Friday, 10 February 2017

రామాయణము అయోధ్యకాండ -తొంబది ఏడవసర్గ

                                                 రామాయణము 

                                        అయోధ్యకాండ -తొంబది ఏడవసర్గ 

భరతుని విషయములో సుమిత్రానందనుడయిన  లక్ష్మణుడు కోపముతో ఊగిపోవుట గమనించిన రాముడు అతనిని శాంతపరుచుతూ "నాయనా !మిగుల ప్రాజ్ఞుడు అయిన భరతుడు మన వద్దకు వచ్చునప్పుడు ధనుర్భాణములతో పని ఏమున్నది ?మన తండ్రిగారే ఈ రాజ్యమును భరతునికి ఇచ్చివేశారు . ఇక భరతుడు మనకు ఎందుకు కీడు చేయ తలుస్తాడు . మనం అనాలోచితముగా భరతుడిపై దాడి చేసి సాధించుకున్న రాజ్యము ఎవరికోసం ?నాకు అటువంటి రాజ్యము వద్దు . 
భరతుడు చిన్నతనము నుండి నాకు బాగుగా తెలుసు అతడిది అటువంటి స్వభావము కాదు . ఓ సౌమిత్రీ !ఎట్టి ఆపదలు వచ్చినను పుత్రులు తండ్రిని ఎటుల చంపగలరు . అటులనే ఒక సోదరుడు ప్రాణతుల్యుడైన మరో సోదరుడిని ఎలా చంపగలడు . కావున నీ ఆలోచన తప్పు . కోపము విడిచి శాంతిని వహించుము . బహుశా జరిగిన విషయము తెలుసుకుని తన తల్లి కైకేయిని దూషించి ఉంటాడు . తండ్రిని ప్రసన్నుడిని చేసుకుని మనలను మరల్చుటకు వచ్చి ఉండవచ్చును . బహుశా ,మనము సుకుమారులము కావున దశరథ మహారాజు మనలను మరల్చి అయోధ్యకు తీసుకువెళ్ళుటకు వస్తున్నాడేమో ?కనీసము మిక్కిలి సుకుమారి అయిన సీతాదేవినైనను అతడు తీసుకుని వెళ్లవచ్చును . 
లక్ష్మణా !అన్ని వాహనము కానవచ్చుచున్నవి కానీ తండ్రి గారి శ్వేతచ్ఛత్ర రధము మాత్రము కానవచ్చుటలేదు . నాకేదో సందేహము కలుగుచున్నది ." అని రాముడు పలుకగా లక్ష్మణుడు శాంతించి చెట్టు దిగెను . భరతుడు "మానవలన శ్రీరాముని ఆశ్రమముకు ఏ ఇబ్బంది కలుగకూడదు "అని సైనికులను ఆజ్ఞాపించెను . పిమ్మట అత్యంత వినమ్రుడై రాముని అనుగ్రహము పొందుటకై రాముడు వున్న దిశగా బయలుదేరెను . 

రామాయణము అయోధ్యకాండ తొంబది ఏడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment