రామాయణము
అయోధ్యకాండ -నూట ఏడవసర్గ
బందు మిత్రుల మధ్య భరతుడు ఎంతగా ప్రాధేయపడినా శుభ లక్షణ సంపన్నుడైన శ్రీరాముడు భరతునితో "సోదరా !భరతా!రాజశిరోమణి అయిన దశరధుని కైకేయి దేవి అందు కలిగిన పుత్రుడవు నీవు . నీవు పలికిన వచనములు అన్నీ నీకు తగినట్లుగానే వున్నవి .
సోదరా !పూర్వము మన తండ్రి మీ తల్లిని వివాహము చేసుకోను సందర్భమున "కైకేయికి పుట్టిన వారికే రాజ్యాధికారం ఇత్తును "అని మన తండ్రి ప్రతిజ్ఞ చేసియున్నాడు . ఆ పిమ్మట దేవాసురలకు జరిగిన సంగ్రామములో మీ తల్లి చేసిన సేవలకు మహారాజు మిగుల సంతుష్టుడై ఆమెకు రెండు వరములు ఇత్తునని వాగ్ధానము చేసెను .
వాసిగాంచినదియు ,ఉత్తమ మహిళ అయిన మీ తల్లి మహారాజుచే ఒట్టు పెట్టించుకుని నిన్ను రాజ్యాభిషిక్తుడను చేయుట ,నన్ను వనములకు పంపుట అను రెండు వరములను ఆయనను అడిగెను . అందులకు ఆమహారాజు సమ్మతించి ,ఆమెకు ఆ రెండు వరములను ఇచ్చెను .
ఓ నరశ్రేష్టా !భరతా !ఈ విధముగా మన తండ్రి వరదాన రూపమున 14 సంవత్సరములు వనవాసము చేయుము అని నన్ను ఆజ్ఞాపించెను . కనుక ఆయన ఆజ్ఞకు బద్ధుడనై సీతాలక్ష్మణ సహితుడనై వనవాసమునకు వచ్చితిని . సత్యసంధనుడైన మన తండ్రి మాట నిలబెట్టుటకు ఇచటనే ఉండెదను . నీవు కూడా తండ్రి ఆజ్ఞను శిరసావహించి శీఘ్రముగా పట్టాభిషిక్తుడవు కమ్ము .
భరతా !శీఘ్రముగా అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడవుకమ్ము . తండ్రిని సత్యసంధునిగా చేయుము . అదే సముచితము . ఓ భరతా !నీవు ప్రజలందరికి రాజువి కమ్ము . నేను సమస్త వనములకు రాజు అయ్యేదను . సంతోషముగా దణ్డకారణ్యములో అడుగిడెదను . ఇక నీవు దుఃఖిపకు .
No comments:
Post a Comment