రామాయణము
అరణ్యకాండ -అరువదితొమ్మిదవసర్గ
రామలక్ష్మణులు జటాయువుకి జలతర్పణములు అర్పించినపిమ్మట నైరుతి దిశగా సీతాదేవిని వెతుకుతూ నడసాగెను . ఆ మార్గము దట్టమైన చెట్లతో పొదలతో ప్రవేశించుటకు వీలులేకుండా ఉండెను . ఆ అరణ్యమున రామలక్ష్మణులు నడుచుచు ముందుకు సాగుతుండెను . అచట వారికి ఒక గుహ కనిపించెను . ఆ గుహ వద్ద స్థూలకాయురాలైన ఒక రాక్షసి ఉండి వీరిని అడ్డగించెను . లక్ష్మణుడు ఆ రాక్షసి ముక్కు చెవులు కోసివేసెను . అప్పుడా రాక్షసి బిగ్గరగా అరుస్తూ అచటి నుండి పారిపోయెను .
రామలక్ష్మణులు ఆ అరణ్యములో ముందుకు సాగుతుండగా లక్ష్మణునినికి అనేక దుశ్శకునములు ఎదురయ్యెను . అందువలన వారిరువురు ,ధనుర్భాణములను ధరించి సిద్ధముగా ఉండెను . అంత కొంత దూరము వెళ్లిన పిమ్మట పెద్ద ఆకారముకల ఒక రాక్షసుడు వారికి కనిపించెను .. అతడికి ముఖము ,మెడ లేకుండెను . పొట్టలో నోరు ఉండెను . అతడి చేతులు మిక్కిలి పొడుగుగా ఉండెను . మొండెము ఒక్కటే ఉండుటచే ఆ రక్కసుడు మిక్కిలి భయంకరముగా ఉండెను .
ఆ రాక్షసుడు రామలక్ష్మణులను చూసి తన చేతులతో వారిని చెరో చేతితో మిక్కిలి గట్టిగా పట్టుకొనెను . రాముడు ధైర్యము సడలక ఉండెను కానీ ,లక్ష్మణుడు ప్రాణ సమానుడైన తన అన్నగారు ఆ రాక్షసుడు చేతిలో చిక్కుకొనుట చూసి దిగులుపడెను . పిమ్మట అతడు రాముడితో "అన్నా !నా గురించి ఆలోచించకు ,నన్ను వీడికి ఆహారముగా వదిలి నీవు వెడలిపో నీకు వదిన తప్పక దొరుకును . నన్ను మాత్రము మరువకుము "అని పలికెను .
తమ్ముడి మాటలకు రాముడి ధైర్యము కొద్దిగా సడలేను కానీ ,లక్ష్మణుని చూసి ధైర్యము తెచ్చుకొనెను .
రామాయణము అరణ్యకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment