రామాయణము
అరణ్యకాండ -పంతొమ్మిదవసర్గ
ముక్కు ,చెవులు రక్తమోడుతూ విలపిస్తూ ,తన వద్దకు వచ్చిన తన సోదరి అయిన శూర్పణఖను చూసి ఖరుడు మిక్కిలి క్రుద్ధడై "నీయీ దురవస్థకీ కారణమేమి ?నీకు ఈ గతి పట్టించిన మూర్ఖుడెవడు ?"అని ప్రశ్నించెను . అప్పుడా శూర్పణఖ "రామలక్ష్మణులను రాకుమారులు ఒక సౌనదర్యవతితో కలిసి మన దండకారణ్య ప్రాంతము నందే వసించి వున్నారు . వారి వలననే నాకు ఈ దురవస్థ తటస్తించినది . వారి రక్తమును త్రాగిన కానీ ,నాకు ప్రతీకారము తీరదు . "అని కోపముతో ,అవమానంతో రగిలిపోతూ పలికెను .
అప్పుడా ఖరుడు తన సోదరికి జరిగిన అవమానమునకు గాను రగిలిపోతూ ,పదునాలుగు మంది మిక్కిలి బలవంతులయిన రాక్షస వీరులను పిలిచి "మీరు వెనువెంటనే వెళ్లి మా సోదరిని అవమానించిన వారి ప్రాణములు తీసిరండు "అని ఆజ్ఞాపించెను .
అప్పుడా రాక్షస వీరులు శూరపణఖ దారి చూపగా ,రాముని ఆశ్రమమునకు వెళ్లి రామునిపై నిశిత బాణములను ప్రయోగించసాగిరి . అయినను మదగజములు మండుతున్న అగ్నిజ్వాలలను ఎదుర్కొనలేనట్లు వారు శ్రీరాముని దెబ్బతీయలేకపోయిరి .
No comments:
Post a Comment