రామాయణము
అరణ్యకాండ -ముప్పదితొమ్మిదవసర్గ
ఓ రావాణా! నాటియుద్దమున శ్రీ రాముని అనుగ్రహముచే ఎట్టకేలకు సురక్షితుడనై ప్రాణములతో బయటపడి ఇట్లుంటిని. ఇప్పుడుగూడ జరిగిన మరియొక వృతాంతమున గూర్చి తెలిపెదను సావదానముగావినుము.
శ్రీరాముని వలన ఆ విధముగా ప్రాణాపాయస్థితికి లోనైనను నేను ఆయనయెడ విరోధభావమును మాత్రమును వీడలేదు. ఒక నాడు మృగ రూపమును దాల్చిన ఇద్దరు రాక్షసులతో గూడి నేను దండకారుణ్యమున ప్రవేశించితిని నేను మాంసమును భక్షించేడి ఒక మహాక్రూర మృగరూపమును ధరించి ఆ ఆవిడయందు తిరుగాసాగితిని అప్పుడు నిప్పులు గ్రక్కుచున్న నాలుకతో దృఢమైన శరీరముతో వాడియైన కోఱలతో మహా బలశాలినై ఉంటిని .
ఆ విధముగా మిగుల భయంకరరూపమున నేను అగ్నిశాలలయందును ,పవిత్ర జలాశయాల తీరమునందు తపమొనరించెడి మునీశ్వరులను హింసించుచు సంచరించుచుండిని . దండకారణ్యమున ధర్మకార్యనిరతులై న తాపసులను చంపి ,వారి రక్తమాంసములు భక్షించుటయే నాపనిగా ఉండెను . నేను అట్లు తిరుగుచు ,ధర్మాత్ముడై,మునివేషములోవున్న శ్రీరాముని ,సీతాదేవిని ,లక్ష్మణుని సమీపించితిని . శ్రీరాముడు మహాబలశాలి అయినను "యితడు తాపస వృత్తిలో వున్నాడు కదా !ఎవ్వరిని హింసించడు కదా !"అని భావించి ఆయనపై నాకు కల కోపముతో బుద్ధిహీనుడనై శ్రీరాముని చంపదలచి ఆయన మీదకు దూకితిని .
అప్పుడు శ్రీరాముడు ధనుస్సుని ఆకర్ణాంతము లాగి ,శత్రుసంహారకములైన మూడు బాణములను మాపై ప్రయోగించెను . ఆ బాణములు మా ముగ్గురిని వెంటాడినవి . ఆయన బాణముపు దెబ్బ రుచి నాకు ముందే తెలియుట చే నేను ఎలాగోలా తప్పించుకుంటిని . కానీ నా మిత్రులు ఇద్దరు ఆ బాణపు దెబ్బలకు మరణించితిరి . పిమ్మట పశ్చాత్త్తాపపడి ,దుశ్చరితలు మాని ,తపోనిష్ఠలో నిమగ్నమయితిని . ఆ రోజు నుండి నాకు ఎటు చూసినా శ్రీరాముడే కనపడుచున్నాడు . ఏ చిన్న చప్పుడు విన్నను నేను భయముతో వణికిపోవుచున్నాను . నేను నీ మంచి కోసమే ఇదంతా చెప్పుచున్నాను "అని పలికెను .
రామాయణము అరణ్యకాండ ముప్పది తొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment