రామాయణము
అరణ్యకాండ -నలుబదిమూడవసర్గ
చక్కని అవయవ సౌభాగ్యము కల సీతాదేవి పూలు కోయుచు ఎంతో రమ్యముగా వున్న ఆ మృగమును పరిశీలించి చూసి "ఆయుధములతో రండు "అని రామలక్ష్మణులను బిగ్గరగా పిలిచెను . ఆ పిలుపు విని అచటికి వచ్చిన రామలక్ష్మణులు ఆ కాంచన మృగమును చూసేను .
అప్పుడు లక్ష్మణుడు "అన్నా !ఇది సాధారణ మృగము కాదు లోకములో ఇట్టి మృగము ఉండుట అసంభవం . మారీచుడే ఈ మృగము రూపమున వచ్చి ఉంటాడు . అతడు వేట నిమిత్తమై వచ్చు రాజులను ఈ విధముగా మాయా రూపములతో ఏమార్చి హతమార్చెదడు . "అని పలుకుచుండగా సీతాదేవి లక్ష్మణుని చేతి సంజ్ఞతో ఆపి ,రామునితో
"నాధా !ఈ లేడి చూచుటకు బహు చూడముచ్చటగా వున్నది . ఈ వనవాసములో ఇక్కడ అనేక మృగములు సంచరించుచు ఉండును . వాటన్నిటి కంటే ఇది సౌందర్యమును ఇది మిక్కిలి శ్రేష్టమైనది . మన వాసకాలము ముగియ వచ్చుచున్నది . అంతః పురమునకు ఈ మృగమును తీసుకువెళ్ళినచో అది అంతఃపురమునకే వన్నె తెచ్చును . అత్తగార్లు ,భరతుడు ,చెల్లెల్లు మిక్కిలి సంతోషించెదరు . ఒకవేళ అది ప్రాణములతో దొరకని యెడల అందమైన దాని చర్మముపై నీతో కలసి కూర్చునేదను . "అని పలికెను .
ఆ మాటలు విన్న శ్రీరాముడు "లక్ష్మణా !సీత ఈ లేడికై ఎంతగా ఆకర్షకుతురాలయినదో చూచితివి కదా !ఈమె కోరిక మృగ చర్మమే కావున నేను దీనిని చంపి అయినను తెచ్చెదను . ఒకవేళ నీవు చెప్పినట్టు ఇది మారీచుడే అయితే వాడు మునులకు ఋషులకు అనేక ఇక్కట్లు కలిగించుచున్నాడు . అనేకమంది మునులను ,వేటకై వచ్చిన రాజులను పరిమార్చినాడు . కావున వీడినిఅవశ్యము నేను చంపవలయును . నీవు సీత రక్షణార్ధమై ఇచటనే ఉండుము . నేను ఈ మృగమును చంపి అయినను తెచ్చెదను . సీత రక్షణ విషయములో అప్రమత్తుడవై ఉండుము . జటాయువు సహాయము తీసుకొనుము "అని పలికి ఆ మాయా మృగము వెనుక పరుగిడెను .
రామాయణము అరణ్యకాండ నలుబదిమూడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ (తెలుగు 0,తెలుగు పండితులు .
No comments:
Post a Comment