రామాయణము
బాలకాండ -నలుబదియవ సర్గ
ప్రాణులందరిని హింసించుచున్న సగర పుత్రుల బల పరాక్రమములకు భయపడిన దేవ ,దానవ ,యక్ష ,సర్ప జాతులతో బ్రహ్మ దేవుడు "ఈ భూమండలం అంతా సర్వ శక్తివంతుడైన శ్రీ మహావిష్ణువుది ఆయన కపిల మహర్షిగా అవతరించి వున్నాడు . ఆయన కోపాగ్నికి వీరందరూ భస్మము అవుతారు . ఇదంతా ముందే నిర్ణయింపబడినది . "అని చెప్పగా దేవతలు మొదలగు వారంతా సంతోషించి వారి వారి స్థానములకు వెళ్లిరి .
సమస్త భూమండలమును సాధించిన సగర పుత్రులు యాగాశ్వము కనపడలేదని తండ్రికి చెప్పగా ,సగర మహారాజు "తిరిగి భూమండలమును త్రవ్వుము . యాగాశ్వమును ,దానిని భందించిన వానిని పట్టుకుని రమ్ము "అని ఆజ్ఞాపించెను . అంతట వారి తిరిగి త్రవ్వుతూ పాతాళ లోక తూర్పు దిక్కుకు చేరి అక్కడ భూమిని మోయుచున్న 'విరూపాక్షం 'అనే పేరు కల గజమును చూసి దానికి నమస్కార ,ప్రదక్షణ చేసి దక్షిణ దిక్కుకు వెళ్లిరి . అక్కడ 'మహాపద్మము 'అనే పేరుకల గజమును చూసి దాని స్వరూపమునకు ఆశ్చర్యము పొంది దానికి నమస్కార ప్రదక్షణలు చేసి పశ్చిమ దిక్కుకు చేరిరి . అక్కడ 'సోమనసము 'అనే పేరుకల గజమును చూసి దానికి నమస్కార ,ప్రదక్షణలు చేసి కుశలం అడిగి ,ఉత్తర దిశకు చేరిరి . అక్కడ 'భద్రము 'అనే పేరు కల గజమును చూసి దానిని సృశించి ప్రదక్షణ ,నమస్కారములు చేసి ఈశాన్య దిశకు వెళ్లిరి .
అక్కడ వారు కపిల మహర్షిని చూసిరి . ఆయన సమీపములో సంచరించుచున్న యాగాశ్వమును చూసి ,కపిల మహర్షే అపహరించారని భావించి కోపముతో ,గుడ్లురుముచు ,నాగళ్లు ,గడ్డపారలు,రాళ్లు ,వివిధ వృక్షములు మొదలగు వానిని తీసుకుని ఆగుము ,ఆగుము అంటూ ఆయన మీదకు వెళ్లిరి . వారి దురుసు మాటలు విని కపిల మహర్షి మహారోషావేశముతో హుంకారము చేసెను . ఆ హుంకారమునకు వారందరూ భస్మమయిరి .
No comments:
Post a Comment