Tuesday 25 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదిరెండవసర్గ

                                        రామాయణము 

                                       అరణ్యకాండ -అరువదిరెండవసర్గ 

శ్రీరాముడు సీతకొరకు అంతటా వెతికి వెతికి సీతా !సీతా !అని బిగ్గరగా అరుచుచు ఏడవసాగెను . పిమ్మట అతడు లక్ష్మణుని పట్టుకుని "లక్ష్మణా !సీతను రాక్షసులు చంపివేసి ఉండును . లేకుంటే ఆమె న ఎదుటికి రాకుండా ఇంతసేపు ఉండదు . లక్ష్మణా !సీత లేకుండా నేను బ్రతకజాలను .   నా మాట విని నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్లు . అచటికి వెళ్లిన పిదప భరతుని కౌగలించుకుని అయోధ్యను పరిపాలించమని నా ఆజ్ఞగా చెప్పు . తల్లులని జాగ్రత్తగా చూసుకో . ముఖ్యముగా కౌసల్యా మాత ను జాగ్రత్తగా చూసుకో "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ అరువదిరెండవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం .  ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

Sunday 23 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియొకటవసర్గ

                                          రామాయణము 

                                          అరణ్యకాండ -అరువదియొకటవసర్గ 

శ్రీరాముడు చుట్టుపక్కల అంతయు వెతికి తిరిగి ఆశ్రమమునకు వచ్చెను . అచట చెల్లాచెదురుగా పది వున్నదర్భలు ,ఆసనములను చూసేను . అప్పుడు ఆ మాహానుభావుడు లక్ష్మణుని గట్టిగా పట్టుకుని "లక్ష్మణా !సీత ఏమయిపోయినది . రక్కసులెవరైనా ఆమెను భక్షించి ఉండునా ?లేక అపహరించివుండునా ?సుకుమారి ఆ రాకుమారి కి ఎట్టి కష్టము వచ్చినదో కదా !ఆమె ఎడబాటు నేను తట్టుకొనలేక మరణించుట తధ్యము . పిమ్మట నేను ఊర్ధ్వ లోకములకు వెళ్ళినచో అచట మన తండ్రి "నేను విధించిన 14 ఏండ్లు అరణ్యవాసము పూర్తిచేయకనే ఇలా వచ్చితివి " నన్ను ఛీ కొట్టుట తధ్యము . "అని పలికెను . 
అప్పుడు లక్ష్మణుడు అన్న ను ఓదార్చుచు "అన్నా !వదినగారికిఎత్తి అపకారము జరిగివుండదు . కంగారు పడకుము . మనిద్దరమూ కలసి వదినగారిని వెతుకుదాము .  అరణ్యములో పూలు కోయుటకో లేక స్నానము చేయుటకో ,విహారమునకో వదినగారు వెళ్ళివుండవచ్చు "అని చెప్పెను . అయినను రాముడు ఊరడిల్లక "లక్ష్మణా !మనము ఇప్పుడే అరణ్యమంతా వెతికినాము కదా !సీత జాడ లభించలేదు "అని దీనవధానుడై చుట్టుపక్కల కళ్ళతోనే వెతుకుచు నిస్సహాయుడై కంట నీరు ధారగా కారుచుండగా సీతా !సీతా !అని అరుచుచు ఉండెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








 

Friday 21 July 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియవసర్గ

                                                 రామాయణము 

                                                   అరణ్యకాండ -అరువదియవసర్గ 

శ్రీరాముడు సీతాదేవి కొఱకు ఆశ్రమము చుట్టపక్కలంతా బాగుగా వెదికినను ప్రయోజనము లేకుండెను . ఆ ఆశ్రమములో సీతాదేవి రావణుడి నుండి తప్పించుకొనుటకు పెనుగులాడినపుడు అచట ఉన్న దర్భలు .ఆసనములు అన్నీ చెల్లాచెదురుగా పడిపోయెను . ఆ ప్రదేశము శోభావిహీనముగా ఉండెను . అచటి వృక్షములు ,పుష్పములు అన్నియు సీతాదేవి లేకపోవుటచే వాడినట్లుగా ఉండెను . అట్టి ప్రదేశమును చూసి రాముడు మిగుల సోకించెను . 
"సీతను ఎవరైనా అపహరించుకుపోయారా ?చంపివేసిరా ?లేక నన్ను ఆటపట్టించుచున్నదా ?ఎవ్వరితోడు లేకుండకపోవుటచే భయపడి వనములలో తిరిగుచున్నదా ?పూవులను ,పండ్లను సేకరించుకొనుటకు ఎచటికైనా వెళ్ళినదా ?స్నానార్ధమై సరస్సుకి వెళ్ళినదా ?జలములు తెచ్చుటకై నదికి వెళ్ళినదా ?"అని పరిపరి విధములుగా రాముడు ఆలోచించుచువుండెను . సీతాదేవి కనపడక పోవుటచే శోకముచే ఆయన కండ్లు ఎరుపెక్కేను . పిచ్చివాని వలె చెట్లు వెంట పరుగెట్టసాగెను . 
కనపడిన ప్రతి చెట్టును సీతజాడ చూసితిరా అని ప్రశ్నించసాగెను . కనపడిన ప్రతి మృగమును సీతాదేవి ఆచూకీకై అడుగసాగెను . కానీ ఫలితము శూన్యము . ఆయన సీతాదేవి వృక్షముల వెనక దాగుకుని ఆటపట్టించుననుకొని "వృక్షముల వెనక దాగుకొని నన్ను ఆటపట్టించినది చాలు ఇక బయటకు రా "అని పిలువసాగెను . కానీ సీతాదేవి రాకపోవుటచే "సీతాదేవిని రాక్షసులు భక్షించి ఉండును . కావునే ఆమె కనిపించుటలేదు "అని భావించెను . శ్రీరాముడు ఆవిధముగా విశాలమైన దట్టమైన అడవులలో పరిగెడుతూ మిక్కిలి అలసిపోయెను . అయినప్పటికీ సీతాదేవిని వెతుకుతూ పిచ్చివాని వలె తిరుగసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday 20 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                                                      రామాయణము 

                                                     అరణ్యకాండ -ఏబదితొమ్మిదవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణునితో పదేపదే సీతాదేవిని వదిలివచ్చినందుకు పరుషముగా మాట్లాడసాగెను . అప్పుడు లక్ష్మణుడు అరుపులు విని సీతాదేవి భయపడి లక్ష్మణుని సహాయముకై వెళ్ళమనుట ,లక్ష్మణుడు అంగీకరించకపోవడంతో సీతాదేవి పరుషముగా మాట్లాడుట ఆ మాటలు తట్టుకోలేక లక్ష్మణుడు రాముని వద్దకు బయలుదేరుట మొదలైన వృత్తాంతమును అంతయు శ్రీరామునికి తెలిపెను . అయినను శ్రీరాముడు లక్ష్మణుని "మీ వదినగారు తెలియక అటుల మాట్లాడినప్పటికీ నీవు ఆమెను విడిచి రాకుండా వుండవలసినది "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    

రామాయణము అరణ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ

                                              రామాయణము 

                                             అరణ్యకాండ -ఏబది ఎనిమిదవసర్గ 

రాముడు సీతాదేవికి ఏ ఆపద సంభవించిందో అని భయపడుతూ లక్ష్మణునితో కలిసి వడివడిగా ఆశ్రమమువైపు నడవసాగెను . ఆయన మిక్కిలి అలసిపోయినప్పటికీ సీతాదేవిపై కల అపారమైన ప్రేమ వలన ఆయన ఎచ్చటా విశ్రమించకుండా తన నడక సాగించెను . బడలిక చేత ఆయన ముఖము మిక్కిలి వాడి ఉండెను . 
ఆ విధముగా రామ్లష్మణులు ఇరువురూ పరుగులాంటి నడకతో ఆశ్రమము చేరి సీతాదేవి కొరకు ఆశ్రమము అంతా వెతికేను . ఆశ్రమము చుట్టుపక్కలా ,సీతాదేవి తానూ కలిసి తిరిగిన విహారప్రాంతములు అన్నియు వెతికేను . కానీ ఫలితం శూన్యం . పిమ్మట శ్రీరాముడు సీతాదేవి కనిపించక క్షణకాలం శ్రీరాముడు నిస్చేస్తుడయ్యెను . 

రామాయణము అరణ్యకాండ ఏబది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    

Tuesday 18 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదియేడవసర్గ

                                              రామాయణము 

                                                  అరణ్యకాండ -ఏబదియేడవసర్గ 

బంగారుజింక రూపములో వున్న మారీచుని చంపి శ్రీరాముడు వెనుతిరిగి ఆశ్రమము వైపు వడివడిగా నడవసాగెను . ఆ మహానుభావుడు తన మనసులో "నాకు దుశ్శకునము లు కనిపించుచున్నవి . సీతాదేవి ఆశ్రమములో క్షేమముగానే ఉండును కదా !ఆ రాక్షసుడు మరణిస్తూ సీతా !లక్ష్మణా !అని బిగ్గరగా అరిచాడు . ఆ అరుపులు విని సీత నాకేదో ఆపద సంభవించిందని బయపడి లక్ష్మణుని నా వద్దకు తప్పక పంపును . అక్కడ ఆమె ఒక్కటే ఉంటుంది . "అని ఆలోచిస్తూ నడవసాగెను . 
ఇంతలో దీనవధనుడైన   లక్ష్మణుడు రాయుడికి ఎదురుపడెను . లక్ష్మణుని చూసిన రాముడు కంగారుపడి ,"లక్ష్మణా !మీ వదిన సీతను ఒక్కదాన్నే వదిలి నువ్వు ఎందుకు వచ్చావు ?"అని మందలించెను . అసురులు తిరిగే ఈ అరణ్యప్రాంతములో ఆమెను ఇలా వదిలి వచ్చుట క్షేమము కాదు . మనము చంపుటచే పగ పూనిన రాక్షసులు ఆమెను చంపుట  తినివేయుట చేసివుండెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

Monday 17 July 2017

రామాయణము అరణ్యకాండ -ప్రక్షిప్తసర్గ

                                           రామాయణము 

                                               అరణ్యకాండ -ప్రక్షిప్తసర్గ 

సీతాదేవి లంకలో ప్రవేశించిన పిమ్మట బ్రహ్మదేవుడు ఇంద్రుని పిలిచి "ఓ దేవరాజా !దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకు పోయి లంకలో ఉంచాడు . దీనివలన రాక్షసుల వినాశనం కలిగి లోకములకు మేలు కలుగుతుంది . కానీ పతివ్రతా శిరోమణీ ,సాధ్వీ ,సుకుమారురాలు అయిన సీతాదేవి లంకలో అడుగుపెట్టింది మొదలు ఏమియు తినుటలేదు . ఆ పతివ్రతా శిరోమణి అటుల తినకుండా వున్నా యెడల ఆమె ప్రాణములకే ముప్పు వచ్చును . 
ఆమె అటుల మరణించుట లోకములకు మంచిది కాదు . కావున నీవు వెళ్లి ఆ సాధ్వికి దివ్యపాయసమును అందించుము . "అని ఆజ్ఞాపించేను . అప్పుడు ఇంద్రుడు నిద్రాదేవితో కలిసి లంకా నగరమునకు బయలుదేరెను . నిద్రాదేవి ప్రభావంతో రాక్షసులందరూ నిద్రించెను .

 అప్పుడు ఇంద్రుడు సీతాదేవి వద్దకు వెళ్లి "సాధ్వీ !నేను సురారాజుని . మహాత్ముడైన శ్రీరామునికి కార్యసిద్ధికై తోడ్పడగలను . కనుక నీవు శోకింపవలదు . 
నా మాయా ప్రభావమున రక్కసులందరూ నిద్రలో మునిగి ఉండిరి . శ్రీరాముడు సముద్రము దాటి వచ్చుటకు నేను సహాయము చేసెదను . నీ భోజనమునకై నేను దివ్య పాయసమును తెచ్చితిని . ఓ పూజ్యురాలా !ఈ పాయసమును ఆరగింపుము .దీని ప్రభావమున ఆకలి దప్పులు నిన్ను ఎప్పటికి బాధించవు . "అని పలికెను . ఆ మాటలు విన్న సీతాదేవి "నీవు ఇంద్రుడివే అని నేను నమ్ముట ఎట్లు ?నేను ఇదివరకు శ్రీరాముడు తో కలసి వనవాసము చేసినప్పుడు దూరమునుండి నిన్ను చూసితిని . నేను ఆనాడు   చూసిన ఆ దేవా లక్షణములు చూపించిన యెడల నమ్మెదను "అని పలికెను . 

ఆ మాటలు విన్న ఇంద్రుడు సీతాదేవి ఆంతర్యము గ్రహించి ,తన దేవలక్షణములు ప్రదర్శించెను . ఆయన కాళ్ళు నెలకు తాకక ఉండెను . ఆయన కళ్ళు రెప్ప పడక ఉండెను . దివ్య వస్త్రములు దేదీప్యమానంగా వెలుగుచూవుండెను . ఆయన ధరించిన పూల మాల వాడక ఉండెను . ఆ లక్షణములు చూసిన సీతాదేవి ఆయన ఇంద్రుడని గ్రహించి ,తన భర్త పేరు వినుటచే మిక్కిలి సంతోషపడెను . ఇంద్రుడు అందించిన దివ్యపాయసమును భక్షించెను . పిమ్మట ఆవిడకు కల ఆకలిదప్పికలు తొలగిపోయెను . పిమ్మట ఇంద్రుడు సీతాదేవి వద్ద సెలవు తీసుకుని అచ్చటనుండి వెళ్లిపోయెను . 

రామాయణము అరణ్యకాండ ప్రక్షిప్తసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday 16 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిఆరవసర్గ

                                        రామాయణము 

                                           అరణ్యకాండ -ఏబదిఆరవసర్గ 

రావణుడు ఆవిధముగా పలుకగా సీతాదేవి నిర్భయముగా ఒక గడ్డిపోచను అడ్డుపెట్టుకుని "రాక్షసుఁడా !నా భర్త రగువంశోత్తముడు ,శూరుడు ఆయనే తలుచుకున్నచో చంద్రుడిని సైతము పడవేయగలడు . సముద్రమును ఇంకిపోవునట్టు చేయగలడు . అతడు తనసోదరుడు లక్ష్మణుడితో సహా వచ్చి నిన్ను నీ పరివారమును సర్వనాశనం చేయుదుడు . దండకారణ్యము నుండి నీవు కపటోపాయముతో నన్ను చెట్టితివి . అప్పుడే నీవు రాముని కంట పడివుండిన యెడల నీ ఆయువు అప్పుడే తీరిపోయివుండేది . రాముడు తప్పక ఇచటకు వచ్చి నన్ను తీసుకువెళ్తాడు . 
నేను జనకుని పుత్రికను ,దశరధుని కోడలిని ,శ్రీరాముని ఇల్లాలును . ఎట్టిపరిస్థితిలలో నేను ధర్మము తప్పి వర్తించను . కలలో కూడా నా భర్తను తప్ప అన్య పురుషులను తలవను . ఇది సత్యము "అని పలికెను . 
సీత మాటలకు క్రోధోదిక్తుడైన రావణుడు "సీతా !నీకు పండ్రెండు నెలల సమయము ఇచ్చుచున్నాను . ఈ లోపు నా దారికిరా . లేనియెడ నిన్ను మా వంటవాళ్లు ముక్కలుముక్కలుగా కోసి కూరగా చేసెదరు . "అని పలికి అక్కడ వున్న రాక్షస స్త్రీలతో ఈమెను అశోకవనంలో రహస్య ప్రదేశములో ఉంచి జాగరూపులై కాపాడుడు . నయానో భయానో నా దారికి తీసుకు రండు "అని పలికి 
భూమిని బద్దలు చేయుచున్నాడా అన్నట్లుగా పెద్దగా పెద్దగా చప్పుడు చేయుచు నడిచి వెళ్లిపోయెను . అంతట ఆ రాక్షస స్త్రీలందరూ అశోకవనమునకు సీతాదేవిని తీసుకెళ్లి అచట తమ మాటల్తో భయపెడుతూ ఉండెను . సీతాదేవి ఆ రాక్షస స్త్రీల మధ్యలో భయముతో బతుకుతూ శ్రీరామునే మనసులో తలుచుకుంటూ కాలము వెళ్లదీయసాగెను . 

రామాయణము అరణ్యకాండ ఏబది ఆరవసర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Saturday 15 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదియైదవసర్గ

                                           రామాయణము 

                                               అరణ్యకాండ -ఏబదియైదవసర్గ 

 రావణుడు తాను చేసిన ఘనకార్యమును తలుచుకుని మిక్కిలి సంతుష్టుడై సీతాదేవిపట్ల కామపరవశుడై ,సీతాదేవిని చూచుటకై రమ్యమైన అంతః పురములోకి ప్రవేశించెను . అచట రాక్షస కాంతల రక్షణలో కన్నీరుమున్నీరుగా విలపించుచు ఉండెను . అట్టి సీతాదేవి కడకు రావణుడు చేరి తన వైభవమును చూపించుటకు తన భవనములు అన్ని చూపించసాగెను . 
రత్న మణిఖచితములై బంగారు తాపడములతో ఉన్న రకరకాల భవనములు  రావణుడు సీతాదేవికి చూపించినను ఆమె దుఃఖముతో ,భాదతో వాటిపట్ల విముఖురాలై ఉండెను . పిమ్మట రావణుడు "సీతా !నా అధీనములో ముప్పదిరెండు కోట్లమంది రాక్షసయోధులు కలరు . భయంకర కార్యములు చేయుటలో సిద్దహస్తులు . వీరు కాక బాలురు ,వృద్దులు అనేకులు కలరు . వారందరికీ నేను ప్రభువును . వెయ్యి మంది సేవకులు నా ఒక్కటి సేవకై నియమితులై ఉండెను . 
నీవు నన్ను భర్త గా అంగీకరించినచో వీరందరూ నీకు సేవకులవుదురు . అంతేకాదు నాకు జీవనసర్వస్వమూ నేవే . నీవు నాకు ప్రాణముల కంటే మిన్న . నా రాజ్యము వేయి యోజనముల విస్తీర్ణముకలది . ఇంద్రాది దేవతలు వచ్చినను నన్ను జయించలేరు . రాముడు రాజ్యభ్రష్టుడు ,మనుష్యమాత్రుడు అట్టి వానితో నీకేమి పని . సుందరీ !రాముడిని చూడవలెననే కోరిక మానుకొనుము . రాముడు మానసికముగా అయినా ఇచటకు రాలేడు . 
ఓ తరుణీ నీ ముఖారవిందం మిక్కిలి కోమలమైనది . అది నిరంతరము ఏడ్చుటచే కల తప్పి ఉండెను . "అని రావణుడు పలుకుచుండగా సీతాదేవి చీర చెంగుతో ముఖము దాచుకుని ఎక్కీఎక్కి ఏడ్చుచుండెను . ఆమె తన మనసులో రాముడిని ధ్యానించుచుండెను . అట్టి స్థితిలో పాపాత్ముడవైన రావణుడు "ఓ వైదేహి ఇట్లు చేయుట అధర్మమని భావించరాదు . విధివశమున ఏర్పడిన ఈ బంధము ధర్మసమ్మతమే . 
ఓ జానకీ !నీ పాదములు మిగుల మృదువైనవి . అట్టి పాదములకు నేను నా పదితలలతో మోకరిల్లుదును . వెంటనే నన్ను అనుగ్రహింపుడు . నేను సర్వదా నీ దాసుడనై నీ అధీనములో ఉండెదను . నేను ఇదివరకెన్నడూ ఏ స్త్రీ కి శిరసా నమస్కరింపలేదు . "అని పలికి ఆ రావణుడు ఈమె నాకు దక్కినట్టే అని తన మనసులో తలచుకొనెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Friday 14 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదినాల్గవసర్గ

                                         రామాయణము 

                                              అరణ్యకాండ -ఏబదినాల్గవసర్గ 

రావణుని చేతిలో అపహరణకు గురియైన సీతాదేవికి ఆమెను ఆదుకొనువారు ఎవ్వరును కానరారైరి . ఇంతలో ఒక పర్వత శిఖరంపై ఐదుగురు వానర ప్రముఖులను సీతాదేవి చూసేను . బంగారుకాంతులీను తన ఉత్తరీయపు కొంగున తన జారిపోగా మిగిలిన కొన్ని ఆభరణములను కట్టి వారిమధ్య పడునట్లుగా వదిలెను . శ్రీరాముడు అటుగా వచ్చిన యెడల ఆ నగలను చూసి  గుర్తు పట్టి ఆ దారిగా వస్తాడని ఆశతో సీతాదేవి ఆలా చేసెను . 
రావణుడు లంకకు వెళ్లు తొందరలో అది గమనించలేదు . దూరముగా వున్న వస్తువులను కానీ ,వ్యక్తులను కానీ స్పష్టముగా చూడగల ఆ వానర ప్రముఖులు ఆ సీతాదేవిని కన్నార్పకుండా దేవతలా వలె చూసిరి . రావణుడు అరణ్యములు దాటి ,కొండలు ,కోనలు దాటి సముద్రమును దాటి లంకా నగరంలోని వీధులను ,వాడలను దాటి తన అంతః పురములోకి ప్రవేశించి సీతను అచట ఉంచి "ఈమెను జాగ్రత్తగా చూడుడు . ఈమెకు అవసరమగు సమస్త వస్తువులను అందించండి . పట్టు వస్త్రములు వజ్రవైఢూర్య ఆభరణములు సమృద్ధిగా ఇవ్వుడు .జాగరూపులై ఈమెను రక్షించుడు . పురుషులు కానీ స్త్రీలు కానీ ఈమెను కలువుటకు వీల్లేదు  "అని రాక్షస స్త్రీలను ఆదేశించెను . 
ఆ విధముగా రాక్షస స్త్రీలను ఆదేశించి ఆ అంతః పురము నుండి వెలుపలికి వచ్చి ఇప్పుడు చేయవలినదేమి ?అని ఆలోచించుచుండగా  మాంసభక్షకులు ,మహావీరులు ఐన 8 మంది రాక్షసయోధులు రావణుడి వద్దకు వచ్చి నమస్కరించిరి . రావణుడు ఆ రాక్షసయోధులను పొగుడుతూ "ఓ రాక్షసయోధులారా !మీరు పరాక్రమవంతులు . పూర్వము దండకారణ్యములో ఖరుడు మొదలయిన మహాసైన్యము ఆ అరణ్య రక్షణార్ధము అచట ఉంచితిని . కానీ రాముడు వారినందరిని చంపివేసెను . ఇప్పుడది నా అధికారము న లేదు . కావున మీరందరూ వెంటనే సాయుధులై వెళ్లి అచట వుండండి . అచట మన అధికారమును ప్రదర్శించండి . 
ముఖ్యముగా ఆ రాముడి మీద కన్నేసి ఉంచండి . అతడిని వధించండి . అతడి సమాచారమును నాకు ఎప్పటికప్పు డు సమాచారం అందించండి . మీరు ఇదివరలో పెక్కు యుద్ధములలో మీ ప్రతిభ చూపించి ఉండుటచే ఏ పని మీకు అప్పగించితిని . "అని పలికెను . ఆ రాక్షస యోధులు రావణుడికి నమస్కరించి తమకు అప్పగించిన ఘన కార్యము సాధించుటకై లంకను వీడి వెళ్లెను . పిదప రావణుడు సీతను తీసుకొచ్చినందులకు మిక్కిలి సంతుష్టుడై ఉండెను . 

 రామాయణము అరణ్యకాండ ఏబదినాల్గవసర్గ సమాప్తము . 

                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Wednesday 12 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిమూడవసర్గ

                                       రామాయణము 

                                       అరణ్యకాండ -ఏబదిమూడవసర్గ 

ఆ విధముగా రావణుడు బలవంతముగా ఎత్తుకుపోవుటచే సీతాదేవి ఎక్కి ఎక్కి ఏడ్చుటచే ఆమె కనులు మిక్కిలి ఎరుపెక్కేను . భయముతో కంపిస్తూ ఆ రావణుడితో "ఓ నీచరావణా !రామలక్ష్మణులు లేని సమయము చూసుకుని ,ఒక దొంగవలె నన్ను తీసుకుని పారిపోవుచుంటివి . ఇట్టి పని చేయుటకు నీకు సిగ్గులేదా ?దుర్మార్గుడా !నన్ను అపహరించదలిచి ,నా భర్తకు బయపడి నీవు మాయామృగ రూపముతో ఆయనను నాకు దూరము చేసితివి అనుట నిశ్చయము . మా మామగారి ప్రియమిత్రుడైన జటాయువు నన్ను కాపాడుటకు పూనుకొనగా అతనిని నీవు వధించితివి . అట్లు ఒక ముసలి పక్షిని చంపిన నీవేమి శూరుడవు . 
ఓ రాక్షసాధమా !యుద్ధరంగమున నీ పేరు చెప్పుకుని ,రఘువీరులతో పోరి నన్ను ఇటు తీసుకురాలేదుకదా !దీనినిబట్టీ నీ పరాక్రమము యొక్క గొప్పతనము కనపడుచున్నది . ఓ నీచుడా ! శ్రీరామునకు బయపడి పారిపోవుచున్నావు . క్షణకాలం ఆగుము . నీవు ప్రాణములతో ఇంటికి చేరవు . రామలక్ష్మణుల కంట బడినచో నీవు నీ సైన్యమూ ఒక్క క్షణకాలం కూడా బతికి ఉండుట దుర్లభము . ఆనాడు తమ్ముడు తోడులేకుండానే దండకారణ్యమున ఖరుడు మొదలగు పదునాలుగువేల రాక్షసయోధులను శ్రీరాముడు క్షణకాలంలో మట్టికరిపించెను . 
వివిధములగు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు ,వీరుడు ,బలశాలి అయిన  శ్రీరాముడు తన ప్రియభార్యను అపహరించిన నిన్ను తన తీక్షణమైన శరములచే చంపకుండా ఎట్లుండగలడు ?మిక్కిలి బయశోకములకు లోనైన సీతాదేవి విలపించుచు దైన్యముతో ,జాలిగొలుపునట్లు బహువిధములుగా వచించెను . అయినను ఆమె మాటలను లెక్కచేయక భయకంపితయై దయనీయముగా మెలికలు తిరుగుచున్న ఆ రాజకుమారిని తీసుకుని పోవుచునేవుండెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిమూడవసర్గ సమాప్తము . 

                                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






రామాయణము అరణ్యకాండ -ఏబదిరెండవసర్గ

                                          రామాయణము

                                           అరణ్యకాండ -ఏబదిరెండవసర్గ 

రావణుడు శ్రీరాముని ఆశ్రమ సమీపమున నేలపై పడిపోయిన జటాయువును ,దాని చెంతే ఉండి ఏడుస్తున్న సీతను చూసేను . సీతను తీసుకువెళ్ళుటకు రావణుడు త్వరత్వరగా ఆ వైపుగా నడవసాగెను . తనవైపుగా వస్తున్న రావణుని చూసి సీతాదేవి రామాలక్ష్మణా !అని బిగ్గరగా అరుస్తూ వృక్షమును కౌగిలించుకొనెను . ఆ విధముగా వృక్షమును గట్టిగా పట్టుకున్న సీతాదేవి జుట్టును రావణుడు పట్టుకొనెను . ఆ విధముగా సీతకు జరిగిన అవమానము చూసిన సకల చరాచర జగత్తు అచేతనములై ఉండిపోయెను . 
సూర్యుడు కళాహీనుడయ్యెను . వాయువు ప్రసరించుట ఆపివేసెను . సీతాదేవిని రావణుడు బలవంతముగా ఎత్తుకొనిపోవుట ,ఆవిడ తప్పించుకొనుటకు గింజుకోనుటలో ఆమె కేశపాశములు చెదిరిపోయెను .ఆమె నుదిటి బొట్టు చెరిగేను .  ఆమె ధరించిన ఎర్రమందారరేకులు చెదిరి రాలిపోయెను . ఆమె  ఎర్రటి పట్టువస్త్రము గాలికి  ఎగురుతూ రావణుడికి రాబోవు చావుకు సంకేతముగా ఉన్నది . ఆమె ఎడమకాలి అందే ఊడి నేలపై పడెను . అది రత్నమణిఖచితమై ఉండెను . తదుపరి మెడలోని హారములు కంఠాభరణములు ఇలా ఒక్కొక్కటిగా జారీ నేలపై పడెను . 

ఆ విధముగా బిగ్గరగా రామా !లక్ష్మణా !అని అరుస్తూ నేలపైకి చూస్తూ హృదయవిదారకంగా విలపించుచున్న సీతాదేవిని చూసిన వనదేవతలు సైతము వణికిపోయిరి . ఈ స్థితిలో ఆమెకు రామలక్ష్మణులు కనపడకుండుటచే ఆమె దీనావదన అయి  అంతులేని భయముతో కృంగిపోయెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 

                                      శశి ,

                    ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Tuesday 11 July 2017

రామాయణం అరణ్యకాండ -ఏబదిఒకటవసర్గ

                                     రామాయణం 



                                         అరణ్యకాండ -ఏబదిఒకటవసర్గ 

ధర్మబద్ధముగా జటాయువు ఆ విధముగా పలికిన పిమ్మట రావణుడు మిగుల క్రుద్ధుడై కన్నులనుండి నిప్పులు కురిపించెను . ఆ రాక్షసరాజు ఆ జటాయువు పైకి యుద్దానికి దూకేను . ఆ ఇరువురు యోధులు ఘోరాతోఘోరముగా యుద్ధము చేసుకొనిరి . రావణుడు శూలములు ,బల్లెములు గద మొదలగు ఆయుధములను జటాయువు పైకి విసిరెను . జటాయువు వాటిని చెదరగొట్టెను . పిమ్మట రావణుడు పది వాడి బాణములతో జటాయువును కొట్టెను . ఆ బాణములు జటాయువును తీవ్రముగా గాయపరిచేను . 

జటాయువు రథముపై వున్న రావణుని ,సీతను చూసి బాణపు దెబ్బలను ఏమాత్రము లెక్కచేయక రధము పైకి దూకి రథమునకు కట్టిన అశ్వములను ముక్కుతో పొడిచి చంపెను . తన వాడి గోళ్ళతో రావణుడి రధము లోకల రావణుడి సేవకులను చంపెను . రావణుడి రధము ముక్కలు చేసెను . రధసారధి శిరస్సు ఖండించెను . రావణుడి కవచము ధ్వంసము చేసెను . తన రధము ఛిద్రమయిపోగా రావణుడు సీతను పట్టుకుని భూమిమీదకు దూకేను .
వాహనము ఛిద్రముకాగా ,నేలపైకి దూకిన రావణుని చూసి సమస్త ప్రాణులు 'బాగుబాగు ' అని సంబరంతో పలుకుతూ జటాయువును శ్లాఘించెను . వృద్ధాప్య కారణముగా పక్షిరాజైన జటాయువు మిక్కిలి అలిసివుండుట చూసిన రావణుడు సంతోషించి ,సీతను తీసుకుని ఆకాశమార్గములో ఎగిరిపోసాగెను . అది చూసిన జటాయువు తాను కూడా ఆకాశములో ఎగిరి ఆ రావణునికి ఎదురుగా నిలబడి "ఓ అల్పబుద్దీ !చావు మూడి ఉండుటచే నీవు ఇట్టి పాపపు పనికి పూనుకున్నావు . రణరంగమున రాముడి వజ్ర తుల్యమగు బాణములు నీ గుండెలను చీల్చుట ఖాయము . నీవు నిజముగా వీరుడవయితే క్షణకాలం నిలిచి నాతొ యుద్ధము చేయి "అని పలికెను . 
జటాయువు ఇలా పలుచున్నప్పటికీ రావణుడు సీతను తీసుకుని వెళ్లుచునే ఉండెను . అప్పుడు పరాక్రమశాలి అయిన జటాయువు అతడిపై దాడి చేసెను . రావణుడిని తన పదునైన గోళ్ళతో రక్కుచూ ,ముక్కుతో పొడుచుచూ అతని వీపును గాయపరిచేను . జుట్టు పట్టుకుని లాగెను . అప్పుడు రావణుడు ఆ జటాయువును కొట్టుటకు తన 20 పిడికిళ్ళను ముందుకు చాచెను . జటాయువు వాటిని ముక్కలుముక్కలుగా చేసెను . వెనువెంటనే  రావణునికి ఆయుధములతో సహా చేతులు చేతులు ఛిద్రమైన వాటి స్థానములో మొలిచెను . 
ఈ విధముగా జటాయువు పదేపదే విసిగించుటచే రావణుడు సీతను ఎడమచేతితో పట్టుకుని జటాయువుతో  యుద్ధమునకు దిగెను .  పిమ్మట సీతను వదిలి రెండు ఘడియల పాటు జటాయువుతో యుద్ధము చేసెను . పిమ్మట రావణుడు  ఖడ్గము తీసుకుని జటాయువు రెక్కలు ,కాళ్లు ,పక్కభాగములు నరికివేసెను . ఆ విధముగా రావణుడు జటాయువు రెక్కలు ,కాళ్ళు నరికివేయుటచే వెంటనే ఆ జటాయువు నేలపై పడిపోయెను . జటాయువు శరీరము నుండీ రక్తము ఏరులుగా పారసాగెను . ఆ జటాయువు వద్దకు సీత పరుగున వచ్చి దానిని చూసి ఆత్మబంధువును కోల్పోయినట్లుగా ఏడవసాగెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిఒకటవసర్గ సమాప్తము . 

                                 శశి ,

                    ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Monday 10 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిసర్గ

                                          రామాయణము 

                                                     అరణ్యకాండ -ఏబదిసర్గ 

అప్పుడే నిద్రించుటకు ఉపక్రమించిన జటాయువు సీతాదేవి ఆక్రన్దనలు విని ఉలిక్కిపడిలేచి ,రథముపైనున్న రావణుని ,వైదేహిని చూసేను . పక్షులలో శ్రేష్ఠుడైన జటాయువు రావణునితో ఇట్లు హితవచనములు పలికెను . "ఓ దశగ్రీవా !నా పేరు జటాయువు శ్రీరాముడు దశరథమహారాజు యొక్క కుమారుడు . అతడు సర్వలోకములకు ప్రభువు . నీవు అపహరించుకుపోవుచున్న ఈమె శ్రీరాముని భార్య . పతివ్రతాశిరోమణి . 
ఓ బలశాలీ !ధర్మవర్తనుడైన రాజు పరసతులను ఎలా స్పృశించును ? పైగా రాజపత్నులను తప్పక రక్షించవలెను కదా !వివేకము కలవాడు తనభార్యను రక్షించుకొను రీతిగా పరసతులను కూడా కాపాడవలెను . ఓ రాక్షసరాజా !నీవు పాపశీలుడవు   . కావుననే ఇట్టి దుష్కృత్యమునకు ఒడికట్టావు . శ్రీరాముడు మిక్కిలి బలశాలి అయినను నీకు కానీ ,నీ రాజ్యమునకు కానీ ఏ హాని తలపెట్టలేదు . మరి నీవెందుకు ఆయన భార్యను అపహరించుచున్నావు . 
ఓ నీచుడా !రాకుమారులైన రామలక్ష్మణులిద్దరూ ఇచటికి దూరముగా వున్నారు . నీవు వారికి భయపడే వారు లేని సమయము చూసి నీవు ఈ దుష్కృత్యమునకు ఒడికట్టినావు . నేను వారికి చెప్పుటకు వెళ్ళినచో నీవు పారిపోదువు  . కావున నేనే నీతో యుద్ధము చేసెదను . శ్రీరాముడు నాకు బహి ప్రాణము . నా బొందిలో ప్రాణము ఉండగా నీవు ఈమెను తీసుకుని వెళ్లజాలవు . దశరథమహారాజు నా మిత్రుడు .కావున దశరథమహారాజుకి ,ఆయన పుత్రుడైన శ్రీరాముడికి ఎల్లప్పుడూ హితము కూర్చు పనులే నేను చేయుదును . 
ఓ దశగ్రీవా !ఒక్క క్షణ కాలము ఆగుము రణభూమియందు నీకు తగిన సత్కారము జరిపెదను . నిన్ను రధము నుండి క్రింద పడవేసెదెను "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Saturday 8 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                  అరణ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ 

 సీతాదేవి పలుకులు విని రావణుడు తీవ్ర అసహనమునకు లోనై చేతులు పిసుకుకొనుచు తన అసలు రూపమును చూపెను . 

అనంతరము సీతాదేవితో మరల గట్టిగా "ఓ సీతా !నీవు పతి వ్యామోహములో పడి నా సౌర్యపరాక్రమములు సరిగా వినినట్టులేవు . నేను నా భుజబలముతో ఈ భూమండలమును పైకెత్తగలను . సముద్రజలమును అమాంతం తాగెయ్యగలను . రణరంగమున నిల్చి మృత్యు దేవతను పరిమార్చగలను . నేను కోరుకొనిన రూపము ధరింపగలను . నీవు దేనిని కోరినా ఇవ్వగలను . కనుక నన్ను పతిగా శ్వీకరింపుము . "
అని పలికిన రావణుడి రూపము చూచుటకు భయంకరముగా ఉండెను . కళ్ళు అగ్ని గోళముల వలె ఉండెను . పళ్ళు పటపట కోరుకుచు "ఓ కల్యాణీ !నీకు తగిన భర్త నుం నేనే . కలకాలం నీవు నాతోనే ఉండిపొమ్ము . నిన్ను సంతోష పరుచుతూ ,నీ ప్రశంసలు పొందదగినవాడను . నీకు నేనెన్నడూ అప్రియము కలిగింపను . రాముడు అల్పాయుష్కుడు ,రాజ్యభ్రష్టుడు అతడిలో ఏమి గొప్పతనము చూసి అతడిపై అనురాగము కలిగివున్నావు . "ఇలా మాట్లాడి ఆ దుష్టుడు తన ఎడమ చేతితో సీతాదేవి తలను ,కుడి చేతితో ఆమె పాదములను పట్టుకుని ఆమెను ఎత్తుకొనెను . 

మృత్యువు వలె భయంకరుడైన ఆ రావణుని చూసి వనదేవతల కూడా భయముతో పరుగులు తీసిరి . అంతవరకూ అదృశ్యముగా వున్న రావణుని రధము అచట ప్రత్యక్షమయ్యెను . రావణుడు సీతాదేవిని ఆవిధముగా ఎట్టి రథముపై ఉంచెను . రావణుడు అట్లు తీసుకునిపోవుటకు సిద్దపడగా ఆ సీతాదేవి తన భర్తను స్మరించి 'రామా !రామా !అని బిగ్గరగా అరవసాగెను . కామార్తుడైన రావణుడు తనను తిరస్కరించుచుతప్పించుకొనుటకు  మెలికలు తిరిగితున్న సీతను పట్టుకుని రథములో ఆకాశములో ఎగరసాగెను . 
సీతాదేవి బిగ్గరగా ఏడ్చుచు రామా !లక్ష్మణా !అని బిగ్గరగా అరవసాగెను . రావణునితో "దుష్టుడా !ఆయువుతీరినవాడవై ఈ పాపకృత్యమునకు పాల్పడినావు . నీవు కష్టములపాలై మరణించుట తధ్యము . "అని పలికెను . ఇంకనూ "అయ్యో రాముడి భార్యనైన నన్ను ఈ దుర్మాత్ముడు తీసుకొనిపోవుచున్నాడు . ఇప్పుడు కైకేయి ఆమె యొక్క బంధువుల కోరికలు నెరవేరి వారి మనసులు కుదుటపడివుండవచ్చును . దండకారణ్యమున బాగుగా పుష్పించిన ఓ గన్నేరుమొక్కలారా !రావణుడు సీతను అపహరించిపోవుచున్నాడు అని వెంటనే రాముడికి తెలుపుము . ఓ గోదావరీ మాతా !నీకు నమస్కారము చేయుచున్నాను . నన్ను రావణుడు అపహరించాడని రాముడికి తెలుపుము . అంటూ కనిపించిన చెట్టుకూ పుట్టకూ మొక్కుతూ రాముడికి చెప్పమని విలవిలలాడుతూ ఏడవసాగెను . 

సీతాదేవి మిక్కిలి దుఃఖితయై దయనీయవచనములతో ఇట్లు విలపించుచు ఆ సమయమున చెట్టుపైకల జాటాయి పక్షిని చూసేను . ఆ జాతాయువుతో గద్గద స్వరముతో ఆక్రందించుచు "పూజ్యుడైన ఓ జటాయువు !పాపకర్ముడైన ఈ రాక్షసరాజు నన్ను అపహరించుకునిపోతున్నాడు . దయచూడుము . ఈ నిశాచరుడు క్రూరుడు . బలశాలి ,విజయగర్వంతో ఉన్నాడు . సాయుధుడు ,పైగా దుర్మాత్ముడు అట్టి ఇతనిని ఎదుర్కొనుట నీకు అశక్యము కావున నీవు శీఘ్రముగా వెళ్లి నన్ను అపహరించుకుపోవు విషయము రామలక్ష్మణులకు తెలుపు "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    










 
 

Thursday 6 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ

                                     రామాయణము 

                                   అరణ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ 

సీతా దేవిని బయపెట్టుటకై అప్పుడు రావణుడు "ఓ సుందరీ !కుబేరుడు సవతి సోదరుడు . అతడిపై యుద్ధము గెలిచి ,అతడి లంకా నగరమును ,పుష్పకమును స్వాధీనము చేసుకున్నాను . అది ఎచ్చటికైనను పయనించగలదు . ఆకాశమార్గములో కూడా వెళ్లగలదు .  రాజధాని అగు లంకా నగరము చుట్టూ సముద్రముతో శత్రు దుర్భేద్యముగా ఉండును . ఆ నగరమంతయు బంగారము మణులతో అలంకరింపబడి శోభాయమానంగా ఉండును . నా చేతిలో ఓడిన కుబేరుడు కైలాస గిరిలో తలదాచుకొనెను . నీవు అచటికి వచ్చినచో అచటి వైభోగములు ,ఆనందములు చూసి రాముడిని తలవనైనాతలవవు . నా పరాక్రమము ముందు మానవమాత్రుడైన రాముడు ఏపాటికి సరికాడు . 
నేను సంస్థ రాక్షసులకు రాజుని . నా పేరు తలచినా ,నన్ను చూసినా దేవతలు ,గంధర్వులు .యక్షులు మానవులు మొదలగు సమస్త జాతుల వారు గడగడ వణుకుదురు . వాయువు ,సూర్యచంద్రులు ,అగ్ని సముద్రుడు కూడా నేనున్నచోట తమ ప్రతాపమును చూపించుటకు బయపడెదరు . నీ అదృష్టము కొలది నేను  చేరితిని . కనుక నన్ను శ్వీకరింపుము . "అని పలికెను ఆ నిర్జనవనప్రదేశమున రావణుడు ఇట్లు పలుకగా సీతాదేవి మిగుల కృద్ధురాలై కన్నులెర్రజేజుచు ఆ రాక్షసరాజుతో 
"సమస్త ప్రాణులకు పూజ్యుడు మహాత్ముడు అయిన కుబేరునికి సోదరుడవు అయివుండి కూడా ఇట్టి పాపకృత్యములు ఏల చేయుచున్నావు ?ఓ రావణా !నీవు క్రూరుడవు . ఇంద్రియసుఖలోలుడవు . నీ బుడ్డి పెడదారిన పట్టినది అట్టి నిన్ను ప్రభువుగా పొందిన రాక్షసులందరూ నీ మూలకంగా తప్పక నశింతురు . ఎవడైనను ఇంద్రుడి భార్య అయిన శచీదేవిని అపహరించి ప్రాణములతో ఉండవచ్చునో కానీ ,శ్రీరాముడి భార్య అయిన నన్ను అపహరించిన యెడల వారి ప్రాంమౌలా మీద ఆశ వదులుకోవలసినదే :అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








 

Sunday 2 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదియేడవసర్గ

                                      రామాయణము 

                                     అరణ్యకాండ -నలుబదియేడవసర్గ 

రావణుడు పలికిన మాటలు విన్న సీతాదేవి తన మనసులో 'ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు పైగా అతిధి ఈయనకు సమాధానము చెప్పనిచో శపించునో ఏమో ?అని అనుకుని "బ్రాహ్మణోత్తమా !నేను మిథిలానగరప్రభువైన జనకుడి కుమార్తెను . దశరధుడి కుమారుడైన శ్రీరాముని అర్ధాంగిని . నా పేరు సీత . నా వివాహము అనంతరము 12 సంవత్సరములు అయోధ్యలో హాయిగా ఉంటిమి . మా మామగారు రామునికి పట్టాభిషేకము చేయ యత్నించగా మా అత్తగారు కైక తనకు వున్నా రెండు వరములను అప్పుడు 'భరతుని పట్టాభిషేకము ,రాముని వనవాసము 'గా కోరెను . 
దశరథ మహారాజు ఆడినమాట తప్పలేక ,ఆ వరములు తీర్చలేక తల్లడిల్లుచుండగా నా భర్త శ్రీరాముడు తండ్రి మాట నిలబెట్టుటకు వనములకు వచ్చుటకు నిశ్చయించుకొనెను . నేను మా మరిది లక్ష్మణుడు ఆయనతో వనములకు వచ్చి ఉంటిమి . ఈ పవిత్ర ప్రదేశములో నీవు విశ్రాంతి తీసుకొనుము . నా భర్త ఇప్పుడే వచ్చెదరు . కందమూలాదులు పుష్కలముగా తెచ్చెదరు . ఆరగిందురు . 
ఓ విప్రుడా !పూరవాశ్రమములో నీ పేరేమి ?గోత్రమేమి ?ఒంటరిగా ఈ దండకారణ్యమున ఎలా సంచరించుచుంటివి ?ఏ ఊరివాడవు ?"అని  సీత ప్రశ్నించగా రావణుడు తీవ్రస్వరంతో "నా పేరు రావణుడు . నేను రాక్షస రాజుని . దేవతలు ,నాగులు యక్షులు ,మానవులు సమస్త జాతులవారు నాకు భయపడుదురు . ఓ సుందరీ !నీ దివ్య సౌందర్యము చూచినప్పటినుండి నాకు నా భార్యలపై మనసుపోకున్నది . నేను వివిధప్రదేశముల నుండి అనేక మంది సుందరీమణులు ను అపహరించి తీసుకువచ్చివుంటిని . నీవు నన్ను వివాహమాడినచో వారందరూ నీకు దాసీలగుదురు . నీవు నా పట్టపురానివివి అగుదువు . సముద్రము మధ్యన కల త్రికూటగిరిపై విలసిల్లెడి లంకా నగరము నా రాజధాని . చుట్టూ సముద్రముతో  నా రాజ్యము శత్రు దుర్భేద్యమై ఉండును . ఓ భామినీ నీవు నా భార్యవై వివిధములగు ఆభరణములు ధరించి స్వర్గములో వలే హాయిగా వుండెదవు . "అని పలికెను . 
ఆ మాటలు విన్న సీతాదేవి రావణుని తృణీకరించుతూ "రావణా !నా భర్త రాముడు మే రు పర్వతము వలే ఉన్నతమైనవాడు . అట్టి వానిని కాదని నేను అల్పుడవైన  నీవంటి వారి చెంతకు వచ్చుట కలలో కూడా జరగనిది . ఆయనతోడితే నా జీవితమూ . నేను ఆడ సింహమును నీవు నక్కవు . నేను ఎవ్వరికి అందను . నా భర్త సంరక్షణలో ఉన్న నా జోలికి వచ్చుట అంటే మృత్యు శిఖరమునకు నీవే వెతుకుతూ చేరుట "అని పలికి చిగురుటాకు వలె భయముతో వణకసాగెను . ఆ విధముగా వణుకుచున్న సీతను ఇంకా భయపెట్టుటకు తన పరాక్రము గూర్చి ,రాక్షస జాతి గూర్చి ,తన దుష్కృత్యముల గురించి వివరింప మొదలుపెట్టేను . 

రామాయణము అరణ్యకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  









 

Saturday 1 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదిఆరవసర్గ

                                                 రామాయణము 

                                                   అరణ్యకాండ -నలుబదిఆరవసర్గ 

సీతాదేవి పలికిన పరుష వచనములు భరించలేక లక్ష్మణుడు సీతను వంటరిగా విడుచుటకు కాళ్లురాకున్నను అన్నను చేరుటకై ఆశ్రమము వదిలి బయలుదేరెను . తగిన అవకాశము కోసం ఎదురుచూచుచున్న దశగ్రీవుడు (రావణుడు )లక్ష్మణుడు వెళ్ళుట గమనించి సీతాదేవి సమక్షమునకు వచ్చెను . రావణుడు కాషాయ వస్త్రములు ధరించి శిఖను ,ఛత్రమును ,పాడుకులను ధరించి ఉండెను . ఎడమచేతితో దండము ,కుడిచేతితో కమండలం ధరించి ఆశ్రమము వద్దకు వచ్చెను . 
క్రూరుడు పాపాత్ముడు అయిన రావణుని చూచి దండకారణ్యమున వృక్షముల కదలికలు ఆగిపోయెను . వాయువు ప్రసరించుట ఆగిపోయెను . పరవళ్లు తొక్కుచూ ప్రవహించెడి గోదావరి వేగము తగ్గించి నెమ్మిదిగా ప్రవహింపసాగెను . అటుల రావణుడు బిక్షకుడి వేషములో వైదేహి కడకు వచ్చెను . పతికి ఏ ఆపద వచ్చినదో అని పాటి ధ్యానంలోనే నిమగ్నమైవున్న సీతాదేవిని రావణుడు చూసేను . ఆమె పట్టుపీతాంబరములు ధరించి దిగులుతో ఆశ్రమములో ఏడ్చుచు ఉండెను . 
అప్పుడు రావణుడు "పట్టుపీతాంబరములు ధరించి బంగారు బొమ్మ వలె ఉన్న ఓ వనితా !ఎవరు నువ్వు ?నీ ముఖము ,నేత్రములు ,చేతులు ,కాళ్ళు పద్మములవలె ఉండి పద్మలతలా వున్నావు . నీవు లక్ష్మీవా ?పార్వతివా ?లేక సరస్వతివా ?రతీదేవివా ?ఎవరునీవు ?దివ్యభామినులు కానీ ,గాంధర్వ కాంటాలు కానీ ,యక్ష ,కిన్నెర యువతులు కానీ నీ అందము ముందు దిగదుడుపే . నీవంటి నారీ రత్నమును ఇంతకు ముందు ఈ భూమండలమున చూసి ఎరుగను . 
లోకోత్తరమైన నీ లావణ్యము సౌకుమార్యము ,యవ్వనము ,ఆ వనమున ఏకాంతవాసము ఇవన్నియు నన్ను పిచ్చివానిగా చేయుచున్నవి . ఓ తరుణీ !భయంకరులు కామరూపులు (నచ్చినరూపములో మారగల )రాక్షసులు సంచరించెడి ఇట్టి ఈ ఘోరారణ్యమున నీవు నివసింపతగదు . నీవు నీ భవనమునకు మరలుము . ఇట్టి భయంకరమైన ఈ అరణ్యములో దేవతలు గంధర్వులు మొదలగు వారెవరు సంచరించారు మరి నీవేల వచ్చితివి ?"అని రావణుడు సీతాదేవిని పొగుడుతూ ప్రశ్నించెను . 

అట్లు పలికిన రావణుడు వేషము చూసి సీతాదేవి అతడు సాధువని భావించి అతడిని ఆశ్రమములోకి ఆహ్వానించి ఆసనము (కూర్చొనుటకు పీట )వేసెను , కాళ్ళు,చేతులు కడుగుకొనుటకు ,త్రాగుటకు నీళ్లు ఇచ్చి ఆయనను ఆసనమున కూర్చుండమని ఆహ్వానించెను . సీతాదేవి ఇట్లు ఆహ్వానించుచున్నదే కానీ మాటిమాటికీ రాముడు వెళ్లిన దిక్కుగానే చూచుచు ,రామునకు ఏమయినదో అని కలవరపడుతూ ఉండెను . కానీ ఎంతకీ రామలక్ష్మణులు రాకుండిరి . 

రామాయణము అరణ్యకాండ నలుబదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు