Wednesday 31 August 2016

రామాయణము బాలకాండ -ఏబది ఆరవసర్గ

                                    రామాయణము 

                              బాలకాండ -ఏబది ఆరవసర్గ 

ఆ విధముగా వచ్చిన విశ్వామిత్రుడు ,వశిష్టుని మీద ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను . వశిష్ఠుడు ఏమాత్రము కదలక తన బ్రహ్మదండము ఎత్తి  నిలబడెను . ఆ బ్రహ్మదండ ప్రభావమున ఆగ్నేయాస్త్రము నామరూపములు లేకుండా పోయెను . అందులకు కోపముతో విశ్వామిత్రుడు వరుసగా వారుణాస్త్రము ,రౌద్రాస్త్రము ,ఐన్ద్రాస్త్రము ,పాశుపతము,ఐషీకాస్త్రము ను ప్రయోగించెను . 
ఇవే కాక తాను వారము వల్ల సంపాదించుకున్న సమస్త జీవముల అందు కల అస్త్రములన్నీ ప్రయోగించెను . బ్రహ్మపుత్రుడు అయిన వశిష్ట మహాముని బ్రహ్మ దండము ఆ అస్త్రములన్నిటిని కబళించివేసెను . అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను . బ్రహ్మదండము ఆ బ్రహ్మాస్త్రమును సైతము నిస్తేజమొనర్చెను . ఆసమయములో అక్కడి మునులు ,ఋషులకు వశిష్ట మహర్షి యమధర్మరాజులా ,ఆయన చేతిలోని దండము యమపాశములా కనిపించింది . 
అప్పుడు అక్కడి వారందరూ వశిష్ట మహర్షిని శాంతించమని ,ప్రసన్నుడవమ్మని వేడుకొనిరి . అంత వశిష్ఠుడు శాంతించేను . అప్పుడు విశ్వామిత్రుడు తనలో తాను "ఛీ క్షత్రియ బలము కూడా ఒక బలమా !బ్రహ్మ్తేజో బలమే నిజమైనబలము . ఒకేఒక్క బ్రహ్మదండము నేను తపస్సు ద్వారా సంపాదించుకున్న అనేక అస్త్రములను వమ్ముకావించింది . బ్రహ్మత్వము పొందుటకై క్షత్రియ రోషములను వదిలి ,మనసు ,ఇంద్రియములను నిగ్రహించి తీవ్రముగా తపస్సు చేసెదను "అనుకొనెను . 

రామాయణము బాలకాండ ఏబదిఆరవసర్గ సమాప్తము , 

             శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    








Tuesday 30 August 2016

                                     రామాయణము 

                                        బాలకాండ- ఏబదియైదవసర్గ 

విశ్వామిత్రుని అస్త్ర ప్రభావముచే సమస్త సైనికులు చెల్లాచెదురు అవుట చూసిన వశిష్ఠుడు ఇంకా సైన్యమును పుట్టించమని ధేనువును ఆజ్ఞాపించెను . ఆయన ఆజ్ఞను అనుసరించి అనేక వేల ,లక్షల మందిని సృష్టించెను . ఆ సైన్యము విశ్వామిత్రుని సైన్యమును నామరూపములు లేకుండా చేయగా ,కోపితులైన విశ్వామిత్రుని 100 మంది కుమారులు వశిష్టుని మీదకు ఆయుధములు చేతబూని దాడికి వచ్చిరి . వశిష్ఠుడు ఒక్క హుంకారముతో వారందరిని భస్మమొనర్చెను . 
తన వందమంది కుమారులు ,సైనికులు అంతా నాశనమగుట చూసి విశ్వామిత్రుడు చింతాక్రాంతుడయ్యెను . కోరలు తీసిన పాము వలె అయ్యెను . రాజ్య పాలన చేయమని ఒక కుమారుడికి అప్పగించి వనములకు వెళ్లెను . కిన్నెరులు ,నాగులు సంచరించునట్టి ఆ హిమవత్పర్వత ప్రాంతమునకు చేరి పరమేశ్వరుని అనుగ్రహము పొందుటకు తపస్సు చేయసాగెను . 
పరమేశ్వరుడు ప్రసన్నుడై వరము కోరమనగా దేవ ,దానవ ,గాంధర్వ ,యక్ష ,కిన్నెర ,రాక్షసుల వద్ద వుండే సమస్త ధనుర్విద్యను ప్రసాదింపమని కోరెను .ఆయన అట్లే ప్రసాదించెను . దివ్యాస్త్రములతో గర్వము అధికముకాగా వశిష్టాశ్రమమునకు వెళ్లి ,తన అస్త్రములను ప్రయోగించెను . ఆ అస్త్రముల దాటికి తపోవనం పూర్తిగా దగ్దమయ్యెను . 
ఈ విధముగా విశ్వామిత్రుడు భయంకరముగా అస్త్రములు ప్రయోగించగా అక్కడ వున్న మునులు ,ఋషులు అందరూ భయముతో పరుగులు తీయసాగిరి . వశిష్ఠుడు ఎంత వారించినా వారు పారిపోవుట ఆపసాగిరి . క్షణములో ఆ ప్రదేశము అంతా శూన్యమాయెను . అప్పుడు వశిష్ఠుడు కోపముతో విశ్వామిత్రుని ఎదుట నిలిచి తన భ్రహ్మ దండమును చేతబూనెను . 

రామాయణము బాలకాండ ఏబదియైదవ సర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  












Sunday 28 August 2016

రామాయణము బాలకాండ -ఏబదినాల్గవసర్గ

                                రామాయణము 

                             బాలకాండ -ఏబదినాల్గవసర్గ 

ఓ రామా !వశిష్ఠుడు కామధేనువును ఇచ్చుటకు నిరాకరించగా ,విశ్వామిత్రుడు కామధేనువును బలవంతముగా లాగుకొనిపోవుచుండెను . అప్పుడు ఆ కామధేనువు మనసులో బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఇలా అనుకోసాగేను . "మహనీయుడైన వశిష్ఠుడు నన్ను పరిత్యజించాడా ?నన్ను ఈ విధముగా రాజభటులు లాక్కుపోవుచున్నారు . ఈ ధర్మాత్ముని నేను మిక్కిలి భక్తితో సేవించుచున్నాను . ఈయనకు నాపై గల ప్రీతి అపారం నేను ఏ అపరాధము చేయలేదు . అయినను ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు . నేను చేసిన దోషమేమిటి ?"ఇలా ఆలోచిస్తూ ఆ ధేనువు మాటిమాటికి నిట్టూర్పులు విడుచుచుండెను . పిమ్మట ఆ గోవు వందలాది సైన్యమును విదుల్చుకుని ,వాయువేగముతో వెళ్లి వశిష్టుని ఎదుట నిలిచి ఏడ్చుచు ఇలా పలికెను . 

ఓ బ్రహ్మకుమారా !పూజ్య మహర్షి !ఈ రాజభటులు నన్ను లాగుకొనిపోవుచున్నారు . నీవు నన్ను పరిత్యజించితివా ఏమి ?"అని దీనవదనముతో ,కన్నీరుతో అడిగెను . 
శోకముతో అలమటించుచున్న ఆ ధేనువు మొర విని ఆ బ్రహ్మర్షి దుఃఖితయైన ఒక సోదరితో వలె ఆ ధేనువుతో ఇలా అనెను . "ఓ శబలా !నిన్ను నేను త్యజించుటలేదు . నీవు నాకు ఇసుమంత అయినా అపకారము చేయలేదు . బలశాలి అయిన ఈ రాజే బలగర్వంతో నానుండి బలవంతముగా నిన్ను తీసుకుపోవుచున్నాడు . ఇతనితో సమానమయిన బలము నాకు లేదు . చతురంగ బాలసమన్వితమైన ఒక అక్షౌహిణి సేనతో కూడి ఉన్న యితడు మిక్కిలి శక్తిశాలి . "
వశిష్టుని మాటల ఆంతర్యమును గ్రహించిన ఆ కామధేనువు తేజోమూర్తి అయిన వశిష్టునితో సవినయముగా ఇట్లనెను . "ఓ బ్రహ్మర్షీ !నిజముగా క్షత్రియుని బలము బలమేకాదు . బ్రాహ్మణిని బలమే బలము . అది మిక్కిలి గొప్పది . క్షత్రియుని బలము కంటే గొప్పది . విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను . తపః శక్తి ముందు అతడు బలహీనుడే కానీ నీ  ముందు బలహీనుడే నాకు అనుజ్ఞను ఇమ్ము అతడి బలగర్వాన్ని నేను చిత్తుచేసెదను . "అనెను . 
కామధేనువు ఇలా పలుకగా శత్రుబలములను రూపుమాపగల సైన్యమును సృష్టింపుము అని ఆదేశించెను . ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆధేనువు సైన్యమును సృష్టించింది . ఆ ధేనువు యొక్క హుంకారము నుండి "పప్లవులు "అనే (మ్లేచ్ఛజాతి సైనికులు )బయల్వెడలి విశ్వామిత్రుడు చూస్తుండగానే అతని సైన్యమునంతటిని నశింపచేయసాగిరి . అంతటిని చూసిన విశ్వామిత్రుడు కోపముతో కళ్ళెర్రచేసి తానే స్వయముగా రధమును అధిరోహించి వివిధాస్త్రశస్త్రములతో "పప్లవులను "హతమార్చెను . అది చూసిన ఆధేనువు మిక్కిలి కోపముతో "శకులు ,యవనులు "అను వారిని అసంఖ్యాకంగా సృష్టించెను . వారితో ఆప్రదేశము అంతా నిండిపోయెను . వారు మహా వీరులు మిక్కిలి ప్రభావశాలురు . పొడవైన ఖడ్గములను ,కత్తులను ధరించి వున్నారు. అట్టి సైనికులు విశ్వామిత్రుని సైన్యము అంతటిని తుదముట్టించిరి . అంతట విశ్వామిత్రుడు గొప్ప శక్తి కల అస్త్రములను ప్రయోగించగా వారందరూ చెల్లాచెదురైనారు . 

రామాయణము బాలకాండ ఏబదినాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
















Saturday 27 August 2016

రామాయణము బాలకాండ -ఏబదిమూడవసర్గ

                                 రామాయణము 

                                      బాలకాండ -ఏబదిమూడవసర్గ 

వశిష్టుని ఆదేశము మేరకు కామధేనువు విశ్వామిత్రునికి ,అతని పరివారమునకు వారివారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్ధములు సమకూర్చెను . ఆ కామధేనువు చెరుకు గడలను ,రసములను ,తేనెలు ,పేలాలు ,మధురపానీయములు ,ఆసవములను ,శ్రేష్ఠమయిన పానకములను ,నానావిధ భక్ష్యములను ,పర్వత ప్రమాణములో వేడి వేడి అన్నపురాసులను ,పాయసములు ,సూపములు ,పెరుగులు ,పాలు ,క్షణములో అచ్చట సమృద్ధిగా సిద్ధమాయెను . నానా విధములైన మధుర రసములు ,షడ్రసములతో కూడిన భక్ష్య విశేషములు ,పాత్రలనిండా బెల్లపు పాకముతో కూడిన పెక్కు విధములగు తినుబండారములు మొదలయినవి అన్నీ ప్రత్యక్షమాయెను . 
ఆ ఆహార పదార్థములను విశ్వామిత్ర మహర్షి ,అతని పరివారము సంతుష్టముగా భుజించిరి . దానితో విశ్వామిత్రుడు సంతుష్టుడై "ఓ మహర్షీ నీ అతిధి సత్కారములచే మిక్కిలి సంతుష్టుడను అయ్యాను నాదొక విన్నపము . నీకు లక్ష గోవులను ఇచ్చెదను . నాకు ఈ కామధేనువును ఇవ్వుము ఇది గోరత్నము కావున న్యాయముగా రాజుకే ఇది చెందవలెను . కావున దీనిని నాకు ఇచ్చివేయుము "అని పలికెను . 
అంత వశిష్ఠుడు "ఓ రాజా !నీవెన్ని లక్షల కోట్ల గోవులను మారె ఇతరములు ఇచ్చినను నేను ఈ కామధేనువుని ఇవ్వలేను . ఇదే నా సర్వ కర్మలకు మూలం . కావున నన్ను మన్నించి ఈ కామధేనువుని మాత్రం కోరవద్దు "అని చెప్పెను . ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడయ్యెను . ఇలా అనెను . 
"ఓ నిష్టా గరిష్టుడా !నడుమనందు బంగారు త్రాళ్ల తోనూ సువర్ణ కంఠాభరణములతో ,అంకుశములతో అలంకృతమైన 14000 ఏనుగులను ఇచ్చెదను . చిరుగంటల పట్టెడలతో అలంకరింపబడిన నాలుగేసి తెల్లని అశ్వములతో కూర్చబడిన 800 బంగారు రథములను సమర్పించెదను . కాంభోజ ,బాహ్లిక దేశములలో పుట్టి గాంధర్వ జాతికి చెందిన మిక్కిలి బలిష్ఠములగు 11000 గుఱ్ఱములను ఇచ్చెదను . పలు వన్నెలతో ఒకదానికంటే మరియొకటి మేలయిన ,వయసులో వున్న ఒక కోటి ఆవులను నీకు సమర్పింతును . ఓ బ్రాహ్మణోత్తమా !నీవు కోరినంత బంగారమును ,రత్నాలరాశులను ఇచ్చెదను . ఈ కామధేనువును మాత్రము నాకు ఇమ్ము . "అని పలికెను . 
విశ్వామిత్రుడి మాటలు విని వశిష్ఠుడు ఇలా పలికెను . "ఓ రాజా !ఇదియే నాకు రత్నాల ఘని ,ధననిది ,నా సర్వస్వమూ ఇదే ,అంతేకాదు ఇది నా జీవనాధారము . ధర్మ ,పూర్ణమాసాది యాగములను దక్షిణలతో కూడిన యజ్ఞములను ,తదితర పుణ్య కార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము . నా ఋషి జీవన సమస్త విధులకు ఈ కామధేనువే జీవగఱ్ఱ . ఇక పెక్కు మాటలతో పనిలేదు . సకల మనోరధములను ఈడేర్చు ఈ దివ్యదేనువును ఇయ్యనే ఇయ్యను ". అనెను . 

రామాయణము బాలకాండ ఏబదిమూడవ సర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








                                      

Friday 26 August 2016

రామాయణము బాలకాండ -ఏబదిరెండవ సర్గ

                                          రామాయణము 

                                             బాలకాండ -ఏబదిరెండవ సర్గ  

విశ్వామిత్రుడు గౌతముడి ఆశ్రమముని చూసి ఎంతో సంతోషించెను గౌతముని వద్దకు వెళ్లి ఆయనకు ప్రణామము చేసెను . మహిమాన్వితుడైన వశిష్ఠుడు  ఆయనకు స్వాగత సత్కారములు చేసెను . అతిధి పూజలు చేసెను . ఒకరినొకరు కుశల ప్రశ్నలు కావించుకొనిరి . వారు చక్కని కదా ప్రసంగములతో చాలా సమయము గడిపిరి .  పిమ్మట వశిష్ట మహర్షి "ఓ రాజా ! నీ చతురంగ బలమునకు ,నీకు ఆతిధ్యము ఇవ్వదలిచితిని . దయతో నన్ను అనుగ్రహింపుము . "అని కోరెను . 
విశ్వామిత్రుడు "మీ ప్రియా వచనములు మాకు సంతృప్తి కూర్చినవి అవే మాకు సత్కారములు . నీకు నా నమస్కారములు నాయెడ మిత్ర భావము చూపుము . వెళ్ళుటకు నాకు అనుజ్ఞను ఇమ్ము "అని కోరెను . దానికి వశిష్ఠుడు  అంగీరింపక పదే పదే ఆదిత్యము స్వీకరించమని కోరెను . అప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించెను . 
విశ్వామిత్రుడు అంగీరింపగా వశిష్ఠుడు సంతోషముతో పలు వన్నెలు కల కామధేనువుని పిలిచెను . "చిత్ర విచిత్ర వర్ణముకల ఓ కామధేను ! నా మాట విని సైన్యముతో ,అపరివారముతో కూడి మన ఆశ్రమమునకు వచ్చిన ఈ మహారాజుకి నేను ఆతిధ్యమివ్వదలిచాను . కావున వారందరకీ ఇష్టమైన వంటకములను ,పిండివంటలను ,ఇంకనూ రకరకాల రసములు మొదలగు సమస్త పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము . "అని పలికెను . 


రామాయణము బాలకాండ ఏబదిరెండవ సర్గ సమాప్తము . 

             శశి,

ఎం . ఏ (తెలుగు ),  తెలుగు పండితులు .  










Thursday 25 August 2016

రామాయణము బాలకాండ -ఏబదియొకటవ సర్గ

                                               రామాయణము 

                                  బాలకాండ -ఏబదియొకటవ సర్గ  

గౌతమముని పెద్దకుమారుడు తపోధనుడు అయిన శతానందుడు విశ్వామిత్ర మహర్షి మాటలు (అహల్యా శాప విమోచనం )విని ,ఉత్సుకతతో" మా తల్లి విధి వశమున శాపమునకు గురి అయినదని రామచంద్రులకు తెలిపినారా ?శాప విమోచన అనంతరము మా తండ్రి గారు అచటికి ఏతెంచారా ?మా తల్లిని అనుగ్రహించారా ?వారిరువురు తమకు అతిధి మర్యాదలు ఒనర్చినారా ?"అని అడిగెను . 
విశ్వామిత్రుడు నా కర్తవ్యమును నేను నెరవేర్చినాను . మీ తండ్రిగారు రేణుకను జమదగ్ని వలె తన భార్య అయిన అహల్యను శ్వీకరించారు . అని తెలిపెను పిమ్మట శతానందుడు రామునితో 
"నరశ్రేష్ఠుడవు అయిన ఓ రామా !మా తల్లి శాపము తొలగించినందుకు నీకు శతకోటి వందనములు . నీ రాకతో మేము ధన్యులమైతిమి . నిన్ను తీసుకువచ్చిన ఈ విశ్వామిత్రుడు మిక్కిలి గొప్పవాడు . ఈయనఅంత ధన్యుడు ఈ భూమండలంలో ఇంకొకడు లేడు . ఈయన తపః ప్రభావమును ,చరిత్రను తెలిపెదను వినుము . 
ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు ,సమస్త విద్యలలో ఆరితేరినవాడు . శత్రువులను అణచినవాడు అనుక్షణము ప్రజాక్షేమము కోరుచు రాజ్యపాలన చేసినవాడు . ప్రజాపతి కుమారుడు కుశుడు ,అతని కుమారుడు కుశనాభుడు 
అతడు మిక్కిలి బలశాలి ,అతని కుమారుడు గాది ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు . మహాబల సంపన్నుడు అయిన ఈ విశ్వామిత్రుడు పెక్కు కాలము చక్కగా రాజ్యపాలన చేసి అనేకమంది సైన్యముతో కూడి భూమండలమును చుట్టివచ్చెను . అతడు నగరములు ,రాష్ట్రములు ,నదులు ,పర్వతములు ,ఆశ్రమములు దాటుతూ వశిష్టుని ఆశ్రమమునకు విచ్చేసెను . ప్రశాంత వాతావరణముతో ఏంటో రమ్యముగా దేవదానవ ,గంధర్వులతో ,కిన్నెరులతో చక్కగా అది శోభిల్లుతూ ఉండెను . 
ఆ ఆశ్రమములో అనేకమంది తపోధనులు అయినా మునులు కలరు . వారిలో కొందరికి జలము మాత్రమే ఆహారము ,కొందరికి వాయువు మాత్రమే ఆహారము ,మరికొందరికి పండిరాలిన ఆకులు మాత్రమే ఆహారము . ఇంకొందరికి పండ్లు ,దుంపలు మాత్రమే ఆహారము . వారందరూ మనోనిగ్రహము కలిగినవారు . రాగద్వేషములకు అతీతులు ,జితేంద్రియులు . పెక్కుమంది మహిమాన్వితులైన మునులతో ఆ ఆశ్రమము మరో బ్రహ్మలోకమా అన్నట్లుగా వున్నది . గొప్పవాడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమము ను దర్శించెను . 

రామాయణము బాలకాండ ఏబదియొకటవ సర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















Wednesday 24 August 2016

రామాయణము బాలకాండ - ఏబదియవ సర్గ

                          రామాయణము 



                     బాలకాండ - ఏబదియవ సర్గ 

శ్రీరామ లక్ష్మణులతో కలసి విశ్వామిత్రుడు ఈశాన్య దిశగా ప్రయాణించి జనక మహారాజు యజ్ఞ వేదికకు చేరుకొనిరి . అక్కడ అనేకమంది మునులతో ,ఋషులతో వేదపండితులతో నిండుగా ఉండెను . జలసమృద్ది కల ఒక ప్రశాంత నిర్జన ప్రదేశమును తమ బసగా రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ఏర్పాటు చేసుకుని ,విశ్రమించారు . 
విశ్వామిత్ర మహర్షి రాక గురించి తెలుసుకున్న జనక మహారాజు స్వయముగా వారి వద్దకు వచ్చి అతిధి మర్యాదలు చేసి ,కుశల ప్రశ్నలు వేసెను . విశ్వామిత్ర మహర్షి కూడా జనక మహారాజుని కుశల ప్రశ్నలు అడిగి అక్కడ జరుగుతున్నా యాగము గురించి ప్రశ్నించెను . దానికి జనక మహారాజు ఆ యాగ వృత్తాన్తము అంతా చెప్పి తమరు వచ్చుట వలన ఈ యాగముకు సాఫల్యము చేకూరిందని పలికి ,మరొక్క పన్నెండు దినములలో ఈ యాగము పరిసమాప్తి అవుతుందని చెప్పెను . ఇంకా హవిర్భాగములు శ్వీకరించుటకు వచ్చే దేవతలను తమరు చూడవచ్చని పలికెను . 
జనక మహారాజు రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రునితో వారి గురించి ప్రశ్నించెను . విశ్వామిత్ర మహర్షి వారి గురించి , తాటక వద గురించి ,యాగ సంరక్షణ గురించి ,అహల్యా శాప విమోచనం గురించి సమస్తము జనక మహారాజుకు వివరించి ,ప్రస్తుతము జనక మహారాజు వద్దనున్న శివధనస్సు చూచుటకు వచ్చినారని తెలిపెను . 

    రామాయణము  బాలకాండ ఏబదియవ సర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Tuesday 23 August 2016

రామాయణము బాలకాండ -నలుబది తొమ్మిదవ సర్గ

                            రామాయణము 


                                   బాలకాండ -నలుబది తొమ్మిదవ సర్గ 

గౌతముడి వలన శపింపబడిన ఇంద్రుడు అగ్ని మొదలయిన దేవతలతో "గౌతముని శాప కారణముగా నేను వృషణములు లేని వాడను అయ్యాను . అహల్య ఆకారణముగా శపింపబడినది . నాకు ఎట్లయినను తిరిగి వృషణము వచ్చునట్లు చేయుడు "అని పలికెను . అప్పుడు వారందరూ పితృదేవతల  వద్దకు వెళ్లి జరిగిన విషయమును చెప్పి యజ్ఞములలో మీకు సమర్పింపబడే మేషము (మేకపోతు )యొక్క వృషణములు ఇచ్చి ఇంద్రుడిని సఫలుడిని గావింపుము  అని కోరిరి . వారును అంగీకరించి వారికి సమర్పింపబడిన మేకపోతుల వృషణములను ఇంద్రునికి సమర్పించిరి . అని విశ్వామిత్రుడు శ్రీ రాముడికి ఆ ఆశ్రమ వృత్తాన్తమును తెలిపెను . 
విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ ప్రకారము శ్రీరాముడు ఆ ఆశ్రమములోకి ప్రవేశించి అక్కడ కఠోర దీక్షలో ఉండి అన్యులెవ్వరికి కనపడకుండా వున్నా అహల్యను చూసేను . శ్రీరాముడి దర్శించినంతనే అహల్య శాప విముక్తురాలగెను . పిమ్మట అక్కడ వున్నా వారందరికీ ఆవిడ కనిపించెను  . 


రామలక్ష్మణులు అహల్యా దేవి పాదములకు నమస్కరించిరి . పిమ్మట అహల్య కూడా తన భర్త గౌతముని మాటలు తలచుకుని రామలక్ష్మణుల పాదముల్లకు నమస్కారములు చేసినది . పిమ్మట వారిని ఆహ్వానించి అతిధి సత్కారములు చేసింది . అప్పుడు దేవతలు దుందుభులు మ్రోగించుచు పుష్పవర్షము కురిపించిరి . గంధర్వులు గానములు చేసిరి . అప్సరసలు నాట్యము చేసిరి . 
తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయము గ్రహించి గౌతముడు వచ్చి ,అహల్యా సమేతముగా విధివిధానంగా భక్తి శ్రద్దలతో శ్రీరాముని పూజించెను . పిమ్మట శ్రీరాముడు వారి నుండి వీడ్కోలు తీసుకుని మిథిలా నగరము వైపు తన ప్రయాణమును సాగించేను . 

రామాయణము బాలకాండ నలుబది తొమ్మిదవ సర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

            



















Monday 22 August 2016

రామాయణము బాలకాండ -నలుబది ఎనిమిదవ సర్గ

                            రామాయణము 



                               బాలకాండ -నలుబది ఎనిమిదవ సర్గ 

కుశల ప్రశ్నలు అయినా తర్వాత 'సుమతి 'మహారాజు సుకుమారులైన ఈ బాలురు ఎవరు ?అని రామలక్ష్మణులను ఉద్దేశించి విశ్వామిత్ర మహర్షిని అడిగెను . అప్పుడు విశ్వామిత్రుడు వారు దశరధుని పుత్రులని తాటక ,సుభాహాది రాక్షసుల వదలను పూసగుచ్చినట్టు ఆ మహారాజుకి వివరించెను . 'సుమతి మహారాజు ఆ వృత్తాన్తము అంతా విని మిక్కిలి సంతోషించెను . ఆ రోజు అచటనే విశ్రమించి మరునాటి ఉదయమే విశ్వామిత్రుడు ,రామలక్ష్మణులు మిథిలా నగరము వైపుగా తమ ప్రయాణమును కొనసాగించిరి . 
మిధిలకు సమీపములో ఒక సుందరమైన ఆశ్రమమును వారు చూసిరి . అది మిక్కిలి పాతది అయినాను ఎంతో రామణీయముగా వున్నది . అక్కడ ఎవ్వరు లేరు . రాముడు ఇదేమి అని విశ్వామిత్ర మహర్షిని అడుగగా ఆ వృత్తాంతమును మహర్షి ఇలా తెలిపెను . 
"ఓ నరశ్రేష్టా !ఇది మహాత్ముడైన గౌతమముని ఆశ్రమము ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుచు దేవతలా పూజలను సైతము అందుకొంచు ఉండెను . పూర్వకాలమున గౌతమముని ,తన భార్య అహల్యతో కూడి ఈ ఆశ్రమమున నివశించెను . గౌతమముని ఆశ్రమమున లేని సమయము చూసుకుని ఇంద్రుడు గౌతముని వేషము దాల్చి అహల్య వద్దకు వచ్చెను . తన దివ్య దృష్టితో వచ్చినది ఇంద్రుడు అని తెలుసుకుని అహల్య "ఓ సురశ్రేష్టా నేను దాంపత్య జీవితమున సంతుష్టురాలును ఇక్కడి నుండి వెంటనే వెళ్లి నీ ,నీ గౌరవము నిలుపుము ". అని పలికెను . అందుకు ఇంద్రుడు అలాగే అని పలికి గౌతముడు వచ్చునేమో అని భయపడుతూ వెలుపలికి రాగా గౌతముడు వస్తూ ఇంద్రుడిని చూసి కోపముతో విగత వృషణుడవు అయ్యెదవు అని శపించెను . అహల్యను కూడా వేల సంవత్సరములు అన్నపానాదులు లేక వాయు భక్షణముతో తపించుచు ఈ ఆశ్రమముననే పడివుండెదవు అని శపించెను . 
దశరధుని కుమారుడు అయిన శ్రీరాముడి పాదధూళి స్పర్శ తో పవిత్రురాలివి అవుతావు అని చెప్పి ఈ ఆశ్రమము వీడి హిమాలయములలో తపస్సు నిమిత్తమై వెడలెను . 

రామాయణము బాలకాండ నలుబది ఎనిమిదవ సర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                      






















Saturday 20 August 2016

రామాయణము బాలకాండ -నలుబది ఏడవసర్గ

                                రామాయణము 

                      బాలకాండ -నలుబది ఏడవసర్గ           

దితి తన గర్భస్థ శిశువు ముక్కలైనందుకు మిక్కిలి చింతించెను . ఏడు ముక్కలు ఏడుగురు కుమారులుగా మరుత్తులు అనే పేరుతో విఖ్యాతులై దివ్యలోకములో సంచరింతురు . అని ఇంద్రునితో పలికెను . ఇంద్రుడు నివశించి ,దితికి సేవలు చేసిన ప్రదేశము ఇదే అని విశ్వామిత్రుడు రామునికి తాము వున్న స్థానము గురించి చెప్పెను . ఇక్ష్వాకు వంశమునకు చెందిన 'సుమతి 'అను పేరు గల జితేంద్రియుడు అయిన మహారాజు ప్రస్తుతము ఈ విశాల నగరమును    పాలించుచున్నారు . విశాల నగరమును పాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూలపురుషుడు అయిన ఇక్ష్వాకుని అనుగ్రహముచే దీర్గాయుష్మంతులై వర్ధిల్లిరి . వారందరూ మహాత్ములు ,పరాక్రమశాలురు ,పరమ ధార్మికులు అని విశ్వామిత్రుడు చెప్పెను . 
ఆ రాత్రి అక్కడే విశ్రమించాలని నిశ్చయించుకున్నారు . మిగుల పరాక్రమవంతుడు ,మహా యశశ్వి అయినా సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు తెలుసుకుని ,పురోహితులతో ,బంధువులతో కూడి ఎదురేగి స్వాగత సత్కారములు చేసెను . సకల మర్యాదలతో ఆయనను పూజించి ,అంజలి ఘటించి కుశల ప్రశ్నలు అడిగెను . పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇలా పలికెను . 
"ఓ మహాత్మా !నన్ను అనుగ్రహింపదలిచి మీరు మా దేశమునకు దయతో విచ్చేసిరి . నేను ధన్యుడనైతిని . మీ దర్శన భాగ్యము కూడా కలిగెను . ఇక నాయంతటి ధన్యుడు ఎవ్వడుండును ?

రామాయణము బాలకాండ నలుబది ఏడవ సర్గ సమాప్తము . 


                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











Friday 19 August 2016

రామాయణము బాలకాండ నలుబది ఆరవసర్గ

                         రామాయణము 

                               బాలకాండ నలుబది ఆరవసర్గ 

ఓ రామా !క్షీరసాగర మదనములో తన పుత్రులు ,తన సవతి పుత్రులు అయిన దేవతలచే వధింపబడుటచే దితి మిక్కిలి భాదపడుతూ మరీచి మహర్షి కుమారుడు తన భర్త అయిన కశ్యప మహర్షి వద్దకు వెళ్లి ,పుత్ర శోకముతో భాదపడుతూ తనకి ఇంద్రుని అదుపు చేయగల పుత్రుడిని ప్రసాదింపమని వేడుకొనెను . దానికి ఆ మహర్షి" నీ పవిత్రతను కాపాడుకుంటూ తపస్సు చేయుము . నీవు కోరుకున్నట్టే బలశాలి అయిన కుమారుడు జన్మిస్తాడు "అని పలికెను . 
కశ్యప మహర్షి పలుకులు విని దితి మిక్కిలి సంతోషించి 'కుశప్లవము 'అను పేరు కల క్షేత్రమునకు వెళ్లి తీవ్రముగా తపస్సు ఆచరించసాగెను . దితి అలా తపస్సు ఆచరిన్చుచుండగా దేవేంద్రుడు మిక్కిలి వినయ విధేయతలతో సపర్యలు చేయసాగెను . ఆవిడకు కావల్సినవి అన్నీ సమకూర్చుచు ,మాతృ భావముతో దితికి పాదములొత్తుట ,చామరముతో వీచుట మొదలగు పరిచర్యలు చేసెను . వేయి సంవత్సరములలో ఒక పది సంవత్సరములు మిగిలి ఉండగా దేవేంద్రుడి సేవలకు సంతుష్టురాలైన దితి జరిగిన వృత్తాన్తమును చెప్పి" నీ తమ్ముడిని నేను శాంత పరుస్తాను . మీరిద్దరూ కలసి ముల్లోకాధిపత్యమును అనుభవించగలరు ."అని చెప్పెను . 
ఈ విధముగా చెప్పి మిక్కిలి నిద్ర రావడంతో దితి మధ్యాహ్న వేళ మాట్లాడుతూనే వొరిగి నిద్రపోయెను . పగటిపూట నిద్రపోవుట ,తన శిరోజములు పాదధూళి తగులుట గ్రహించిన ఇంద్రుడు ,ఆమె అశుచి అయినది అని గ్రహించి తనను అదుపు చేయగలవాడు జన్మిస్తాడని భయముతో ధైర్యము చేసి ,సూక్ష్మ రూపములో దితి గర్భములోకి ప్రవేశించి ,గర్భస్థ శిశువును 7 ముక్కలుగా చేసెను . ఇంద్రుడి వజ్రాయుధము తగిలి శిశువు ఏడ్చుట మొదలుపెట్టేను . అప్పుడు ఇంద్రుడు ఏడవకు అని పలికి శిశువును ముక్కలు చేసెను . శిశువు ఏడుపు విని దితి మేల్కొని శిశువుని వధింపకు అని పలికెను . అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి ,దితికి నమస్కరించి ,"అమ్మా !పాదములవైపు శిరస్సును ఉంచి నిద్రించుటచే నీవు అశుచివైతివి . ఈ అవకాశమును చూసుకొని ,యుద్దములో నన్ను చంపగల వాడిని 7 ముక్కలుగా చేసితిని . నన్ను క్షమింపుము "అని పలికెను . 

రామాయణము బాలకాండ నలుబదిఆరవ సర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










 

Thursday 18 August 2016

రామాయణము బాలకాండ -నలుబదిఐదవ సర్గ

                                   రామాయణము 

                                   బాలకాండ -నలుబదిఐదవ సర్గ 

ఆ రాత్రి రామ లక్ష్మణులు ,విశ్వమిత్రుడు ,మునులు అక్కడే విశ్రమించి తెల్లవారి లేచి తమ విధులు పూర్తి చేసుకుని గంగ ను దాటి ఉత్తర తీరమునకు చేరిరి . పిమ్మట వారు 'విశాల 'అను నగరము దర్శించిరి . రమ్యమైన ఆ నగరము అమరావతి వలేదివ్యముగా విరాజిల్లుచు ఉండెను . 
మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్రునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషాల గురించి తెలుపమని ప్రార్ధించెను . ఆయన ప్రార్ధనను విన్న విశ్వామిత్రుడు ఇలా చెప్పెను . "ఓ రామా !శుభకరమైన దేవేంద్రుడి కథను వివరించెదను అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గూర్చియు వివరించెదను వినుము . 
ఓ రామా !పూర్వకాలమున కృతయుగము న దితి పుత్రులు బలశాలురుగా ,అదితి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహా పరాక్రమశాలురు గా ఉండిరి . దేవతలకు ,దైత్యులకు మనకు రోగములు ,ముసలితనము మరణము లేకుండుట ఎట్లు అను ఆలోచన కలిగెను . ఓ రామా !ఆ మహాత్ములు ఇలా ఆలోచించుచుండగా క్షీరసాగరమును మదించి దానినుండి అమృతమును పొందుదాము అనే ఉపాయము వారికి తట్టెను . 
శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవ్వముగా ,వాసుకిని త్రాడుగా చేసుకుని క్షీరసాగరమును చిలికిరి . ఇలా వేయి సంవత్సరములు జరిగిన పిమ్మట కవ్వపు త్రాడుగావున్న వాసుకి విషమును క్రక్కుచు తన కోరలచే శిలలను కాటువేయసాగెను . వాసుకి కోరలనుండి అగ్నిజ్వాలలవలె భయంకరమైన హాలాహలము అనే మహావిషము బయల్వెడలెను . ఆ విషాగ్ని సమస్త జగమును దగ్దమొనరించ సాగెను . అంతట దేవదానవ మొదలగు వారందరూ ప్రార్ధించగా పరమేశ్వరుడా హాలాహలమును శ్వీకరించి కంఠము నందు నిలుపుకుని గరళకంఠుడు అయ్యెను . 
తిరిగి పాల సముద్రమును చిలుక నారంభించగా మందర పర్వతము పాతాళమునకు దిగబడెను . అప్పుడు అందరూ ప్రార్ధించగా మహావిష్ణువు కూర్మ రూపమును ధరించి మందర పర్వతమును తన మోపున ధరించెను . తిరిగి పాలసముద్రమును చిలుక నారభించగా కొన్ని సంవత్సరములకు ఒక మహా పురుషుడు క్షీరసాగరమున ఉద్భవించెను . ఆయనయే ధన్వంతరి . ఆయన ఒక చేతితో దండమును మరియొక చేతితో కమండలమును ధరించి ఉండెను . ఇంకనూ అప్సరసలు కూడా అందుండీ ఉద్భవించిరి .  

దేవదానవులలో ఎవరూ అప్సరసలని కానీ వారి వెనుక ఉద్భవించిన పరిచారిక స్త్రీలను కానీ భార్యలుగా స్వీకరించలేదు . వరుణ దేవుని కూతురు వారుణి ఆ సాగరము నుండి ఉద్భవించెను . ఇంకను పాల సముద్రము నుండి కౌస్తభము అను దివ్యమణి ,దివ్య అశ్వము అలాగే అమృతము వెలువడినవి . అమృతము కోసము దేవదానవులు తీవ్రముగా పోట్లాడుకొనిరి . ఫలితముగా ఇరు పక్షములవారిలో చాలామంది మరణించిరి . పిమ్మట సర్వ శక్తిమంతుడు అయిన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే మోహినీ రూపము దాల్చి క్షణములో అమృతకలశమును హస్తగతమొనర్చుకొనెను . 


. తనను శరణు జొచ్చిన దేవతలకు అమృతమును దానవుల కళ్ళు కప్పి పోసెను . 

ఇంద్రుడు దైత్యులను హతమార్చి రాజ్యాధికారమును చేబట్టి ,ఋషులు ,చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకమును అతడు సంతోషముతో పరిపాలించెను . 

             రామాయణము బాలకాండ నలుబది అయిదవ సర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday 15 August 2016

రామాయణము బాలకాండ -నలుబది నాల్గవసర్గ

                              రామాయణము 

                        బాలకాండ -నలుబది నాల్గవసర్గ 

ఆ విధముగా గంగ భస్మరాసులపై ప్రవహించి వారిని పునీతులను చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై "భూమిమీద సాగర జలములు ఉన్నంతకాలము సగరపుత్రులు దేవతల వలె స్వర్గమున వుంటారు . ఈ గంగ నీకు పెద్దకూతురు ఈమెను ఇకనుండి భగీరధి అని పిలిచెదరు . ఈమె మూడులోకములలో ప్రవహించుట వలన  ఈమె త్రిపద గా వాసిగాంచును . నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నావు . ముల్లోకములలో తిరుగులేని యశస్సును సంపాదించావు .  శిరోమణీ పవిత్ర గంగా జలములో స్నానమాచరించి పునీతుడవు కమ్ము . నీ పితృదేవతలకు తర్పణములు వదులుము . "అని చెప్పి అంతర్ధానమయ్యెను . 
అంతట భగీరధుడు బ్రహ్మ చెప్పినట్లు తర్పణములు వదిలి శుచియై తన నగరమునకు వచ్చి సర్వ సంపదలతో తులతూగుచూ తన రాజ్యమును పాలించెను . ఆ రాజ్యములో ప్రజలందరూ శోక సంతాపములు లేక ఆరోగ్య భాగ్యములతో హాయిగా ఉండెను . 
ఓ రామా !గంగావతార వృత్తాన్తము నీకు వివరించితిని . నీకు శుభమగుగాక బ్రాహ్మణులు ,క్షత్రియులు మొదలగు వారందరికీ ఈ పవిత్ర గాద వివరించినచో వారి జీవితములు ధన్యమగును . వారికి యశస్సు ప్రాప్తించును . ఆయువు పెరుగును . పుత్రులు కలుగును . స్వర్గము ప్రాప్తించును .పితృదేవతలు ,దేవతలు  వారియెడ ప్రసన్నులగుదురు . శుభకరమైన ఈ గంగావతారనమును భక్తి  వారికి కోరికలు అన్నీ తీరును . ,వారి పాపములు అన్నీ నశించును . ఆయువు వృద్ధి చెందును . కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును . అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పెను . 


రామాయణము బాలకాండ నలుబది నాల్గవ సర్గ సమాప్తము . 


                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Friday 12 August 2016

రామాయణము బాలకాండ -నలుబది మూడవ సర్గ

                                  రామాయణము 

                                          బాలకాండ -నలుబది మూడవ సర్గ 

బ్రహ్మ దేవుడు వెళ్లిన తర్వాత భగీరధుడు బొటనవేలు మీద నిలబడి ఒక సంవత్సరము కాలము కఠిన తపస్సు చేసెను . శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై గంగను శిరస్సున ధరించుటకు అంగీకరించెను . అంతట గంగాదేవి ఆకాశమున నుండి శివుడి శిరసుపైకి దూకేను ఆమె "నా ప్రవాహముతో శంకరుని కూడా పాతాళమునకు తీసుకువెళ్ళెదను . "అని మనసున భావించెను . 


శివుడు గంగ గర్వము గ్రహించి తన శిరస్సుపై పడిన గంగను కదలనివ్వకుండా తన జటలతో బంధించెను . అప్పుడు భగీరధుడు తిరిగి ఈశ్వరుడిని ప్రార్ధించగా ఆయన సంతుష్టుడై గంగను బ్రహ్మ చే సృష్టించబడిన బిందుసరోవరము నందు వదిలెను . అలా విడబడిన గంగ ఏడూ పాయలుగా విడువడి హ్లాదిని ,పావని ,నళిని అనే మూడు పాయలు తూర్పు వైపు ప్రవహించెను . సుచక్షువు ,సీత ,సింధువు అను పాయలు మంగళ ప్రదములైన జలములతో పశ్చిమం వైపు ప్రవహించెను . ఈ గంగా ప్రవాహములో ఏడవది భగీరదుని అనుసరించెను . ముందు భగీరధుడు ఒక దివ్య రథముపై వెళ్లుచుండగా మనో వేగముతో గంగ ఆయనను అనుసరించెను . ఆవిధముగా భూలోకమున ప్రవహించుచున్న గంగ మిక్కిలి సుందరముగా ఉండెను . దేవతలు ,ఋషులు ,మునులు ఈ ప్రవాహమును చూచుచు ,ఇది శివుని శిరస్సుపైనుండి పడినది కావున మిక్కిలి పవిత్రము అనుకుని నీటిని తీసుకుని శిరస్సున చల్లుకొనిరి . వారందరూ ఆ ప్రవాహమును అనుసరించిరి . 


అసాధారణ కార్యములు నిర్వహించడములో సమర్ధుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచుండగా గంగ ఆయన ఆశ్రమమును మున్సి వేసెను . దానితో కోపించిన ఆయన ఆ సమస్త ప్రవాహమును మింగివేసెను . అంతట భగీరధుడు ,దేవతలు మునులు ,ఋషులు అందరూ జహ్ను మహర్షిని ప్రార్ధించిరి . అప్పుడు ఆయన గంగాజలమును తన చెవులు ద్వారా విడిచి పెట్టెను . కావున అప్పటి నుండి ఆవిడను జాహ్నవి అని పిలుస్తారు .. భగీరథుని అనుసరించుతూ గంగ సముద్రమును చేరెను . తదుపరి పాతాళ లోకమును చేరెను . సగర పుత్రుల భస్మ రాశులపై ప్రవహించి వారికి ఉత్తమ గతులు కల్పించెను . 

రామాయణము బాలకాండ నలుబది మూడవ సర్గ సమాప్తము . 


                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Thursday 11 August 2016

                         రామాయణము 




                           బాలకాండ -నలుబది రెండవ సర్గ 

సగరుడు మరణించిన తర్వాత అతని మనవడు అంశుమంతుడు రాజు అయ్యెను . అతని కుమారుడు దిలీపుడు . దిలీపుడిని రాజు చేసి అంశుమంతుడు గంగావతరణం కోసం హిమాలయాలకు వెళ్లి చాలా ఏళ్ళు తపస్సు చేసి తపస్సు ఫలించకుండానే మరణించెను . దిలీపుడు జరిగిన వృత్తాoతము తెలుసుకుని చాలా బాధపడెను గంగావతారణకు ఏమి చేయాలనీ దీర్ఘముగా ఆలోచించి ఏ నిర్ణయము తీసుకోకుండానే ఉండెను . అతని కుమారుడు భగీరధుడు . మిక్కిలి ధార్మికుడు . తన తండ్రి దిలీపుడు ఎన్నో యజ్ఞ యాగములను చేసి ఆ పుణ్య ఫలమున బాధ్యతలు కుమారుడికి అప్పగించి స్వర్గస్థుడయ్యెను . భగీరధునికి పుత్రులు లేరు అతడు తన గంగను భువిపైన అవతరింప చేయుటకు తపస్సు చేయుటకు రాజ్య భారమును మంత్రులకు అప్పగించి హిమాలయములకు వెళ్లెను . 
దీర్ఘ కాలము తపస్సు చేసి బ్రహ్మ దేవుడిని ప్రసన్నుడిని చేసుకుని ,తన ముత్తాతలకు ఉత్తమ గతులు కల్పించటానికి గంగను అవతరింప చేయమని ,ఇక్ష్వాకు వంశమునకు సంతానమును ప్రసాదింపమని రెండు వారములు కోరెను . ఆ వర ప్రభావంవలన గంగ హిమాలయములో ఉద్భవించినది . హిమవంతుని పెద్ద కుమార్తె ఆయిన గంగ ప్రవాహము యొక్క వేగ దాటికి ఈ భూలోకము తట్టుకోలేడు . గంగను ధరించ ఈశ్వరుడే సమర్ధుడు కావున అతని గూర్చి తపస్సు చేయమని బ్రహ్మ దేవుడు చెప్పి అంతర్ధానమయ్యెను . 

రామాయణము బాలకాండ నలుబదిరెండవ సర్గ సమాప్తము . 


                         శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Monday 8 August 2016

                        రామాయణము 



                      బాలకాండ -నలుబది ఒకటవ సర్గ 

సగర మహారాజు తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి తన మనవడు అంశుమంతుని పిలిచి" నీ పినతండులు ఏమయినారో తెలియకుండా వుంది . నీవు శక్తీ మంతుడవు . సమర్థుడవు కావున నీవు వెళ్లి మీ పినతండ్రుల జాడ కనుగొని యాగాశ్వము జాడ కనుగొని దానిని బంధించిన వాడిని చంపి  రమ్ము "అని అతడిని పంపెను . 
తాతగారి ఆజ్ఞను పొంది అంశుమంతుడు ఖడ్గము  ధనుర్భాణములు ధరించి తన పినతండ్రులు భూమిని త్రవ్విన దారిలో వెళ్లి దిగ్గజాలకు నమస్కరించి ,వాటిని ఆచూకీ అడిగి భస్మరాశి వద్దకు చేరిరి . వారి మరణ వార్త విని దుఃఖితుడై ఏడవసాగెను . ఆ అంశుమంతుడు అచటనే సంచరిస్తున్న యాగాశ్వమును చూసేను . అతడు తన పినతండ్రులకు తర్పణములు ఇచ్చుటకు జలముకై చూడగా ఎక్కడా దొరకలేదు . తన తండ్రుల మేనమామ అయిన గరుత్మంతుడు కనపడి ధైర్యము చెప్పెను . గంగా జలములో తర్పణములు విడువుము అని పలికెను . ఇంకనూ యాగాశ్వము తీసుకువెళ్లి యజ్ఞమును పూర్తిచేయమని చెప్పెను . 
అతడు ఆవిధముగా యాగాశ్వమును తీసుకువెళ్లి యజ్ఞ దీక్షలో వున్న తాతకు జరిగిన వృత్తాంతము అంతా వివరించెను పుత్రుల మరణ వార్త దుఃఖించి యదావిధిగా యజ్ఞమును పూర్తిచేసెను . తన నగరమునకు వెళ్లెను . గంగను తీసుకువచ్చే విషయము గురించి ఒక నిర్ణయమునకు రాలేకపోయెను ఇలా చాలా కాలము గడిచెను . ఏ నిర్ణయము తీసుకోకుండానే ఆయన మరణించెను . 



రామాయణము బాలకాండ నలుబది ఒకటవ సర్గ సమాప్తము . 


                        శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Friday 5 August 2016

                              రామాయణము 

                                     

                                        బాలకాండ -నలుబదియవ సర్గ 

ప్రాణులందరిని హింసించుచున్న సగర పుత్రుల బల పరాక్రమములకు భయపడిన దేవ ,దానవ ,యక్ష ,సర్ప జాతులతో బ్రహ్మ దేవుడు "ఈ భూమండలం అంతా సర్వ శక్తివంతుడైన శ్రీ మహావిష్ణువుది ఆయన కపిల మహర్షిగా అవతరించి వున్నాడు . ఆయన కోపాగ్నికి వీరందరూ భస్మము అవుతారు . ఇదంతా ముందే నిర్ణయింపబడినది . "అని చెప్పగా దేవతలు మొదలగు వారంతా సంతోషించి వారి వారి స్థానములకు వెళ్లిరి . 
సమస్త భూమండలమును సాధించిన సగర పుత్రులు యాగాశ్వము కనపడలేదని తండ్రికి చెప్పగా ,సగర మహారాజు "తిరిగి భూమండలమును త్రవ్వుము . యాగాశ్వమును ,దానిని భందించిన వానిని పట్టుకుని రమ్ము "అని ఆజ్ఞాపించెను . అంతట వారి తిరిగి  త్రవ్వుతూ పాతాళ  లోక తూర్పు దిక్కుకు చేరి అక్కడ భూమిని మోయుచున్న 'విరూపాక్షం 'అనే పేరు కల గజమును చూసి దానికి నమస్కార ,ప్రదక్షణ చేసి దక్షిణ దిక్కుకు వెళ్లిరి . అక్కడ 'మహాపద్మము 'అనే పేరుకల గజమును చూసి దాని స్వరూపమునకు ఆశ్చర్యము పొంది దానికి నమస్కార ప్రదక్షణలు చేసి పశ్చిమ దిక్కుకు చేరిరి . అక్కడ 'సోమనసము 'అనే పేరుకల గజమును చూసి దానికి నమస్కార ,ప్రదక్షణలు చేసి కుశలం అడిగి ,ఉత్తర దిశకు చేరిరి . అక్కడ  'భద్రము 'అనే పేరు కల గజమును చూసి దానిని సృశించి ప్రదక్షణ ,నమస్కారములు చేసి ఈశాన్య దిశకు వెళ్లిరి . 
అక్కడ వారు కపిల మహర్షిని చూసిరి . ఆయన సమీపములో సంచరించుచున్న యాగాశ్వమును చూసి ,కపిల మహర్షే అపహరించారని భావించి కోపముతో ,గుడ్లురుముచు ,నాగళ్లు ,గడ్డపారలు,రాళ్లు ,వివిధ వృక్షములు మొదలగు వానిని తీసుకుని ఆగుము ,ఆగుము అంటూ  ఆయన మీదకు వెళ్లిరి . వారి దురుసు మాటలు విని కపిల మహర్షి మహారోషావేశముతో హుంకారము చేసెను . ఆ హుంకారమునకు వారందరూ భస్మమయిరి . 

రామాయణము బాలకాండ నలుబదియవ సర్గ సమాప్తము .

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .