రామాయణము
బాలకాండ -ముప్పది ఆరవసర్గ
విశ్వామిత్రుడు చెప్పిన గాధను విన్న శ్రీరాముడు గంగా వృత్తాo తమును సంపూర్ణముగా తెలిపమని అడిగెను . దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పెను .
"ఓ రామా !పరమేశ్వరుడు పార్వతిని వివాహమాడిన పిమ్మట పెక్కు కాలము వారికి సంతానము కలగలేదు . దీర్ఘ కాలము తర్వాత శివునికి సంతానము కలిగిన ఆ తేజో మూర్తి ప్రభావమును లోకము తట్టుకోలేదని ,దేవతలు ప్రార్ధించగా వారి ప్రార్ధనలు విని శివుడు పార్వతితో కలసి తపస్సు చేసెను . అప్పుడు శివుడు దేవతలతో "స్వస్థానము నుండి కదిలిన నా తేజస్సు ఎవరు ధరింపగలరు "అని అడిగెను . వారు భూమాత ధరిస్తుందని చెప్పెను .
శివ తేజస్సు పర్వతములతో ,వనములతో కూడిన భూమి అంటా వ్యాపించెను . అప్పుడు దేవతలు అగ్ని దేవుడిని ఆ తేజస్సుని భరించమని అడిగెను . అగ్నిచే వ్యాప్తమైన శివ తేజస్సు స్వేత పర్వతము అయ్యెను . అచట రెల్లుగడ్డి ఏర్పడెను . అక్కడ మహా తేజశ్వి అయిన కుమారశ్వామి జన్మించెను . కృత్తికలు పాలిచ్చి పెంచుటచే కార్తికేయుడు అని ,అగ్నిచే ధరింపబడుట వలన అగ్ని సంభవుడు అని అతడు ప్రసిద్ధి వహించెను .
అప్పుడు పార్వతి దేవతలతో "ఓ దేవతలారా !నాకు అప్రియమైన పనిని చేసినందుకు మీ పత్నులు సంతానవతులు కాకుండురు గాక !"అని శపించెను . భూమాతని "పెక్కు మంది రాజులకు భార్యవు అవుతావు" అని శపించెను . పార్వతీ పరమేశ్వరులు కైలాశ పర్వతమునకు చేరి తపస్సు చేయసాగెను .
రామాయణము బాలకాండ ముప్పది ఆరవ సర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment