Tuesday 28 December 2021

రామాయణము ఉత్తరకాండ -డెబ్బదిరెండవసర్గ

                        రామాయణము 

                           ఉత్తరకాండ -డెబ్బదిరెండవసర్గ  

శత్రుఘ్నుడు శయనించిననూ ఆయనకు రామాయణ దివ్యగాధే తలపునకు వచ్చి ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు . మరునాడు సంధ్యావందనాది క్రియలని ముగించుకుని వాల్మీకి మహర్షి అనుమతి తీసుకుని అయోధ్యకు వెళ్లెను . అయోధ్యలో శ్రీరాముని దర్శించి పరమానందభరితుడై అభివాదం చేసి ,"మహారాజా !నీవు ఆజ్ఞాపించినట్లుగా లవణాసురుడిని అంతమొనర్చి మదుపురమును పునర్నిర్మాణము చేసితిని . నీకు దూరముగా ఆ నగరములో 12 సంవత్సరములు గడిపితిని . తల్లికి దూరమైన దూడ వలె నేను ఎక్కువకాలం అక్కడ ఉండలేను . "అని పలికెను . 
తమ్ముడిని చూసి అతడి మాటలు విన్న శ్రీరాముడు శత్రుఘ్నుడిని అక్కున చేర్చుకుని ,"మహావీరా !ఏ మాత్రము విషాదమునకు లోను కావద్దు . ఇది క్షత్రియుల లక్షణము కాదు . ఆత్మీయులకు దూరమై అన్యప్రదేశములో వున్నప్పటికి రాజులు దుఃఖింపరాదు . నన్ను కలుసుకొనుటకై అప్పుడప్పుడు అయోధ్యకు వస్తూ వుండు . నాకు కూడా నీవు ప్రాణముల కంటే మిన్న . మనకు రాజ్యపాలన అవశ్య కర్తవ్యము "అని పలికెను . శ్రీరాముడి మాటలను అంగీకరించి శత్రుఘ్నుడు అయోధ్యలో ఏడు రోజులు ఉండి తిరిగి మదుపురమునకు పయనమయ్యెను . అలా మదుపురమునకు వెళ్లుచున్న శత్రుఘ్నుడిని కొంత దూరము భరతలక్ష్మణులు అనుసరించి సాగనంపిరి . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదిరెండవసర్గ సమాప్తము . 

                                                                      శశి ,

                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment