Wednesday 29 December 2021

రామాయణము , ఉత్తరకాండ --- డబ్బది ఐదవసర్గ

                           రామాయణము 

                      ఉత్తరకాండ ------ డెబ్బది ఐదవసర్గ 

                

నారదుడు పలికిన మాటలు విన్నంతనే శ్రీ రాముడు చాలా సంతోషించి లక్ష్మణుడితో " సౌమ్యా ! బ్రాహ్మణోత్తముడి వద్దకువెళ్లి ఆయన్ని ఊరడించు మృత బాలుడి కళేబరం దెబ్బతినకుండా దానిని సుగంధములతో సువాసనలుగల తైలములతో భద్రపరుచునట్లు చూడుము . నిపుణులైనవారిచే భద్రత కల్పించుము . అవయవములు యదాతదంగా ఉండునట్లు రూపం మారిపోకుండా ఉండునట్లు జాగ్రత్తలు తీసుకొనుము . " అని ఆదేశించి పుష్పకమును తలుచుకోగా అది వెనువెంటనే అక్కడకి వచ్చినది . అప్పుడు శ్రీ రాముడు మునీశ్వరులకి నమస్కరించి నగర రక్షణ బాధ్యతను భరత లక్ష్మణులకు అప్పగించి ధనుర్భాణాలు, తుణీరాలు, ఖడ్గము తీసుకొని విమానమును అధిరోహించెను . 
శ్రీ రాముడు పడమర దిశ , ఉత్తర దిశ , పూర్తిగా అంతటా అన్వేషించి అక్కడ ఏ దుష్కృత్యములు జరగకుండుట చూసి , దక్షిణ దిశకు వెళ్లెను .అక్కడ శైవల పర్వతమునకు ఉత్తర భాగమున కల ఒక మహా సరస్సు ఆయనకి కనిపించెను . ఆ సరస్సు తీరంలో తపస్సు చేస్తున్న ఒక తాపసిని  చూసేను . ఆ తపస్వి అధోముఖుడై వ్రేలాడుచుండెను . ఆయన్ని చూసిన శ్రీ రాముడు అతని వద్దకు వెళ్లి " వ్రతనిష్టా గరిష్టుడా ! నీవు ఎవరు? నేను దశరధుని కుమారుడను . నా పేరు శ్రీ రాముడు నీవు ఇంత తీవ్రమైన తపస్సును ఎందుకు ఆచరించుచున్నావు . నీవు కోరుకొనుచున్న వరమేమి?. స్వర్గ భోగములు కావలెనా? , లేక వాటి కంటే మించినది కావలెనా ?, ఏ నిమిత్తమై ఇంతటి తపస్సుకి పూనుకుంటివి? . " అని పలికెను .  

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియైదవసర్గసమాప్తము . 

                                                                                          శశి ,

                                                                                                          ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు  పండితులు . 

 

No comments:

Post a Comment