రామాయణము
అయోధ్యకాండ -తొంబదియైదవసర్గ
అంతట శ్రీరాముడు చిత్రకూట పర్వతము నుండి మందాకినీ నదీ తీరమునకు సీతతో కూడి చేరి నదీ సౌందర్యములను జనకనందినికి చూపెను . నిర్మలమైన నదీజలములను ,నదీ తీరమునకు ఇరువైపులా కల వృక్షములు ,ఆ వృక్షముల నుండి పూలు జాలువారి నదీ తీరప్రదేశము ,నదీ జలములు ఆ పూలతో నిండి చూచుటకు మనోహరముగా కల ఆ దృశ్యమును రాముడు సీతకు చూపెను . ఆ నదీ తీరమున విహరించు చెకోర పక్షుల జంటలను సీతకు చూపెను .
ఇంకనూ శ్రీరాముడు సీతతో "ఓ మైథిలీ !నన్ను త్రికరణ శుద్ధిగా అనుసరించు అనుకూలవతివైన నీవు నా చెంతన ఉండుట వలన నాకు అయోధ్య గుర్తుకు వచ్చుట లేదు . నీతో ,లక్ష్మణునితో ,కలసి ఈ నిర్మల జలములను త్రాగుచు ,మధురమైన కందమూలములను భుజించుచు నేను అయోధ్యలో వలే హాయిగా వున్నాను . ఈ నదీ ప్రాంతము మిక్కిలి రమణీయముగా కలదు . ఇచట సిద్దులు ,మునులు మున్నగు వారి నిత్యమూ స్నానమాచరించుచు వుండుదురు . ఈ నదీ జలములలో స్నానమాచరించినవారికి ,ఈ వృక్షఛాయలలో విశ్రమించువారికి శ్రమలు మాయమగును "అని పలుకుతూ ఆ ప్రాంతము లో విహరించుచుండెను .
No comments:
Post a Comment