రామాయణము
కిష్కిందకాండ -మూడవసర్గ
ఆంజనేయుడు సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు సన్యాసి వేషములో రామలక్ష్మణుల వద్దకు వెళ్లి వారిని బాగుగా పొగిడి ,వారి రూపలావణ్యములను మెచ్చుకుని అచటకు వచ్చుటకు కల కారణమును అడిగెను . రామలక్ష్మణులు మాట్లాడక మౌనముగా ఉండుటచే ,తిరిగి ఆంజనేయుడు "స్వామీ !నా పేరు హనుమంతుడు అంటారు . నేను సుగ్రీవుడు మంత్రిని అతడు తన అన్న వలన బయపడి ఋష్యమూక పర్వతముపై నివసించుచున్నారు . సుగ్రీవుడు బలపరాక్రమవంతుడు . సూర్యుని పుత్రుడు . అతడు మీతో స్నేహము చేయ కోరుతున్నాడు . మీ గురించి వివరములు తెలుసుకొనుటకు నన్ను మారు వేషములో ఇచటికి పంపినాడు . నేను వానరుడను "అని పలికి వారి సమాధానమునకై నిరీక్షించుచు ఉండెను .
రాముడు హనుమంతుడి మాటలు విని లక్ష్మణుడితో "లక్ష్మణా !ఈ వచ్చినవాడు సకల శాస్త్రములను బాగుగా నేర్చినవాడు . వ్యాకరణశాస్త్ర విషయములను అన్నిటిని బాగుగా ఎరిగినవాడు . కావుననే ఇతని మాటలలో ఒక్క వ్యాకరణ దోషపదము లేదు . స్వరము మధ్యమ స్వరములో వున్నది . ఇతడితో తగు మర్యాదగా మాట్లాడుము . సుగ్రీవుడితో చెలిమి కోసము మనము వెతుకుతుండగా ,ఆయనే మన కొరకు పంపినాడు . ఈయన మాటలకు చంపుటకు కట్టి ఎత్తిన శత్రువు కూడా శత్రుత్వమును విడనాడును "అని పలికెను .
లక్ష్మణుడు రాముడి మాటలు విని హనుమంతుడితో "ఓ వానరశ్రేష్టా !మహాత్ముడైన సుగ్రీవుని గుణగణములను కబంధుని వలన ఇదివరకే వినివుంటిమి . వానర ప్రభువైన సుగ్రీవుని వెతుకుతూ మేము ఇచటికి చేరితిమి . ఓ మారుతీ !మైత్రి విషయమున సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలకు మేము సమ్మతించితిమి . నీ సూచనలు మేము పాటించెదము . "అని పలికెను . పవనసుతుడైన హనుమంతుడు లక్ష్మణుని మాటలకు ఏంటో సంతోషించెను . సుగ్రీవుని కార్యము (సుగ్రీవుని బాధలు తొలగునని )ఫలించునని సంతోషపడెను .
రామాయణము కిష్కిందకాండ మూడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ .ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment