Thursday 30 December 2021

రామాయణము ఉత్తరకాండ -ఎనుబదియవసర్గ

                         రామాయణము 

                          ఉత్తరకాండ -ఎనుబదియవసర్గ  

అగస్త్యుడు శ్రీరామునితో ఇంకా ఇలా చెప్పసాగెను . "రామా !అనంతరము దండుడు రాజ్యమునకు శత్రుబాధ లేకుండా పెక్కువేల సంవత్సరములు ప్రజలను పరిపాలించెను . ఒకరోజు ఆ దండ మహారాజు శుక్రాచార్యుని ఆశ్రమమునకు వెళ్లెను . అక్కడ అటుఇటు సంచరించుచున్న మిక్కిలి సౌందర్యవతి అయిన శుక్రాచార్యుని కుమార్తెను చూసి మోహించాడు . దండుడు ఆమెతో "శుభంగీ !నీవు ఎక్కడనుండి వచ్చితివి ?"అని ప్రశ్నించగా 
శుక్రాచార్యుని కుమార్తె ఆ రాజుతో"రాజా !నేను శుక్రాచార్యుని పెద్ద కుమార్తెను . నా పేరు అరజ . నేను ఈ ఆశ్రమములోనే నివసించుచున్నాను . మీరు నన్ను వివాహము చేసుకోనదలిచితే మా తండ్రిని ఆశ్రయించండి . అన్యధా ప్రవర్తించినచో నీవు మిక్కిలి అనర్ధములపాలగుదువు . మా తండ్రి కోపించినచో ముల్లోకములనూ దహించివేయగలడు . "అని పలుకగా 
దండుడు ఆమె మాటలు ఏమాత్రము లక్ష్య పెట్టక ఆమెను బలాత్కారముగా తన బాహువులతో బంధించెను . పిమ్మట దండుడు తన నగరమునకు వెళ్లిపోయెను . పిమ్మట ఆ అరజ భయపడుతూ ,ఆ ఆశ్రమ సమీపమునందే ఏడ్చుచు తన తండ్రి కోసము నిరీక్షించసాగెను . 

రామాయణము ఉత్తరకాండ ఎనుబదియవసర్గ సమాప్తము .  

                                                                            శశి ,

                                                                                       ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తరకాండ -డెబ్బదితొమ్మిదవసర్గ

                        రామాయణము 

                                   ఉత్తరకాండ -డెబ్బదితొమ్మిదవసర్గ  

అగస్త్య మహర్షి పలికిన మాటలు విని శ్రీరాముడు "పూజ్యుడా !ఘోరమైన ఆ వనమున విదర్భరాజగు ఆ స్వేతుడు తపస్సు చేసిన ప్రదేశము నందు మృగములు ,పక్షులు లేకుండుట ఏమిటి ?ఆ రాజు తనతపఃశ్చర్యకు అట్టి నిర్జనారణ్యమున నందు ఎట్లు ప్రవేశించెను ?"అని అడుగగా 
అగస్త్య ముని రామునితో "రామా !పూర్వము కృతయుగము నందు 'మనువు 'అనే మహారాజు కలడు . అతడు రాజ్యమును న్యాయసమ్మతముగా పాలించువాడు . వర్ణాశ్రమ ధర్మములను కాపాడినవాడు . ఆయన కుమారుడు ఇక్ష్వాకుడు . మనువు ఇక్ష్వాకుడిని రాజుగా చేసి "నాయనా !ధర్మమార్గమున ప్రజలను రక్షించుచు రాజ్యమును పాలించుము . నిరపరాధులను ఎవ్వరినీ దండించరాదు . అపరాధము చేసిన మానవులను దండించుట న్యాయసమ్మితము . అట్టి ధర్మప్రభువు మరణానంతరము స్వర్గసుఖములు పొందగలడు . "అని కుమారునికి ఉపదేశము చేసి ,అతడు మిక్కిలి సంతోషముతో యోగమార్గము ద్వారా శాశ్వత బ్రహ్మలోకమునకు  చేరెను . 
రాజైన ఇక్ష్వాకువు యజ్ఞములు ,దానములు ,తపస్సులు మొదలగు సత్కర్మలను ఆచరించి వందమంది కుమారులను పొందెను . వారు దేవకుమారులవలె మిక్కిలి తేజస్సంపన్నులు . ఆఖరువాడుమాత్రము మిక్కిలి మూర్ఖుడు . ఇక్ష్వాకువు 'మందబుద్ధియైన యితడు తన మూర్ఖత్వము కారణముగా మున్ముందు దండనార్హుడు అగును 'అని భావించి ,అతనికి 'దండుడు'అని పేరుపెట్టెను . 
ఇక్ష్వాకువు దండుడికి తగినట్లుగా ఒక ఘోరమైన ప్రదేశమును అప్పగించుటకై ఆలోచించి ,వింధ్యాద్రికి శైవలపర్వతమునకు మధ్యకల ప్రదేశమునకు అతనిని రాజుగా చేసెను . దండుడు అక్కడ ఒక ఉత్తమ నగరమును నిర్మించెను . ఆ నగరమునకు 'మధుమంతము ' అని పేరు పెట్టెను . దండుడు నిష్టాగరిష్ఠుడైన శుక్రాచార్యుని తన పురోహితునిగా చేసుకొనెను . అతని పాలనలో పురప్రజలు సుఖసంతోషములతో వర్దిల్లిరి . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                                                                    శశి ,

                                                                       ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





రామాయణము , ఉత్తరకాండ ---- డెబ్బది ఎనిమిదవసర్గ

                             రామాయణము 

                         ఉత్తరకాండ ---- డెబ్బది ఎనిమిదవసర్గ 

రఘురామా! నేను పలికిన మాటలు విని ఆ మహాపురుషుడు అంజలి ఘటించి , " బ్రాహ్మణోత్తమా! నా పూర్వ వృత్తాంతమును తెలిపెదను వినుము . విదర్భ మహారాజు అయిన సుదేవ మహారాజు నా తండ్రి ఆయనకీ ఇద్దరు కుమారులు నా పేరు స్వేతుడు   , తమ్ముడి పేరు సురథుడు మా తండ్రి స్వర్గస్తుడైన పిమ్మట ప్రజలు నన్ను విదర్భకు రాజుగా పట్టాభిషిక్తుడిని చేసితిరి . నేను న్యాయముగా ధర్మ మార్గం లో ప్రజలను కాపాడుతూ , వేయి సంవత్సరములు రాజ్యపాలన చేశాను . ఒక రోజు నా ఆయుః ప్రమాణము తెలిసి నా తమ్ముడైన సురధుడిని రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి ఈ సరోవర తీరమునకు చేరి . మూడువేల సంవత్సరాల కాలము తీవ్రముగా తపస్సు చేసినాను . పిమ్మట సూక్ష్మ శరీరంతో సత్యలోకమును చేరాను . అయినను నన్ను ఆకలి దప్పులు బాధింప సాగినవి . ఆ భాధను తట్టుకోలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి " దేవా! బ్రహ్మలోకము వచ్చినను ఆకలి దప్పులు నన్ను విడిచి పెట్టుట లేదు . నేను చేసిన పాపము ఏది? . ఇప్పుడు నాకు ఆహారము ఏమిటో దయచేసి తెలుపుము . " అని ప్రార్ధించాను . 
నా మాటలు విన్న బ్రహ్మదేవుడు " నాయనా! నీవు తపస్సుకు ప్రాధాన్యమియ్యక నీ శరీర పోషణ యందే శ్రద్ద కనపరిచితివి . బిక్షాటన చేయుచూ వచ్చిన యతీశ్వరులకు గాని, అతిధి దేవుళ్ళకి గాని భిక్షపెట్ట కుంటివి . దేవతలకు గాని పితృ దేవతలకు గాని స్వల్పంగా అయ్యినా దానము చెయ్యక ఏకాగ్రతలేని , తపస్సు ఆచరించుచూ వచ్చితివి . కావుననే  నీకు స్వర్గము చేరినప్పటికీ ఆకలి దప్పుల బాధ తీరకుండెను . భూలోకంలో పడి  ఉన్న నీ శరీరమే నీకు ఆహరం నాయనా! మహా పురుషుడైన అగస్త్య మహాముని ఈ వనమున అడుగిడిన పిమ్మట నీవు ఈ పాపమునుండి విముక్తి పొందుదువు . సౌమ్యా! ఆ మహానుభావుడు దేవతలను సైతం తరింప చేయగల సమర్థుడు . ఇక నిన్ను ఉద్దరించుట ఆయనికి ఒక క్లిష్ట విషయం కాదు . " అని పలుకగా ఆ నాటి నుండి నేను నా కళేభరమునే ఆహారముగా భక్షించుచున్నాను . అనేక సంవత్సరముల నుండి నేను భక్షించుచున్నపటికి ఇది ఏమాత్రం తరుగలేదు . మహాత్మా! నాకు ఈ పాపము నుండి విముక్తి కలిగించుము . కారణం జన్ముడవైన నీకు తప్ప మరెవ్వరికీ ఇది సాధ్యముకాదు . ద్విజోత్తమా ! ఈ ఆభరణమును స్వీకరించుము . ఈ దివ్యాభరణము నీకు బంగారమును ధనమును , వస్త్రములను , భక్షభోజ్యములను , సమస్త  భోగ్య పదార్ధములను నీకు సమకూర్చ గలదు . ఇక నీవే నాకు దిక్కు " అని ప్రార్ధించగా ఆ మాటలు విని అతడు అందించుచున్న ఆభరణమును తీసుకున్నాను . వెనువెంటనే శవము అదృశ్యమయ్యెను . అది చూసి సంతోషించిన స్వెతుడు పరమానందంతో స్వర్గమునకు వెళ్లెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                                                                        శశి ,

                                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము, ఉత్తరకాండ ---- డెబ్బది ఏడవసర్గ

                             రామాయణము 

                              ఉత్తరకాండ ---- డెబ్బది ఏడవసర్గ  

అగస్త్యుడు శ్రీ రాముడితో " రామా! పూర్వం ఒక మహారణ్యం ఉండేది . దాని వైశాల్యం వంద యోజనములు . అందులో మృగములు కానీ , పక్షులు కానీ లేకుండెను . ఆ వనం లో తపస్సు చేయదలచి అరణ్యమంతా తిరిగితిని . అక్కడ అనేక రకముల వృక్షాలు రుచికరములైన ఫలములు కలవు . ఆ అరణ్య మధ్యభాగంలో ఒక మహా సరస్సు కలదు . ఆ సరస్సులో అనేక పద్మములు, కలువలు కలవు . హంసలతో చక్రవాకంతో మిక్కిలి మనోహరంగా కలదు . దానిలోని నీరు మధురంగా ఉండెను . ఆ సరస్సు సమీపంలో ఒక ఆశ్రమం కలదు . అది పురాతనమైనదీ అత్యంత పవిత్ర మైనది . అందులో ఎవరు లేకుండిరి . పురుషోత్తమా! అక్కడ వేసవికాలమునందు నేను ఒక రాత్రి నివసించితిని . 
ప్రాతఃకాలమే లేచి స్నానమునకై సరోవర తీరమునకు వెళ్లితిని . అక్కడ దృడంగా ఉన్న ఒక యువకుని శవం  కనిపించింది "ఇది ఏమి?" అని ఆలోచిస్తూ నేను అక్కడ నిలబడి ఉన్నాను .అప్పుడు అత్యద్భుతంగా ఉన్న హంసలు పూన్చబడి ఉన్న ఒక దివ్య విమానం కనిపించింది . ఆ విమానంలో వేలకొలది  అప్సరసలచే సేవింప బడుచున్న దివ్యమైన ఆభరణాలను ధరించిన ఒక మహా పురుషుడు ఉన్నాడు . అతడు నేను చూస్తుండగానే విమానం నుండి కిందకి దిగి అక్కడ ఉన్న శవమును భక్షించుచున్నాడు . పిమ్మట అతడు సరస్సులోకి దిగి శుద్ద ఆచమనము (చేతులు , నోరు  శుభ్రపరుచుట ) గావించి, తిరిగి విమానము ఎక్కుటకు సిద్దపడగా నేను అతనితో "అయ్యా! దేవతా స్వరూపుడవైన నీవు ఎవరు ? నింద్యమైన ఇట్టి ఆహారము ఎలా భుజించితివి ? దయతో తెలుపుము . " అని ప్రశ్నించితిని .  

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియేడవసర్గ సమాప్తము . 

                                                                                       శశి ,

                                                                                   ఎం . ఏ ,ఎం. ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Wednesday 29 December 2021

రామాయణము ఉత్తరకాండ ---- డెబ్బది ఆరవసర్గ

                               రామాయణము 

                      ఉత్తరకాండ ---- డెబ్బది ఆరవసర్గ 

శ్రీ రాముడు పలికిన మాటలు విని అధోముఖుడై ఉన్న ఆ తాపసి అట్లే ఉండి " మహా యశస్వి నేను శూద్రుడను , నా పేరు శంభుకుడు , నేను ఈ శరీరంతోనే దివ్యత్వం పొందగోరుచున్నాను . అంతే కాదు దేవలోకమును జయింప దలచి ఇట్టి ఉగ్రతపస్సుకు పూనుకుంటిని . " అని పలికెను . ఆ మాటలు  విన్న శ్రీ రాముడు వెంటనే తన ఖడ్గమును తీసి అతడి శిరస్సు ఖండించెను . ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి శ్రీ రాముడిని మాటిమాటికి ప్రశంసించిరి . అప్పుడు అన్ని వైపుల నుండి శ్రీ రాముడిపై పూల వాన కురిసెను . అప్పుడు దేవతలు " రామా! నీవు చేసిన ఈ కార్యం దివ్యమైనది లోకకళ్యాణదాయకం కావున , ఇష్టమైన వరమును కోరుకొనుము " అని పలికిరి . 
ఆ మాటలు విన్న శ్రీ రాముడు అంజలి ఘటించి " నాయందు దేవతలు ప్రసన్నులైనచో బ్రాహ్మణ బాలుడు జీవించుగాక, నాకు ఈ ఒక్క వరము చాలు . " అని పలుకగా , ఆ మాటలు విన్న దేవతలు మిక్కిలి సంతోషించి " రామా! నీవు ఆ శూద్రుడిని సంహరించిన క్షణమే ఆ బాలుడు పునర్జీవితుడైనాడు . ఇక మా వరం తో పనిలేదు . నీకు మేలు చేకూరును శుభములు పొందగలవు . మహా తేజస్వి అయిన  అగస్త్యమహర్షి జలములనే శయ్యగా చేసుకొని పన్నెండు సంవత్సరములుగా తపస్సు చేయుచున్నాడు . ఆయన దీక్ష సమాప్తమైనది.  మేము ఆయనని  అభినందించుటకై అక్కడికి వెళ్లుచున్నాము . నీవు కూడా రా! నీకు మేలగును . అని పలుకగా రాముడు అట్లే అని తన పుష్పకముతో దేవతల విమానములు అనుసరించి అగస్త్య మహాముని ఆశ్రమం వైపుగా వెళ్లెను . 
అగస్త్యముని తన ఆశ్రమమునకు వచ్చిన దేవతలని చూసి పూజించెను . దేవతలు ఆయన్ని అభినందించిరి . పిమ్మట వారంతా తమతమ స్థానములకు వెళ్లిరి . దేవతలు వెళ్లిన పిదప శ్రీ రాముడు పుష్పకము నుండి దిగి అగస్త్యమహామునికి అభివాదం చేసెను . ఆ మహాముని శ్రీ రాముడిని ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసి " రఘురామా! నీకు స్వాగతం నా అదృష్టం కొద్దీ నీ దర్శనం లభించినది . అర్హతలేనివాడు తపస్సు  చేయుటకు పూనుకొనగా నీవు అతన్ని హతమార్చి ఇక్కడికి వచ్చావని దేవతలు నాకు చెప్పెను . నీ వలన ఆ బ్రాహ్మణ సుతుడు పునర్జీవితుడైనాడు ఈ రోజు నీవు ఇక్కడే విశ్రమించి రేపు ఉదయమే అయోధ్యకు వెళ్లుము . రామా! ఇది విశ్వకర్మ నిర్మించిన దివ్యాభరణము ఇది అద్భుతమైన ఆకృతిచే కాంతులచే తేజరిల్లుచున్నది.  నా తృప్తికొరకు దీనిని స్వీకరింపుము . దీన్ని ధరించుటకు ఇంద్రాది దేవతల కంటే కూడా నీవే అర్హుడవు . " అని పలికెను . 
శ్రీ రాముడు "తపోధనా ఈ దానం పుచ్చుకోనుటకు బ్రాహ్మణుడే తగిన వాడు.  క్షత్రియుడైన నేను అందునా బ్రాహ్మణుని నుండి దానం పుచ్చుకొనుట ఎంత వరుకు సమంజసం . దయతో ఈ విషయమును వివరింపుము . " అని పలుకగా అగస్త్యుడు " రామా! పూర్వకాలమున కృతయుగమున ప్రజలకు రాజులేకుండెను . దేవతలకు మాత్రం ఇంద్రుడు ప్రభువుగా ఉండెను . అప్పుడు అందరు బహ్మదేవుడిని ప్రార్ధించగా ఆయన ఇంద్రాది దిక్పాలకులని ఆహ్వానించి విషయము వివరించి " మీరందరు మీ తేజస్సుల్లో ఒక్కొక్క అంశమును ఇవ్వండి ఆ అంశాలతో ఒక పాలకుడు ఏర్పడును . " అని పలుకగా అప్పుడు ఇంద్రాది లోకపాలకులు తమ తేజస్సునుండి ఒక్కొక్క అంశను బ్రహ్మదేవుడికి సమర్పించిరి . ఆ సమయంలో బ్రహమ దేవుడికి ఒక తుమ్ము వచ్చెను . ఆ తుమ్ము నుండి 'క్షుపుడు అను వాడు ఆవిర్భవించెను . లోకపాలురు ఇచ్చిన అంశలతో బ్రహ్మ దేవుడు క్షుపుడిని తీర్చిదిద్ది ప్రజలకు ప్రభువుగా నియమించెను . 
పిమ్మట ఆ క్షుపుడు ఇంద్రుడి తేజాభాగముతో రాజ్యము పరిపాలించ సాగేను . వరుణ దేవుడి అంశతో ప్రజలకు పుష్టి చేకూర్చెను . కుబేరుడి తేజస్సుతో ప్రజలకు సిరి సంపదలు సమకూర్చెను . యముడి తేజస్సుతో దండనా  విభాగమును నిర్వహించెను . రామా! ఇంద్రాది దిక్పాలకుల తేజోభాగములో నీలోను వర్ధిల్లు చున్నవి . కావున నేను సమర్పిస్తున్న ఈ ఆభరణమును స్వీకరింపుము " అని పలుకగా శ్రీ రాముడు ఆ ఆభరణమును స్వీకరించి " మహాత్మా ఈ ఆభరణము అత్యద్బుతముగా ఉన్నది అమోఘమైన దీని ఆకారము దివ్యముగా ఉన్నది . ఇది మీకు ఎలా ప్రాప్తించింది? నాలోని కుతూహలము కొద్దీ నిన్ను అడుగు చున్నాను . " అని అడుగగా అగస్త్యుడు " ఓ మహాబాహు! ఈ వనము నందే ఒక రమణీయ ప్రదేశములో ఒక దివ్య పురుషుడి నుండి నేను దాన్ని స్వీకరించితిని " అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియారవసర్గ సమాప్తము . 

                                                                          శశి ,

                                                                                           ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

 

రామాయణము , ఉత్తరకాండ --- డబ్బది ఐదవసర్గ

                           రామాయణము 

                      ఉత్తరకాండ ------ డెబ్బది ఐదవసర్గ 

                

నారదుడు పలికిన మాటలు విన్నంతనే శ్రీ రాముడు చాలా సంతోషించి లక్ష్మణుడితో " సౌమ్యా ! బ్రాహ్మణోత్తముడి వద్దకువెళ్లి ఆయన్ని ఊరడించు మృత బాలుడి కళేబరం దెబ్బతినకుండా దానిని సుగంధములతో సువాసనలుగల తైలములతో భద్రపరుచునట్లు చూడుము . నిపుణులైనవారిచే భద్రత కల్పించుము . అవయవములు యదాతదంగా ఉండునట్లు రూపం మారిపోకుండా ఉండునట్లు జాగ్రత్తలు తీసుకొనుము . " అని ఆదేశించి పుష్పకమును తలుచుకోగా అది వెనువెంటనే అక్కడకి వచ్చినది . అప్పుడు శ్రీ రాముడు మునీశ్వరులకి నమస్కరించి నగర రక్షణ బాధ్యతను భరత లక్ష్మణులకు అప్పగించి ధనుర్భాణాలు, తుణీరాలు, ఖడ్గము తీసుకొని విమానమును అధిరోహించెను . 
శ్రీ రాముడు పడమర దిశ , ఉత్తర దిశ , పూర్తిగా అంతటా అన్వేషించి అక్కడ ఏ దుష్కృత్యములు జరగకుండుట చూసి , దక్షిణ దిశకు వెళ్లెను .అక్కడ శైవల పర్వతమునకు ఉత్తర భాగమున కల ఒక మహా సరస్సు ఆయనకి కనిపించెను . ఆ సరస్సు తీరంలో తపస్సు చేస్తున్న ఒక తాపసిని  చూసేను . ఆ తపస్వి అధోముఖుడై వ్రేలాడుచుండెను . ఆయన్ని చూసిన శ్రీ రాముడు అతని వద్దకు వెళ్లి " వ్రతనిష్టా గరిష్టుడా ! నీవు ఎవరు? నేను దశరధుని కుమారుడను . నా పేరు శ్రీ రాముడు నీవు ఇంత తీవ్రమైన తపస్సును ఎందుకు ఆచరించుచున్నావు . నీవు కోరుకొనుచున్న వరమేమి?. స్వర్గ భోగములు కావలెనా? , లేక వాటి కంటే మించినది కావలెనా ?, ఏ నిమిత్తమై ఇంతటి తపస్సుకి పూనుకుంటివి? . " అని పలికెను .  

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియైదవసర్గసమాప్తము . 

                                                                                          శశి ,

                                                                                                          ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు  పండితులు . 

 

Tuesday 28 December 2021

రామాయణము ఉత్తరకాండ -డెబ్బదినాలుగవసర్గ

                       రామాయణము 

                     ఉత్తరకాండ -డెబ్బదినాలుగవసర్గ  

దుఃఖశోకములతో బావురుమంటూ బ్రాహ్మణుడు పలికిన దయనీయమైన విలాపవచనములను శ్రీరాముడు వినెను . శ్రీరాముడు దుఃఖసంతప్తుడై వెంటనే మంత్రులను ,వశిష్ట వామదేవాది తపోధనులను ,పురప్రముఖులను ,తన తమ్ముళ్లను పిలిపించెను . 
శ్రీరాముడు తన పిలుపుతో సభకు వచ్చినవారందరినీ చూసి వారికి అంజలి ఘటించి ,పుత్రవియోగ దుఃఖముతో వృద్దబ్రాహ్మణుడు తనను తప్పుపడుతూ పలికిన పలుకులను వారికి తెలిపెను . శ్రీరాముడి మాటలు విన్న నారదమహర్షి "రఘురామా !ఒక రాజు యొక్క దేశములో ఎవడైనా బుద్ధిలేనివాడు అధర్మమునకు ,అకృత్యమునకు ఒడికట్టినచో ఆ రాజ్యములో సంపదలు నశించును . అంతేకాదు రాజుకూడా నరకముపాలగును . ధర్మముగా ప్రజలను పాలించు రాజునకు వేదాధ్యయనము ,తపస్సు ,సుకృతకర్మలు చేయునట్టి ధర్మాత్ముల పుణ్యములో ఆరవభాగము చెందును . నీ రాజ్యమంతా గాలించుము . ఎవడో అధర్మకార్యమునకు వడిగట్టినాఁడు . దాని ఫలితమే ఇది . ఆ అధర్మమును నివారించుటకు ప్రయత్నించుము . అలాచేస్తే ధర్మము వర్ధిల్లుతుంది . అంతేకాదు ,నీకు ప్రజలకు ఆయుర్వృద్ధి కలుగుతుంది . ఆ బాలుడు కూడా పునర్జీవితుడు అవుతాడు . "అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదినాలుగవసర్గసమాప్తము . 

                                                                               శశి ,

                                                                                        ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


 

రామాయణము ఉత్తర కాండ -డెబ్బదిమూడవసర్గ

                           రామాయణము 

                            ఉత్తర కాండ -డెబ్బదిమూడవసర్గ  

శ్రీరాముడు శత్రుఘ్నుడిని మదుపురమునకు పంపివేసిన పిమ్మట ,తమ్ముళ్ళతో కలిసి ధర్మయుక్తముగా పరిపాలనచేయుచుండెను . అలా కొన్నిదినములు గడిచినపిమ్మట ,ఒక వృద్ధ బ్రాహ్మణుడు మృతబాలుని శరీరము తీసుకుని రాజభవనద్వారము వద్దకు వచ్చెను . అతడు దుఃఖముతో పుత్రా !పుత్రా !అని బిగ్గరగా ఏడుస్తూ "నేను పూర్వజన్మలో ఎటువంటి పాపకృత్యములను చేసినానో ఆ పాప ఫలితముగా నా ఏకైక పుత్రుడు మృత్యువాత పడుట చూడవలసి వచ్చినది . నీవు ఇంకనూ పసివాడవు . యవ్వనమున అడుగుపెట్టలేదు  . నీ వియోగముతో నేను ,మీ అమ్మా ,త్వరలోనే మృత్యువుపాలగుట తధ్యము . నేను ఇంతవరకు అసత్యమాడి కానీ ఎవరినీ హింసించి కానీ ,ఏ ప్రాణిని కష్టపెట్టికానీ ఎరుగను . 
ఈ దేశములో బాలురకు మృత్యువు సంభవించుట బట్టీ ,ఈ రాజ్యాధిపతి అయిన శ్రీరాముని దోషము ఇందులో ఎంతోకొంత ఉండితీరును . ఇది నిశ్చయము . రాజా !నీ దేశములో మృతిచెందిన ఈ బాలుని నీవు బ్రతికింపుము . 
లేనిచో దిక్కులేనివారివలె నేను నా భార్య ఈ రాజభవనద్వారము వద్దనే ప్రాణత్యాగము చేసికొందుము . ఆ బ్రహ్మహత్యాపాతకమును అనుభవించుచు కలకలకాలము సుఖముగా ఉండుము . "అంటూ పుత్రవియోగముతో తల్లడిల్లుచున్న ఆ బ్రాహ్మణుడు ఇలా అనేక మాటలచే రాజును తప్పుబడుతూ శోకభారంతో ఆ బాలుని కళేబరమును గుండెలకు హత్తుకొనెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదిమూడవసర్గసమాప్తము . 

                                                                               శశి ,

                                                                                      ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





రామాయణము ఉత్తరకాండ -డెబ్బదిరెండవసర్గ

                        రామాయణము 

                           ఉత్తరకాండ -డెబ్బదిరెండవసర్గ  

శత్రుఘ్నుడు శయనించిననూ ఆయనకు రామాయణ దివ్యగాధే తలపునకు వచ్చి ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు . మరునాడు సంధ్యావందనాది క్రియలని ముగించుకుని వాల్మీకి మహర్షి అనుమతి తీసుకుని అయోధ్యకు వెళ్లెను . అయోధ్యలో శ్రీరాముని దర్శించి పరమానందభరితుడై అభివాదం చేసి ,"మహారాజా !నీవు ఆజ్ఞాపించినట్లుగా లవణాసురుడిని అంతమొనర్చి మదుపురమును పునర్నిర్మాణము చేసితిని . నీకు దూరముగా ఆ నగరములో 12 సంవత్సరములు గడిపితిని . తల్లికి దూరమైన దూడ వలె నేను ఎక్కువకాలం అక్కడ ఉండలేను . "అని పలికెను . 
తమ్ముడిని చూసి అతడి మాటలు విన్న శ్రీరాముడు శత్రుఘ్నుడిని అక్కున చేర్చుకుని ,"మహావీరా !ఏ మాత్రము విషాదమునకు లోను కావద్దు . ఇది క్షత్రియుల లక్షణము కాదు . ఆత్మీయులకు దూరమై అన్యప్రదేశములో వున్నప్పటికి రాజులు దుఃఖింపరాదు . నన్ను కలుసుకొనుటకై అప్పుడప్పుడు అయోధ్యకు వస్తూ వుండు . నాకు కూడా నీవు ప్రాణముల కంటే మిన్న . మనకు రాజ్యపాలన అవశ్య కర్తవ్యము "అని పలికెను . శ్రీరాముడి మాటలను అంగీకరించి శత్రుఘ్నుడు అయోధ్యలో ఏడు రోజులు ఉండి తిరిగి మదుపురమునకు పయనమయ్యెను . అలా మదుపురమునకు వెళ్లుచున్న శత్రుఘ్నుడిని కొంత దూరము భరతలక్ష్మణులు అనుసరించి సాగనంపిరి . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదిరెండవసర్గ సమాప్తము . 

                                                                      శశి ,

                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తరకాండ -డెబ్బదియొకటవసర్గ

                      రామాయణము 

                    ఉత్తరకాండ -డెబ్బదియొకటవసర్గ  

12 సంవత్సరములు గడిచినపిమ్మట శత్రుఘ్నుడు స్వల్ప సంఖ్యలో భృత్యులను ,బలములను తీసుకుని అయోధ్యాపురికి పయనమయ్యెను . శత్రుఘ్నుడు దారిలో ఏడెనిమిది చోట్ల విడిది చేసి వాల్మీకి ఆశ్రమమునకు చేరెను .వాల్మీకి మహర్షి ని దర్శించి పాదాభివందనం చేసి ,మునులు చేసిన అతిధి మర్యాదలు స్వీకరించెను. పిమ్మట వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడితో "పురుషశ్రేష్టా !పాపాత్ముడైన ఆ రాక్షసుడిని నీవు అవలీలగా వధించావు . అతని మృతితో ఈ లోకముల భయము తొలగిపోయి ప్రశాంతి ఏర్పడెను . నీవు ఆ రక్కసుడితో యుద్ధము చేయుచున్న సమయములో ఇంద్రసభలో ఆసీనుడనయి చూసితిని . నీ పరాక్రమము అమోఘము "అని పలికెను .   ఆ రోజు అక్కడే విశ్రమించెను . 
శత్రుఘ్నుడు అతిధి మర్యాదలు స్వీకరిస్తున్న సమయములోనే ,మరొక కుటీరము నుండి కుశలవులు మధురముగా గానము చేయుచున్న రామగానమును వినెను . ఆ గాథ తన కనుల ముందే జరుగుతున్నట్లుగా అనిపించసాగెను . శత్రుఘ్నుడి వెంట వచ్చిన సైనికులు పరస్పరము ఇలా మాట్లాడుకొనుచుండిరి . "ఇదియేమి ?మనము ఇప్పుడు ఎక్కడఉన్నాము ?ఇది కలకాదు కదా !ఈ పవిత్ర వృత్తాంతము మనకు తెలిసినదే . ఈ గాథ ఈ ఆశ్రమములో మరల యధాతధముగా వింటున్నాము . "అని అనుకుని శత్రుఘ్నుడితో "నరశ్రేష్టా !ఇది ఏమి వింత ?దీనిని గురించి వాల్మీకి మహర్షిని అడిగి తెలుసుకొనండి . "అని పలుకగా ,శత్రుఘ్నుడు "మిత్రులారా !ఈ ముని ఆశ్రమములో ఇలాంటి ఆశ్చర్యములు అనేకము జరుగుతుంటాయి . మనము ఆ విధముగా అడుగుట సముచితము కాదు "అని పలికెను .

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియొకటవసర్గ సమాప్తము . 

                                                             శశి ,

                                        ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

 



రామాయణము ఉత్తరకాండ -డబ్బదియవసర్గ

                   రామాయణము 

                   ఉత్తరకాండ -డబ్బదియవసర్గ  

లవణాసురుడు హతుడైనపిమ్మట ఇంద్రాది దేవతలు అగ్నిదేవుడిని ముందు ఉంచుకుని ,శత్రుసంహార దక్షుడైన శత్రుఘ్నుడితో "నరశ్రేష్టా !ముల్లోకవాసులు చేసుకున్న పుణ్యవశాన నీవు లవణాసురుడిని సంహరించావు . మేము నీకు ఒక వరము ఇవ్వాలని ఇక్కడికి వచ్చాము . వరము కోరుకో "అని పలికిరి . 
వారి మాటలు విన్న శత్రుఘ్నుడు వారికి అంజలి ఘటించి ,"దేవతలారా  !ఈ మధుపురి దేవనిర్మితమైనది . మనోహరమైనది . దీనిని రాజధానిగా చేసుకొని నేను ఇక్కడ నివసించెదను . మీ ఆశీస్సులు నాకు లభించటమే నా పాలిటవరము "అని పలికెను . 
శత్రుఘ్నుడి మాటలు విన్న దేవతలు సంతోషించి "నీవు కోరినట్లే అగుగాక !రమణీయమైన ఈ మదుపురము మహాశూరులతో ,సేనతో సుసంపన్నమగును . ఇది నిశ్చయము . "అని పలికి తమతమ స్థానములకు వెళ్లిరి . శత్రుఘ్నుడు తన సేనను అక్కడికి రప్పించి మదుపురములోకి ప్రవేశించి ,ఆ పురమును పరిపాలించుతూ నివసింపసాగెను . 
శత్రుఘ్నుడి పాలనలో ప్రజలంతా నిర్భయముగా సుఖశాంతులతో హాయిగా ఉండిరి . ఆ ప్రాంతములోని పొలములన్నీ సస్యశ్యామలములయినవి . వర్షములు సకాలములో కురవసాగినవి . ప్రజలందరూ ఆరోగ్యభాగ్యములతో వర్ధిల్లుచుండిరి . ఇల్లు ,కూడళ్లు ,రాజవీధులు ,అంగళ్లు మనోహరముగా ఉండెను . అనేక దేశములనుండి వచ్చిన వర్తకులతో ఆ ఊరి వీధులు కిటకిటలాడుచుండెను . శత్రుఘ్నుడు మధురాపురములో 12 సంవత్సరములు నివసించిన పిమ్మట ఆయనకు శ్రీరాముడిని దర్శించవలెననే కోరిక కలిగినది . 

రామాయణము ఉత్తరకాండ డబ్బదియవసర్గ సమాప్తము . 

                                                                      శశి ,

                                                                                      ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము , ఉత్తరకాండ ---- అరువది తొమ్మిదవసర్గ

                             రామాయణము 

            ఉత్తరకాండ ---- అరువది తొమ్మిదవసర్గ  

శత్రుఘ్నుడు లవణాసురునితో " నిశాచరా నీవు ఇదివరుకు అనేక మందిని   చంపి ఉండవచ్చు, కానీ ఈ శత్రుఘ్నుడు వారి వంటివాడు కాదు . నేడు నా బాణాగ్నికి గురై నీవు దగ్ధమై పోయి నేలపాలు  కాగా పౌరులు జానపదులు హాయిగా గాలిపీల్చుకొందురు " అని పలుకగా ఆ మాటలు విన్న లవణాసురుడు భగ్గున మండి  పడుతూ ఒక మహా వృక్షమును పెకలించి శత్రుఘ్నుడి పై విసిరెను . శత్రుఘ్నుడు తన బాణముతో దానిని ముక్కలు ముక్కలు చేసెను . పిమ్మట ఆ  రాక్షసుడు అనేక వృక్షములను ఒకదాని వెంట ఒకటి శత్రుఘ్నుడి పై ప్రయోగించెను . ఆ రఘువీరుడు ఏమాత్రం చలించక తన బాణములతో వాటిని అన్నింటిని ఖండించి వేసెను . పిమ్మట లవణాసురుడు ఒక మహావృక్షమును పెకలించి శత్రుఘ్నుడి శిరస్సుపై తీవ్రముగా కొట్టెను .  అతడు ఆ దాటికి మూర్ఛిల్లెను . 
అది చూసిన ఋషులు , దేవ గాంధర్వఅప్సరసలు బిగ్గరగా హాహాకారములు చేసిరి . మూర్ఛితుడై నేలమీద పడిపోయిన శత్రుఘ్నుడు మరణించినట్లుగా ఆ రాక్షుసుడు అపోహ చెందెను . అందుకనే తన శూళమును తెచ్చుకొనుటకు భవనమునకు వెళ్లక అక్కడే కూర్చొని ,తాను వేటాడి  తెచ్చిన ఆహారమును భక్షింప సాగేను . అప్పుడు శత్రుఘ్నుడు స్పృహలోకి వచ్చి ఎప్పటివలె ఆయుధాలు చేబూని నిలబడెను . పిమ్మట శ్రీరాముడు తనకిచ్చిన దివ్యశరమును ప్రయోగించుటకై బయటకు తీసెను . అది ఉత్తమోత్తమమైనది శత్రుభయంకరమైన దానికాంతులు అన్ని దిక్కులకు  వ్యాపించు చుండెను . అది రూపంలో ,శక్తిలో వజ్రాయుధము వంటిది . అది అన్నికణుపుల  యందు వంకరలు కలిగి భయంకరముగా  ఉన్నది . మేరుపర్వతం వలే ధృడమైనది యుద్ధంలో పరాజయం ఎరుగనిది దానీరెక్కలు మనోహరముగా ఉన్నవి.  ఆ బాణ ప్రభావముచే దేవతలతో సహా సమస్త ప్రాణులు మిక్కిలి భయాందోళనలకు లోనయ్యిరి . 
భయాందోళనకు గురైన దేవాసురులు , గంధర్వులు, మునులు ,అప్సరసలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి " పితామహా! లోకవినాశనం దాపరించిందా? ఇట్టి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ కనీవినీ ఎరుగము.  సమస్త ప్రాణులు కలవర పడుచున్నారు " అని పలుకగా బ్రహ్మదేవుడు " నాయనలారా ! లవణాసురుడుని వధించుటకై శత్రుఘ్నుడు ఒక మహా శరమును చేబూనాడు దాని ప్రభావమే ఇది . అది శ్రీ మహా విష్ణువుకి సంభందించినది . ఆ శరప్రభావము శ్రీ మహా విష్ణువుకి మాత్రమే తెలియును . శ్రీరాముని తమ్ముని చేతిలో లవణాసురుడి సంహారము జరుగును.  ఆ దృశ్యమును మీరు కూడా తిలకింపుడు . " అని పలుకగా దేవతలు అచట నుండి బయలు దేరి యుద్దభూమికి చేరి ఆకాశమునందు నుండి ఆ శరముని చూసేను . ఆకాశములో ఉన్న దేవతలను చూసిన శత్రుఘ్నుడు బిగ్గరగా సింహనాదం చేసి ఆ శరమును ప్రయోగించగా, అది ఆరాక్షసుడి వక్షస్థలమును చీల్చి రసాతలము చేరి మళ్లీ  శత్రుఘ్నుడి తూణీరమునకు చేరెను . 
ఆ లవణాసురుడు మరణించిన వెంటనే పరమ శివుడి మహాశూలము ఆయన వద్దకే చేరెను . అది చూసిన దేవతలు ఋషులు నాగులు అప్సరసలు , అందరు శత్రుఘ్నుడిని పొగడ్తలతో ముంచెత్తిరి . 

రామాయణము ఉత్తరకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                                                                            శశి ,

                                                                                      ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము , ఉత్తరకాండ ------ ఆరువది ఎనిమిదవసర్గ

                            రామాయణము 

                       ఉత్తరకాండ ------ ఆరువది ఎనిమిదవసర్గ  

మరునాడు ప్రాతఃకాలము లవణాసురుడు మాంసాహార సంపాదనకు నగరం నుండి బయలుదేరెను . ఇంతలో మహావీరుడగు శత్రుఘ్నుడు యమునా నదిని దాటి ధనుర్భాణములను ధరించి మధురాపుర ధ్వారమునందు నిలిచి ఉండెను . ఆ రాక్షసుడు మధ్యాహ్న వేలకు అనేక మృగములను వేటాడి వాటిని తీసుకొని వస్తూ శత్రుఘ్నుడిని చూసి " నరాధమా ! ఈ ధనుర్భాణాలతో నన్నేమి చేయగలవు ? నీలాగే అనేక వేలమంది ఆయుధాలతో నాపై రాగా వారందరిని నేను సునాయాసంగా భక్షించి వేసితిని . ఈ రోజు నాకు కావాల్సిన ఆహారము సంపూర్ణముగా లభించలేదు.  నాకు ఆహారమవ్వటానికి నీవు స్వయంగా వచ్చినావు . " అని పలుకుతూ పదేపదే వికటాట్టహాసము చేయుచున్న రాక్షసుడిని చూసి శత్రుఘ్నుడు " దుర్మతీ ! నేను నీతో ద్వంద్వ యుద్ధం చేయగోరుతున్నాను . నేను దశరధ మహారాజు కుమారుడును . శ్రీ రాముడి సోదరుడని . నా పేరు శత్రుఘ్నుడు.  నిన్ను వధించుటకై ఇక్కడికి వచ్చితిని నీవు సకల ప్రాణులకు శత్రుడవు . నాకంట  పడిన పిమ్మట ఇక ప్రాణములతో తిరిగి పోలేవు . " అని పలికెను . 
ఆ మాటలు విన్న రాక్షసుడు అవహేళనగా నవ్వుతూ " దుర్మతీ! నా అదృష్టం కొద్దీ నీవు నేడు నాచేతికి చిక్కావు . రాక్షస రాజైన రావణుడు నాపినతల్లి ఐన సూర్పనఖకు సోదరుడు స్త్రీకారణంగా అతడు రాముడి చేతిలో హతుడయ్యెను . నీ అన్న అతడినే కాక అతని వంశమును కూడా రూపుమాపేను . ఇప్పుడు నేను నీ అంతం ద్వారా అన్నిటికి సమాధానము చెప్పెదను . క్షణకాలం ఆగుము నా ఆయుధమును తీసుకు వచ్చి ఇప్పుడే నాతో యుద్ధముచేయవలననే నీ కోరికను తీర్చెదను . " అని పలికెను . అప్పుడు శత్రుఘ్నుడు " ఓయీ నాచేతికి చిక్కిన నీవు తిరిగి ప్రాణాలతో ఎక్కడికి పోగలవు? నా బాణాలతో నిన్ను యమపురికి పంపెదను . నీ ఆత్మీయులందరిని ఒక్కసారి స్మరించుకో " అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ అరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                                                                    శశి ,

                                                                                         ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము, ఉత్తరకాండ ---- అరువది ఏడవసర్గ .

                            రామాయణము 

                ఉత్తరకాండ ---- అరువది ఏడవసర్గ .  

శత్రుఘ్నుడు యమునానదీ తీరంలో కొంతకాలము విశ్రాంతిగా  గడిపెను . ఒకరోజు శత్రుఘ్నుడు లవణాసురుడి బలము తెలుసుకొనగోరి భృగువంశజుడు అయిన చ్యవనమహర్షితో " బ్రాహ్మణోత్తమా! లవణాసురుడి శూళముయొక్క బలం ఎట్టిది? . ఆ లవణాసురుడు ఇంతకుముందు ఎవరితో యుద్ధంచేసాడు? . అతని చేతులో మరణించిన వారు ఎవరు? " అని పలుకగా చ్యవన మహర్షి " రఘునందనా యుద్ధరంగంలో ఈ శూళముదాటికి అనేక మంది మృతులయ్యిరి పూర్వము ఇక్ష్వాకు వంశపు రాజైన మాంధాత అయోధ్యను పరిపాలించుచుండెను . అతడు మిక్కిలి బలపరాక్రమాలు కలవాడు . ముల్లోకాలలో ఖ్యాతికి ఎక్కినవాడు . భూమండలంలో చాలాభాగము అతని అధికారంలో కలదు . ఇట్లుండగా ఆరాజు దేవలోకమును జయించుటకు పూనుకొనెను . విషయము తెలిసిన  ఇంద్రుడు భయాందోళనకు గురిఅయ్యెను . మాంధాత యుద్దమునకై స్వర్గమునకు వచ్చెను . అప్పుడు ఇంద్రుడు అతనితో" ఓ మహాపురుషా !నీవు మనుష్యలోకమునకు పూర్తిగా రాజువి కాలేదు.  నీవు సమస్త భూతలమును నీ వశంలోకి తెచ్చుకొనిన  పిమ్మట, నీ బలాలతో వాహనాలతో కలిసివచ్చి, స్వర్గమును పరిపాలింపుము " అని పలికెను . 
అప్పుడు మాంధాత " సురపతీ ! భూలోకంలో నా శాసనం చెల్లనిది ఎక్కడ ? " అని ప్రశ్నించెను . అప్పుడు ఇంద్రుడు" పుణ్యాత్ముడా  మదుపుత్రుడైన లవణాసురుడు మధువనమునకు ప్రభువుగా ఉన్నాడు . నీ శాసనం అతడు పాటించడు " అని పలికెను . ఆ మాటలు విన్న మాంధాత సిగ్గుతో తలవంచుకొని మరేమి మాట్లాడక స్వర్గమును వదిలి లవణాసురుడుని జయించుటకై బలములతో మధువనంలో ప్రవేశించెను . పిమ్మట అతడు యుద్ధం చేయగోరి లవణుడి  వద్దకు తన దూతను పంపెను . దూత మాటలు విన్న లవణుడు కోపంతో ఆ దూతను భక్షించి వేసెను . ఎంత సమయం గడిచినా దూత తిరిగి రాకపోవడంతో మాంధాత మిక్కిలి కోపంతో అన్ని వైపుల నుండి శరవర్షం కురిపించెను . అప్పుడా లవణాసురుడు వికృతంగా నవ్వుతూ  తన శూళమును చేతబూని పరివారంతో సహా యుద్ధమునకు దిగెను . 
పిమ్మట ఆ లవణాసురుడు ఆ శూళమును ప్రయోగించగా అది మిరుమిట్లు గొలుపుతూ ఆ మహారాజుని అతని పరివారంతో సహా భస్మం చేసి తిరిగి లవణాసురుడిని చేరెను . శతృఘ్నా! ఆ శూలప్రభావము సాటిలేనిది  . రఘువంశజా! నీవు రేపు ప్రాతఃకాలమునే ఆలవణాసురుడు శూళమును చేబూనకముందే అతడిని వధింప గలవు . ఇది నిశ్చయము . నీవు లవణాసురుడుని వధించుటతో సకల లోకములకు శుభములు చేకూరును . 

రామాయణము ఉత్తరకాండ అరువదియేడవసర్గ సమాప్తము . 

                                                                                                   శశి ,

                                                                                            ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము ,ఉత్తరకాండ -అరువదిఆరవసర్గ

                            రామాయణము 

                               ఉత్తరకాండ -అరువదిఆరవసర్గ  

శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో ఉన్న ఆ రోజు రాత్రే సీతాదేవికి ప్రసవమై ఇద్దరు మగపిల్లలు జన్మించిరి.  ఆ వార్త విన్నవెంటనే వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చి ముద్దులొలుకుతూ, బాలసూర్యునివలె విరాజిల్లుతున్న ఆ బాలురులను చూసిరి . పిమ్మట వారికి రాక్షస , భూతపిశాచ బాధలు కలుగకుండా రక్షావిధులని చేసిరి . ఆ ఇద్దరు శిశువులలో ముందు పుట్టిన  వానికి కుశుడు  అని పేరు, రెండవ వానికి లవుడు అని పేరు పెట్టిరి . 
సీతాదేవి కవలలను కనుట ,వారికి వాల్మీకి మహర్షి ఆజ్ఞతో వృద్దవనితలు రక్షాకార్యక్రమాలు నిర్వహించుట, వారికి పేర్లు పెట్టుట, మొదలగు విషయములన్ని, ఆ అర్దరాత్రియందే  విని శత్రుఘ్నుడు చాలా సంతోషించెను . పిమ్మట అయన తనలో తాను సీతామాత సౌభాగ్యంతో వర్ధిల్లు గాక అనుకొనెను . మరునాడు ప్రాతఃకాలమే సంధ్యావందనాది ప్రాతఃకాల క్రియలు ఆచరించి వాల్మీకి మహర్షి ఆశీస్సులు పొంది పశ్చిమ దిశగా ప్రయాణమయ్యెను . ఏడుదినములు ప్రయాణం చేసి యమునా  తీరములో ఉన్న ఋషీశ్వరుల ఆశ్రమమునందు ఆగెను . కాంచనుడు మొదలగు మహర్షులతో పెక్కు కదా ప్రసంగాలతో విశ్రాంతిగా ఆరోజు రాత్రి గడిపెను 

రామాయణము ఉత్తరకాండ -అరువదియైదవసర్గ

                      రామాయణము 

                                ఉత్తరకాండ -అరువదియైదవసర్గ  

శత్రుఘ్నుడు రెండురోజులు ప్రయాణించి వాల్మీకి ఆశ్రమానికి చేరెను . అక్కడ వాల్మీకి మహర్షికి పాదాభివందనం చేసి ,"శ్రీరాముడి ఆదేశానుసారం ఒక ముఖ్యకార్యముపై సాగిపోవుచూ ఇక్కడికి వచ్చితిని . ఈ రాత్రికి ఇక్కడ ఉండి ,రేపు ప్రాతః కాలమునే బయలుదేరి పశ్చిమదిశగా వెళ్లెదను . "అని పలికెను . 
శత్రుఘ్నుని మాటలు విని వాల్మీకి మహర్షి నవ్వుతూ "యశశ్వీ నీకు స్వాగతము "అని పలికి శత్రుఘ్నుడికి అతిథిసత్కారములు చేసెను . 

రామాయణము ఉత్తరకాండ అరువదియైదవసర్గ సమాప్తము . 

                                                                           శశి ,

                                                                                            ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తర కాండ -అరువది నాలుగవసర్గ

                         రామాయణము 

                        ఉత్తర కాండ -అరువది నాలుగవసర్గ 

శ్రీరాముడు శత్రుఘ్నుడితో "నాయనా !నాలుగువేల అశ్వబలము ,రెండువేల రథబలము ,ఒక వంద గజ బలము నీ వెంట వస్తాయి . వ్యాపారులు నటులు ,నర్తకులు కూడా వస్తారు . యుద్ధోత్సాహముతో వున్న యోధులుకల మహాసేనను అయోధ్యనుండి పంపివేసి ,పిమ్మట నీవు ఒక్కడివే వెళ్లి ధనుర్ధారివై లవణాసురుడుని చేరుము . నీవు యుద్దమునకై వచ్చుచున్న విషయము లవణాసురిడికే కాదు ఎవ్వరికీ అనుమానము కలగని విధముగా నీవు అక్కడికి వెళ్లుము . వర్షాకాలం ప్రారంభము కాగానే ఆ రాక్షసుడిని చంపివేయుము . "అని పలికెను . 
శత్రుఘ్నుడు శ్రీరాముడు పలికిన విధముగా ముందుగా తన బలములను పంపివేసి ,ఒక నెల రోజులు గడిచిన పిమ్మట ,యుద్ధమునకు ప్రయాణమై కౌసల్య సుమిత్ర కైకేయి మాతలకు నమస్కారము చేసెను . శ్రీరాముడికి ప్రదక్షణ నమస్కారాలు చేసి ,పిమ్మట లక్ష్మణుడికి భరతుడికి నమస్కారము చేసెను . పిమ్మట కులగురువు వశిష్ఠుడికి కూడా ప్రదక్షణ పూర్వకముగా నమస్కారము చేసి యుద్దమునకై బయలుదేరెను . 

రామాయణము ఉత్తరకాండ అరువదినాలుగవసర్గ సమాప్తము . 

                                                                                                   శశి ,

                                                                                                               ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

 

Monday 27 December 2021

రామాయణము ఉత్తర కాండ -అరువదిమూడవసర్గ

                    రామాయణము 

                    ఉత్తర కాండ -అరువదిమూడవసర్గ 

శ్రీరాముడు పట్టాభిషేకము చేస్తానని చెప్పగా ,శత్రుఘ్నుడు బిడియపడి అన్నతో "మహారాజా !మీ ఆజ్ఞను శిరసావహింతును . "అని పలికెను . పిదప శ్రీరాముడు తగిన ఏర్పాట్లు చేయించి ,ఎంతో వైభవోపేతముగా శ్శత్రుఘ్నుడికి పట్టాభిషేకము చేసెను . అది చూసి బ్రాహ్మణులు ,పౌరులు ఎంతో సంతోషించిరి . కౌసల్య ,సుమిత్ర ,కైకేయి మొదలగు రాజవనితలు శుభాశీస్సులు పలికిరి . ఋషీశ్వరులు ,యమునాతీరవాసులు అంతా లవణాసురుడు హతమయినట్లే తలపోసిరి . 
పిమ్మట శ్రీరాముడు తన తమ్ముడైన శత్రుఘ్నుడిని తన పక్కన కూర్చొండబెట్టుకుని "నాయనా !నేను నీకొక బాణమును ఇచ్చుచున్నాను . ఇది మిక్కిలి దివ్యమైనది . శత్రుపురములను ధ్వంసము చేయుటలో అమోఘమైనది . శ్రీ మహావిష్ణువు ప్రళయ కాలములో శయనించియున్నప్పుడు ,దుర్మార్గులైన మధుకైటభులు విజృంభించగా వారిని వధించుటకు శ్రీ మహావిష్ణువే దీనిని సృజించెను . ఈ విషయము  సురాసురులకుసైతము తెలియదు . ఆ కారణముగా ఈ శరము ఏ ప్రాణికీ కనిపించదు . శత్రుఘ్నా !ఈ శరము వలన సమస్త ప్రాణులకు భయభ్రాంతులు కలుగుతాయి . ఆ కారణము చేతనే నేను రావణసంహార సమయములో కూడా ఈ శరమును ప్రయోగించలేదు . సోదరా !ఆదిదేవుడైన పరమేశ్వరుడు మధురాక్షుసుడికి ఒక ఉత్తమోత్తమమైన మహా శూలమును అనుగ్రహించాడు . అది మధురాక్షుడి కుమారుడైన  లవణాసురుడికి సంక్రమించింది . అతడు ఆ శూలమును తన భవనము నందు ఉంచి ,నిత్యమూ పూజించుచున్నాడు . పిమ్మట అతడు అన్ని దిక్కులు తిరిగి తనకు నచ్చిన ఆహారమును వేటాడి తెచ్చుకొనును . ఎవరైనా యుద్ధమునకు వచ్చినప్పుడే ఆ శూలమును తీసుకొని శత్రువులను భస్మము చేయును . మిగిలిన సమయములలో అది అతడి భవనములోనే సురక్షితముగా ఉండును . కావున శతృఘ్నా !అతడు తన భవనమున ప్రవేశించక ముందే నీవు అతడిని యుద్ధమునకు ఆహ్వానించి ఆ రాక్షసుడిని సంహరింపుము . అన్యధా అతడి వధ అసాధ్యము "అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ అరువదిమూడవసర్గ సమాప్తము . 

                                                                               శశి ,

                                                                                                  ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Friday 24 December 2021

రామాయణము , ఉత్తరకాండ ------ అరువదిరెండవసర్గ

                            రామాయణము 

                         ఉత్తరకాండ ------ అరువదిరెండవసర్గ 

చ్యవనమహర్షి మాటలు విన్న శ్రీరాముడు ఋషీశ్వరులకు అంజలి ఘటించి" ఆ లవణుడు ఎక్కడ ఉన్నాడు ?. అతని గురించి సవివరముగా నాకు తెలుపుము . " అని పలికెను . ఆ మాటలు విన్న ఋషీశ్వరులు" రామా! ఆ లవణాసురుడు మధువనములోనే నివసించుచున్నాడు . సమస్త ప్రాణులు అందునా ముఖ్యంగా తాపసులు అతనికి ఆహారములు . అతడు ప్రతీరోజు వేలకొలది సింహములను , పెద్దపులులను , లేళ్ళను , ఏనుగులను అట్లే మనుషులను చంపి తన ఆహారముగా చేసుకొనుచున్నాడు . " అని పలికెను . వారి మాటలు విన్న శ్రీరాముడు" ఓ మహాత్ములారా !ఆ రాక్షుసుడి   విషయంలో  మీరు ఇక ఏమాత్రం భయపడనవసరం లేదు " అని వారికి ధైర్యం చెప్పి అక్కడే ఉన్న తన సోదరుల వైపు తిరిగి " సోదరులారా! మీలో లవణుని సంహరింపగల వీరుడు ఎవరు ? " అని ప్రశ్నించెను . అన్న మాటలు విన్న భరతుడు " అన్నా! ఆ రాక్షసుని నేను హతమార్చెదను . ఆకార్య భారము నాకు అప్పగించుము " అని పలికెను . అప్పుడు అక్కడే ఉన్న శత్రుజ్ఞుడు లేచినిలబడి " అన్నా! భరతుడు ఇదివరకు నీవు వనవాసమునకు వెళ్ళినప్పుడు నీరాక కోసం నిరీక్షించుచు అయోధ్యను పాలించెను . ఆ సమయంలో అతడు పెక్కు కష్టములను అనుభవించెను . అతడు భూమిపైనే శయనించుచు జటలు , నారచీరలు ధరించి ఫలమూలములను ఆహారముగా స్వీకరించుచు నందీ గ్రామములోని నివసించెను . ఆ విధంగా పెక్కు దుఃఖములకు లోనయ్యేను . మహారాజా! లవణాసురుడుని సంహరించుటకు ఈ సేవకుడు (నేను) ఉండగా మరలా అతడిని యుద్ధ కష్టములకు పంపుట ఎందులకు " అని పలికెను . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు " శత్రుఘ్నా ! నీవు పలికినది సముచితముగానే ఉన్నది.  భరతుడిని ఇంకా శ్రమపెట్టుట నీకు ఇష్టం లేనిచో వీరుడువైన నీవే ఆ లవణాసురుడి యొక్క నగరంలో ప్రవేశించి అతడిని హతమార్చుము . నిన్ను ఆ రాజ్యమునకు రాజును చేసెదను . నీవు శూరుడవు, యుద్ధాది సమస్త విద్యలు నేర్చినవాడవు . మధురాక్షసుని కుమారుడైన లవణుడు మిక్కిలి పాపాత్ముడు సర్వ సమర్థుడవైన నీవు నా ఆదేశం ప్రకారం అతడిని హతమార్చి ఆ రాజ్యమును ధర్మబద్ధంగా పాలింపుము " అని పలికెను . 

రామాయణము ----- ఉత్తరకాండ , అరువదిరెండవసర్గ -------------- సమాప్తం . 

శశి,

ఎం.ఏ , ఎం.ఏ(తెలుగు),తెలుగు పండితులు . 

Thursday 23 December 2021

రామాయణము , ఉత్తరకాండ ------ అరువదిఒకటవ సర్గ

                                 రామాయణము 

                               ఉత్తరకాండ ------ అరువదిఒకటవ సర్గ  

మహర్షులు ఆ విధముగా తెలుపగా శ్రీ రాముడు వారికీ అభయమిస్తూ , " విషయం తెలపండి ఇక మీకు ఏభయము ఉండదు . " అని పలుకగా ఋషులు " మహారాజ మేము ఉండే ప్రదేశమంతా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నవి . వాటికి గల కారణాలు తెలిపెదము విను , పూర్వము మధువు అనే ఒక మహాసురుడు ఉండెడి వాడు . అతడు మిక్కిలి బలశాలి , దైత్యవంశమునకు చెందినవాడు . లోలపుత్రులలో జ్యేష్ఠుడు . ఆ మధువు బ్రాహ్మణ భక్తి కలవాడు . తనను ఆశ్రయించిన వారికీ తోడ్పడుచుండేవాడు . మిక్కిలి ప్రజ్ఞాశాలి  , దేవతులకు మిత్రుడు . ఆయన శివుడి కోసం పెక్కువేల సంవత్సరాలు తపస్సు చేసెను . ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తన శూలమునుండి మరొక శూలమును సృష్టించి మధువుకి ఇస్తూ " రాక్షసా!  సాటిలేని నీ ధర్మ నిరతికి ముగ్దుడనయ్యాను . కనుకే ఈ ఆయుధమును నీకు అనుగ్రహించాను . నీవు దేవతల పట్ల బ్రాహ్మణుల పట్ల విరోధ భావమును వహించనంతవరుకు ఈ ఆయుధము నీవద్ద ఉండును . నీవు అన్యధా ప్రవర్తించినచో అది అదృశ్యమైపోవును . యుద్ధంలో నిన్ను ఎదిరించినవాడిని ఇది భస్మం చేసి తిరిగి నీచేతికి రాగలదు . " అని వరమిచ్చెను . 
ఆ మాటలు విన్న మధురాక్షసుడు పరమ సంతోషంతో శూలమును గ్రహించి ఆ మహాదేవుడికి ప్రణమిల్లి " సర్వలోక పూజ్యుడవైన దేవాధిదేవ అత్యంత శ్రేష్టమైన ఈ శూలము మా వంశమునకు ఎల్లకాలం దక్కేలా అనుగ్రహించు . " అని పలికెను . ఆ మాటలు విన్న శంకరుడు " ఓయీ నీవు కోరినట్లు జరుగుట అసంభవం . నీ కుమారునికి ఒక్కనికి మాత్రమే ఈ శూలము పనిచేయును . ఈ శూలము ఎవ్వరి చేతిలో ఉంటె వారు సమస్త ప్రాణులకును జయింప శక్యం  కానివాడు . " అని పలికి అంతర్ధాన మొందెను . 
పిమ్మట ఆ మధు రాక్షసుడు ఒక మహభవనమును నిర్మింప చేసి అందు నివాసముండ సాగేను.   అతడి భార్యపేరు కుంభీనసి వారికుమారుడు లవణాసురుడు . అతడు మిక్కిలి భయంకరుడు . బాల్యమునుండి పాపకృత్యములను చేయుచుండెడివాడు . అతడిని చూసి మధురాక్షసునికి మనసు బాధతో నిండిపోయినది . కొంతకాలమునకు ఆ శూలమును తన కుమారునికి అప్పగించి పరమేశ్వరుడి వరం గురించి వివరించి తన రాజ్యమును వీడి సముద్రగర్భమును ప్రవేశించెను . స్వభావము చేతనే దుర్మార్గుడైన ఆ లవణాసురుడు ఆ శూల ప్రభావముచే ముల్లోకములను అందునా విశేషించి తాపసులును మిక్కిలి భాదింప సాగేను . భయంతో పెక్కుమంది ఋషులు అనేక రాజులను ఇంతకుముందు కాపాడమని వేడుకొనిరి కానీ ఎవ్వరు ముందుకురాకుంటిరి . నాయనా !రామా !రావణుడు నీచేతిలో సపరివారంగా హతుడైనట్లు మేము వింటిమి . ప్రస్తుతము నీవు తప్ప మమ్ములను రక్షించువాడు ఎవ్వరు లేరు . మా కోరికని మన్నించి ఆ లవణాసురుడి బారినుండి మమ్ము రక్షించు అని కోరిరి .   

రామాయణము ఉత్తరకాండ అరువదియొకటవసర్గ సమాప్తము . 

                                                                                         శశి ,

                                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

రామాయణము , ఉత్తరకాండ ---- అరువదియవ సర్గ

                             రామాయణము 


                           ఉత్తరకాండ ---- అరువదియవ సర్గ 

రోజులు గడిచిపోవుచున్నవి వసంత కాలము వచ్చెను . ఒక నాడు చ్యవన మహర్షిని ముందుంచుకొని వందకు పైగా  తాపసులు శ్రీ రాముని వద్దకు వచ్చిరి . వారందరిని శ్రీ రాముడు ఎంతో సాదరంగా ఆహ్వానించి , సముచితముగా గౌరవించి , వారు ప్రేమ తో తెచ్చిన నదీ తీర్థములను వివిధ ఫలములను , ఎంతో అభిమానంతో స్వీకరించెను . పిమ్మట వారిని సుఖాసీనులని గావించి అంజలి ఘటించి శ్రీ రాముడు వారితో " మహాత్ములారా ! తమరు ఏ కార్యమునకై ఇచటికి విసినారు సావధానుడనై మీ కార్యములను నిర్వహించుటకు సిద్ధముగా ఉన్నాను . దయతో ఆజ్ఞపించుడు . మహర్షుల మనోరధమును ఈడేర్చుట వలన నాకు పరమానందం కలుగును . ఈ సమస్త రాజ్యము కడకు నా జీవితము మీకే సమర్పితము . ఇది నా పరమాశయము . ఇది సత్యము " . అని పలికెను . 
శ్రీ రాముడి మాటలు విన్న మునులంతా సంతోషంతో " మహోత్తమా ఈ భూమండలమున , నీవు తప్ప అన్యులెవరు ఇట్టి మహోదార వచనములను పలకలేరు . మహా రాజా మిక్కిలి బల పరాక్రమములు కల పెక్కుమంది రాజులను మేము దర్శించి యుంటిమి కానీ వారిలో ఎవ్వరు మేము వచ్చిన పనిని తెలుసుకొని అది అసాధ్యమని భావించిరి . కానీ నీవు మేము వచ్చిన కారణమూ తెలుసుకొనక ముందే మాపై గల గౌరవంతో ప్రతిజ్ఞ చేసితివి . మా కార్యమును నీవు తప్ప మరెవరు నేరవేర్చలేరు . ఋషులకు సంభవించిన ఈ భయంకర పరిస్థితుల నుండి వారిని కాపాడుటకు నీవే సర్వ సమర్థుడవు . 

Wednesday 22 December 2021

రామాయణము , ఉత్తరకాండ ------- అధికపాఠం

                              రామాయణము 

                                ఉత్తరకాండ ------- అధికపాఠం 

ప్రాతఃకాలము అయ్యిన పిమ్మట విద్యుక్తములైన సంధ్యోపాసనాది కార్యక్రమములు నిర్వర్తించుకొని శ్రీ రాముడు పిమ్మట ధర్మసభలో ఆసీనుడయ్యెను . ఆ సభలో పురోహితుడైన వశిష్ఠుడు ,కశ్యపమహర్షి ,బ్రాహ్మణోత్తములు ,వైశ్యప్రముఖులు  ఆసీనులై ఉండగా ఆ ప్రభువు ధర్మ విచారణ చేయుచుండెను . ఆ సభ దేవా సభ వలె విరాజిల్లుతున్నది . అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో "సౌమిత్రీ !నీవు ముఖద్వారం వద్దకు వెళ్లి ,కార్యార్థులు ఎవరైనా ఉంటే వెంటనే ఇక్కడికి తీసుకు రమ్ము ". అని పలుకగా ,లక్ష్మణుడు వెంటనే ముఖద్వారం వద్దకు వెళ్లి తిరిగి వచ్చి శ్రీరాముడితో "అక్కడ ఎవరూ లేరు "అని చెప్పెను . అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో "నాయనా !నీవు ముఖద్వారం వద్దకు మళ్ళీ వెళ్లి ఎవరైనా కార్యార్థులు ఉంటే చూసి తీసుకురమ్మని చెప్పగా "లక్ష్మణుడు తన అన్న శ్రీరాముని ఆజ్ఞను పాటించి తిరిగి ముఖద్వారమునకు వెళ్లి చూడగా ,అక్కడ ఒక కుక్క కనిపించింది . బాధతో పదేపదే మొరుగుతున్న కుక్కని చూసి లక్ష్మణుడు "నీకు ఏమి కావాలి ?"అని కుక్కను అడుగగా ,
ఆ కుక్క లక్ష్మణునితో "ఓ మహానుభావా !సమస్త ప్రాణులకు ఆశ్రయమైన వాడైన శ్రీరాముడితో స్వయముగా  నా బాధను విన్నవించుకోవాలని అనుకుంటున్నాను . "అని పలుకగా లక్ష్మణుడు ఆ కుక్కను సభా భవనమునకు ఆహ్వానించగా ,అప్పుడు కుక్క " ప్రభూ !దేవమందిరము అందు ,రాజభవనము నందు ,బ్రాహ్మణుని గృహము నందు ,అగ్ని ,ఇంద్రుడు ,సూర్యుడు ,వాయువు మొదలగు దేవతలు ఉందురు . కావున శ్రీరాముని ఆజ్ఞ లేనిదే ,అధమ జాతికి చెందిన కుక్కనైన నేను రాజా భవనము లోకి ప్రవేశించలేను . ఈ విషయములన్నీ శ్రీరామచంద్రప్రభువుకి తెలియచేయుము . "అని కుక్క పలుకగా 
లక్ష్మణుడు సభలోకి ప్రవేశించి శ్రీరామునికి శునక విషయము చెప్పి ,ఆయన అనుమతితో శునకమును రాజమందిరమున ప్రవేశపెట్టెను . శునకమును చూసిన శ్రీరాముడు "ఓ శునకమా !నీవు నిర్భయముగా నీ విషయములు వివరించు "అని పలుకగా ,తలమీద పెద్ద దెబ్బతో ఉన్న ఆ శునకము శ్రీరాముడితో "ప్రభూ !సమస్త ప్రాణులకూ రాజే సర్వాధికారి . ప్రజలందరినీ సన్మార్గములో నడిపించువాడు రాజే . ప్రజలు అమాయకస్థితిలో వున్నా ,ప్రభువు జాగరూపుడై వారిని పాలించుచు ఉంటాడు . ప్రజల మంచిచెడులకు రాజే కర్త . రఘువీరా !నాయెడ ఎట్టి దోషమూ లేకున్ననూ సర్వార్ధసిద్దుడు అనే పేరు కల భిక్షువు నన్ను తలపై కొట్టెను . "అని పలుకగా 
శ్రీరాముడి ఆజ్ఞతో ద్వారపాలకులు ఆ భిక్షువును అచటికి తీసుకువచ్చిరి . ఆ విప్రోత్తముడు శ్రీరాముని దర్శించి ,"పుణ్యపురుషా !నేను చేయవలసిన కార్యము నాకు దయతో తెలుపుము . (ఇక్కడకు తీసుకు వచ్చిన కారణము తెలుపుము )అని పలుకగా ,శ్రీరాముడు విప్రుడితో "ద్విజోత్తమా !నీవు కఱ్ఱతో ఈ శునకము తలపై కొట్టితివి . అలా కొట్టుటకు ఇది నీకు చేసిన అపకారమేమి ?"అని ప్రశ్నించగా ,ఆ విప్రుడు "స్వామీ !బిక్ష దొరకక అసహనంతో భిక్షకై తొరుగుతుండగా ,ఇది దారికి అడ్డముగా ఉండెను . 'తొలగిపొమ్ము తొలగిపొమ్ము'అని నేను మందలించిననూ అది నాకు అడ్డు వచ్చుటచే ,కోపముతో దీనిని కొట్టితిని . ఓ రఘురామా !నా అపరాధమునకు నన్ను శిక్షింపుము . నీ చేతిలో శిక్షింపబడినచో ఇక నాకు నరక భయము ఉండదు . "అని పలుకగా 
శ్రీరాముడు తన సభలో ఆసీనులై ఉన్న వారితో "ఇతనికి ఏమి శిక్ష విధించాలో తెలుపుము "అని పలుకగా వారు "బ్ర్రాహ్మణుడికి మరణశిక్ష విధించరాదు ". అని పలికిరి . అప్పుడు శ్రీరాముడితో సహా అందరూ ఏమి శిక్ష విధించాలా ?అని ఆలోచించుచుండగా శునకము శ్రీరామునితో "రామా !నీవు నాయెడ ప్రసన్నుడవైనచో నేను కోరుకున్న వరమును ప్రసాదించుము . మహారాజా !ఈ బ్ర్రాహ్మణుడిని కులపతిగా (మఠాధిపతిగా )చేయుము . అందునా కౌలంచర మఠమునకు అధిపతిగా చేయుము . "అని పలికెను . శ్రీరాముడు శునకము మాటలు మన్నించి ఆ బ్రాహ్మణుడిని మఠాధిపతి పదవిలో అభిషిక్తుడిని చేసెను . అతడు సంతోషముగా గజమును అధిరోహించి వెళ్లిపోయెను . 
సభలోని వారందరూ ఆశ్చర్యపడుతూ "తేజశ్వీ !రామా !ఆ బ్ర్రాహ్మణుడికి వరము ఇచ్చితివి . మఠాధిపత్యము కట్టపెడితివి . ఇది శిక్షించుట ఎట్లగును ?"అని పలికిరి . శ్రీరాముడు వారితో "శునకము ఆ విధముగా కోరుటలో ఆంతర్యము ఉన్నది "అని పలికెను . పిదప శునకము శ్రీరాముని ప్రేరణతో ఇలా మాట్లాడనారంభించెను . "నేను పూర్వ జన్మలో కౌలంచర మఠమునకు కులపతిగా ఉంటిని . అప్పుడు నేను యజ్ఞ శిష్టాన్నము భుజించుచుండెడివాడను . దేవతలను భూసురులను పూజించుటయందు నిరతుడనై ఉంటిని . దేవతా ప్రసాదములను దాసదాసీజనములకు సముచితముగా పంచుచుండెడివాడను . శుభకర్మలయందు అనురక్తుడనై దేవద్రవ్యమును రక్షించుచుండెడివాడను . ఆ కాలమున నేను సచ్ఛీలుడనై  ఉంటిని . ఐనను నేను ఘోరమైన ఆ అధమ జన్మ పొందవలసి వచ్చినది . ఇక ఈ బ్రాహ్మణుడైతే మిక్కిలి కోపస్వభావము కలవాడు . ఇట్టివాడు మఠాధిపతి అయినచో నరకము తప్పదు . అంతేకాదు ఇతని కారణము ముందు ఏడు తరములు వారు ,తరవాత ఏడు తరముల వారునరకయాతనాలకుగురియగుదురు . 
బ్రాహ్మణుని సొత్తును ,దేవాలయ ద్రవ్యమును కాజేసినవాడు ,స్త్రీ బాలుర ద్రవ్యములు అపహరించువాడు ,ఇతరులకు దానమిచ్చిన ధనమును తిరిగి తీసుకునే వాడు ఆత్మీయులతో సహా నశించును . "అని పలికి ఆ శునకము తన స్థానమునకు వెళ్లిపోయెను . పూర్వజ్ఞానము కలది ,మిక్కిలి మనశ్శక్తి కలది ఐన ఆ శునకము కాశీ నగరమునకు చేరి ,అక్కడ నిరశన దీక్ష వహించి తనువును త్యజించేను . 

రామాయణము ఉత్తరకాండ అధికపాఠం సమాప్తము . 

                                                                                        శశి ,

                                                                                      ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు 






Tuesday 21 December 2021

రామాయణము , ఉత్తరకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                            రామాయణము 

                             ఉత్తరకాండ -ఏబదితొమ్మిదవసర్గ  

శుక్రాచార్యుడి  శాపవచనములు విన్నంతనే యయాతి తీవ్రమయిన ముసలి ధనమునకు లోనై ఎంతో క్రుంగి పోయెను . పిమ్మట అతడు తన కుమారుడవైన యదువుతో" నాయనా! నీవు ధర్మజ్ఞుడవు , మిక్కిలి యశస్వివి , నాకోసం నాయీ వార్ధక్యమును నీవు స్వీకరించుము  . " అని అడుగగా , యదువు " ఓ రాజా! నేనా ! నీ ముద్దుల కొడుకయిన పూరువే నీ వార్ధక్యాన్ని స్వీకరిస్తాడులే " అని పలుకగా యయాతి మహా రాజు పూరునితో " కుమారా! నీవు నా వార్ధక్యాన్ని స్వీకరింపుము " అని కోరగా అప్పుడు పూరుడు అంజలి ఘటించి యయాతి తో " తండ్రీ నీ అనుగ్రహమునకు పాత్రుడునైన నేను ధన్యుడను నీ ఆజ్ఞను తల దాల్చెదను . " అని పలికెను . ఆ మాటలు విన్న యయాతి అంతులేని సంతోషం తో పొంగి పోయి యోగబలంతో తన వార్ధక్యమును పూరువుకు సంక్రమింప చేసెను . 
అలా కుమారుని నుండి చక్కని యవ్వనమును పొందిన యయాతి వేల  యజ్ఞములు   ఆచరించెను . పెక్కువేల సంవత్సరముల కాలము రాజ్యము  పాలించెను . ఇలా చాలా గడిచిన  పిమ్మట ఆ రాజు తన కుమారుడైన పూరువుతో " నాయనా ! నీవద్ద న్యాసముగా ఉంచిన నా ముసలి తనమును మరల నాకు ఇచ్చివేయుము . నీవు నా ఆజ్ఞను శిరసావహించినందుకు నేను ఎంతో సంతృప్తుడను అయితిని .   కనుక నేను మిక్కిలి సంతోషం తో ఈ రాజ్యమునకు నిన్నురాజును   చేసెదను . అని పలికి దేవయాని కుమారుడయిన యదువుతో " నీవు నా ఆజ్ఞను  తిరస్కరించితివి . కనుక నీకు గాని, నీ సంతానమునకు గాని రాజ్యాధి కారము లేకుండెను గాక . నేను నీకు తండ్రిని , గురుతుల్యుడను . నీవు నా మాటను కాదని నన్ను అవమానించావు . కావున నీకు భయంకరులు అయిన రాక్షసులు , పిశాచములు జన్మింతురు . నీవు చంద్ర వంశమున జన్మించినప్పటికీ నిన్ను ఈ వంశం నుండి  వెలివేయుచున్నాను . నీవు  దుష్ట బుద్ధివి అయినందున నీవలె నీ పుత్ర పౌత్రాదులు కూడా నీతిలేనివారు అగుదురు' అని శపించి ఆ మహా రాజు తన   కుమారుడు పూరువుకి యవ్వనం తిరిగి ఇచ్చి విధ్యుక్తముగా పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థాశ్రమమును శ్వీకరించెను . పిమ్మట చాలా కాలమునకు యయాతి మహారాజు స్వర్గమునకు ఏగెను . పూరుడు కాశీ రాజ్యమునందలి ప్రతిష్టాన పురం (పాట్నా)ను  రాజధానిగా  చేసుకొని మిక్కిలి ధర్మ బద్దంగా రాజ్య పాలన గావించెను . చంద్ర వంశం నుండి బహిష్కృతుడు అయిన యదువు క్రౌంచ వనమునందలి ఒక పురమున నివసించుచు వేల కొలది పుత్రులను పొందెను . 
యయాతి మహా రాజు క్షత్రియ ధర్మమును  అనుసరించి శుక్రాచార్యుని శాపమును అనుభవించెను . కానీ నిమి వశిష్ట మహాముని శాపమును సహించక ప్రతిశాపము ఇచ్చెను . " అని శ్రీరాముడు లక్ష్మణుడితో పలికెను . ఇంతలో సూర్యోదయము అయ్యెను . 

రామాయణము ఉత్తరకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                                                                   శశి ,

                                                                         ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









రామాయణము, ఉత్తర కాండ - ఏబది ఎనిమిదవ సర్గ

                              రామాయణము 

                                                                                                                                                                                                                                                                                                                                                                            ఉత్తర కాండ - ఏబది ఎనిమిదవ సర్గ

లక్ష్మణుడు తన అన్న అయిన శ్రీ రాముడు తెలిపిన గాధలను విని తన అన్నతో " మహా రాజా ! మీరు చెప్పిన గాధలు మిక్కిలి అద్బుతమయినవి ఎంతో ఆశ్చర్య కరమైనవి నిమి మహారాజు క్షత్రియుడు శూరుడు , మీదు మిక్కిలి యజ్ఞ దీక్షలో ఉన్నవాడు అట్టి మహారాజు మహాత్ముడయిన వశిష్ఠుడి విషయంలో సహనము చూపకుండుటకు గల కారణమేమిటి? . " అని అడుగగా శ్రీ రాముడు " మహావీరా! మనుషులు కొన్ని కొన్ని సందర్భాలలో తమ సహనమును కోల్పోవు చుందురు ఇది అత్యంత సహజము . దీనికి ఉదాహరణగా యయాతి మహారాజు కథ చెప్పెదను వినుము . 
నహుషుడి కుమారుడయిన యయాతి అనుక్షణము ప్రజల అభివృద్ధికై పాటుపడు చుండెడి మహారాజు . ఆయనకి ఇరువురు భార్యలు . వారుఇరువురు ఈలోకమున సాటిలేని సౌందర్య వతులు . వారిలో ఒక భార్య దైత్య వంశమునకు చెందిన వృషపర్వుని కుమార్తె అయిన శర్మిష్ట . మరో భార్య దైత్య గురువైన శుక్రాచార్యుని కుమార్తె . ఆమె సౌందర్యవతే అయినను రాజుకు ఆమె పై ఎక్కువ ప్రేమ లేకుండెను . ఆ ఇరువురికి చక్కని కుమారులు కలిగిరి . శర్మిష్ట కుమారుని పేరు పూరుడు . దేవయాని కుమారుని పేరు యదువు . 
పూరుడు తన సుగుణ సంపద చేత తల్లి శర్మిష్ట కారణముగా తండ్రికి ప్రీతీ పాత్రుడు అయ్యెను . ఈ విషయములో మనస్తాపము చెందిన యదువు తన తల్లి అగు దేవయానితో ఇట్లనెను . "అమ్మా! పూజ్యుడు , క్లిష్ట కార్యములను సైతం అవలీలగా సాధింప గల ప్రజ్ఞా శాలి అయిన శుక్రాచార్యుని కుమార్తెవు కదా అట్టి మహాత్ముని వంశమున పుట్టిన నువ్వు తీరని దుఃఖమును దుర్భరమయిన అవమానమును మనస్సులోనే భరించుచున్నావు . ఇట్లు అవమానముల పాలగుచు జీవించుట కంటే మనము అగ్నికి ఆహుతి అగుటయే యుక్తము.  రాజుని ఆ శర్మిష్ట తోనే, ఆమె కుమారులతోనే సంతోషముగా ఉండనివ్వు . ఒక వేళ నీవు ఈ దురవస్థ సహించ గలిగితే సహించు నాకు మాత్రం అట్టి శక్తీ లేదు . నేను ప్రాణ త్యాగం చేయుటకు నాకు అనుమతి ఇవ్వు . ముమ్మాటికీ నేను ప్రాణ త్యాగము చేసెదను . " అని పలుకగా 
ఆ మాటలు విన్న దేవయాని మిక్కిలి కోపం తో తన తండ్రి అగు శుక్రాచార్యుడిని స్మరించెను . శుక్రాచార్యుడు తన కుమార్తెతో పెల్లుబుగు చున్న దుఃఖము గ్రహించి త్వరత్వరగా ఆమె వద్దకు చేరెను . దీనావస్థలో ఉన్న ఆమె కుమార్తెను చూసి ' అమ్మా! ఇది ఏమి ఇట్లున్నావు ? ' అని అడిగెను . ఆయన ఆ విధముగా ప్రశించగా కోపంతో , బాధతో రగిలి పోతున్న దేవయాని ' తండ్రీ ! మండుతున్న అగ్నిలో ప్రవేశించి కానీ, విషము త్రాగి కానీ , నీళ్లలో దూకి కానీ , నా జీవితమును చాలించెను . నాకు జరిగిన అవమాన భారమును భరించ లేకున్నాను  . భార్గవ ఆ రాజర్షి నీయందు అనాదరణ  భావం చూపుచున్నట్లే నాయందును అనాదరణ  భావమునే కలిగి ఉన్నాడు . అతడు నన్ను ఏమాత్రము గౌరవించుట లేదు " . అని దేవయాని పలుకగా ఆ మాటలు విన్న శుక్రాచార్యుడు మిక్కిలి కోపించి యయాతిని ఇట్లు శపించెను . " యయాతి నీవు చేసిన దోషమునకు కాను నీవు తీవ్రమైన వార్ధక్యమునకు గురై మిక్కిలి అశక్తుడవు అగుదువు . " . ఇలా శపించిన పిమ్మట తన కూతురుని ఊరడించి స్వగృహమునకు వెళ్లెను . 

రామాయణము ఉత్తరకాండ ఏబది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                                                                               శశి ,

                                                                                    ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 















రామాయణము ఉత్తర కాండ ---------- ఏబది ఏడవ సర్గ

                           రామాయణము 

                        ఉత్తర కాండ ---------- ఏబది ఏడవ సర్గ 

శ్రీ రాముడు లక్ష్మణుడి తో "లక్ష్మణా! ఒక కుంభం నుండి సూర్య ,వరుణుల యొక్క తేజస్సు తో  అగస్త్య , వసిష్ఠ మహా మునులు ఉద్బవించిరి . పిమ్మట వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకు గురువై వారి పూజలు అందుకోను చుండెను . 
వసిష్ఠుడికి నూతన దేహము ఆవిర్భవించినది  కదా ఇప్పుడు నిమి గురించి తెలుపుతాను విను . 
నిమి మహా రాజు మరణించిన పిమ్మట ఋషీశ్వరులు అందరు విదేహుడుగా ఉన్న ఆ రాజుని చూసి తామే యజ్ఞ దీక్షను వహించిరి. అచటి బ్రాహ్మణోత్తములు పౌరులతో , భృత్యులతో ఆ మహా రాజు యొక్క దేహమును తైల కటాహమునందు ఉంచి గంధ మాల్యములతో వస్త్రములతో కాపాడిరి . యజ్ఞము ముగిసిన పిమ్మట సంప్రీతులైన దేవతలు నిమి యొక్క ఆత్మతో ' రాజర్షి ఒక వరమును కోరుకొనుము ' అని పలికిరి . అప్పుడు నిమి ఆత్మ' దేవతలారా ! నేను సకల ప్రాణుల నేత్రముల యందు నివసించును గాక '. అని పలికెను . అప్పుడు దేవతలు నీవు కోరుకున్నట్లే సమస్త ప్రాణుల నేత్రములు యందు నివసించుచుందువు . ఓ పృథ్విపతి జీవుల  చక్షువుల యందు వాయు రూపమున చరించుచున్న నీకు విశ్రాంతి గూర్చుటకై ప్రాణులు మాటిమాటికి తమ కన్నులు మూసుకొని చుందురు (రెప్ప వేయుదురు ). ' అని దేవతలు వరమిచ్చి తమ తమ స్థానాలకు వెళ్లిపోయిరి . పిమ్మట ఋషులు నిమి యొక్క దేహమును ఒక అరణిలో ఉంచి నిమికి సంతానము కలిగించుటకై మంత్ర పూర్వకముగా హోమముములు ఒనర్చుచు నిమి దేహమును  మదించిరి . అందుండి ఒక మహా తేజస్వి ఉద్బవించెను . మదించుట వలన కలుగుట చే అతనిని మిథి అని , ఆ విధముగా జన్మించుట చే జనకుడని , విదేహుని నుండి ఆవిర్భవించిన  కారణం చే వైదేహుడు అని ఖ్యాతి వహించెను . ఆయన కారణంగానే ఆ వంశమునకు మిథిల వంశం అనే పేరు ప్రసిద్ధ మయ్యెను " అని శ్రీ రాముడు పలికెను. 

 సమాప్తం ---- రామాయణము ---- ఉత్తరకాండ ---- ఏబదియేడవ సర్గ. 


శశి , 

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగు పండిట్ . 


























Monday 20 December 2021

రామాయణము- ఉత్తరకాండ - యాబది ఆరవసర్గ

                       రామాయణము 

                       ఉత్తరకాండ - యాబది ఆరవసర్గ 

శ్రీ రాముడి మాటలు విన్న సౌమిత్రి అంజలి ఘటించి "రాజా! దేవతలతో సామానులు విదేహులు అయిన వసిష్ఠుడు నిమి మహారాజు మరలా దేహమును పొంద గలిగిరి " అని ప్రశ్నించగా శ్రీ రాముడు " సౌమిత్రి ! తపోధనులు, ధార్మికులు అయిన నిమి వశిష్ఠులు పరస్పరం శపించుకొని దేహములు కోల్పోయి వాయువు వాలే మసలుకోన సాగిరి . వశిష్ట మహాముని తన తండ్రి అయిన బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లెను . బ్రహ్మ దేవుడి పాదములకు ప్రణమిల్లి " లోక నాధా! నిమి యొక్క శాపం వలన నేను విదేహుడనయితిని నాకు మరియొక దేహమును అనుగ్రహించుము . బ్రహ్మ దేవుడు" అట్లే నీ కోరిక తప్పక నెరవేరును . " ఆ మాటలు విన్న వసిష్ఠుడు సంతోషించి బ్రహ్మ దేవుడికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అచట నుండి వరుణ లోకమునకు వెళ్లిపోయెను . 
వరుణ లోకం లో ఊర్వశి చేసిన ఒక తప్పునకు కాను సూర్యుడు ఆమెను "నీవు మనుష్య లోకం చేరి కొంత కాలం అక్కడే నివసింతుము . బుధుని యొక్క పుత్రుడు కాశీ దేశమునకు రాజు అయిన పురూరవుని వద్దకు నేడే వెళ్లుము . అతడు నీకు భర్త కాగలడు ."అని శపించెను . 
సూర్యుడు చెప్పినట్లు ఊర్వశి బుధుడి కుమారుడయిని పురూరవుని వద్దకు వెళ్లెను . వారు ఇరువురికి ఆయువు అనే కుమారుడు కలిగెను . ఆయువు కుమారుని పేరు నహుషుడు . ఇతడు ఇంద్రుని వాలే మహా తేజస్వి . వజ్రాయుధమును ప్రయోగించి వృత్తాసురుడుని సంహరించిన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకొనగా ఆ సమయంలో నహుషుడు ఇంద్ర పదవిని అలంకరించి లక్ష సంవత్సరమునులు స్వర్గమును పరిపాలించెను . 
అలా ఊర్వశి సూర్యుడి శాప కారణంగా భూలోకం లో అనేక సంవత్సరములు ఉండి పిదప స్వర్గ లోకమునకు చేరెను " అని శ్రీ రాముడు పలికెను. 





రామాయణము , ఉత్తరకాండ ------ యాబది ఆరవ సర్గ . 

శశి ,

ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు ), తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తరకాండ -ఏబది ఐదవసర్గ

                          రామాయణము 

                             ఉత్తరకాండ -ఏబది ఐదవసర్గ 

శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో "నాయనా !నృగ మహారాజు వృత్తాంతమును వివరించాను కదా !ఇంకనూ వినవలెనని నీకు కుతూహలము వున్నచో మరో కథను తెలిపెదను వినుము . "అని పలుకగా ,లక్ష్మణుడు "రాజా !ఆశ్చర్యకరములైన ఇట్టి కధలను ఎన్ని విన్నా తనివి తీరదు . "అని పలికెను . 
ఆ మాటలను విన్న శ్రీరాముడు "సోదరా !మహాత్ములైన ఇక్ష్వాకుకుమారులలో నిమి మహారాజు 12వ వాడు . అతడు మిక్కిలి పరాక్రమమవంతుడు, అత్యంత ధర్మనిరతుడు . మహావీరుడైన ఆ రాజు గౌతమముని ఆశ్రమ సమీపములో ఒక పురమును నిర్మింపచేసెను . అది సురపురియైన అమరావతి వలే ఎంతో వైభవోపేతమైనది . ఆ చక్కని నగరమునకు 'వైజయంతము 'అని పేరు . ఆ మహానగరమును నిర్మించిన పిమ్మట నిమి మహారాజు తన తండ్రి ఇక్ష్వాకు మహారాజుని సంతోషపరుచుటకై కొన్ని సంవత్సరములపాటు నిర్వహించే ఒక యాగము చేయ సంకల్పించాడు . ఆయన తన తండ్రితో సంప్రదించి ,ఆ యజ్ఞమును చేయించుటకై మొట్టమొదట బ్రహ్మర్షులలో శ్రేష్ఠుడైన వశిష్ఠమహామునిని ఆహ్వానించెను . 
పిమ్మట నిమి మహారాజు తపోధనులైన అత్రి ,అంగీరసుడు ,భృగువు మొదలైనవారిని కూడా పిలిచెను . అప్పుడు వశిష్ఠుడు నిమితో "ఇంతకు ముందే ఇంద్రుడు ఒక యజ్ఞమును చేయించుటకై నన్ను ఆహ్వానించాడు . నేను ఆ యజ్ఞమును పూర్తిచేసి వచ్చి నీ యజ్ఞమును పూర్తి చేసెదను . నాకొఱకు నిరీక్షించుము . "అని పలికెను . వశిష్ఠుడు వెళ్లిపోయిన పిమ్మట గౌతమ మహర్షి నిమి యొక్క యజ్ఞమును పూర్తిచేసెను . వశిష్ఠుడు ఇంద్రుని యజ్ఞమును పూర్తి చేసి నిమి యజ్ఞమునకు వచ్చెను . అక్కడ గౌతమ మహర్షి తనకు మారుగా యజ్ఞమును పూర్తి చేసి ఉండుట చూసిన వశిష్ఠుడు కోపోద్రిక్తుడయ్యెను . అయినను  రాజ దర్శనమునకై కొంత సమయము అక్కడే కూర్చుండి ఎదురుచూసేను . ఆ సమయములో నిమి మహారాజు గాఢమైన నిద్రలో మునిగి ఉండెను . రాజ దర్శనము కాకపోవుటచే వశిష్ఠుడు మిక్కిలి కోపోద్రిక్తుడై 'రాజా !యజ్ఞ నిర్వహణకు నాకు మారుగా మరొకరిని నిలిపితివి . నన్ను అవమానించితివి . కనుక నీ దేహము చైతన్యరహితముగా అగును . "అని శపించెను . ఆ శాపమునకు క్రుద్ధుడైన నిమి మహారాజు కూడా వశిష్ఠుడిని "నీవు వచ్చిన విషయము తెలియక నేను నిద్రించినాను . ఆకారణముగా నీవు యమదండము వంటి శాపమును ప్రయోగించితివి . బ్రహ్మర్షీ !మిక్కిలి తేజోమహితమైన నీ దేహము కూడా చైతన్యము కోల్పోవును . ఇందు సందేహము లేదు . "అని శపించేను . 
ఆ విధముగా నిమి మహారాజు వశిష్ట మహాముని రోషావేశపరులై ఒకరినొకరు శపించుకుని ,వెంటనే విదేహులైరి . 

రామాయణము ఉత్తరకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                                                 శశి ,

                         ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





Sunday 19 December 2021

రామాయణము ఉత్తర కాండ -ఏబది నాలుగవ సర్గ

                     రామాయణము 

                  ఉత్తర కాండ -ఏబది నాలుగవ సర్గ  

శ్రీరాముడి మాటలు విన్న లక్ష్మణుడు ,అన్నకు నమస్కరించి "అన్నా !రాజర్షి ఐన నృగ మహారాజు చేసిన అపరాధము చిన్నదే అయినప్పటికీ ఆ బ్ర్రాహ్మణోత్తములు ఇచ్చిన శాపము యమదండము వలే మిక్కిలి తీవ్రమైనది . పురుషోత్తమా !క్రుద్ధులైన ఆ ఇరువురు బ్రాహ్మణులు శపించిన పిమ్మట నృగ మహారాజు ఏమిచేసెను ?"అని అడుగగా ,
శ్రీరాముడు "సౌమ్యుడా !నృగ మహారాజు బ్రాహ్మణులు వెళ్లిన పిమ్మట తన మిత్రులను ,మంత్రులను ,పురోహితులను ,పౌరులను పిలిపించి ,వారితో 'నేను బ్రాహ్మణుల శాపమునకు గురి అయ్యాను . నాకుమారుడైన వసువును రాజుగా పట్టాభిషిక్తుడను చేయుటకు ఏర్పాట్లు చేయుము . శిల్పులను రప్పించి ,నాకోసము ఒక గోతిని సిద్దపరుచుము . నాకు బ్రాహ్మణులు ఇచ్చిన శాపకాలము ముగియు వరకు నేను అక్కడే వుంటాను . వర్షములు భాదకు తట్టుకొనునట్లుగా ,మంచు భాద లేకుండా ,గ్రీష్మ తాపమును నివారించునట్లుగా మూడు వేరువేరు గోతులను శిల్పులచే నిర్మింపచేయుము . అక్కడ ఫల వృక్షములను  ,పూలతీగలను ,చక్కగా నీడనిచ్చే వివిధ మహావృక్షములను ,గుబురుగా వుండే పొదలను ఏర్పాటు చేయింపుడు . 'అని ఆజ్ఞ ఇచ్చి తిరిగి తన కుమారుడితో 'పుత్రా !నిత్యమూ ధర్మ నిరతుడవై క్షత్రియ విధులను పాటించుచు ప్రజానురంకంగా పాలన చేయుము . కుమారా !పూర్వజన్మలో చేసిన సుకృత దుష్కృతముల ఫలితముగా మానవుడు వెళ్లవలిసిన ప్రదేశములకు వెళ్ళును ,సుఖదుఃఖములు అనుభవించును . కావున ఇందులకు నీవు వ్యధ చెందవలదు . అని పలికి తన కోసము చక్కగా ఏర్పాటు చేసిన గోతుల వద్దకు వెళ్లి వాటిలో ప్రవేశించెను . ఆయన ఊసరవెల్లిగా (తొండ) మారిపోయెను . అలా నృగ మహారాజు బ్రాహ్మణుల శాప ఫలితాన్ని అనుభవించుచున్నాడు ".అని శ్రీరాముడు లక్ష్మణుడితో పలికెను .   

రామాయణము ఉత్తరకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 


                                                                                      శశి ,

                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Thursday 16 December 2021

రామాయణము ఉత్తరకాండ -ఏబదిమూడవసర్గ

                         రామాయణము 

                       ఉత్తరకాండ -ఏబదిమూడవసర్గ 

లక్ష్మణుడు పలికిన మాటలు విన్న శ్రీరాముడు తమ్ముడితో "నాయనా !నీవు నా మనోభావములను బాగుగా గుర్తించిన బుద్ధిశాలివి . నీవంటి ఆత్మీయుడు లభించుట దుర్లభము.  అందునా ఈ దుఃఖ సమయములో తోడుగా ఉండుట విశేషము . లక్ష్మణా !నేను నాలుగు రోజుల నుండి పౌరకార్యములను పట్టించుకొనుటలేదు . కావున నాయనా !పురోహితులను ,మంత్రులను నా వద్దకు పంపుము . అలాగే కార్యార్థులై వచ్చిన స్త్రీ పురుషులను కూడా ఇక్కడికి పంపుము . నిత్యమూ ప్రజల గురించి ఆలోచించని రాజు ఘోరమైన నరకం పాలవుతాడు . దీనికి సంభందించిన ఒక కథ చెబుతాను విను 
పూర్వము నృగుడు అనే మహారాజు ప్రజాపాలకులలో గొప్పవాడిగా పేరు పొందాడని ప్రతీతి . అతడు వేదములను అధ్యయనము చేసినవాడు . బ్ర్రాహ్మణ భక్తి కలవాడు . సత్యవచనుడు ,మిక్కిలి పవిత్రుడు . ఒకానొక సందర్భములో పుష్కర తీర్థములందు బ్ర్రాహ్మణోత్తములకు బంగారముతో అలంకృతమైన దూడలతో కలిసి వున్న కోటి గోవులను దానము చేసెను . నాయనా ఆ కాలములోనే ఉంఛవృత్తితో జీవించే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు . అతడు నిత్యమూ అగ్నికార్యము నెరపుచుండెడివాడు . ఆ పుణ్యాత్ముడికి దూడతో కలిసిన ఒక ఆవు ఉండేది . రాజు దానము చేసిన కోటి ఆవులలో ఆ ఆవు దూడ కూడా కలిసిపోయాయి . అది గుర్తించని రాజు దానిని కూడా మిగిలిన ఆవులతో పాటు దానము చేసివేసెను . ఆకలిదప్పులతో బాధపడే బ్ర్రాహ్మణుడు తప్పిపోయిన తన ఆవును వెతుకుతూ అక్కడ ఇక్కడ తిరుగసాగెను . ఆలా సంవత్సరము గడిచిపోయెను . ఐనను ఆవును వెతుకుట ఆపలేదు . అలా వెతుకుతూ ,'కనఖలము 'అనే గ్రామమునకు చేరెను . ఆ గ్రామములో ఒక బ్రాహ్మణుడి ఇంట తన ఆవును చూసి గుర్తించెను . ఆ ఆవు ఆరోగ్యముగానే ఉన్నది కానీ దూడ మాత్రము బాగా బక్కచిక్కిపోయినది . అది చూసి వెంటనే ఆ విప్రుడు తన ఆవుని 'శబలా '!రా !'అని ఎలుగెత్తి పిలిచెను . ఆ పిలుపు విని తన యజమానిని గుర్తించి పరుగు పరుగున ఆయన వద్దకు వచ్చి ,ఆయన వెంట నడిచెను . అప్పటి వరకు ఆ ఆవుని పోషించిన బ్రాహ్మణుడు అది చూసి గబగబా నడిచి ఆ విప్రుడి వద్దకు వెళ్లి ,"ఇది నా గోవు . దీనిని నృగ మహారాజు నాకు విధ్యుక్తముగా దానము చేసెను . "అని పలికెను . 
ఆ విధముగా ఆ ఆవు కారణముగా ఆ ఇద్దరి బ్రాహ్మణుల మధ్య తీవ్ర వాదము జరిగెను . వారు ఆ విధముగా వాదించుకుంటూనే ఆ ఆవుని దానము చేసిన నృగ మహారాజు వద్దకు బయలుదేరిరి . వారు రాజభవనమునకు చేరిరి కానీ వారికి అందు ప్రవేశించుటకు ,రాజ దర్శనమునకు అనుమతి లభించలేదు . దాంతో వారిరువురు ఎంతో క్రుద్ధులయ్యిరి . దాంతో వారు మిక్కిలి కోపముతో "కార్యార్థులమై వచ్చిన మాకు నీవు దర్శనము ఈయకుంటివి . అందువలన నీవు సకల ప్రాణులకు కనపడకుండా ఒక తొండవై పడియుందువు . వందలవేలకొలది సంవత్సరాల పాటు ఒక గుంతలో నివసింతువు . ఈ లోకములో యదువంశములో వాసుదేవుడు అనే పేరుతో ఒక మహా పురుషుడు జన్మించును . ఆ మహాత్ముడు ఈ శాపము నుండీ నిన్ను రక్షించగలడు . "అని నృగ మహారాజుని శపించెను . 
పిమ్మట వారు ఆ ఆవుని మరో బ్రాహ్మణుడికి దానముగా ఇచ్చి ,తమ దారిన తాము పోయిరి . వారి శాప ఫలితముగా నృగ మహారాజు దారుణమైన ఫలితమును అనుభవించెను . "
నాయనా !కావున కార్యార్థులై వచ్చిన వారియొక్క వివాదమును పట్టించుకోననిచో ఆ దోషము రాజును చుట్టుకొనును . అందువలన కార్యార్థులై వచ్చిన వారికి వెంటనే నా దర్శనము కలుగునట్లు చూడుము . "అని శ్రీరాముడు లక్ష్మణుడితో పలికెను . 

రామాయణము ఉత్తరకాండ ఏబదిమూడవ సర్గ సమాప్తము . 

                                                             శశి ,

                                                  ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


రామాయణము ఉత్తర కాండ -ఏబది రెండవ సర్గ

                               రామాయణము 

                                ఉత్తర కాండ -ఏబది రెండవ సర్గ 

లక్ష్మణుడు సుమంత్రుడితో కలిసి ఆ రాత్రి కేశినీ నదీ తీరంలోనే గడిపెను . ప్రాతః కాలమే నిద్రలేచి అచటి నుండి బయలుదేరెను . ఆ సౌమిత్రి మధ్యాహ్న సమయమునకు అయోధ్యలో ప్రవేశించెను . మిక్కిలి చింతాక్రాంతుడై వున్న లక్ష్మణుడు 'శ్రీరామునికి ఏమి చెప్పాలి ?ఎలా చెప్పాలి?ఆయనను ఎలా ఓదార్చాలి ?అని పరిపరి విధములుగా ఆలోచించన చేస్తూ రాజా భవనము వైపుగా రధమును నడిపెను . 
రాజా భవనము లోకి ప్రవేశించి ,సింహాసనంపై కూర్చుని ఉన్న తన అన్నను దర్శించి ఆయన పాదములకు ప్రణమిల్లెను . అనంతరము అతడు గుండె దిటవు చేసుకుని ,"ప్రభూ !పూజ్యుడవైన నీ ఆజ్ఞను తలదాల్చి ,ముందుగా ఉద్దేశించిన ప్రకారము ,పవిత్రమైన వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపమునకల గంగా తీరమునందు జానకీ దేవిని విడిచి నీ పాద సేవకై ఇక్కడికి తిరిగి వచ్చాను . విధివిలాసము ఇలా వుంది . పురుష శ్రేష్టా !ధైర్యము వహించి దృఢ చిత్తుడవై ఈ మనోదౌర్బల్యమును వీడుము . "అని పలికెను . 

రామాయణము ఉత్తర కాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 
                           

                                                   శశి ,                                           

                                                                               ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


                                                               

Wednesday 5 May 2021

రామాయణము , ఉత్తరకాండ------------యాబదిఒకటవసర్గ

                               రామాయణము 

                             ఉత్తరకాండ------------యాబదిఒకటవసర్గ  

లక్ష్మణుడి ప్రేరణతో సుమంత్రుడు దూర్వాస మహాముని  పలికిన పలుకులను గురించి ఈ విధముగా చెప్ప సాగెను . లక్ష్మణా! ఒకానొకనాడు  అత్రి మహర్షి కుమారుడైన, దూర్వాస మహాముని వసిష్ఠ మహాముని ఆశ్రమములో చాతుర్మాస్య దీక్షను నడిపెను . మీ తండ్రి తన పురోహితుడైన వసిష్ఠ మహర్షిని దర్శించుటకు ఆయన ఆశ్రమమునకు వెళ్లగా అక్కడ వశిష్ట, దూర్వాస మహామునులు ఇద్దరిని చూసి పరమ సంతోషముతో నమస్కరించెను . వారుకూడా మహారాజుకి స్వాగతం పలికి ఆసనమిచ్చి అర్ఘ్య  పాద్యములతో ఫలమూలాదులతో సత్కరించిరి . పిమ్మట ముగ్గురు కూర్చుని మాట్లాడుకును సంధర్బములో మీ తండ్రి మహా తపోధనుడగు దూర్వాస మహా మునికి అంజలి ఘటించి . ఇలా పలికెను . " ఓ ముని శ్రేష్టా మా ఇక్ష్వాకు వంశము యొక్క  బవితవ్యము ఎట్టిది? . మా కుమారుల ఆయుః సౌభాగ్యములు ఎట్టివి? . వారి పుత్రుల యొక్క ఆయుప్రమాణాలు ఎట్టివి? . ఈ విషయములన్ని తెలుసు కోవాలని చాలా ఉత్సాహముతో ఉన్నాను దయచేసి తెల్పుము . " అని పలికెను . అప్పుడు దూర్వాస మహాముని " మహారాజా ! నేను నీకు ఒక పూర్వ వృతాంతాన్ని చెప్తా విను . ఒకానొకప్పుడు దేవతలకు అసురులకు యుద్ధము సంభవించెను . అప్పుడు దైత్యులు దేవతలకు భయపడి . భృగు మహర్షి భార్యని ఆశ్రయించిరి . ఆమె అభయమిచ్ఛేను . వారు ఆ ఆశ్రమములో  నిర్భయముగా ఉండసాగిరి . అది గమనించిన శ్రీ మహావిష్ణువు కోపించి తన సుదర్శన చక్రంతో భృగుపత్ని  శిరస్సు ఖండించెను . అది చూసి భృగుమహర్షి మిక్కిలి కోపంతో ' జనార్ధన! స్త్రీని , అందునా ఋషి పత్నిని  కోపంతో ఒడలెఱుంగక చంపినావు . కావున నీవు మానవుడవై జన్మిస్తావు . అంతే కాదు ఆ మానవ లోకంలో చాలా కాలం పత్నివియోగాన్ని పొందుతావు అని శపించెను పిమ్మట తాను చేసిన తప్పును తలచుకొని పశ్చాత్తాపంతో తనకు ప్రతి శాపం వచ్చునేమో అని కలవర పడెను ఆ ప్రభువునే ఆరాధించెను . అప్పుడు భక్త సులభుడు అయిన  ఆ మహా విష్ణువు  లోక హితము కొరకు ఆ శాపమును అంగీకరించెను ఆ పరంధాముడే నీ కడుపున రాముడిగా జన్మించెను . భృగు మహర్షి యొక్క శాప ఫలితము అతడు తప్పక పొందును . అతడు అయోధ్యకు రాజై వేల  సంవత్సరములు ప్రజలనురంజకముగా పరిపాలించి తన లోకమునకు చేరును . ఆ శ్రీ రాముడు అశ్వమేధముమొదలైన అనేక యాగాలు సమృద్ధిగా  చేయును . అతనికి సీతాదేవి యందు ఇద్దరు కుమారులు జన్మించును . వారిరువురు అయోధ్యనందు కాక వేరొక చోట జన్మించును . ఆ కుమారులకు రాముడు కోసల రాజ్యమును పట్టము కట్టును . " అని పలికెను . పిమ్మట దశరధ మహారాజు వారిరువురికి తిరిగి నమస్కరించి సెలవు తీసుకొని అయోధ్యకు తిరిగి వచ్చెను . లక్ష్మణా! ఈ విషయములన్నిటినీ నా మనస్సులోనే పదిలంగా ఉంచుకున్నాను వాటిని ఇప్పుడు నీకు వివరించాను . ఇది విధి నిర్ణయము అగుట వలన పరితపించ వలదు ధైర్యము వహించు. " అని పలికెను . ఆ మాటలు విన్న లక్ష్మణుడు చాలా సంతోషించి బలే బలే అని పలికెను . ఆ విధంగా వారిద్దరూ మాట్లాడుకుంటూ సూర్యాస్త సమయమునకు కేశిని నదీ తీరమునకు చేరిరి . 

                             శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 











రామాయణము , ఉత్తరకాండ -------- యాబదియవసర్గ

                               రామాయణము 

                             ఉత్తరకాండ -------- యాబదియవసర్గ 

జనకుడి కూతురైన సీతాదేవి వాల్మీకాశ్రమము చేరినట్లు తెలుసుకొని లక్ష్మణుడి మనస్సు మిక్కిలి పరితాపమునకు లోనయ్యేను . అప్పుడు అతడు సారధి ఐన సుమంత్రుడితో " సారధీ! ఎంతటి వారికైనా విధి నిర్నయం తప్పించుకోలేనిది కదా . నిజంగా శ్రీ రాముడే కోపిస్తే దేవ,దానవ,గంధర్వులను  సైతం పరిమార్చగలడు  . అట్టి రఘువీరుడు తన భార్యను అడవులకు వదిలి నాడు . సీతా సాద్వి విషయములో మంచి చెడులను మరచి నోటికి వచ్చినట్లు మాట్లాడిన పురజనుల మాటలను పాటించి ఇలాంటి క్రూర కృత్యమునకు పాల్పడుట ఎంత వరుకు ధర్మ బద్దం . ఏ విధముగా ఆలోచించినా ఇది ఆయన కీర్తికి గొడ్డలిపెట్టే " అని పలుకగా సుమంత్రుడు" లక్ష్మణా! పూర్వము మీ తండ్రిగారి ఎదుట దైవజ్ఞులు ఈ సంగతిని తెలిపినారు శ్రీ రాముడు సుఖార్హుడే అయ్యినప్పట్లికి కష్టములు తప్పవు ఆత్మీయుల ఎడబాటు తప్పక కలుగును . ఒక సారి మీ తండ్రికి దూర్వాస మహాముని చెప్పిన ఒక రహస్య విషయమును నీకు తెలిపేదెను వినుము . దాన్ని ఎవ్వరికి చెప్పరాదని రాజాజ్ఞ . మహారాజు ఈ విషయముని రహస్యముగా ఉంచమని చెప్పినప్పటికీ నీ బాధని చూడలేక నేను ఆ విషయమును చెప్పుచున్నాను "  అని పలుకగా లక్ష్మణుడు ఆశ్చర్యముతో " ఏమా విషయము ?" అని అడిగెను . 

శశి ,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగు పండితులు .