రామాయణము
అరణ్యకాండ -నలుబదినాల్గవసర్గ
మహాతేజస్వి అయిన శ్రీరాముడు ఆ విధముగా లక్ష్మణుడితో పలికి ధనుర్భాణములు ధరించి ,లేడి వెనక పరుగిడెను . మారీచుడు రాముని ఆశ్రమమునకు దూరమంగా తీసుకువెళ్ళవలెననే కోరికతో కొంతసేపు కనపడుతూ ,మరికొంతసేపు మాయమై ఈ విధముగా మాయలచే ఆ మారీచుడు శ్రీరాముని ఆశ్రమము నుండి పెక్కు దూరము తీసుకువచ్చెను .
రాముడు ఆ మాయలు చూసి దానిని ప్రాణములతో పెట్టుకొనుట సాధ్యము కాదని తలచి దానిపై బాణమును ప్రయోగించెను . ఆ బాణము తగిలిన వెంటనే ఆ లేడి రూపమున వున్న మారీచుడు తాడి చెట్టంత పైకి ఎగిరి తన స్వస్వరూపముతో కింద పడెను . అతడు ఆ బాణపు దెబ్బకు గిలగిలలాడుతూ రావణుడి వచనములు (సీతను ఆశ్రమములో వంటరిగా ఉండునట్లు చేయుము )గుర్తుకువచ్చి హా సీతా !హా లక్ష్మణా !అని బిగ్గరగా అరచి మరణించెను .
ఆ మరణించిన మారీచుని చూసి రాముడు ఇది అంతయు లక్ష్మణుడు చెప్పినట్టే రాక్షస మాయే . ఈ రాక్షసుడు మరణించుచు అయ్యో సీతా !అయ్యో లక్ష్మణా !అని అరుస్తూ మరణించాడు . సీత ఈ పలుకులు విని ఏమగునో కదా ,లక్ష్మణుడు ఎంత చింతించునో కదా అని దిగులుతో ,భయమునకు లోనయ్యేను . వడివడిగా తన ఆశ్రమము వైపుగా అడుగులు వేయసాగెను .
No comments:
Post a Comment