Wednesday 29 December 2021

రామాయణము ఉత్తరకాండ ---- డెబ్బది ఆరవసర్గ

                               రామాయణము 

                      ఉత్తరకాండ ---- డెబ్బది ఆరవసర్గ 

శ్రీ రాముడు పలికిన మాటలు విని అధోముఖుడై ఉన్న ఆ తాపసి అట్లే ఉండి " మహా యశస్వి నేను శూద్రుడను , నా పేరు శంభుకుడు , నేను ఈ శరీరంతోనే దివ్యత్వం పొందగోరుచున్నాను . అంతే కాదు దేవలోకమును జయింప దలచి ఇట్టి ఉగ్రతపస్సుకు పూనుకుంటిని . " అని పలికెను . ఆ మాటలు  విన్న శ్రీ రాముడు వెంటనే తన ఖడ్గమును తీసి అతడి శిరస్సు ఖండించెను . ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి శ్రీ రాముడిని మాటిమాటికి ప్రశంసించిరి . అప్పుడు అన్ని వైపుల నుండి శ్రీ రాముడిపై పూల వాన కురిసెను . అప్పుడు దేవతలు " రామా! నీవు చేసిన ఈ కార్యం దివ్యమైనది లోకకళ్యాణదాయకం కావున , ఇష్టమైన వరమును కోరుకొనుము " అని పలికిరి . 
ఆ మాటలు విన్న శ్రీ రాముడు అంజలి ఘటించి " నాయందు దేవతలు ప్రసన్నులైనచో బ్రాహ్మణ బాలుడు జీవించుగాక, నాకు ఈ ఒక్క వరము చాలు . " అని పలుకగా , ఆ మాటలు విన్న దేవతలు మిక్కిలి సంతోషించి " రామా! నీవు ఆ శూద్రుడిని సంహరించిన క్షణమే ఆ బాలుడు పునర్జీవితుడైనాడు . ఇక మా వరం తో పనిలేదు . నీకు మేలు చేకూరును శుభములు పొందగలవు . మహా తేజస్వి అయిన  అగస్త్యమహర్షి జలములనే శయ్యగా చేసుకొని పన్నెండు సంవత్సరములుగా తపస్సు చేయుచున్నాడు . ఆయన దీక్ష సమాప్తమైనది.  మేము ఆయనని  అభినందించుటకై అక్కడికి వెళ్లుచున్నాము . నీవు కూడా రా! నీకు మేలగును . అని పలుకగా రాముడు అట్లే అని తన పుష్పకముతో దేవతల విమానములు అనుసరించి అగస్త్య మహాముని ఆశ్రమం వైపుగా వెళ్లెను . 
అగస్త్యముని తన ఆశ్రమమునకు వచ్చిన దేవతలని చూసి పూజించెను . దేవతలు ఆయన్ని అభినందించిరి . పిమ్మట వారంతా తమతమ స్థానములకు వెళ్లిరి . దేవతలు వెళ్లిన పిదప శ్రీ రాముడు పుష్పకము నుండి దిగి అగస్త్యమహామునికి అభివాదం చేసెను . ఆ మహాముని శ్రీ రాముడిని ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసి " రఘురామా! నీకు స్వాగతం నా అదృష్టం కొద్దీ నీ దర్శనం లభించినది . అర్హతలేనివాడు తపస్సు  చేయుటకు పూనుకొనగా నీవు అతన్ని హతమార్చి ఇక్కడికి వచ్చావని దేవతలు నాకు చెప్పెను . నీ వలన ఆ బ్రాహ్మణ సుతుడు పునర్జీవితుడైనాడు ఈ రోజు నీవు ఇక్కడే విశ్రమించి రేపు ఉదయమే అయోధ్యకు వెళ్లుము . రామా! ఇది విశ్వకర్మ నిర్మించిన దివ్యాభరణము ఇది అద్భుతమైన ఆకృతిచే కాంతులచే తేజరిల్లుచున్నది.  నా తృప్తికొరకు దీనిని స్వీకరింపుము . దీన్ని ధరించుటకు ఇంద్రాది దేవతల కంటే కూడా నీవే అర్హుడవు . " అని పలికెను . 
శ్రీ రాముడు "తపోధనా ఈ దానం పుచ్చుకోనుటకు బ్రాహ్మణుడే తగిన వాడు.  క్షత్రియుడైన నేను అందునా బ్రాహ్మణుని నుండి దానం పుచ్చుకొనుట ఎంత వరుకు సమంజసం . దయతో ఈ విషయమును వివరింపుము . " అని పలుకగా అగస్త్యుడు " రామా! పూర్వకాలమున కృతయుగమున ప్రజలకు రాజులేకుండెను . దేవతలకు మాత్రం ఇంద్రుడు ప్రభువుగా ఉండెను . అప్పుడు అందరు బహ్మదేవుడిని ప్రార్ధించగా ఆయన ఇంద్రాది దిక్పాలకులని ఆహ్వానించి విషయము వివరించి " మీరందరు మీ తేజస్సుల్లో ఒక్కొక్క అంశమును ఇవ్వండి ఆ అంశాలతో ఒక పాలకుడు ఏర్పడును . " అని పలుకగా అప్పుడు ఇంద్రాది లోకపాలకులు తమ తేజస్సునుండి ఒక్కొక్క అంశను బ్రహ్మదేవుడికి సమర్పించిరి . ఆ సమయంలో బ్రహమ దేవుడికి ఒక తుమ్ము వచ్చెను . ఆ తుమ్ము నుండి 'క్షుపుడు అను వాడు ఆవిర్భవించెను . లోకపాలురు ఇచ్చిన అంశలతో బ్రహ్మ దేవుడు క్షుపుడిని తీర్చిదిద్ది ప్రజలకు ప్రభువుగా నియమించెను . 
పిమ్మట ఆ క్షుపుడు ఇంద్రుడి తేజాభాగముతో రాజ్యము పరిపాలించ సాగేను . వరుణ దేవుడి అంశతో ప్రజలకు పుష్టి చేకూర్చెను . కుబేరుడి తేజస్సుతో ప్రజలకు సిరి సంపదలు సమకూర్చెను . యముడి తేజస్సుతో దండనా  విభాగమును నిర్వహించెను . రామా! ఇంద్రాది దిక్పాలకుల తేజోభాగములో నీలోను వర్ధిల్లు చున్నవి . కావున నేను సమర్పిస్తున్న ఈ ఆభరణమును స్వీకరింపుము " అని పలుకగా శ్రీ రాముడు ఆ ఆభరణమును స్వీకరించి " మహాత్మా ఈ ఆభరణము అత్యద్బుతముగా ఉన్నది అమోఘమైన దీని ఆకారము దివ్యముగా ఉన్నది . ఇది మీకు ఎలా ప్రాప్తించింది? నాలోని కుతూహలము కొద్దీ నిన్ను అడుగు చున్నాను . " అని అడుగగా అగస్త్యుడు " ఓ మహాబాహు! ఈ వనము నందే ఒక రమణీయ ప్రదేశములో ఒక దివ్య పురుషుడి నుండి నేను దాన్ని స్వీకరించితిని " అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియారవసర్గ సమాప్తము . 

                                                                          శశి ,

                                                                                           ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

 

No comments:

Post a Comment