము చేయుము . "అని పలికెను . 
అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముని ఆదేశము మేరకు కిష్కిందా నగరములో ప్రవేశించేను . నగరంలోని ప్రజలు ,వానర ప్రముఖులు అందరూ సుగ్రీవుని చుట్టుముట్టేను . వారందరితో కొద్దిసేపు కుశలప్రశ్నలు మొదలగు సంభాషణలు గావించి పిమ్మట సుగ్రీవుడు అంతఃపురమునకు వెళ్లి అటునుండి రాజ్యసభకు వెళ్లెను . వానరులు రాజ్యసభను రంగురంగుల పూలతో అలంకరించిరి . బంగారు సింహాసనంపై సుగ్రీవుని కూర్చొండబెట్టి ,పుణ్యతీర్ధములనుండి ,నదీనదముల నుండి ,సప్తసముద్రముల నుండి తెచ్చిన నీటిని బంగారు పాత్రలో ఉంచి వాటితో సుగ్రీవునికి పట్టాభిషేకము చేసెను . ఆ సమయములో బ్రాహ్మణోత్తములు అనేక యజ్ఞములు చేసిరి . వారందరికీ అమూల్యమైన నగలు ,వస్త్రములు ,దనము ,ధాన్యము ,గోవులు ,వస్తువులను ,మావోహారమైన ఆహార పదార్ధములను ఇచ్చి సంతోష పరిచేను . సుగ్రీవుడు తన భార్య రుమను శ్వీకరించెను . పిమ్మట శ్రీరాముని ఆదేశము మేరకు అంగదుని యువరాజుగా పట్టాభిషేకము చేసెను . అప్పుడు అచట వున్న వానర ప్రముఖులందరూ "బాగుబాగు "అని పొగిడిరి . పిమ్మర సుగ్రీవుడు శ్రీరాముని దగ్గరకు వెళ్లి పట్టాభిషేక విషయములన్నీ వివరించెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువది ఆరవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .   










Thursday 23 August 2018

రామాయణము కిష్కిందకాండ - ఇరువది అయిదవసర్గ

                                        రామాయణము  

                                                                         

                                 కిష్కిందకాండ - ఇరువది అయిదవసర్గ 

శ్రీ రాముడు దుఃఖించుచున్న తార సుగ్రీవుడు అంగదుడు మొదలగు వారిని ఓదార్చి ,వాలి అంతిమ సంస్కారమునకు ఏర్పాట్లు చేయమని చెప్పెను . ఆ బాధ్యతను లక్ష్మణుడు తీసుకుని వాలి అంతిమసంస్కారమునకు కావలిసిన వస్తువు అన్ని దగ్గరుండి తెప్పించి  అంతిమ వీడ్కోలు ఘనముగా ఏర్పాటు చేసెను . చక్కగా అలంకరించబడిన పల్లకీని తీసుకువచ్చి దానిపై వస్త్రాభరణములతో అలంకరించిన వాలి మృత దేహమును చేర్చి ,ముందు వానరులు విలువైన రత్నములు చల్లుచుండగా పల్లకీని తీసుకువచ్చిరి . 
ఎండిన కట్టెలు గంధపు చెక్కలతో వాలి దేహమునకు సంస్కారములు నిర్వహించిరి . ఆ సమయములో తారను అతి కష్టము మీద తక్కిన వానర స్త్రీలు పట్టుకోగలిగారు . పిమ్మట వాలికి తర్పణములు వదులుటకు వారందరూ నాదీ జలముల వద్దకు వెళ్లిరి . రామలక్ష్మణులు ,సుగ్రీవుడు ,తార అంగదులను ముందు ఉంచుకుని ఆ వానర ప్రముఖులంతా తర్పణములు వదిలిరి . ఈ సమస్త కార్యమును రామలక్ష్మణులు దగ్గరుండి నడిపించిరి . కార్యక్రమము అయ్యిన పిమ్మట సుగ్రీవుడు రాముని వద్దకు వచ్చి నిలబడెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము . 

                                                  శశి ,

ఎం . ఏ .ఎం . ఏ (తేలుగు ),తెలుగు పండితులు . 

                                                                                          

Tuesday 21 August 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదినాల్గవసర్గ

                                         రామాయణము 

                                           కిష్కిందకాండ -ఇరువదినాల్గవసర్గ 

కన్నీరుమున్నీరుగా విలపించుచున్న తారను చూసి సుగ్రీవుడు చలించిపోయెను . తారను చూసి తానును విలపించెను . అతని మనస్సు న దైన్యము వహించెను . అతడు చిన్నబోయిన ముఖముతో శ్రీరాముని చేరెను . రామునితో ఈ విధముగా పలుకసాగెను . "ఓ మహాప్రభూ !నీవు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటివి . రాజ్యము నాకు దక్కినది . కానీ ఇప్పుడు నాకు రాజ్యభోగములపై మనస్సే పోవుటలేదు . అంతేకాదు నాకు జీవితముమీదే విరక్తి కలుగుతున్నది . మా అన్న అగు వాలి ఇంతకూ మునుపు నన్ను అనేక విధములుగా అవమానించి వున్నాడు . పైగా నా భార్యను అపహరించి నాకు ద్రోహము చేసినాడు అందుచే నేను మీచే మా అన్నాను చంపించితిని . 

ఓ రామా ! నేను ఇప్పటి వరకు ఋష్యమూక పర్వతంపై జీవిస్తూ వచ్చాను . ఇప్పుడు నా అన్న మృతదేహము చూస్తుంటే అలాగే ఋశ్యమూకపర్వతం పైనే బతికేసివుంటే బాగుండేది అనిపిస్తోంది . మా అన్న అగు వాలి మహానుభావుడు యుక్తాయుక్త విచక్షణ కలిగినవాడు . అతడు నాతొ యుద్ధము చేయునపుడు "తమ్ముడా !నిన్ను చంపదలుచుకోలేదు . నీవు స్వేచ్ఛగా ఎక్కడికైనా పో "అని పలికాడు . ఆ విధముగా పలుకుట అతనికే చెల్లినది . కానీ దుర్మాత్ముడనైన  నేను అతడి గురించి నీకు చెప్పి అతడిని చంపించినాను . ఈ పాపమునకు పరిహారము లేదు . నేనును అగ్నిజ్వాలలో పడి మరణించెదను . ఓ రామా !నీకు ఇచ్చిన మాట ప్రకారము నేను మరణించినను నా ఆజ్ఞచే సీతాన్వేషణను ఈ వానరులు గావింతురు . క్షమించరాని పాపము చేసిన నేను జీవించుటకు అనర్హుడను . మరణించుటకు నాకు అనుమతి ఇవ్వు "అని పలికెను . 
ఆర్తుడై అలమటించుచున్న సుగ్రీవుని చూసి శ్రీరాముడు తానునూ కన్నీరు పెట్టి ఏడ్చుచున్న తారను ఓదార్చుటకు ఆ వైపుగా నడవసాగెను . శ్రీరాముడు వచ్చుట గమనించిన అక్కడి వారు భర్త దేహము పై పది ఏడ్చుచున్న తారను లేవదీయుటకు ప్రయత్నము చేసిరి . తార తన భర్తను వదులుటకు ఇష్టపడక బలవంతముగా భర్తపై పడుచుండెను . ఆ సమయములో తనవైపుగా వచ్చుచున్న శ్రీరాముని చూసి పెనుగులాడుట ఆపివేసెను . తార ఇంతకుముందు శ్రీరాముని చూడకపోయినా అతని తేజస్సు ను చూసి ,అంతకు మునుపు అంగదుడిచే రాముని రూపురేఖలు విని ఉండుటచే రాముని గుర్తించింది . 

పిమ్మట తార తన భర్త మరణమునకు కారణము శ్రీరాముడు అని తలిచి పరుషవాక్యములు పలుకవలెనని సంకల్పంతో రాముని చేరెను కానీ శ్రీరాముడి ప్రభావము చే ఆమెలోని తీవ్రభావము తగ్గిపోయెను . అప్పుడు ఆమె రామునితో ఇలా పలికెను . "ఓ రామా ! నీవు సర్వ గుణ సంపన్నుడవు . సత్పురుషుడవు . సర్వ ధర్మములు తెలిసినవాడవు . ఓ రామా !నా నాధుని చంపిన ఆ బాణముతోనే నా ప్రాణములు  కూడా తీయుము , నేను నా నాధుడు లేనిదే  ఉండలేను . నా నాధుడు కూడా స్వర్గము లభించినా చెంత నేను లేని యెడ సంతోషముగా వుండలేడు . నన్ను చంపి నా భర్త వద్దకు నన్ను చేర్చుము స్త్రీని చంపుట ఎట్లు అని ఆలోచించుతున్నావేమో ?భార్యాభర్తలు వేరుకాదు ఒక్కరే . భార్యయే భర్తకు ఆత్మ . కావున నన్ను వాలి ఆత్మగా భావించి వధించుము . అన్ని దానములలోకి కన్యా దానము మిక్కిలి ప్రశస్తమని పెద్దలు చెప్పుదురు . ఆ విధముగా నన్ను నా భర్తకు దానము ఇచ్చి పుణ్యము కట్టుకొనుము "అని పలికెను 
అప్పుడు శ్రీరాముడు తారను ఓదార్చుచు "ఓ వీర పత్నీ ! నీవు ఈ విధముగా దైన్యమునకు లోనుకావద్దు . సర్వప్రాణుల తలరాతను రాసిడెది బ్రహ్మదేవుడే . విధిని ఎవ్వరూ తప్పించుకొనలేరు . విధి నిర్ణయమే అంత . త్వరలోనే నీ కుమారుడైన అంగదుడు యువరాజు కానున్నాడు . అతడి బాధ్యతా భారము నీపై వున్నది . కావున దుఃఖించకు . వీర పత్నులు దుఃఖించరాదు . "అని పలికెను . పిమ్మట తార కొంత ఉపశమనము పొందెను 

రామాయణము కిష్కిందకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Monday 20 August 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదిమూడవసర్గ

                                           రామాయణము 

                                     కిష్కిందకాండ -ఇరువదిమూడవసర్గ 

వానవేంద్రుడైన వాలి బంధుమిత్రులందరినీ వీడి స్వర్గస్తుడు కాగా తార అతని దేహముపై పడి మిక్కిలి దీనంగా విలపించసాగెను . పరిపరి విధములుగా భర్త శూరత్వమును తలచుకుని బిగ్గరగా ఏడవసాగెను . పిమ్మట తార తన కుమారుడైన అంగదునిచే వాలికి నమస్కరింపచేసెను . అప్పుడు నీలుడు  (సుగ్రీవుని సేనాధిపతి )వాలి కి గుచ్చుకున్న బాణమును లాగివేసెను . 
రామాయణము కిష్కిందకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము . 
                                                                                                        


                                                                                                               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Thursday 17 May 2018

రామాయణం కిష్కిందకాండ -ఇరువదిరెండవసర్గ

                                     రామాయణం 

                               కిష్కిందకాండ -ఇరువదిరెండవసర్గ 

కొనఊపిరితో వున్నా వాలి తన శక్తినంతా కూడగట్టుకుని కళ్లుతెరిచి చూచెను అతడికి ఎదురుగా సుగ్రీవుడు కనపడెను . అప్పుడా వానర ప్రభువు "తమ్ముడా !నేను బలగర్వితుడనై ,అజ్ఞానవసమున  భార్యను చెరపట్టితిని . నా దోషమును మన్నింపుము . అన్నదమ్ములమైన మనము కలిసి మెలిసి జీవించు అదృష్టము  దేవుడు మన నొసటన రాయలేదు . మరి కొన్ని క్షణములలో నేను ఈ తనువును చాలించెదను . కావున ఈ వానర రాజ్యమును నీవు శ్వీకరింపుము . ఈ సమస్త సంపదలు రాజ్యము తుదకు నా ప్రాణములు కూడా వదిలి వెళ్ళిపోచున్నాను . 'వాలి అజేయుడు ,ఎంతటి వీరుడికైనా లొంగడు 'అనే నా కీర్తి నేటితో పరిసమాప్తి అయినది . ఓ వీరుడా !రాజ్యభారం క్లిష్టమైనదే అయిననూ దానిని భరించ నీవు సమర్థుడవు . 
సోదరా !నా కుమారుడై అంగదుడు నాకు ప్రాణములకంటే ఎక్కువ ప్రియుడు . అతడు  పసివాడు అమాయకుడు . అతడి రక్షణ  భారము  ఇకపై నీదే . అతనికి నాకు మారుగా అన్నవస్త్రాభరణాదులను నీవే సమకూర్పవలెను . ఇతడికి ఎట్టి భయము లేకుండా అండగా ఉండుము . నాయనా !సుగ్రీవా !నా ధర్మపత్ని అగు తార సుషేణుని కూతురు , ఈమె ఏంటో సూక్ష్మ బుడ్డి కలది . రాబోవు ఆపదలను పసిగట్టగలడు . సకల విషయములనందును సమర్థురాలు . తమ్ముడా !శ్రీరాముని కార్యము ఎట్టి సంకోచము లేకుండా చేయుము . సుగ్రీవా !ఇదిగో !ఈ దివ్యమైన బంగారుమాలను నా బొందిలో ప్రాణము ఉండగానే నీవు దరింపుము లేనిచో నేను మృతి చెందిన వెంటనే ఈ మాలకున్న అజేయ శక్తి నశిస్తుంది . "అని పలికి తమ్ముడికి ఆ మాలను అందించెను . 

అన్న వాలి మాటలు విన్న సుగ్రీవునికి అతనిపై అంతకు ముందు వరకు వున్న శత్రు భావము పూర్తిగా నశించి అన్నపై ప్రేమ భాద అంకురించినవి . పిమ్మట వాలి తన కుమారుడైన అంగదుడను పిలిచి అతడికి అనేక బుద్దులు చెప్పెను. పిమ్మట వాలి మరణము ఆసన్నమగుటచే కన్నులు మూసివేసెను అతడి ప్రాణములు అనంతవాయువులలో కలిసిపోయెను . ఆ క్షణములో కిష్కింద నగరములో ఆక్రోసనాలు ఏడుపులు ఆకాశము అంటు నట్లుగా వినిపించెను . కిష్కిందా రాజ్యము కళావిహీనము అయ్యెను . తన పాటి మరణించిన  కారణముగా తార దుఃఖసముద్రములో మునిగిపోయెను . చచ్చిపడి ఉన్న భర్త ముఖము చూచి  కౌగలించుకుని నరికివేయబడ్డ చెట్టుని అల్లుకున్న తీగలా నేలపై పడిపోయెను . 

రామాయణము కిష్కింద కాండ ఇరువదిరెండవసర్గ సమాప్తము . 

                                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ ( తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము కిష్కిందకాండ -ఇరువదిఒకటవసర్గ

                                           రామాయణము 

                                               కిష్కిందకాండ -ఇరువదిఒకటవసర్గ 

ఆకాశము నుండి రాలి పడిన తారక వలె భూమిపై పది ఏడ్చుచున్న తారను చూచి ఆంజినేయుడు ఇలా పలికెను . 
"ఓ మహాసాద్వీ !ఏ ప్రాణి అయినను తెలిసి చేసిన ,తెలియక చేసిన పాపపుణ్య ఫలితములన్నిటినీ ఈ లోకమునైనా ,పరలోకమునైనా తప్పక అనుభవించి తీరవలెను . ఈ శరీరము నీటి బుడగ వాలే అస్తిరమైనది ,కావున ఒక దేహమున వున్న జీవుడు మరొక దేహమున వున్నా జీవుడి గూర్చి విచారించుట అవివేకము . ఓ దేవీ !నీవు అన్నీ తెలిసిన దానవు . ఏ జీవి ఎప్పుడు పుట్టునో ఏ జీవి ఎప్పుడు గిట్టునో ఎవ్వరూ చెప్పలేరు . కావున ఈ విలాపములు మాని పరలోకమున వున్నత గతులిచ్చెడి పుణ్యకార్యములు చేయుము . 
తల్లీ అసంఖ్యాకులైన వానరభల్లూకములతో కూడిన సువిశాలమైన  కిష్కింద రాజ్యమును నీ భర్త అయినా వాలి ఏంటో సమర్ధవంతముగా పరిపాలించాడు . దీనులను ఆప్తులను చక్కగా రక్షించాడు ఒక వీరునితో యుద్ధము చేస్తూ వీరమరణము పొందుటకు సిద్ధముగా వున్నాడు . కావున అతనికి తప్పక ఉత్తమలోకములు లభిస్తాయి . ఆ విషయములో నీవు శోకించవలిసిన పనిలేదు . ఓ పూజ్యురాలా !ఈ వానరప్రముఖులందరికీ అంగదునికి ,ఈ కిష్కింద రాజ్యమునకు నీవే రక్షకురాలివి . వారందరూ సోకథంతప్తులై వున్నారు వారిని ఊరడించి భావికార్యమునకు ప్రోత్సహించుము . నీ పర్యవేక్షణలో అంగదుడు రాజ్యమును పరిపాలించగలడు . సింహాసనమును అధిష్టించిన అంగదుడిని చూచినచో నీ మనసుకు కొంత ఊరట లభించును . "అని పలికెను . 
అప్పుడా తార మారుతితో "ఓ వానర శ్రేష్టా !నీవు పలికినట్టు నా కుమారుడు వున్ననూ ఈ రాజ్యము నాకు ఉన్నానో వాటి మీద నాకు మనసు లేదు . నా మనసు నా పాటి పాదపద్మములనే ఆశ్రయించుకుని వున్నది . ఆయన లేను బతుకు నాకు వ్యర్థం . కావున నేను కూడా ఆయనతో సహగమనము చేసెదను . అంగదునికి సుగ్రీవుడు తండ్రి వంటి వాడు అతని బాగోగులు సుగ్రీవుడి చూసుకొనును . నేను నా భర్తతో సహగమనము చేసెదను "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువదిఒకటవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు  పండితులు . 








Thursday 19 April 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదియవసర్గ

                                     రామాయణము 

                                    కిష్కిందకాండ -ఇరువదియవసర్గ 

శ్రీరాముని బాణాపుదెబ్బచే నేలపై పది ఉన్న వాలిని ఆ తార కౌగలించుకుని "ఓ వానరవీరా !యుద్ధమున తిరుగులేనివాడవు . వానరులలో ప్రముఖుడవు . నీవంటి మహారాజు ఇలా నేలపై పరుండుట తగునా !లే లేచి తగిన శయ్యపై పరుండుము . నీకు అత్యంత ప్రియమైన భార్యనైన నేను ఈ విధముగా నీ చెంతనే ఉండి ఈవిధముగా విలపించుచుండగా కానేసాము మారు పలుకవేమి ? కనీసము నీ గారాల పుత్రుడైన  అంగదుడనైనా ఊరడించవేమి ?మేము నీకు అప్రియములైన ఏ పనులు చేసినాము ?ఇక నుండి నువ్వు అల్లారుముద్దుగా పెంచిన అంగదుడు పినతండ్రి కోపతాపములు భరించుచు జీవించవలెను కాబోలు " అంటూ ఏడ్చెను . తిరిగి కుమారునివైపు తిరిగి . "నాయనా !అంగదా !మీ తండ్రి ని కనులారా చూచుకో మల్లి ఆ అదృష్టము దక్కదు ". అని పలికి తిరిగి వాలివైపు తిరిగి "నీవు నీ హితము కోరి నేను చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి నీ తమ్ముడి భార్య రామ ను చెర పట్టి చేచేతులారా ఈ దుస్థితిని తెచ్చుకున్నావు . "
 అని అప్లికి సుగ్రీవునితో "ఓ సుగ్రీవా !నీ కోరిక నెరవేరినది కదా తండ్రి వంటి అన్నగారిని పొట్టన పెట్టుకున్నావు . ఆయన విగత జీవుడై పడివున్నాడు ఇప్పుడు నీకు సంతోషమేగా ఇక నీ భార్యతో సంతోషముగా వుండు . ఈ రాజ్యమును ఏలుకో !"అనెను . అంటూ బిగ్గరగా ఏడ్చుచూ వాలివైపు తిరిగి "ఓ నాధా !నేను నీ భార్యలు అందరూ వచ్చి వున్నారు మమ్ములను కనీసము ఒక్కసారైనా చూడవేమి ?అజ్ఞానముతో మేమేమయినా దోషము చేసి ఉంటే మమ్ము మన్నించు "అనెను.  తిరిగి ఆమె నా ప్రియమైన భర్త చనిపోయి పడివున్ననూ  ఇంకనూ నా హృదయము బద్దలవలేదంటే నేను బహుశా పాషాణ హృదయురాలిని అయివుంటానని ఏడ్చి ప్రాయోపవేశమునకు సిద్దపడెను 

రామాయణము కిష్కిందకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు 







Saturday 14 April 2018

రామాయణము కిష్కిందకాండ -పందొమ్మిదవసర్గ

                                 రామాయణము 

                              కిష్కిందకాండ -పందొమ్మిదవసర్గ 

ఆ విధముగా శ్రీరాముని దెబ్బకు వాలి పడిపోయాడని తెలిసిన తార అంతఃపురము నుండి పరుగు పరుగున వచ్చుచుండెను . ఆమెకు దారిలో అనేక వానర వీరులు వాలి కూలిపోవడంతో బయపడి పారిపోతూ కనిపించారు . ఆమె వారి ఆపి "ఓ వానర వీరులారా !రాజ్యము కోసము సుగ్రీవుడు పన్నిన పన్నాగము ఇది . అతడు శ్రీరాముని చేత తన అన్నపై బాణము వేయించెను . కావున మీరు భయపడనవసరము లేదు "అని పలికెను . అప్పుడా వానరవీరులు "అమ్మా !వాలి మరణావస్థలో వున్ననూ నీ కుమారుడు ఇంకనూ బతికే వున్నాడు ఇప్పుడు రాజ్యమును రక్షించుకొనుట తక్షణ కర్తవ్యము . ఇప్పటికే ఈ రాజ్యమునుండి వాలి చే బహిష్కరించబడిన వానరుల నుండి ముప్పు వున్నది సుగ్రీవుని నుండి ముప్పు వున్నది కావున  నీ కుమారునికి పట్టాభిషేకము చేసి రాజ్యరక్షణా బాధ్యతలు చేపట్టాలి కావున నీవు కూడా మా మాట విని అంతఃపురమునకు మారాలి పొమ్ము "అని పలికిరి . 
అప్పుడా తార "ఓ వీరులారా !నా భర్తే నా లోకము ఆయన మరణించినచో ఈ రాజ్యముతో నాకు పని లేదు . కుమారునితో కూడా పని లేదు . ఆయన చరణముల నేడే నాకు స్వర్గము "అని పలికి బోరున ఏడ్చుచు రణరంగమునకు వచ్చెను అచట ఆమె ముందుగా విల్లిను నేలపై పెట్టి దాని మీద చెయ్యి వేసి నిలబడిన శ్రీరాముని పక్కనే వున్నలక్ష్మణుని ,వారి వెంటే వున్నా సుగ్రీవుని నిర్మల బుద్దితో చూసేను . వారిని దాటుకుని వాలి  వద్దకు వచ్చి పెద్దపెట్టున ఎడ్వానారంభించెను .

 పెద్ద పెద్ద వృక్షములను కొండలను సైతము పీకి పారవేయగల వాలి ఇప్పుడు పరమ దీనావస్థలో వున్నాడు . శత్రువు ఎంతటి గొప్పవాడైన సునాయాసముగా ఓడించితిరిగి రాగల వీరుడు ఇప్పుడు తిరిగిరాని లోకములకు పోవుటకు సిద్దమై వున్నాడు . ఆమెకు గుండె పగిలినట్టు అనిపించెను . ఆమె ఆర్యాపుత్రా !అని బిగ్గరగా ఏడ్చుచుండెను . ఆడ లకుముకి పిట్ట వలే ఏడ్చుచున్న తారను ఆమె వెంటే వున్నా అంగదుడను చూసి సుగ్రీవుడు మిక్కిలి విషాదమునకు లోనయ్యేను . 

రామాయణము కిష్కిందకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Thursday 12 April 2018

రామాయణము కిష్కింద కాండ -పదునెనిమిదవసర్గ

                                          రామాయణము 

                                   కిష్కింద కాండ -పదునెనిమిదవసర్గ 

మరణావస్థలో వున్నవాలి శ్రీరాముని తనను వధించబూనటానికి కారణము అడుగగా శ్రీరాముడు ఇలా కారణము చెప్పనారంభించెను . "వానరా !ధర్మార్ధ విషయములు నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు . సరే నిన్ను శిక్షించుటకు కారణము చెబుతాను విను ,కొండలతో కొనలతో ,అరణ్యములతో కూడిన ఈ భూమి ఇక్ష్వాకు వంశ ఆధీనములో వున్నది . ఇప్పుడు ఇక్ష్వాకు వంశ ప్రభువు భరతుడు ,మేమందరము ఆయన అనుచరుల వంటి వారము ఆయనకు ధర్మపాలనలో సహాయపడు వారము . ఓ వాలి !పురుషుడు తనకంటే చిన్నవాడైన తన తమ్ముడిని ,తన పుతృడిని ,తన శిష్యుడిని ముగ్గురిని పుత్రుని వలె చూసుకొనవలెను . ఇది ధర్మజ్ఞులు చెప్పిన ధర్మము . ఆ ధర్మము ప్రకారము నీ సోదరుడైన సుగ్రీవుని భార్య నీకు కోడలుతో సమానము అనగా కూతురు వంటిది . అటువంటి ఆమెను నీవు కామాతురడవై చెరపట్టితివి . 
నీవు చేసిన ఈ తప్పుకు నేను శిక్షవిధించితిని . రాజ్యములో తప్పుచేసినవాడికి శిక్షవిధించక పోయినట్లయియే ఆ పాపము రాజుకు తగులుతుంది . పూర్వము ఇట్టిపాపమునే శ్రవణుడు అనే వాడు చేసాడు . మా వంశము వాడైన మాంధాత చక్రవర్తి అతడికి భయంకరమైన శిక్షవిధించాడు . ఓ వానరా !నీకు నేను విధించిన శిక్ష సరియైనది ఇందు ఏ మాత్రము అనుమానము లేదు . అదీ కాక నేను సుగ్రీవునితో మైత్రి చేసుకున్నప్పుడు అతడి భార్యను అతడి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించెదనని మాట ఇచ్చాను . నేను నా మాటను ఎలా నిలబెట్టుకోకుండావుండగలను ?ఓ వాలి !ఇక నిన్ను చాటుగా చంపుటకు గల కారణము చెప్పెదను వినుము . మహారాజులు మృగములను చాటున ఉండి అయినా వాలా పన్ని అయినా చంపవచ్చు . అది ధర్మమే నీవు మనిషివి కావు మృగమువి కావున ఇలా నిన్ను చంపుటలో ఏ దోషమూ లేదు . "అని పలికెను . 
శ్రీరాముని మాటలు విన్న వాలి "రామా !నీవు ధర్మపరుడవు ,నేను ఈ బాణపు దెబ్బకు తట్టుకోలేక ఏవో మాట్లాడాను నన్ను క్షమించు . నాకు నా మరణము గూర్చి చింతలేదు నా బాధ అంతా నా ఒక్కగానొక్క ముద్దులకుమారుడు అయినా అంగదుడు గురించే అతడిని అల్లారుముద్దుగా పెంచుకున్నాను . అతడి పరిస్థితి ఏమవుతుందో అనే నా భయము . నాయందు దయ ఉంచి నీవు అతడిని సంరక్షించుము . లక్ష్మణుడిని ,సుగ్రీవుని చూసినట్లే అతడిని చూడుము . నా భార్య తార మిక్కిలి తెలివికలది . ఆమె రాబోవు ఆపదను అంచనావేయుటలో సమర్థురాలు . ఆమె మాటలు పెడచెవినపెట్టి నేను ఈ మరణమును కొనితెచ్చుకున్నాను . సుగ్రీవుని ఆమెను ఏమి అనవద్దని చెప్పు "అని పలికెను . 
అప్పుడు రఘురాముడు "వానరా !అంగదుడు ఇంతవరకూ నేనుండి పొందిన ప్రేమాభిమానములే నా నుండి సుగ్రీవుని నుండి పొందగలడు . శిక్ష అనుభవించినావు కావున నీ పాపము నుండి విముక్తుడవు అయ్యావు . కావున నీవు విచారించవలదు "అని పలికెను . ఆ మాటలు విన్న వాలి స్వామి !నా అపచారమును మన్నింపుము "అని వేడుకొనెను . 

రామాయణము కిష్కిందకాండ పదునెనిమిదవసర్గ  సమాప్తం . 

                                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Wednesday 11 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునేడవసర్గ

                                         రామాయణము 

                                        కిష్కిందకాండ -పదునేడవసర్గ 

శ్రీరాముడి బాణపు దెబ్బకు నేలకొరిగిన వాలి కొంతసేపటికి కళ్లుతెరిచి రామలక్ష్మణులను చూసేను . పిమ్మట అతడు రామునితో పరుషముగా ఇలా మాట్లాడనారంభించెను . "స్వామి !నీవు మహారాజు పుత్రుడవు ,సకల ధర్మశాస్త్రములు అభ్యసించినవాడవు . ఉత్తమవంశమున జన్మించినవాడవు . పరాక్రమవంతుడివి ,అన్ని విధములుగా వాసికెక్కినవాడవు . నేను వేరొకరితో యుద్ధము చేయునపుడు నీవు నా వక్షస్థలమున ఎందుకు కొట్టితివి .' శ్రీరాముడు కనికరము కలవాడు ఆశ్రీతులను కాపాడువాడు . ఎల్లప్పుడూ ప్రజాహితమునకే పాటుపడేవాడు ,దయామయుడు ,సదాచారసంపన్నుడు' ,అని ఈ భూమండలం మొత్తము నీ గుణములను గానము చేయుచున్నది . శ్రీరాముడు ధర్మపరుడు అని నమ్మి తార అడ్డు పడినా వినక నేను సుగ్రీవునితో యుద్ధమునకు వచ్చితిని . నీవు యధార్ధమునకు అధర్మపరుడివి . 
నీ దేశమునకు ,నీ పురమునకు నీకు నేనెన్నడూ అపకారము తలపెట్టి ఎరుగను . నిన్ను ఎన్నడూ అవమానించి ఎరుగను . అటువంటి నన్ను ఎందుకు చంపబూనావు . నేను నీతో యుద్ధము చేయలేదు . పైగా నేను వానరుడను . రాజులు సాధారణముగా రాజ్యము కొరకు సంపద కొరకు యుద్ధములు చేస్తారు . మరి నీవు ఈ  రోజు నా వనము నుండి ఏమి ఆశించి నన్ను కొట్టావు . రాజద్రోహి ,గోబ్రాహ్మణ హత్యలు చేయువాడు ,చోరుడు ,ఎల్లప్పుడూ ప్రాణులను ,వధించువాడు నాస్తికుడు ,అన్న కంటే ముందుగా వివాహము చేసుకున్న వాడు ,చాడీలు చెప్పేది వాడు ,లోభి ,మిత్రద్రోహి ,గురుద్రోహి ,ఇతరుల సంపదను బలవంతముగా అనుభవించెడివాడు ,స్త్రీలను ఏడిపించెడివాడు వీరందరికి నరకయాతనలు తప్పవు . 
ఓ రఘువీరా !జింక చర్మము ఆసనమునకు ఉపయోగపడును ,చమరీమృగకేసములు చామరములుగా దైవసేవలో ఉపయోగపడును ,ఏనుగుల దంతములు లోకులు ఉపయోగించుకొనెదరు . మరి నేను ఏ రకంగానూ ఉపయోగపడను కదా ,కనీసము మాంసముగా భుజించుటకు కూడా నా శరీరము పనికి రాదు మరి నీవు ఏమి ఆశించి నన్ను వధించచూసావు ?ఓ రాజా !నిరపరాధులమైన మావంటి వారి పట్ల నీ పరాక్రమము ప్రదర్శించితివి . నా ఎదురుగా నిలిచి నాతొ యుద్ధము చేసినచో నేను తప్పక యుద్దములో నిన్ను ఓడించెడివాడను . రణరంగమున ఎవ్వరు నన్ను ఎదిరించలేరు . సీతామాత జాడకై నీవు సుగ్రీవుని బదులు నన్ను ఆశ్రయించి ఉంటే నేను మరు నిముషములోనే ఆమెను నీ ఎదుట నిలబెట్టెడివాడను . ఆ రావణుడు ఆదేవిని సముద్రములోకాని ,పాతాళములో కానీ ఎచ్చట దాచినా ఆ సాద్విని తెచ్చి వుండెడివాడను . జీవులకు మరణము సహజమే ,నా తదుపరి సుగ్రీవుడు రాజు అగుట కూడా సమంజసమే ,కానీ నీవు నన్ను ఇలా ఎందుకు కొట్టావో నాకు సమాధానము చెప్పు "అని వాలి శ్రీరాముని కోరెను . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Tuesday 10 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునాఱవసర్గ

                                                రామాయణము 

                                                 కిష్కిందకాండ -పదునాఱవసర్గ 

చంద్రుని వాలే మనోహరమైన ముఖము కల తార పలికిన మాటలు విన్న వాలి ఆమెను మందలించుచు "ఓ సుందరీ !సుగ్రీవుడు నాకు సోదరుడే కాదనను . ఇప్పుడు అతడు నాకు శత్రువు అతడు యుద్ధమునకు ఆహ్వానించుచు గర్జిస్తుoడగా  నేను పిరికివాడు వాలే కూర్చొననా ?శ్రీరాముని వలన నాకు ప్రమాదం జరుగునని శంకించకు . ధర్మము బాగుగా ఎరిగిన ఆయన నిర్దోషినైన నన్ను భాదించడు . ఓ తారా !నీవు నాపై కల ప్రేమను వ్యక్తపరిచితివి . నేను నీకు మాట ఇచ్చుచున్నాను . సుగ్రీవుని చిత్తుగా ఓడించి తిరిగి నీ వద్దకు వచ్చెదను . సుగ్రీవుడు నా బలము ముందు నిలవలేడు . నేను అతడిని చావమోడుతాను కానీ చంపను . నీవు అంతఃపురములోకి వెళ్లుము . "అని పలికెను . 
వాలి మాటలు విన్న తార వాలికి ప్రదక్షణ చేసి ,మంగళహారతి ఇచ్చి స్వస్తి వచనములు పలికి అంతఃపురములోకి వెళ్లెను . పిమ్మట వాలి సుగ్రీవుని అరుపు వచ్చిన దిశగా కోపముతో వడివడిగా నడక ప్రారంభించెను . సుగ్రీవుడు కనపడినంతనే వాలి తన పై వస్త్రమును నడుమునకు బిగువుగా కట్టి పిడికిలి బిగించి సుగ్రీవునికి దగ్గరగా రాసాగేను



 . 
వాలిని చూసిన సుగ్రీవుడు కూడా తన ఉత్తరీయమును నడుమునకు బిగించి వాలి మీదకు దూకేను . వాలి ఒక్క పిడిగుద్దుతో సుగ్రీవుని పడవేసెను . రక్తము కక్కుకున్న సుగ్రీవుడు మిక్కిలి కోపముతో అరుచుచు అక్కడే వున్నా పెద్ద మద్ది చెట్టుని పీకి వాలిని  దానితో కొట్టెను . ఆ దెబ్బకు వాలి చలించిపోయెను . పిమ్మట అన్నదమ్ములు ఇరువురు చెట్లతోటి ,పర్వతములతోటి ,గోళ్ళతోటి ,మోచేతులతో ,మోకాళ్ళతో భయంకరముగా అరుస్తూ యుద్ధముచేసుకొనసాగిరి . వారిరువురి శరీరములు రక్తముతో తడిసిపోయెను . క్రమముగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లనారంభించెను . అప్పుడు సుగ్రీవుడు మాటిమాటికి దిక్కులు చూడనారంభించెను . అది గమనించిన శ్రీరాముడు సుగ్రీవుని ఆంతర్యమును అర్ధము చేసుకుని విషతుల్యమైన బాణమును తీసి వాలిపై ప్రయోగించెను . 

అది మాత్రా (రెప్పపాటు ) కాలములో వాలి శరీరములో ప్రవేశించెను . ఆ బాణము దాటికి నిలువలేక వాలి కిందపడిపోయెను . శ్రీరాముడు ప్రయోగించిన బాణము బంగారము వెండి తో అలంకృతమై వున్నది . ఆ బాణపు దాటికి వాలి శరీరము నుండి రక్తము ప్రవహింపసాగెను . అతడు అచేతనుడై రణరంగమున పడిపోయెను . 

రామాయణము కిష్కింద కాండ పదునాఱవసర్గ సమాప్తము . 

                శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday 9 April 2018

రామాయణము కిష్కిందకాండ -పదునైదవసర్గ

                            రామాయణము 

                               కిష్కిందకాండ -పదునైదవసర్గ 

సుగ్రీవుడి గర్జన అంతఃపురంలో వున్నా వాలి కి వినపడినంతనే అతని మత్తు వదిలిపోయెను అతని శరీరము కోపముతో ఊగిపోవసాగెను . అతడి కళ్ళు కోపముతో ఎరుపెక్కేను . పిమ్మట అతడు గర్జించుచు సుగ్రీవునిపై యుద్ధమునకు వెళ్ళబోయేను . అప్పుడు వాలి భార్య తారా దేవి ఎదురొచ్చి భర్తను ప్రేమగా కౌగలించుకుని "ప్రాణేశ్వరా !నీ మంచి కొరకు నేను చెబుతున్న ఈ మాటలు వినుము నీలోని ఈ కోపమును త్వజించుము . ప్రభూ !యుద్ధమున నిన్ను గెలవగలిగినవాడు నీ శత్రువులలో ఎవ్వడు లేడు . నువ్వు మిక్కిలి పరాక్రమవంతుడివి . అందులో సందేహము లేదు . కానీ నీచేత    చావుదెబ్బలు  తిని వెంటనే తిరిగి వచ్చాడు అంటే ఎదో బలమయిన కారణము వుంది ఉంటుందని నా నమ్మకము . 
సుగ్రీవుని గర్జన లోని తీవ్రత ,గట్టితనం చూస్తూ ఉంటే ,అతడేదో గట్టి ప్రయత్నముతో వచ్చినట్టుగా నాకు సందేహముగా వున్నది . దీనిని సామాన్య విషయముగా  భావించకూడదు  . ఇదంతా చూస్తుంటే సుగ్రీవుడు ఎదో గట్టి అండతో వచ్చాడు అనిపిస్తోంది . ఇదంతా నేను ఊహించి చెప్పటం  లేదు . చారుల ద్వారా మన కుమారుడు అంగదుడు విన్న విషయాలు నాకు తెలిసాయి . అయోధ్యాధిపతి దశరధుని కుమారులు రామలక్ష్మణులు వీరాధివీరులు ,రణరంగమున ధీరులు వారు ఇప్పుడు ఇక్కడికి సమీపముననే అరణ్యమున ఉండి సుగ్రీవునితో మైత్రి కుదుర్చుకొన్నారుట . ఆ రాముడు అస్త్రవిద్యా విశారదుడు , సాధుజనులకు ఒక మహావృక్షం వంటివాడు . సర్వలోకరక్షకుడని వినివుంటిని .   అటువంటి మహానుభావుడితో కోరి వైరము పెట్టుకొనుట తగదు . 
పైగా సుగ్రీవుడు ఎవరో కాదు నీకు తోడబుట్టిన నీ తమ్ముడే ఈ లోకములో అతడికంటే ఆప్తులు నీకు ఇంకెవరు వుండరు . కాబట్టి అతడిని పిలిపించి యువరాజుగా పట్టాభిషేకము చేయి . ఆ పదవికి అతడు అన్ని విధములుగా అర్హుడు . కావున వైరము మాని అతడిని నీ అక్కున చేర్చుకొనుము . నాకు సంతోషము కలుగచేయదలుచుకున్నచో ఈ మాటలు పాటింపుము . "అని పలికెను . కానీ ఆయువు మూడిన వాలికి ఆ మాటలు ఏ మాత్రము రుచింపలేదు . 

రామాయణము కిష్కిందకాండ పదునైదవసర్గ సమాప్తము . 

                                         శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ ఏ(తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము కిష్కిందకాండ -పదునాల్గవసర్గ

                                     రామాయణము 


                                             కిష్కిందకాండ -పదునాల్గవసర్గ 

రామసుగ్రీవాదులు త్వరత్వరగా నడుచుచు కిష్కింద సమీపమునకు చేరిరి . పిమ్మట సుగ్రీవుడు పెద్దగా గర్జన చేసెను . రామలక్ష్మణులు మిగిలిన వానర వీరులు చెట్లచాటున నిలబడి చూచుచుండిరి . అప్పుడు సుగ్రీవుడు రామునికి సమీపముగా వచ్చి ",రామా !నీ మాట ప్రకారము నేను మరలా వాలి పై యుద్ధమునకు వచ్చితిని . కేవలము నీవు రక్షించెదవనే దైర్యముతోనే వచ్చి ఉంటిని . కావున నీవు నాకు ఇదివరకు ఇచ్చిన మాట (వాలిని పరిమార్చెదను )నిలబెట్టుకొనుము" అని వినయముగా ,దీనంగా ప్రార్ధించెను . 
అప్పుడు రఘురాముడు "మిత్రమా !ఈ విషయముపై నీకు భయము కించిత్తు కూడా వలదు . నీవు ధైర్యముగా యుద్ధమునకు వెళ్లుము . నిన్ను గుర్తించుటకై లక్ష్మణుడు నా అనుజ్ఞచే 'గజసాహ్వము 'అను పేరు కల లతను నీ మేడలో వేసినాడు . ఆ మాల కారణముగా నేను నిన్ను గుర్తించి వాలిని వధించెదను . ఆ వాలిని నేను గుర్తించిన పిమ్మట కూడా అతడు సజీవుడై తిరిగి వెళ్ళినచో అది నా దోషము . కావున నీవు ఆలసింపక ఆ వాలిని యుద్ధమునకు ఆహ్వానింపుము . అతడికి యుద్ధము అన్న మిక్కిలి ప్రీతి . కావున అతడు మరల నీతో యుద్ధమునకు తప్పక వచ్చును . "అని పలికెను . 
రాముని మాటలు విన్న సుగ్రీవుడు ధైర్యము తెచ్చుకుని బిగ్గరగా ఆకాశము బ్రద్దలగునట్లు గర్జించెను . సుగ్రీవుడు  సూర్యుని వరము వలన జన్మించాడు . మేఘము వలె గర్జించుటలో సుప్రసిద్ధుడు . అతడి గర్జన విని పక్షులు బయపడి ఎగిరిపోయినవి . జంతువులూ మృగములూ బెదిరి పరుగిడినవి . 

                రామాయణము కిష్కిందకాండ పదునాలుగవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Saturday 3 March 2018

రామాయణము కిష్కిందకాండ -పదమూడవసర్గ

                                        రామాయణము 

                                  కిష్కిందకాండ -పదమూడవసర్గ 

రామలక్ష్మణులు ,సుగ్రీవుడు ,ఆంజనేయాది వీరులు కిష్కింధకు పయనమయి కొండలను వాగులను దాటుతూ అడవిదారి వెంట నడకసాగించిరి . దారిలో  ఎన్నో పరిమళాభూరితమైన పుష్పములు కల వృక్షములు ,పెద్దపెద్ద చెట్లు కలవు అవి చూచుటకు మిక్కిలి రామణీయముగా ఉండెను వాటిని చూసిన రాముడు సుగ్రీవునితో "మిత్రమా !ఈ వృక్షముల యొక్క ప్రత్యేకత తెలుపుము "అని కోరగా సుగ్రీవుడు "మిత్రమా !ఇచట "సప్తజనులు "అని ప్రసిద్ధి చెందిన ఏడుగురు మునులు ఇచట కఠోరమైన తపో నియమములను పాటించుచు తలకిందులుగా వారమునకు ఒక్కసారిమాత్రమే వాయుభక్షణము చేయుచు ఆహారము ముట్టక తపము చేసిరి . 
వారి తపస్సు ఫలించి వారు సశరీరముతో స్వర్గమునకు వెళ్లిరి . అయినను వారు ఇచటికి వచ్చి యజ్ఞయాగాదులు నిర్వర్తించెదరని ఇచటి వారు చెప్పుకుందురు . ఆ ప్రదేశములోకి మనుష్యులు కాను పశుపక్షాదులు కానీ ప్రవేశించలేవు . వెళ్లిన వారు తిరిగి రాలేరు . "అని ఆశ్రమము చూపించి చెప్పెను . మరల సుగ్రీవుడు రాముని తో "మిత్రమా ఆ ముని ఆశ్రమమునకు నమస్కరించుము . వారికి నమస్కరించిన వారికి సకల కోరికలు తీరి శుభములు కలుగును "అని పలికి తానును నమస్కరించెను .పిమ్మట వారు పెక్కు దూరము పయనించి కిష్కింధకు చేరుకొనిరి . 

రామాయణము కిష్కిందకాండ పదమూడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Friday 2 March 2018

రామాయణము కిష్కిందకాండ -పన్నెండవసర్గ

                            రామాయణము 

                                     కిష్కిందకాండ -పన్నెండవసర్గ 
అప్పుడు సకల శుభదాయకుడైన శ్రీరాముడు సుగ్రీవుని మాటలు విని తన మనసుకి ధైర్యము నమ్మకము కలిగించుటకు తన విల్లు ధరించి వాడి ఐన శరమును బలిష్ఠముగా ఉన్న ఓ మద్ది చెట్టుపై వేయగా అది దానిని చీల్చి దానికి సమాంతముగా వున్న మరో ఏడు మద్దిచెట్లనీ ఏకకాలంలో చీల్చి ,కొండను చీల్చుకుంటూ పాతాళమున ప్రవేశించి తిరిగి రాముని తూణీరములోకి చేరెను .

 రాముని పరాక్రమమును కళ్లారా చూసిన సుగ్రీవుడు మిక్కిలి సంతోషించి ,శ్రీరాముని బలపరాక్రమములను పొగిడి ఆయనను ఆలింగనము చేసుకొనెను . 
పిమ్మట రాముడు చెప్పుటచే ,సుగ్రీవుడు తన అన్న ఐన వాలి పైకి యుద్ధమునకు వెళ్లి నగరము వెలుపల నిలబడి పెద్దగా పిలిచెను . అప్పుడు యుద్ధవీరుడైన వాలి ఆ కేక విని సమరోత్సాహముతో పరుగుపరుగున వచ్చి తమ్ముడితో తలపడసాగెను . ఆ మాహావీరులు ఇరువురు తమ ముష్టిఘాతములతో ఒకరినొకరు బలముగా మోసుకొనసాగిరి . ఒకేలా వున్న వారిరువురిలో సుగ్రీవుని రఘునందనుఁడు గుర్తింపలేకపోయెను . అందుచే తన బాణమును ప్రయోగించలేదు .

 అంతకంతకు బలము సన్నగిల్లగా ప్రాణభయముతో సుగ్రీవుడు తిరిగి ఋష్యమూక పర్వతమునకు పరుగు తీసెను . 
మతంగా మహర్షి శాపము గుర్తుండుటచే వాలి ఋష్యమూక పర్వతముపై అడుగు పెట్టక "బతికిపోయావుపో "అని వెనుతిరిగేను . ఋష్యమూక పర్వతము చేరిన సుగ్రీవుని చెంతకు రామలక్ష్మణులు ,హనుమదాది వీరులు చేరిరి . వారిని చూసిన సుగ్రీవుడు సిగ్గుతో తల వంచుకుని "రామా !నీవు రక్షించెదవనే ధైర్యముతో మా అన్నపైకి యుద్ధమునకు వెళ్లితిని . నీవు నాకు ఇచ్చిన మాటను ఏల నిలబెట్టుకోలేదు . నిన్ను నమ్మినందుకు ఇదేనా ఫలితము ?"అని ప్రశ్నించగా రాముడు 
"మిత్రమా !సుగ్రీవా !రూపురేఖలలోను ,కంఠ ధ్వనిలోను మీరిరువురు ఒక్కమాదిరిగా ఉంటిరి . మీలో ఎవరు నీవో ,ఎవరు వాళూ నేను పోల్చుకోలేకపోయితిని . పొరపాటున నీకు బాణము తగులునేమో అని నేను బాణ ప్రయోగము చేయకుంటిని .  ఈ సారి నీవు ఏదేని ఒక గుర్తును ధరించి యుద్ధమునకు వెళ్లుము . అప్పుడు నేను నిన్ను సులభముగా గుర్తించి వాలిని వధింపగలను "అని పలికెను . అప్పుడు లక్ష్మణుడు శ్రీరాముడి ఆజ్ఞను అనుసరించి అచట దొరుకు నాగకేసరి పూలను మాలగా కట్టి సుగ్రీవుడి మేడలో వేసెను . అనంతరము అందరూ కలిసి తిరిగి కిష్కింధకు పయనమయ్యిరి . 

                     రామాయణము కిష్కిందకాండ పన్నెండవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .