రామాయణము
యుద్ధకాండ -అరువదిరెండవసర్గ
కుంభకర్ణుడు రావణుని వద్దకు బయలుదేరి వెళ్తుండగా కుంభకర్ణుని పై భవనములపై నుండి పుష్ప వర్షము కురిపించుచుండిరి . తనవద్దకు వచ్చిన కుంభకర్ణుని చూసిన రావణుడు సంతోషముతో అతడిని కౌగిలించుకొనెను . పిమ్మట కుంభకర్ణుడు తన అన్న పాదములకు నమస్కారముచేసి ,తన ఆసనంపై కూర్చుండి "అన్నా !నన్ను నిద్రలేపి పిలిపించిన కారణము తెలుపుము "అని పలికెను .
అప్పుడు రావణుడు "కుంభకర్ణా !దశరధుని కుమారుడు మిక్కిలి బలశాలి అయిన శ్రీరాముడు వానరారాజు సుగ్రీవుడితో ,వానర సైన్యముతో కలిసి అభేద్యమైన మహా సముద్రమును దాటి వచ్చినాడు . అతడు మన రాక్షసవంశ నాశనమునకు పూనుకున్నాడు . వారి చేతిలో ఇంతవరకు మనము జయించినదే లేదు . ఇప్పుడు లంకను కాపాడగలిగినవాడవు నీవే అందుకే నీ నిద్రకు భంగము కలిగించినాను . ఓ మహాబాహు !నీకు అప్పగించిన పని దుష్కరమైనదే . కానీ ఈ సోదరుని కొరకు నీవు ఈ కార్యమును సాధింపక తప్పదు . ఈ లోకములొకల సమస్త ప్రాణులలో నిన్ను ఎదిరించి నిలవగలవాడు ఎవ్వడు లేడు . నీ పరాక్రమముతో శత్రు సైన్యమును చిన్నాభిన్నము చేయుము "అని పలికెను .
రామాయణము యుద్ధకాండ అరువది రెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment