రామాయణము
అరణ్యకాండ -నలుబదియవసర్గ
మారీచుడు ఆ విధముగా హితోక్తి పలికినప్పటికీ చావు ఘడియలు సమీపించిన రావణుడు అతడి మాటలు ఏమాత్రమూ లక్ష్యపెట్టక "మారీచా !దుష్టుడు ,క్రూరస్వభావుడు ,మానవమాత్రుడు ఐన ఆ అల్పుడు గూర్చి నీవు పలికిన మాటలకు నేను ఏ మాత్రమూ బెదరను . నీవే కాదు దేవతలు సైతము నన్ను సీతాపహరణ యోచన నుండి మరల్చలేరు .
ఇది తధ్యము . ఖరుడు మొదలగు రాక్షస వీరులను చంపిన రాముడిపై నేను తప్పక ప్రతీకారము తీర్చుకొనెదను . నీవు బంగారవర్ణపు లేడీగా మారి వారి ఆశ్రమం పరిసరాలలో చరించు . అప్పుడు సీత లేడిపై ఆశపడి రాముడిని ఆ లేడి కావలెనని కోరును . రాముడు దానికై పరిగెత్తును . అతడిని దూరముగా తీసుకెళ్లి ,నీవు శ్రీరాముడి కంఠ స్వరముతో ఆపద వచ్చినట్టుగా బిగ్గరగా అరువుము . అప్పుడు లక్ష్మణుడు సైతము అచటి నుండి రాముడు వెళ్లిన వైపుగా వెళ్ళును . ఆసమయములో నేను సునాయాసముగా సీతను అపహరించెదను .
ఓ మారీచా !నేను చెప్పినట్టుగా చేసి తీరవలెను . ఇది నా ఆజ్ఞ నా ఆజ్ఞను అతిక్రమించినచో నిన్ను నేను చంపివేయుదును . లేడి వేషములో రాముని ఆశ్రమమునకు వెళ్ళినచో నీవు ఎటులైనను తప్పించుకొను అవకాశము కలదు . కానీ నా మాటను అతిక్రమించినచో నీకు మరణము తప్పదు ఇది సత్యము . "అని పలికెను .
No comments:
Post a Comment