Tuesday 28 December 2021

రామాయణము ఉత్తర కాండ -డెబ్బదిమూడవసర్గ

                           రామాయణము 

                            ఉత్తర కాండ -డెబ్బదిమూడవసర్గ  

శ్రీరాముడు శత్రుఘ్నుడిని మదుపురమునకు పంపివేసిన పిమ్మట ,తమ్ముళ్ళతో కలిసి ధర్మయుక్తముగా పరిపాలనచేయుచుండెను . అలా కొన్నిదినములు గడిచినపిమ్మట ,ఒక వృద్ధ బ్రాహ్మణుడు మృతబాలుని శరీరము తీసుకుని రాజభవనద్వారము వద్దకు వచ్చెను . అతడు దుఃఖముతో పుత్రా !పుత్రా !అని బిగ్గరగా ఏడుస్తూ "నేను పూర్వజన్మలో ఎటువంటి పాపకృత్యములను చేసినానో ఆ పాప ఫలితముగా నా ఏకైక పుత్రుడు మృత్యువాత పడుట చూడవలసి వచ్చినది . నీవు ఇంకనూ పసివాడవు . యవ్వనమున అడుగుపెట్టలేదు  . నీ వియోగముతో నేను ,మీ అమ్మా ,త్వరలోనే మృత్యువుపాలగుట తధ్యము . నేను ఇంతవరకు అసత్యమాడి కానీ ఎవరినీ హింసించి కానీ ,ఏ ప్రాణిని కష్టపెట్టికానీ ఎరుగను . 
ఈ దేశములో బాలురకు మృత్యువు సంభవించుట బట్టీ ,ఈ రాజ్యాధిపతి అయిన శ్రీరాముని దోషము ఇందులో ఎంతోకొంత ఉండితీరును . ఇది నిశ్చయము . రాజా !నీ దేశములో మృతిచెందిన ఈ బాలుని నీవు బ్రతికింపుము . 
లేనిచో దిక్కులేనివారివలె నేను నా భార్య ఈ రాజభవనద్వారము వద్దనే ప్రాణత్యాగము చేసికొందుము . ఆ బ్రహ్మహత్యాపాతకమును అనుభవించుచు కలకలకాలము సుఖముగా ఉండుము . "అంటూ పుత్రవియోగముతో తల్లడిల్లుచున్న ఆ బ్రాహ్మణుడు ఇలా అనేక మాటలచే రాజును తప్పుబడుతూ శోకభారంతో ఆ బాలుని కళేబరమును గుండెలకు హత్తుకొనెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదిమూడవసర్గసమాప్తము . 

                                                                               శశి ,

                                                                                      ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment