రామాయణము
ఉత్తర కాండ -డెబ్బదిమూడవసర్గ
శ్రీరాముడు శత్రుఘ్నుడిని మదుపురమునకు పంపివేసిన పిమ్మట ,తమ్ముళ్ళతో కలిసి ధర్మయుక్తముగా పరిపాలనచేయుచుండెను . అలా కొన్నిదినములు గడిచినపిమ్మట ,ఒక వృద్ధ బ్రాహ్మణుడు మృతబాలుని శరీరము తీసుకుని రాజభవనద్వారము వద్దకు వచ్చెను . అతడు దుఃఖముతో పుత్రా !పుత్రా !అని బిగ్గరగా ఏడుస్తూ "నేను పూర్వజన్మలో ఎటువంటి పాపకృత్యములను చేసినానో ఆ పాప ఫలితముగా నా ఏకైక పుత్రుడు మృత్యువాత పడుట చూడవలసి వచ్చినది . నీవు ఇంకనూ పసివాడవు . యవ్వనమున అడుగుపెట్టలేదు . నీ వియోగముతో నేను ,మీ అమ్మా ,త్వరలోనే మృత్యువుపాలగుట తధ్యము . నేను ఇంతవరకు అసత్యమాడి కానీ ఎవరినీ హింసించి కానీ ,ఏ ప్రాణిని కష్టపెట్టికానీ ఎరుగను .
ఈ దేశములో బాలురకు మృత్యువు సంభవించుట బట్టీ ,ఈ రాజ్యాధిపతి అయిన శ్రీరాముని దోషము ఇందులో ఎంతోకొంత ఉండితీరును . ఇది నిశ్చయము . రాజా !నీ దేశములో మృతిచెందిన ఈ బాలుని నీవు బ్రతికింపుము .
లేనిచో దిక్కులేనివారివలె నేను నా భార్య ఈ రాజభవనద్వారము వద్దనే ప్రాణత్యాగము చేసికొందుము . ఆ బ్రహ్మహత్యాపాతకమును అనుభవించుచు కలకలకాలము సుఖముగా ఉండుము . "అంటూ పుత్రవియోగముతో తల్లడిల్లుచున్న ఆ బ్రాహ్మణుడు ఇలా అనేక మాటలచే రాజును తప్పుబడుతూ శోకభారంతో ఆ బాలుని కళేబరమును గుండెలకు హత్తుకొనెను .
No comments:
Post a Comment