రామాయణము
సుందరకాండ -పదినైదవసర్గ
అశోకవృక్షము పైన చేరిన హనుమ ఆ వనమంతా బాగుగా పరిశీలించి చూడసాగెను . జానకీ దేవికొరకు చూపులతో వెతికేను . అలా వెతకగా మాలిన వస్త్రములు కట్టుకుని వున్న ఒక స్త్రీ కనిపించెను . ఆమె కట్టుకున్న వస్త్రము మిక్కిలి మలినమై ఉండెను . కానీ దాని శోభ ఏమాత్రము తగ్గలేదు . ఆమె ఎటువంటి అలంకారములు లేకుండెను . ఆమె జుట్టు తైలస్నానాది సంస్కారములు లేక జాడలు కట్టి ఉండెను . ఆమె వంటిపై ఎటువంటి ఆభరణములు లేవు . శ్రీరాముడు చెప్పిన గుర్తులు ప్రకారము కొన్ని నగలు చెట్టు కొమ్మకు తగిలించివుండెను . అవి మిక్కిలి మాసి ఉండెను . హనుమ కూడా ఋశ్యమూకపర్వతము పై ఉన్నప్పుడు రాక్షసుడు అపహరించి పోవుచుండగా చూసిన స్త్రీ జారవిడిచి న ఉత్తరీయము బంగారుఅంచు కలది . ఇప్పుడు ఈ సాధ్వి ధరించి ఉన్న చీర కూడా బంగారు అంచు కలిగివున్నది .
మారుతి శ్రీరాముడు చెప్పిన ఆనవాలు ,తానూ చూసినది బాగుగా గుర్తుతెచ్చుకుని ,అతి కష్టము మీద ఆ మహా సాధ్వి సీతయే అని గుర్తించెను . ఆమె ముఖము మిక్కిలి విచారంగా ఉండెను . ఆమె దేహము మొత్తము దుమ్ముపట్టి ఉండెను . అయినను ఆమె ముఖములో కాంతి మిక్కిలి ప్రకాశవంతముగా ఉండెను .ఆమె చాలా కాలము నుండి కడుపు నిండా భోజనము చేసినట్లు లేకుండెను ." శ్రీరామునికి దూరముగా ఉన్నాను ఆమె మదిలో ఆయన ఎల్లప్పుడూ ఉండును . సీతాదేవి దూరముగా ఉన్నను ఆయన తలంపులో ఆమె ఎల్లప్పుడూ ఉండెను . కావునే వారిరువురు జీవించి ఉన్నారు .వీరిరువురు ఒకరికొకరు బాగుగా తగి వున్నారు . వీరు ఆదర్శ దంపతులు "అని హనుమ అనుకొనెను .
రామాయణము సుందరకాండ పదునైదవసర్గ .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment