రామాయణము
ఉత్తరకాండ -డెబ్బదినాలుగవసర్గ
దుఃఖశోకములతో బావురుమంటూ బ్రాహ్మణుడు పలికిన దయనీయమైన విలాపవచనములను శ్రీరాముడు వినెను . శ్రీరాముడు దుఃఖసంతప్తుడై వెంటనే మంత్రులను ,వశిష్ట వామదేవాది తపోధనులను ,పురప్రముఖులను ,తన తమ్ముళ్లను పిలిపించెను .
శ్రీరాముడు తన పిలుపుతో సభకు వచ్చినవారందరినీ చూసి వారికి అంజలి ఘటించి ,పుత్రవియోగ దుఃఖముతో వృద్దబ్రాహ్మణుడు తనను తప్పుపడుతూ పలికిన పలుకులను వారికి తెలిపెను . శ్రీరాముడి మాటలు విన్న నారదమహర్షి "రఘురామా !ఒక రాజు యొక్క దేశములో ఎవడైనా బుద్ధిలేనివాడు అధర్మమునకు ,అకృత్యమునకు ఒడికట్టినచో ఆ రాజ్యములో సంపదలు నశించును . అంతేకాదు రాజుకూడా నరకముపాలగును . ధర్మముగా ప్రజలను పాలించు రాజునకు వేదాధ్యయనము ,తపస్సు ,సుకృతకర్మలు చేయునట్టి ధర్మాత్ముల పుణ్యములో ఆరవభాగము చెందును . నీ రాజ్యమంతా గాలించుము . ఎవడో అధర్మకార్యమునకు వడిగట్టినాఁడు . దాని ఫలితమే ఇది . ఆ అధర్మమును నివారించుటకు ప్రయత్నించుము . అలాచేస్తే ధర్మము వర్ధిల్లుతుంది . అంతేకాదు ,నీకు ప్రజలకు ఆయుర్వృద్ధి కలుగుతుంది . ఆ బాలుడు కూడా పునర్జీవితుడు అవుతాడు . "అని పలికెను .
రామాయణము ఉత్తరకాండ డెబ్బదినాలుగవసర్గసమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment