Thursday 30 June 2016

రామాయణము బాలకాండ -ఇరువదిరెండవ సర్గ

                                రామాయణము 


                                        బాలకాండ -ఇరువదిరెండవ సర్గ 


వశిష్టుని హిత వచనములను దశరధుని ముఖము వికశించెను . పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను . తల్లి కౌశల్య తండ్రి దశరధుడు రాముని ఆశీర్వదించిరి . పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీస్సులు పలికెను . దశరథ మహారాజు తన ముద్దు బిడ్డ అయిన రాముని మూర్ధమున ఆఘ్రాణించి ప్రసన్నమైన మనస్సుతో అతనిని విశ్వామిత్రునికి అప్పగించెను . ఆ సమయమున విశ్వామిత్రుని పక్కన చేరి వున్న రాజీవలోచనుడైన రాముని చూసి వాయువు వారికి సుఖ స్పర్శ కలిగించుచు దుమ్ములేకుండా వీచెను . మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రుడితో గూడి వెళుతుండగా చక్కగా పూలవాన కురిసేను . దేవదుందుభులు .శంఖములు మధురముగా ధ్వనించేను . విశ్వామిత్రుడు ముందు సాగిపోవుచుండగా జులపాల జుట్టు కల శ్రీరాముడు ధనుర్ధారియై ఆయనను అనుసరించెను . లక్ష్మణుడు ధనువు చేబట్టి  రాముడి ని అనుసరించెను . ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను ,ధనస్సులను ధరించి ,తమ తమ శోభలతో అన్ని దిక్కులను వెలుగులు విరజిమ్ముచుండిరి . 
విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో గూడి సరయు నదికి దక్షిణ తీరమున ఒకటిన్నర యోజనముల దూరము ప్రయాణము చేసిన పిమ్మట 'రామా ' అని మధురముగా సంభోదించి ఇలా అనెను . "నాయనా !ఈ నీటిని గ్రహించి ,ఆలసింపక ఆచమనమొనర్పుము . 'బాల ',అతిబల 'అణు మంత్రములను ఉపదేశించెదను శ్వీకరింపుము . ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట కానీ ఆకలి దప్పులు కానీ ఉండవు . నీ రూపకాంతులు తరగవు . నీవు నిదురించుచున్నను ఏమరపాటున వున్నాను రాక్షసులు నిన్నేమీ చేయలేరు . ఈ మంత్ర ప్రభావమున నీ భాహుబలములను ఎదుర్కొనగలవాడు ఈ భూమండలమున ఎవడును ఉండడు . ఈ భూలోకమునే కాదు ముల్లోకములలో నీకెవ్వరూ సాటిరారు . ఓ పుణ్యాత్ముడా !సౌందర్యము న కానీ ,సామర్ధ్యమున కానీ విషయం గ్రహణము నందు కానీ చక్కగా కార్య నిశ్చయము చేయుటలోకాని ,ప్రత్యుత్తరములు ఇచ్చుటలో కానీ లోకము నందు నీతో సమానుడు ఎవడు లేడు . 'బల ',అతిబల 'అను ఈ మాహా మంత్రములు సమస్త జ్ఞానమునకు మాతృకలు . ఈ రెండు విద్యలు లభించినచో ఇకముందు నీకు దీటైన వాడెవ్వడు వుండడు . ఓ పురుషోత్తమా !రఘురామా !మార్గమునందు 'బల ,;అతిబల 'అను మంత్రములు జపించుచు పయనించినచో నీకు ఆకలి దప్పుల బాధలుండవు .లోక కళ్యాణమునకై ఈ విద్యలు స్వీకరింపుము . ఈ రెండు విద్యలు అభ్యసించినచో నీకు సాటిలేని యశస్సు అబ్భును . ప్రభావాన్వితమైన ఈ రెండు విద్యలు బ్రహ్మ దేవుడినుండి ఆవిర్భవించినవి . 
అంతట శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి ,శుచియై విశ్వామిత్రుడి నుండి బల ,అతిబల విద్యలను స్వీకరించెను . అమిత పరాక్రమశాలి అయిన శ్రీ రాముడు ఆ విద్యలను గ్రహించి శరత్కాలం నందు సహస్ర కిరణుడై సూర్య భగవానుని వలె విరాజిల్లెను . రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు సేవలు ఒనర్చెను . పిమ్మట ఆ ముగ్గురు సరయు నదీ  తీరమందే ఆ రాత్రి గడిపిరి . దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణ శయ్యపై కలిసి పరుండిరి . అయినను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచెను .  

రామాయను బాలకాండ ఇరువదిరెండవ సర్గ సమాప్తము . 


                         శశి ,

ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





















Wednesday 29 June 2016

రామాయణము బాలకాండ -ఇరువదియొకటవ సర్గ

                             రామాయణము 



                                   బాలకాండ -ఇరువదియొకటవ సర్గ 

దశరధుడు ఎటూ దిక్కు తోచనివాడై పుత్రవాత్సల్యముతో తడబడుచు పలికిన మాటలు విని విశ్వామిత్రుడు కుపితుడై ఇలా అనెను . "ఓ రాజా నా అభ్యర్ధన నెరవేరుస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆ మాట తప్పుటకు చూస్తున్నావు . ఇలా ప్రతిజ్ఞా భంగము చేయుట రఘు వంశజులకు తగదు . ఇలా చేయటము మీ వంశమునకే కళంకము . ఇట్లు మాట తప్పుట నీకు యుక్తము అనిపించినచో నా దారిన నేను వెళ్తాను . నీవు నీవారితో కూడి సుఖముగా ఉండు . "సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రుడు ఇలా కోపోద్రిక్తుడు కాగా భూమండలమంతా కంపించెను . దేవతలు భయగ్రస్తులయిరి . నిష్టాగరిష్టుడు ,ధీరుడు ,మహానుభావుడు అయిన వశిష్ట మహర్షి జగత్తంతయు భయముతో చలించుట గమనించి దశరధునితో ఇలా అనెను . 
"ఓ రాజా !నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి . ధర్మమూర్తివి ,ధైర్యశాలివి ,సత్య వ్రతమును పాలించువాడవు . కనుక నీవు ధర్మ హానికి తలపడరాదు . ఓ రఘువంశోద్భవా 'మీ కోరిక నేను  నెరవేర్తును 'అని ప్రతిజ్ఞ చేసి ,ఆ మాటలను నిలబెట్టుకొని వానికి అశ్వమేధ యాగ ఫలము ,నీతులు బావులు తవ్వించిన ఫలము నశించిపోతాయి . కావున విశ్వామిత్ర మహర్షి వెంట రాముని పంపుము . రాముడు అస్త్ర విద్యలో ఆరితేరినవాడు అయినను కాకున్నను ,విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలో వున్న అమృతము వలె ఆయనను రాక్షసులు ఏమి చేయలేరు . ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము ,గొప్ప శక్తి సామర్ధ్యాలు కలవాడు . మిక్కిలి ప్రజ్ఞాశాలి ,ఏ లోకమునందలి తాపసులలో మేటివాడు . వివిధాస్త్ర ప్రయోగములను ఎరిగినవాడు ,చరాచరాత్మకము లైన ఈ మూడు లోకముల లో ఈయనతో సాటి అయిన అస్త్ర ప్రయోగాకుశులుడు  మరియొకడు లేడు . ఇకముందు ఎవ్వరు వుండబోరు . 
పూర్వము విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా కృశాశ్వుడను ప్రజాపతి పరమ ధార్మికులైన తన కుమారులను అస్త్ర రూపములో విశ్వామిత్రునికి ఇచ్చివేసెను . కృశాశ్వుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు ,వారు పెక్కు రూపములు కలవారు . మహావీరులు తేజశ్శాలురు, జయమును గూర్చువారు . జయ ,సుప్రభ అను దక్ష కన్యలు సుందరాంగులు . వారు ప్రకాశవంతమైన ,శత్రు సంహారకములైన నూఱు అస్త్ర ,శస్త్రములను సృష్టించిరి . అసుర సైన్యములను సంహరించుటకు జయ అను ఆమె మిక్కిలి శక్తి సంపన్నులు ,కామరూపులు శ్రేష్ఠులు అయిన  ఏబది మంది కుమారులను కనెను . 'సుప్రభ 'అను ఆమె 'సంహారులు 'అను పేరుకల ఏబది మంది పుత్రులను కనెను . వారు జయింప శక్యము కానివారు . అమోఘ పరాక్రమశాలురు . మిక్కిలి బలవంతులు . 
కుశికుని పుత్రుడైన విశ్వామిత్రుడు ఆ అస్త్రములనన్నింటిని పూర్తిగా ఎరుగును . అంతేకాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టించగలడు . ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు . కావున ఓ రాజా !ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు . విశ్వామిత్రుడు స్వయముగానే ఎదుర్కొనగలడు . నీ కుమారునకు మేలు చేయుటకే నీ వద్దకు వచ్చి నిన్ను ఇలా అభ్యర్ధిస్తున్నాడు . "వశిష్ట మహర్షి హిత వచనములను దశరధుడు ప్రసన్నచిత్తుడై ,మిక్కిలి పొంగిపోయెను . సూక్ష్మ బుద్ది గల ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను . 

రామాయణము  బాలకాండ  ఇరువదియొకటవ సర్గ సమాప్తము . 


                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  
















                                

Tuesday 28 June 2016

రామాయణము బాలకాండ -ఇరువదియవ సర్గ

                               రామాయణము 

          

                           బాలకాండ -ఇరువదియవ సర్గ 

దశరథ మహారాజు  ఆ విశ్వామిత్రుని మాటలు విని క్షణ కాలము నిశ్చేష్టుడయ్యెను . పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇలా అనెను . "రాజీవలోచనుడు అయిన నా రాముడు 16 యేండ్లు వయస్సు కూడా నిండనివాడు . కనుక ఇట్టి చిన్ని వయసులో ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధము చేయగలడని నేను అనుకోవడం లేదు . ఇదిగో !ఈ అక్షౌహిణి సేనకు నేను అధిపతిని . ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిశాచరుల (నిశ అనగా రాత్రి , నిశ సమయములో చరించు వారు ,రాక్షసులు )తో పోరాడతాను . ఈ నా భటులు శూరులు పరమ పరాక్రమ శాలురు . వివిధాస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు . రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు . దయచేసి శ్రీ రాముని మాత్రము కొరవలదు . నేనే ధనుర్భాణములు పట్టి మీ యాగ సంరక్షణ చేయగలను . యుద్ధ రంగమున సేనలకు ఆధిపత్యము వహించి నా కంఠము లో ప్రాణము ఉన్నంతవరకు పోరాడతాను . కనుక రాముని పంపవలసిందిగా కోరవద్దు . రాముడు పసివాడు ఇంకా ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు . శత్రువుల బలాబలాలు పసిగట్టలేడు . అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు . యుద్దములో ఆరితేరినవాడు కాదు . రాక్షసులు అందరూ కపట యుద్ధమున నిగ్గుదేలినవారు . కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు . 
రాముడిని ఎడబాసి క్షణ కాలము కూడా నేను ఉండలేను . కావున ఈ పసివాడిని కొరవద్దు . యజ్ఞ వ్రతము చేపట్టిన ఓ బ్రహ్మర్షీ !తప్పనిసరిగా రాముని వెంట తీసుకు వెళ్లదలిచినచో నేను కూడా నా చతురంగ బలములతో వెంట వస్తాను . 60,000 సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది కష్టములను భరించియజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను . నా నలుగురు కుమారులలో రాముడంటే నాకు అత్యంత ప్రేమ పైగా ఇతడు పెద్దవాడు . కనుక రాముని తీసుకెళ్లవలదు . ఓ మునీశ్వరా !ఆ రాక్షసులెవరు ?వారి పరాక్రమము ఎట్టిది ?వారు ఎవరి కుమారులు ?వారి ఆకారములు ఎట్టివి ?వారికి ఎవరి అండ కలదు ? ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలుపవలెను ?అంతయు నాకు విశద పరుచుము . "అని పలికిన దశరధుని మాటలు విని విశ్వామిత్రుడు ఇలా పలికెను . 
"రావణుడు అను  రాక్షసుడు పౌలస్త్య వంశమున జన్మించెను . అతడు మిక్కిలి బలవంతుడు . గొప్ప పరాక్రమశాలి అతడికి పెక్కు రాక్షస బలములు కలవు . పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందెను . అతడు ఆ వార గర్వము చే లోకములను న భాదించుచున్నాడు . రాక్షస రాజైన ఆ రావణుడు 'విశ్రవసుడి 'కుమారుడు . కుబేరుని సోదరుడు . యజ్ఞమును విఘ్నము కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయముగా పాల్గొనలేదు . కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు సుబాహువు అను మహా బలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నము కలిగించుచున్నారు . "
విశ్వామిత్ర మహర్షి ఇలా పలుకగా దశరధుడు ఆ మునితో ఇలా అనెను . "దేవతలు ,దానవులు ,గంధర్వులు ,యక్షులు ,గరుత్మంతుడు ,నాగులు మొదలగు వారెవ్వరు యుద్దములో రావణుని ఎదుర్కొనలేరు . ఇంకా మానవుల విషయము చెప్పనేల ?ఆ రావణుడు యుద్ధ భూమిలో శత్రువుల బల పరాక్రముములను హరించి వేయును . కావున ఓ మునిపుంగవా !నేను నా సైన్యముతో కూడి కానీ పుత్ర సహితుడనై కానీ అతనిని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను . యజ్ఞమునకు విఘ్నము కలిగించు చున్న మారీచ ,సుబాహులు సుందోపసుందల కుమారులు ,యుద్ధమున వారు యమునితో సమానులు . కనుక నా ముద్దు బిడ్డడు రాముడిని మీతో పంపలేను . "
బ్రాహ్మణోత్తముడు ,కుశికుని వంశమువాడు ,మహా పురుషుడు అయిన విశ్వామిత్రుడు అసంగతములైన దశరధుని మాటలకు ఆగ్రహోదగ్రుడాయెను . సమిధలతో ,ఆజ్యాహుతులతో ప్రజ్వరిల్లిన అగ్ని వలె ఆ మహర్షి మండిపడెను . 

రామాయణము  బాల కాండ ఇరువదియవ సర్గ సమాప్తము . 


                          శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Monday 27 June 2016

రామాయణము బాలకాండ -పందొమ్మిదవ సర్గ

                                                    రామాయణము 

                                                              బాలకాండ -పందొమ్మిదవ సర్గ 

మహా తేజశ్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనములను విని ,పులకిత గాత్రుడై ఆయనతో ఇలా అనెను . "ఓ రాజశేఖరా !నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున జన్మించిన వాడవు . వశిష్ట మహర్షి యొక్క ఉపదేశములు విన్న వాడవు . కనుక నీవు ఇలా మాట్లాడుటయే యుక్తము . నేను సంకల్పించిన కార్యమును తెలుపుతాను . దానిని ఆచరింపుము . నీవు ఆడిన మాట తప్పకుము . ఒక లక్ష్య సిద్ధికై నేను యజ్ఞ దీక్షను చేపట్టితిని . కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నములు కలిగించుచున్నారు . నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పరిసమాప్తి అవుతుండగా సుశిక్షుతులు ,పరాక్రమవంతులు అయిన మారీచ ,సుబాహులు మాంస ఖండములను ,రక్తమును యజ్ఞ వేదికపై వర్షించునట్లు చేస్తున్నారు . నియమ నిష్టలతో నేను ఆచరిస్తున్న యజ్ఞము ఆ విధముగా విఘ్నములకు గురి అగుచున్నది . నా శ్రమ అంతయూ వృధా ఆగుతున్నది . కనుక ఉత్సాహము కోల్పోయి ,నా ఆశ్రమము నుండి నేను ఇచటికి వచ్చితిని . ఓ భూపతీ !అట్లు విఘ్నములు కల్గించుచున్నను వారిపై కోపమును ప్రకటించుటకు కానీ వారిని శపించుటకు కానీ యజ్ఞ దీక్షలోనున్న  నాకు యుక్తము కాదుకదా !
ఓ నరేంద్రా !సత్య పరాక్రముడు ,జులపాల జుట్టు కలవాడు ,శూరుడు ,నీ కుమారులలో పెద్దవాడు అయినా శ్రీ రాముని నావెంట పంపుము . ఈ రాముడు నా అండ దండలతో తన దివ్యమైన తేజః ప్రభావమునయాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంహరించుటకు సమర్ధుడు . నా వెంట వచ్చి యాగమును సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములగు శ్రేయస్సులు సమకూరును . అందులకు సందేహము లేదు . ఈయన ఖ్యాతి ముల్లోకములలోను వ్యాపించును . ఏ విధముగానైనను ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలవజాలరు . శ్రీరాముడు తప్ప మఱియొకడు ఎవరు వారిని చంపలేరు . ఓ మహారాజా ! ఆ రాక్షసులు బల గర్వముచే  పెక్కు పాప కృత్యములు చేసివున్నారు . అందువలన వారికి చావు దగ్గర పడింది . వారు ఏ విధముగానూ రాముని ముందు నిలవజాలరు . 
రాజీవలోచనుడైన నీ పుత్రుడు అగు శ్రీ రాముని 10 దినముల పాటు యాగ రక్షణార్ధమై వెంటనే నాతో పంపుము . ఇదియే నా అభీష్టము . ఓ దశరథ మహారాజా !ఏ మాత్రమూ ఆలస్యము లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తి అగునట్లు చూడుము . నీకు మేలగుగాక . మనస్సున కలత చెందకుము ". ధర్మాత్ముడు మహా తేజశ్శాలీ అయిన విశ్వామిత్రుడు ఈ విధముగా పలికి మిన్నకుండెను . ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర పలుకులు విని ,తీవ్రమైన శోకమునకు గురయి ,భయముతో కృంగిపోయెను . విశ్వనామిత్రుడి వచనములు దశరధుని హృదయమును ,మనస్సును మిక్కిలి కలిచివేసెను . అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆసనము నందే మిగుల చలించిపోయెను . 



రామాయణము  బాలకాండ పందొమ్మిదవ సర్గ . 


                              శశి ,

                  ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


















Sunday 26 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమదవ సర్గ

                                రామాయణము 

     
                                  

                                           బాలకాండ -పదునెనిమదవ సర్గ 

విశ్వామిత్రుడి మాటలు విని ఆ ద్వార పాలకులు కలవరపడి ,భయముతో రాజభవనమునకు పరిగెత్తిరి . వారు రాజ ప్రాసాదానికి చేరి ,విశ్వామిత్ర మహర్షి రాకను గురించి ఇక్ష్వాక వంశజుడైన దశరథ మహారాజుకు నివేదించిరి . ఆ ద్వారపాలకులు తెలిపిన మాటలు విని ,దశరధుడు సంతోషముతో పురోహితులను వెంట తీసుకుని బ్రహ్మ వద్దకు ఇంద్రుడి వలె ఆ మహర్షికి ఎదురేగెను . కఠోర నియమములను పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని చూసి రాజు మిక్కిలి సంతోషించెను . పిమ్మట ఆయనకు అర్ఘ్య పాద్యాది సత్కారములను జరిపెను . ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్య పాద్యాది సత్కారములను శ్వీకరించెను . పిదప అతడు మాహారాజును కుశల ప్రశ్నలు అడిగెను . మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యధోచితముగా పలుకరించెను . ఈ విధముగా విశ్వామిత్రుడితో గౌరవింపబడిన వారై వారందరూ ఎంతో సంతోషించారు . పిమ్మట అందరూ రాజభవనమున ప్రవేశించి వారి వారి యోగ్యతలు ప్రకారము ఆసీనులయ్యిరి . 
మిక్కిలి ఉదారము కల దశరథ మహారాజు ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని పొగుడుతూ ఇట్లనెను . "ఓ మహర్షీ అమృతము లభించినట్లు ,నష్ట పోయినవారికి నిధి లభించినట్లు నీళ్లు లేనిచోట వర్షము కురిసినట్లు సంతానము లేనివారికి ధర్మపత్ని అందు పుత్రులు కలిగినట్లు ,మీ ఆగమనం మాకు మహదానందం కలిగించింది . మీకు స్వాగతము . ఓ ధర్మాత్మా !బ్రహ్మర్షీ మీరు ఇక్కడికి వచ్చుట మా అదృష్టము . ధన్యుడనైతిని . మీ అభీష్టమేమి ?అందుకై నేనేమి చేయవలెను ?నేడు నా జన్మ సఫలమైనది . జన్మ చరితార్ధమైనది . పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి . అనంతరము తపః ప్రభావమున బ్రహ్మర్షిత్వము సాదించితిరి . కనుక మీరు నాకు బహుదా పూజ్యులు . ఓ బ్రహ్మర్షి !అద్భుతమైన మీ ఆగమనం నన్ను అబ్భురపరిచింది . మా గృహము పావనమైనది ప్రభూ మీ సందర్శనము వల్ల నేను కృతార్థుడనయ్యాను మీరు ఏ కార్య నిమిత్తమై వచ్చారో తెలపండి . మీ కార్యము నెరవేర్చుటకై సిద్ధముగా వున్నాను . అనుగ్రహింపండి . 
ఓ కౌశికా !కార్య విషయమున సందేహమును పెట్టుకొనవలదు . మీరు పూజ్యులైన అతిధులు ,కావున గృహస్థుడైన నాకు దైవసమానులు . మీ కార్యమును నేను నెరవేర్చెదను . అర్ధ వంతములైన దశరధుడి మృదు మధుర వచనములు విశ్వామిత్రునకు వీనులకు విందుగా ఉండెను . హృదయమునకు ఆహ్లాదమును కూర్చెను . అంతట ఉత్తమోత్త గుణములచే ఖ్యాతికెక్కిన వాడు , శమదమాది విశిష్ట గుణ సంపన్నుడు అయిన  విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడాయెను . 



      రామాయణము  బాలకాండ పదునెనిమిదవ సర్గ సమాప్తము . 




                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 














Friday 24 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమదవ సర్గ

                             రామాయణము 

                           బాలకాండ -పదునెనిమదవ సర్గ 

రఘు వంశజులలో మహా తేజశ్శాలీ అయిన శ్రీ రాముడు అమోఘమైన పరాక్రమము కలవాడు . సమస్త ప్రజలకు పూర్ణ చంద్రుడి వలె ఆహ్లాద కరుడు . రాముడు ఏనుగు ఎక్కి ,గుఱ్ఱమును అధిరోహించి ,రథమునందుండి యుద్ధము చేయుటలో కుశులుడు . ధనుర్విద్య నందు నిపుణుడు . సర్వదా తల్లి తండ్రుల సేవలో నిమగ్నుడై ఉండెడివాడు . ప్రజలను ఆనందింప చేయునట్టి అన్నయగు రాముని యందు లక్ష్మణుడు బాల్యము నుండి భక్తి తత్పరుడు నిత్యమూ ఆయనను సేవించుటే ఒక మహా భాగ్యముగా భావించేవాడు . రామ సేవల అందే నిరతుడగు లక్ష్మణుడు తన సుఖములను ఏ మాత్రమూ పట్టించుకోకుండా త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావముతో అన్ని విధములుగా ప్రియమును గూర్చు వాడు . అతడు రామునకు బహి ప్రాణము పురుషోత్తముడైన రాముడు లక్ష్మణుడు తన దగ్గర లేకపోతే నిద్రపోయేవాడు కాదు . తల్లి కౌశల్య తీసుకువచ్చిన కమ్మని భోజన పదార్ధములను లక్ష్మణుడు తోడు లేనిచే భుజించెడివాడుకాదు . అనగా రాముడు లక్ష్మణుడిని విడిచి  క్షణ కాలమైనా వుండేవాడుకాదు . రాముడు గుఱ్ఱమెక్కి వేటకు వెళ్లునప్పుడు లక్ష్మణుడు ధనస్సు చేబూని , అతడిని కాపాడుతూ వెంట నడిచి వెళ్ళేవాడు . 
   లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వలె సేవా స్వభావము కలవాడు . అతడు భరతుడికి ప్రాణము ల కంటే ప్రియమైన వాడు  .  అట్లే శత్రుఘ్నుడు భరతునిపై ఎనలేని ప్రేమను కలిగి ఉండేవాడు . చక్కని శుభ లక్షణ సంపన్నులు అగు తన నలుగురు ప్రియ పుత్రులతో కూడిన దశరధుడు ఇంద్ర ,యమ ,వరుణ ,కుభేరులు  అణు నలుగురు దిక్పాలకులతో కూడిన బ్రహ్మ దేవుని వలె పరమానంద భరితుడయ్యెను . ఆ నలుగురు రాజకుమారులు వివిధ శాస్త్ర జ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసి గాంచిరి .  శ్రేష్ఠులైన ఆ రాజ కుమారులు వేద వేదాంగ ,స్మృతి ,పురాణేతిహాసములను శ్రద్దగా అధ్యయనము చేయుచుండిరి . ధర్మానుర్వేదము నందు నిష్ఠ కలిగి ఉండిరి . 

మహాత్ముడైన దశరధుడు యుక్తవయస్కులైన తన పుత్రులకు అన్ని విధముల ఈడు జోడైన కన్యలతో వివాహములు జరిపించుటకై గురువులతోను ,భందువులతోను బాగా ఆలోచిస్తూ ఉండెను . ఆ విధముగా ఆలోచిస్తుండగా మహా తేజశ్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి అక్కడకు వచ్చెను . రాజును దర్షింప కోరి ఆ ముని ద్వార పాలకులతో "నేను గాది రాజు కుమారుడును ,కుశకుని వంశము వాడను , నా పేరు విశ్వామిత్రుడు ,నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలపండి . "అని పలికెను . 


                శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 















Thursday 23 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమిదవ సర్గ

                              రామాయణము 

                           బాలకాండ -పదునెనిమిదవ సర్గ 

దశరథ మహారాజుకి పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య అంతయు ఉత్సవములు జరిగాయి . అందు ప్రజలెల్లరు అత్యుత్సాహముతో పాల్గొనిరి . రాజ వీధులన్నీ కోలాహలంతో నిండిపోయెను . నటీ నటుల అభినయ ప్రదర్శన తొడను ,నర్తకుల యొక్క నృత్య వినోదములతో విలసిల్లెను . గాన వాద్య గోష్టులతో వంది మాగధ స్త్రోత్ర పాఠములతో ప్రతిధ్వనించేను . రాజు వాందరికి పారితోషకం ఇచ్చెను . బ్రాహ్మణోత్తములకు వేలకొలది గోవులను ధన ,కనక ,వస్తు ,వాహనములు దానము చేసెను . పుత్రులు జన్మించిన 11 దినముల తర్వాత దశరధుడు వారికి జాతకర్మనామకరణోత్సములను నిర్వహించెను . కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణము కల జ్యేష్ఠ పుత్రుడికి 'రాముడు 'అని, కైకేయి కుమారుడికి 'భరతుడు 'అని ,సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు ,శత్రుఘ్నుడు అనీ నామకరణము చేసెను . 



రాజు బ్రాహ్మణులను పుర జనులను గ్రామ వాసులను మృష్టాన్న భోజనంతో సంతృప్తిపరిచేను . ఇంకను బ్ర్రాహ్మణోత్తములకు బహు విధములగు రత్నములను పుష్కలముగా బహూకరించెను . పిమ్మట దశరధుడు తన నలుగురు పుత్రులకు అన్నప్రాసన చౌలోపనయనాది సంస్కారములను సకాలమున జరిపించెను . ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజపతాకము వలె వంశ ప్రతిష్టను ఇనుమడింప చేయుచు తండ్రికి మిక్కిలి సంతోషము కూర్చుచుండెను . మఱియు సమస్త ప్రాణులకు శ్రీ మహా విష్ణువు వలె ఎంతయు ప్రేమపాత్రుడాయెను . ఆ రాజ కుమారులందరూ వేద శాస్త్రములు అభ్యసించిరి . ధనుర్విద్యనందు ఆరితేరిరి . ప్రజల హితమునందే ఆసక్తి కలవారైరి . వారందరూ విజ్ఞాన ఘనులు ,సకల సద్గుణ సంపన్నులు . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Wednesday 22 June 2016

రామాయణము బాలకాండ -పదునెనిమిదవ సర్గ

                           రామాయణము 

                                     బాలకాండ -పదునెనిమిదవ సర్గ 

మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ ,పుత్ర కామేష్టి క్రతువులు ముగిసినవి . దేవతలు అందరూ తమ తమ హావిర్భాగములు స్వీకరించి స్వస్థానములకు చేరిరి . యజ్ఞ దీక్షా నియమములు పూర్తి కాగానే సేవకులు ,సైనికులు ,వాహనములు వెంట రాగా రాణులతో కూడి పురమున ప్రవేశించెను . యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరధుడు వారి వారి యోగ్యతలనుసరించి సన్మానించెను . వారు కూడా మిక్కిలి సంతోషించి ,వశిష్ట మహర్షికి నమస్కరించి ,తమతమ దేశములకు బయలుదేరిరి . అయోధ్య నుండి తమ నగరములకు వెళ్లుచున్న శ్రీమంతులైన ఆ రాజు యొక్క సైనికులు దశరధుడు ఇచ్చిన వస్త్రాభరణములు కు సంతోషపడ్డారు . రాజులందరూ వెళ్లిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరధుడు వశిష్టాది మహర్షులు ముందుకు సాగి పోవుచుండగా పురమున ప్రవేశించెను . నగర ప్రవేశానంతరం దశరధుడు ఋశ్యశృంగుని సాదరముగా పూజించెను . పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంత తో కూడి ప్రయాణమయ్యెను . ధీశాలియైన రోమపాదుడు ఆయనను సపరివారంగా అనుసరించెను .  వారినందరిని దశరధుడు కొంత దూరము అనుసరించి వీడ్కోలు పలికెను . 
దశరథ మహారాజు వచ్చిన వారందరిని వీడ్కొలిపి ,మిక్కిలి ఆనందించెను . తర్వాత పుత్ర ప్రాప్తి కొరకు ఆలోచించుచు హాయిగా నివసింప సాగెను . యజ్ఞము ముగిసిన పిమ్మట ఒక సంవత్సరము గడిచెను . 12 వ మాసము చైత్ర సుద్ద నవమి నాడు పునర్వసు నాల్గవ పాదమున కర్కాటక లగ్నమున కౌశల్యా దేవికి శ్రీ రామచంద్ర ప్రభువు పుట్టెను . ఆ సమయమున సూర్యుడు ,అంగారకుడు ,గురుడు ,శుక్రుడు ,శని అణు 5 గ్రహములు తమ ఉచ్చ స్థానము నందు అనగా క్రమముగా మేష ,మకర ,కర్కాటక ,మీనా ,తుల రాసుల యందు ఉండిరి . జగన్నాధుడు ,అన్ని లోకముల వారిచే నమస్కరింపబడు వాడు ,సర్వ శుభలక్షణ సంపన్నుడు ,మహా భాగ్య శాలి ,విష్ణవంశ సంపన్నుడు ,ఇక్ష్వాకు వంశ సంభూతుడు అయినా శ్రీరాముని పుత్రుడిగా కన్న కౌశల్య ఎంతో ధన్యురాలు . కౌశల్యా దేవి తన తపః ఫలితముగా ,చేతియందు వజ్ర రేఖలు కలవాడు మహా తేజశ్శాలి అయిన శ్రీ రాముడిని పుత్రునిగా పొందెను . 
విష్ణువు యొక్క చతుర్దఅంశయైన వాడు అగు భరతుడు కైకేయి యందు జన్మించెను . భరత జననాంతరము వీరులను ,వివిధములైన అస్త్ర ప్రయోగములందు నిపుణులు వైష్ణవంశ ఒప్పెడు వారు అయిన  లక్ష్మణుడు ,శత్రుఘ్నుడు అను కవలలు సుమిత్రాదేవి కనెను . భరతుడు పుష్యమీ నక్షత్ర యుక్త మీన లగ్నము నందు చైత్ర శుద్ధ దశమి నాడు జన్మించెను . అతడు గురువు యొక్క క్షేత్రమైన మీన లగ్నము నందు జన్మించుట వలన ప్రసన్నమైన బుద్ది కలవాడయ్యెను . లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషా నక్షత్ర యుక్త జన్మించిరి . ఐదు గ్రహములు ఉచ్చ రాశులలో ఉన్నపుడు ఈ నలుగురి జననములు సంభవించెను . దశరధుని కలిగిన కుమారులు నలుగురు అన్ని విధముల ఆయనకు తగినవారు . వారిలో ప్రతి ఒక్కరు వేర్వేరుగా విశిష్ట గుణములను కలిగినవారు . రామాదుల జనన కాలములో గంధర్వులు మధురముగా గానము చేసిరి . అప్సరసలు కనుల పండుగగా నాట్యము చేశారు . దేవ దుందుభులు మోగాయి . ఆకాశము నుండి పుష్ప వర్షము కురిసింది . 
  



                                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













Tuesday 21 June 2016

రామాయణము బాల కాండ -పదునేడవ సర్గము

                        రామాయణము 

                      బాల కాండ -పదునేడవ సర్గము 

మహానుభావుడైన దశరధుని పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహా విష్ణువు సంకల్పించుకున్న పిమ్మట భవిష్యత్ పరిణామాలను ఎరిగిన బ్రహ్మ దేవుడు దేవతలందరితో ఇలా పలికెను . "ఓ దేవతలారా !సత్య సంధనుడు ,మహా వీరుడు ,మన అందరికి హితాభిలాషి అయిన  విష్ణువుకు  కామ రూపులు ,బలశాలురు అయినా సహాయకులను సృజించండి . అద్భుతమైన శక్తి కలవారు ,మహా వీరులు ,వాయువు వలె మిక్కిలి వేగము కలవారు ,యుక్తిశాలురు ,,ప్రజ్ఞావంతులు ,పరాక్రమమున విష్ణువుతో సమానులు ,సామదానభేదదండోపాయములు ఎరిగిన వారు ,సమస్త మైన అస్త్ర శస్త్రములను ప్రయోగించుటలో నిపుణులు ,అమృత పానము చేసిన వారి వలె మరణం లేని వారు ,మీ వలె పరాక్రమ వంతులుఅగు పుత్రులను అప్సరసలు ,ముఖ్య గంధర్వ స్త్రీలు ,యక్ష వనితలు ,నాగ కన్యలు ,ఋక్ష ,విద్యాధర యువతులు ,కిన్నెర మహిళలు వానర స్త్రీలు మున్నగు వారి అందు వానర రూపములో సృజింపుడు . పూర్వమే జాంబవంతుడు". 
బ్రహ్మ దేవుడు ఇలా పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానరుల రూపములో కొడుకులను కన్నారు . మహాత్ములైన ఋషులు ,సిద్దులు ,విద్యాధరులు ,నాగులు ,చారణులు ,వానర ,భల్లూక వీరులను పుత్రులుగా బడసితిరి . ఇంద్రుడు మహేంద్ర పర్వతము వలె మిక్కిలి దృఢమైన దేహము కలవాడు ,వానర శ్రేష్ఠుడు అయిన వాలికి జన్మ నిచ్చెను . తపింప చేయు వారిలో శ్రేష్ఠుడు అయిన సూర్య భగవానుడు సుగ్రీవునికి జన్మనిచ్చెను . వానరులందరిలో ముఖ్యుడు ,ప్రజ్ఞా శాలి ,మిక్కిలి ఉత్తముడు అయినా తారుడు అను వానరుడు బృహస్పతి వలన కలిగెను . శ్రీమంతుడు అయిన 'గంధమాధనుడు 'అణు వానరుడు కుభేరుడి వలన జన్మించెను . విశ్వకర్మ వలన 'నలుడు 'అణు వానరోత్తముడు జన్మించెను . అతడు సర్వ కార్యములను నిర్వహించుటలో దక్షుడు . ఉత్తమ లక్షణాలు కల 'నీలుడు 'అణు వానరుడు అగ్ని దేవుడి వలన జన్మించెను . అతడు అగ్ని వలె భాసిల్లువాడు ,వానరులందరిలోను మిక్కిలి తేజస్వి ,కీర్తి ప్రతిష్టలు కలవాడు . ప్రశస్తమైన రూపము కల మైందుడు ,ద్వివిదుడు అను  వానరులు సౌందర్య సంపన్నులైన అశ్వినీ దేవతల మానస పుత్రులు . పర్జన్యుడు (వర్షాది దేవత )మహా బలశాలి అయిన శరభునకు జన్మమిచ్చెను . సర్వ శుభ లక్షణ సంపన్నుడు,వానర ప్రముఖుడు  అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు . అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరము కలవాడు . గరుత్మంతుడి వలె వేగ గమనుడు . మిక్కిలి బలవంతఁడు . 
ఈ విధముగా వేలకొలది వానరులు ,భల్లూక జాతివారు ,గోపుచ్చ (కొండముచ్చు )జాతివారు వివిధ దేవతల సంతానము ఈ జన్మించిరి . వారు రావణ సంహారము నందు ఆసక్తి కలవారు .సాటిలేని బల పరాక్రమాలు కలవారు . మహావీరులు ,కామ రూపులు ,మేరు మంధర పర్వతము వలె దృఢమైన విశాల శరీరము కల వారు . ఈ వానరాది ప్రముఖులు అందరూ తమకు జన్మలిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను ,వేషములను ,పరాక్రమములను కలిగివుండిరి . వారందరూ మహాకాయులు ,వనసంచారులు ,వన ఫలములను ,కందమూలములను భుజించువారు . కామరూపులు ,మహాత్ములు ,సేనానాయకులు అయిన ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేరెను . ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనలకు నాయక శ్రేష్టులైరి . వారు కూడా వానర వీరులను సృజించిరి . వేలకొలది వానరులు 'ఋక్షవంతము 'అను పర్వత సానువు నందు నివసింపసాగిరి . మరికొంత మంది నానా విధములగు కొండలను ,అడవులను ఆశ్రయించిరి . సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు ,ఇంద్రుని అంశతో పుట్టిన వాలి ఇరువురు సోదరులు (ఋక్షరజుని కుమారులు )వానర వీరులందరూ ఈ ఇరువురు సోదరులను, నలుని ,నీలుని  ,హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉండిరి . దృఢమైన బాహువులు కలవాడు ,అమిత పరాక్రమశాలి అయిన వాలి ఆ భల్లూకములకు ,కొండముచ్చులకు ,వానరులకు ప్రభువై తన భుజ బలముచే వారిని పరిపాలించు చుండెను . ఆ వానరులు పర్వతములతో ,అడవులతో ,సముద్రములతో కూడిన భూమండలమంతయు వ్యాపించి ఉండిరి . ఆ వానర సేనా నాయకులు శ్రీరామునకు సహాయ పడుటకు ఈ భూమండలము నందు అంతటా వ్యాపించి ఉండెను . 

రామాయణము  బాలకాండ పదునేడవ సర్గ సమాప్తము . 



                         శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



















Monday 20 June 2016

రామాయణము బాల కాండ -పదునారవ సర్గ

                                 రామాయణము 

                                  బాల కాండ -పదునారవ సర్గ 

బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్ధింపగా దేవాదిదేవుడైన శ్రీ మన్నారాయణుడు తాను సర్వజ్ఞుడు అయిననూ వారితో మధురముగా ఇలా వచించెను . "ఓ దేవతలారా !దుర్మార్గుడైన ఆ రావణుని చంపుటకు ఉపాయము తెలపండి . దానిని అనుసరించి ,ఆ ఋషి కంటకుని హతమార్చేదను . శ్రీ మహావిష్ణువు వచనములకు అందరూ ఇలా సమాదానమిచ్చిరి . "ఓ శత్రు సంహారకా !  నీవు మానవుడిగా అవతరించి ,యుద్దమున ఆ రావణుని రూపుమాపుము . పూర్వము అతడు దీర్గ కాలము తపస్సు చేసెను . దేవతలలో పెద్దవాడు ,సృష్టి కర్త అయిన బ్రహ్మ వాని తపస్సుకు సంతుష్ఠుడు అయ్యెను . సంతుష్ఠుడు అయి ఉన్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుల నుండి తప్ప ఎ ఇతర ప్రాణి నుండి తనకు చావు లేకుండా వరమును పొందాడు . మానవుల పట్ల అతనికి గల చులకన భావమే ఇందుకు కారణము . ఈ విధముగా పితామహుడి వర గర్వము వలన గర్వితుడై ,ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించు చున్నాడు . స్త్రీలను కూడా కించపరుచుచున్నాడు . కావున ఓ అరిసూదనా !మానవుల వలెనే అతడు మరనిన్చగలడు . "
సమస్త ప్రాణులకు ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల మాటలను విని ,దశరద మహారాజు కి పుత్రుడిగా జన్మించుటకు నిశ్చయించుకొనెను . అదే సమయమున మహా పరాక్రమంతుడు ,శత్రు సంహారకుడు అయిన దశరదుడు పుత్రులు లేక తపన పడుచూ 'పుత్రకామేష్టి 'యాగమును ఆచరించెను . మానవుడిగా అవతరించుటకు నిశ్చయించుకున్న మహా విష్ణువు దేవతల ,మహర్షుల పూజలు అందుకుని బ్రహ్మ దేవుడి వద్ద వీడ్కోలు తీసుకొని అంతర్ధానమయ్యెను . దశరదుడి యొక్క యజ్ఞ కుండము నుండి సాటిలేని తేజస్సుతో ఓ మహా పురుషుడు ప్రత్యక్షమయ్యెను . అతడు మహా బలపరాక్రమ సంపన్నుడు ,కృష్ణ వర్ణముతో విరాజిల్లుతూ ఉండెను . అతడు ఎరుపు రంగు వస్త్రములను ధరించి వున్నాడు . అతని కంటస్వరము దుందుభి వలె గంభీరముగా ఉండెను . అతని శరీరముపై గల రోమములు ,మీసములు ,కేశాలు సింహపు జూలు వలె మృదువుగా ఉండెను . అతడు శుభ లక్షణ సంపన్నుడు ,దివ్యాభరణ భూషితుడు ,గిరి శిఖరము వలె ఉన్నతమైన వాడు . మదించిన పెద్ద పులి వలె భయంకరుడు . సూర్య తేజస్సుతో ప్రకాశించువాడు. అట్టి దివ్య పురుషుడు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియ పత్ని వలె ప్రేమతో రెండు చేతులతో పట్టుకుని ఉండెను . వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండి యుండెను . 
ఆ దివ్య పురుషుడు దశరద మహారాజుతో "ఓ రాజా నేను బ్రహ్మ దేవుడు పంపగా ఇక్కడికి వచ్చాను . "అని చెప్పెను . అప్పుడు మహారాజు అంజలి ఘటించి "ఓ మహాత్మా నీకు స్వాగతము . నా కర్తవ్యము తెలుపండి "అని పలికెను . అప్పుడు ఆ దివ్య పురుషుడు దశరదునితో ఇలా చెప్పెను . "ఓ రాజా !అశ్వమేధ యాగము ,పుత్రకామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి . వారి అనుగ్రహముతో ఇది లభించింది . ఓ నరేంద్రా !ఇది దివ్యమైన పాయసము సంపత్కరము ,ఆరోగ్యమును వృద్ది చేస్తుంది . అంతే కాదు ఇది సంతానమును కూడా ప్రసాదించును . దీనిని స్వీకరింపుము . ఈ పాయసమును నీ ప్రియ పత్నులకిచ్చి భుజించమని చెప్పు . దీనిని సేవించుట వలన యజ్ఞ ఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును . "అనంతరము రాజు అట్లే అని పలికి ,పరమ ప్రీతుడై దివ్య పాయసముతో నిండి ,దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను . ఆ దివ్య  పురుషుడికి ప్రదక్షణ చేసెను . పాయస ప్రధాన కార్యక్రమమును ముగించుకుని ,అద్భుతాకారముతో ,దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమయ్యెను . 
దశరద మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లు మహానందభరితుడయ్యేను. సంతాన దాయకమైన దివ్య పాయసము లభించుట వలన అంతః పుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖ కాంతులతో శరత్కాలమందు ఆహ్లాదకరమైన చంద్ర కిరణములతో ప్రకాశించు ఆకాశము వలె తెజరిల్లిరి . దశరదుడు అంతః పురమున ప్రవేశించి కౌశల్య మొదలగు రాణులతో "మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరించండి "అని పలికెను . ఆ మహారాజు కౌశల్యా దేవికి అమృత తుల్యమగు ఆ పాయసములొ సగ భాగము ఇచ్చెను . మిగిలిన సగ భాగములో సగ భాగము సుమిత్రా దేవికి ఇచ్చెను . మిగిలిన పావు భాగములో సగ భాగము కైకేయికి ఇచ్చెను . మిగిలిన భాగమును మరల సుమిత్రకు ఇచ్చెను .   ఆ ముగ్గురు రాణులు దశరదుని నుండి పాయసమును స్వీకరించి అది తమకు లభించిన మహా భాగ్యముగా భావించిరి . పిమ్మట ఆ రాణులు ముగ్గురు తమకు లభించిన పాయసమును ఎవరి భాగము వారు భుజించి అగ్ని వలె తేజోమూర్తులై విరాజిల్లిరి . కొద్దికాలములోనే వారు ముగ్గురు గర్భవతులు అయ్యిరి . దశరదుడు తన భార్యలను చూసి మిక్కిలి సంతోషించెను . 

రామాయణము బాలకాండ పదునారవ సర్గ సమాప్తము . 


                            శశి ,

ఎం .ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 


















Sunday 19 June 2016

రామాయణము బాల కాండ -పదునైదవ సర్గ

                         రామాయణము 

                           బాల కాండ -పదునైదవ సర్గ 

ప్రజ్ఞా వంతుడు అధర్వనాది వేదములయందు పందితుడును అయిన ఋశ్యశృంగ మహర్షి దశరదునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యముల గురించి ఒక్క క్షణము ఆలోచించెను . పిదప కర్తవ్యము స్పురింప గా ఆయన మహారాజుతో ఇలా అనెను . "ఓ రాజా !నీకు పుత్రులు కలుగుటకై 'అధర్వ శిరస్సు 'అను వేద భాగము నందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా 'పుత్రకామేష్టి 'అను క్రతువును నిర్వహించెదను . "అప్పుడు ఆ ఋషి "పుత్రకామేష్టి "యాగమును ప్రారంభించెను . ఆ తేజశ్శాలి వేద మంత్రములను పతించుచుఅగ్నికి ఆహుతులు ఇచ్చెను . పిమ్మట బ్రహ్మాది దేవతలు ,గందర్వులు ,సిద్దులు ,మహర్షులు తమ తమ హవిర్భాగములు గ్రహించుటకై యదా క్రమము గా యజ్ఞ శాల అందు ప్రత్యక్షమయిరి . దేవతలు అందరూ క్రమముగా సదస్సునకు చేరి ,సృష్టి కర్త అయిన బ్రహ్మ దేవునితో ఇలా విన్నవించుకున్నారు . 
"ఓ దేవా !నీవు అనుగ్రహించిన వర ప్రభావము వలన రావణుడు అను రాక్షసుడు తన పరాక్రము చే మమ్ములను చిత్ర హింసల పాలు చేయుచున్నాడు . అతనిని అదుపు చేయుటకు మేము ఆశక్తులము . హే భగవాన్ !పూర్వము అతని తపస్సుకు మెచ్చి ,నీవు ఆయనకు  వరము ప్రసాదించితివి . దానిని గౌరవించుచు అతడు ఒనరించు ఆగడములను అన్నిటిని ఒర్చుకోనుచున్నాము . ఆ దుర్మార్గుడు వర గర్వముతో ముల్లోకములను భాదించుచున్నాడు . వున్నతులైన దిక్పాలకురిని ద్వేషించుచున్నాడు . స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని సయితము రాజ్య బ్రష్టుడిని చేయ చూస్తున్నాడు . అతడు వర గర్వితుడై కన్ను మిన్ను కానక ఎదురులేనివాడై ఋషులను ,యక్షులను ,గంధర్వులను ,అసురులను ,అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించు చున్నాడు . రావణుడు తన క్రీడా పర్వతమున విహరించునపుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించు కొనుచున్నాడు . వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రముగా వీచుట లేదు . వువ్వెత్తు తరంగములతో వుండు సముద్రుడు అతనికి భయపడి చలించుట లేదు . ఓ మహాత్మా భయంకరాకారుడు అయిన రాక్షసుడికి భయపడి మేము గడ గడలాడుచున్నాము . కావున వాడిని హతమార్చు ఉపాయము మేరె ఆలోచించండి ". 
దేవతలు తనను ఇట్లు ప్రార్ధింపగా బ్రహ్మ దేవుడు కొంత సేపు ఆలోచించి వారితో ఇట్లు అనెను . "భళా ఆ దుర్మార్గుడిని చంపు ఉపాయము తోచినది . గంధర్వుల చే కాని ,యక్షులచే కాని ,దానవుల చే కాని ,రాక్షసుల చే కాని తనకు చావు లేకుండా వరమిమ్మని రావణుడు నన్ను అర్ధించెను . నేను అలాగే అన్నాను . "ఆ రావణుడు వరము కోరు సమయములో మానవులంటే కల చులకన భావముతో వారి నుండి చావు లేకుండా వరం కోరలేదు . కావున మానవుని చేతిలోనే అతని మరణము "బ్రహ్మ దేవుడు పలికిన మాటలు విని దేవతలు ఋషులు అందరూ మిక్కిలి సంతోష పడిరి . ఇంతలో విష్ణు మూర్తి శంఖ ,చక్ర ధారియై ,దివ్య తేజస్సుతో విరాజిల్లుతూ యాగశాలకు వచ్చెను . అప్పుడు విష్ణు మూర్తి బ్రహ్మ దేవుడితో కలసి అక్కడ ఆసీనుడయ్యెను . ఆయనను చూసి దేవతలు అందరూ ఆయనను ఈ విధముగా ప్రార్ధించిరి . 
"ఓ మహా విష్ణూ అయోధ్యాదిపతి అయిన దశరద మహారాజు సర్వ సమర్ధుడు . ధర్మజ్ఞుడు ,ఉదార స్వభావము కలవాడు . అతని ముగ్గురు భార్యలు దక్ష కన్యలైన హ్రీ ,శ్రీ ,కీర్తి అను వారితో సమానులు . వారికి నాలుగు రూపములలో పుత్రుడవు కమ్ము . రావణుడు వర ప్రభావమున లోక కంటకుడు అయ్యెను . అతనిని దేవతలు ఎవ్వరూ చంపలేరు . నీవు మానవుడిగా అవతరించి అతడిని హతమార్చుము . రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరమ గర్వముతో దేవతలను ,గంధర్వులను ,సిద్దులను ,మునీశ్వరులను యుక్తా యుక్త విచక్షణ లేకుండా మిక్కిలి భాదించు చున్నాడు . ఆ క్రూరుడు ఋషులను అట్లే నందన వనమున విహరించు చున్న గంధర్వులను ,అప్సరసలను హింసించు చున్నాడు . ఓ శత్రు భయంకరా !మహా విష్ణూ !మా అందరికీ నీవే దిక్కు . కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకు మానవుడై అవతరించుటకు సంకల్పిమ్పుము . "
బ్రహ్మాది దేవతలు ఇలా ప్రార్ధింపగా సకల్ లోకారాధ్యుడు ,దేవదేవుడు అయిన ఆ శ్రీ మహా విష్ణువు తనను శరణు జొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలతో ఇలా పలికెను . "భయమును వీడండి . క్రూరుడు ,దుర్మార్గుడు ,దేవతలను భాదించువాడు అగు రావణుని అతని పుత్రులను ,పౌత్రులను ,అమాత్యులను భందువులను ,మిత్రులను జ్ఞాతులను అందరికి లోక హితార్ధమై యుద్దమున హతమార్చి తీరెదను . పిమ్మట పదునొకండు వేల సంత్సరముల కాలము ఈ మానవ లోకమున నివసించి ఈ భూమండలమును పరిపాలించెదను . "అని సకల ప్రానులకును ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహా విష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవ లోకమున తను అవతరింప దగు  స్తానమును గూర్చి ఆలోచించెను . పిమ్మట ఆ రాజీవ లోచనుడు తాను దశరద మహారాజుకి నాలుగు రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను . 

రామాయణము బాలకాండ పదునైదవ సర్గ సమాప్తము . 


                     శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 






Saturday 18 June 2016

రామాయణము బాల కాండ -పదునాల్గవ సర్గము

                          రామాయణము 

                             బాల కాండ -పదునాల్గవ సర్గము 

వేద వేదములయందు ,వేదార్ధములయందు ఆరితేరిన ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞ విధులను ఆచరిస్తున్నారు . వేదోక్తముగా మీమాంస శాస్త్రమును కల్ప శాస్త్రమును అనుసరించి వారు యజ్ఞ కర్మలను నిర్వహిస్తున్నారు . ఇంకను ఉపదేశ శాస్త్రము కంటే అధికమైన ,అతిదేశ శాస్త్రము వలన లబ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి . ఇంద్రునకు విధ్యుక్తమైన హవిస్సులు సమర్పింప బడినవి . సోమలతను కల్వము నందుంచి దానికి నల్దిక్కులా బ్రహ్మ ,అద్వర్యువు ,హోత ,ఉద్గాత అను నలుగురు ఋత్విజులు చేరి మంత్రములను పటించుచు సొమరసమును సిద్దము చేసిరి . ఆ యజ్ఞ కార్యములలో ఏ హోమము విడిచిబెట్టబడలేదు . ఒక హోమమునకు మారుగా మరియొక హోమము చేయుట జరగలేదు . హోమ ప్రక్రియలో ఏ మాత్రము దోసగులు దోర్లలేదు . హోమాదికము అంతా మంత్రం పూర్వకముగా నిర్విఘ్నముగా సాగినది . 
ఆ హోమము జరిగిన దినములలో అక్కడ ఆకలి ,దప్పులతో భాద పడినవారు లేరు . అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు విధ్వాంసుడే . ప్రతి బ్రాహ్మణునికి శిష్యులు కాని ,అనుచరులు కాని ,వంద మందికి తక్కువ కాకుండా వుండిరి . ప్రతి దినమూ బ్రాహ్మణులు మొదలుకుని అన్ని వర్ణముల వారు తృప్తిగా భుజించు చుండిరి . ఇంకను తాపసులు ,సన్యాసులు అక్కడ ఆతిధ్యము స్వీకరించు చుండిరి . వృద్దులు ,రోగ గ్రస్తులు ,స్త్రీలు ,బాలబాలికలు రోజు అక్కడికి వచ్చి భుజించు చుండిరి . తాను అనుకున్నంత మంది అతిధులు రాలేదని దశరదుడు సంతృప్తి చెందకుండెను . "అందరికి భోజన పదార్ధము వడ్డించండి ,వడ్డించండి వస్త్ర దానము చేయండి "అని మంత్రులకు దశరదుడు ఆజ్ఞ ఇస్తుండగా అక్కడివారు అందరికి అన్న వస్త్రములను ఒసంగుచున్డిరి . పాక శాస్త్ర ప్రకారము ప్రతి దినమూ సిద్ద పరిచిన భక్ష్య ,భోజ్య ,లేహ్య ,చోష్యాదులతో కూడిన అన్నరాసులు పర్వతము లాగా అక్కడ కనపడుచున్నవి . ఆ మహారాజు యజ్ఞము చూచుటకై వివిధ ప్రదేశములనుండి స్త్రీ ,పురుషులు విచ్చేసిరి . వారందరికీ షడ్రసోపేతములైన భోజనములు ఏర్పాటు చేసిరి . 
చక్కగా వస్త్రాభరణములు ధరించిన పురుషులు బ్రాహ్మణులకు భక్ష్యాన్నపానాదులు వడ్డించిరి . ప్రకాశించిన మణి కుండలములను ధరించిన మరికొందరు అతిధి సేవలో వారికి సహాయపడు చుండిరి . వాక్చతురులు ,ప్రజ్ఞా శీలురు అయిన బ్రాహ్మణులు హోమ కార్యక్రమముల మద్య ఒకరినొకరు జయింప వలెననే ఉత్సాహముతో హేతుబద్దములైన అనేక వైదిక చర్చలు కావించుచుండిరి. ఆ యజ్ఞము నందు ప్రతి దినము సమర్ధులైన బ్రాహ్మణులు సవనత్రయాదిసర్వకర్మలను  వశిష్టాది మహర్షుల ప్రేరణ చే శాస్త్రోక్తముగా ఆచరించు చుండిరి . ఆ యజ్ఞము నందు యూప స్తంభములు నిలబెట్టవలసిన సమయము రాగా 6 మారేడు యూప స్తంభములు ,చండ్ర స్తంభములు 6 ,అట్లే 6 మోదుగ స్తంభములు ,పిదప విరిగి చెట్టు స్తంభము ఒకటి ,దేవదారు వృక్ష స్తంభములు రెండు నిలబెట్ట బడినవి . ప్రతి రెండు స్తంభముల మద్య బారడేసి దూరము ఉండెను . ఈ యూప స్తంభములు అన్నీ యజ్ఞ శాస్త్రజ్ఞులచే యజ్ఞ శోభలను ఇనుమడింప చేయటానికి బంగారు తొడుగులతో అలంకరింప బడినవి . నిలపబడిన యూప స్తంభములు మొత్తం 21. ప్రతి యూప స్తంభము 21 మూరల పొడుగున రూపొందించ బడినవి . ప్రతి స్తంభమునకు వేరు వేరుగా వస్త్రములతో అలంకరించిరి . ఈ యూప స్తంభములు అన్నీ హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా ,దృడంగా చిల్లులు మొదలగు లోపములు లేకుండా ఎనిమిదేసి అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్దపరిచిరి . అవి శాశ్రోక్తముగా కప్పబడెను . పూలచే ,గంధములచే అలంకరింప బడెను ఆకాశమున సప్త ఋషుల వలె అవి దేదీప్యమానముగా విరాజిల్లుచుండెను . 
ఇటుకలు శాస్త్ర ప్రమాణము లో సిద్దపరచ బడినవి . యజ్ఞ వేదికల నిర్మాణముల యందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్ని వేదికలు నిర్మింప బడినవి . ఇవి రెండు రెక్కలు ,తోకను చాచి తూర్పు ముఖముగా కిందకి చూచుచున్న గరుత్మంతుని ఆకృతిలో ఉండెను . బంగారు ఇటుకలతో నిర్మింప బడుట వలన అది గరుడుని సువర్ణ మయమైన రెక్కల వలె శోభిల్లుచు ఉండెను . సాధారనముగా హోమ వేదిక 6 వరసలు కలిగి ఉండును . కాని అశ్వమేధ యాగములో ఇది మూడు రెట్లు అనగా 18 వరసలు కలిగి ఉండును . అక్కడ శాస్త్ర ప్రకారముగా పశువులు ,పాములు ,పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూప స్తంభములకు కట్టి వేయబడెను . ఆ స్తంభములకు 300 పశువులు కట్టివేయబడినవి . దశరదుని ఉత్తమాశ్వము కూడా స్తంభమునకు కట్టబడినది . 
కౌశల్య ,సుమిత్ర ,కైకేయి అను దశరదుని భార్యలు ముగ్గురు ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాపసవ్యములు గా ప్రదక్షణ ఒనర్చి ,సంతోషముతో దానిపై బంగారు సూదులతో మూడు గుర్తులు పెట్టిరి . పట్టమహిషి అయిన కౌశల్యా దేవి ధర్మసిద్ది కొరకు స్తిరమైన చిత్తముతో అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించెను . దశరద మహారాజు శాస్త్ర విధిని అనుసరించి దక్షిణగా పట్టమహిషిని బ్రహ్మ అను రుత్విజునకు ,వావాతను హోతకునకు పరివృత్తిని వుద్గాతకు పాలాకలిని అధర్వునకు ఇచ్చెను . పిమ్మట ఆ నలుగురు ఋత్విజులు వారిని పతుల వలె చేతులతో తాకిరి . అనంతరము రాజు ఆ రుత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములను ఇచ్చి ,పట్టమహిషి మొదలగు నలుగురిని తిరిగి గ్రహించెను . జితేంద్రియుడు ,ప్రయోగ నిపుణుడు అయిన రుత్విజుడు అశ్వకందమును (పెన్నేరు గడ్డను )గైకొని శాస్త్ర ప్రకారము దానిని వండెను . దశరదుడు హోమ సమయమున శాస్త్రోచితముగా తన పాపములను తొలగించు కొనుటకై దాని పొగను వాసన చూసేను . 
బ్రాహ్మనోత్తములైన 16 మంది ఋత్విజులు ఆ అశ్వమేధ యాగమునకు సమకూర్చబడిన హవ్య ద్రవ్యములను మంత్రములను పటించుచు అగ్నిలో వేల్చిరి . వేద భాగములైన బ్రాహ్మనుమలలోని ,కల్ప సూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞము మూడు రోజులలో చేయవలసి వుంది . మొదటి రోజు చేయబడు కార్యక్రమము "చతుష్తోమము "అన  బడును . రోండవ రోజు చేయబడు కార్యక్రమమును "ఉక్త్యము "అనీ, మూడవ రోజు చేయబడు కార్యక్రమమును "అతిరాత్రము "అని పేర్కొనిరి . ఇంకను ఈ ఆశ్వమేధమున శాస్త్రోక్తములైన పెక్కు ఇతర క్రతువులను కూడా దశరదుడు జరిపించెను . శాస్త్రోక్తముగా జ్యోతిష్టోమము ,ఆయుర్యాగము ,అతి రాత్రములు రెండు ,అభిజిత్తు ,విశ్వజిత్తు ,ఆప్తోర్యామము అను ఆరు విధములగు క్రతువులను ఆచరించెను .
దశరద మహారాజు తన వంశాభివ్రుద్దికై 'హోత 'అను ఋత్విజునకు తూర్పు దిశన ఉన్న భూమిని ,'ఆధ్వర్యువు 'అను రుత్విజునకు పడమరన ఉన్న భూమిని ,బ్రహ్మ స్తానమున ఉన్న రుత్విజునకు దక్షినమునున్న భూమిని 'ఉద్గాత 'అను రుత్విజునకు ఉత్తర దిశనున్న భూమిని దక్షిణగా ఇచ్చెను . అంతట ఋత్వుజులు అందరూ యజ్ఞము ద్వారా పవిత్రుడు అయిన రాజుగారితో "ఈ సమస్త భూ మండలమును పరిరక్షించుటకు నీవే సమర్దుడవు . మాకు భూమితో పనిలేదు . దానిని పండించుటలో కాని ,రక్షించుటలో కాని మేము ఆశక్తులము . నిత్యమూ ,నిరంతరమూ మేము వేద శాస్త్రములను అధ్యయనము చేయుట అందే నిరతులము. ఓ రాజా ఈ దాన భూములకు మారుగా కొంత ధనమును మీరే ఇప్పించండి . ఓ మహారాజా !శ్రేష్టములైన మణులు కానీ బంగారమును కానీ గోవులను కానీ లేక సిద్దముగా ఉన్న ఎ వస్తువులు అయినా మాకు ఇవ్వండి . భూమి వలన మాకు ప్రయోజనమేమి ?"అని పలికిరి . 
వేద వేత్తలైన  బ్రాహ్మణులు ఇలా పలుకగా మహారాజు వారికి పది లక్షల గోవులను ,పది కోట్ల బంగారు నాణెములను ,మరియు దక్షిణలకు బదులుగా నలుబై కోట్ల వెండి నాణెములను ఇచ్చెను . ఆ రుత్విజులందరూ కలసి తమకు దక్షిణగా లభించిన సంపదలను దీశాలురైన వశిష్టునకును ,రుశ్య శ్రుంగ మహర్షికి సమర్పించారు . ఆ ఇరువురు ఆ దక్షిణలను ఋత్విజులకు యధోచితముగా పంచి ఇచ్చిరి . అప్పుడా బ్రాహ్మనోత్తములు అందరూ ప్రసన్న చిత్తులై "మేము చాలా సంతృప్తి చెందాము "అని వచించారు . అనంతరము దశరదుడు యాగము చూచుటకై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన కోటి బంగారు నాణెములను శ్రద్దాదరములతో సమర్పించెను . ఈ  విధముగా కోశాగారము నందలి ధనమంతా పూర్తిగా దానము చేసిన తర్వాత నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అచటికి వచ్చెను . దశరదుడు ఆయనకు తన ముంజేతి కంకణము దానము చేసెను . భూమిపై సాగిలపడి తమకు నమస్కరించుచున్న దశరదుడిని బ్రాహ్మనోత్తములు సంప్రదాయ బద్దముగా వేద మంత్రములతో ఆశీర్వదించిరి . 
పుత్ర ప్రాప్తికి ప్రతిభందకములైన పాపములను తొలగించునది ,పుత్ర లాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింప చేయునది, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమయినది  అయిన ఉత్తమోత్తమమైన అశ్వమేధ యజ్ఞమును  ఆచరించి దశరదుడు మిక్కిలి సంతుష్ఠుడు అయ్యెను . పుత్ర ప్రాప్తికై క్రతు నిర్వహణకు రుశ్యశ్రున్గుని దశరదుడు మళ్ళీ అభ్యర్ధించెను . 


రామాయణము  బాలకాండ పదునాల్గవ సర్గ సమాప్తము . 



                           శశి ,

ఎం ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 














రామాయణము బాల కాండ -పదమూడవ సర్గ

                           రామాయణము 

                            బాల కాండ -పదమూడవ సర్గ 

యజ్ఞాశ్వమును వదిలిన ఒక సంవత్సరము తర్వాత మరల వసంత ఋతువు ప్రారంభమయ్యెను . అంతవరకూ యజ్ఞమునకు ముందు నిర్వహింపవలసిన విధులన్నీ దశరదుడు పూర్తి చేసెను . పిదప కార్యదక్షుడైన ఆ మహారాజు సంతానార్ధము యజ్ఞము చేయుటకై యాగశాలలో ప్రవేశించెను . ఆ రాజు వశిష్ట మహర్షికి నమస్కారము చేసి ,విధివిధానముగా ఆయనకు పూజలు చేసెను . పిమ్మట ఆ విప్రోత్తమునితో సవినయనము గా ఇట్లు పలికెను . "ఓ మహర్షీ !మాకు సంతానమును ప్రసాదించునట్టి యజ్ఞమును విద్యుక్తముగా నిర్వహింపచేయండి . రాక్షసులచే విఘ్నములు కలుగకుండా ఎట్టి  లోపమూలేకుండా చూడండి . పూజ్యులైన మీరు మాకు ఆప్తమిత్రులు ,శ్రేయోభిలాషులు ,ఋషి సత్తములు ,అంతే కాదు పరమ గురువులు . కావున ఈ యజ్ఞ నిర్వహణ భారము అంతా మీదే . "
అంతట ఆ వశిష్ట మహాముని మహారాజుతో "అట్లే మీరు కోరిన రీతిగానే యజ్ఞ కార్యములన్నింటిని నిర్వహించెదను "అని చెప్పెను . అప్పుడు వశిష్టుడు యజ్ఞ కర్మలయందు రాజుచే నియక్తులైన బ్రాహ్మనోత్తములను వాస్తు శాస్తమునందు సమర్ధులైన వారిని దార్మికోత్తములైన పెద్దలను ,యజ్ఞ పరిసమాప్తి వరకు కార్య నిర్వహణలో నిమగ్నులైన ,ఇటుకలు మున్నగున్నవి సిద్దపరుచువారిని స్రుక్ సృవాది -ఉపకరణములు (యాగములో నేతిని వేయుటకు వుపయోగించునవి )చేయు వడ్రంగులను భావులను తవ్వువారిని ,లేఖకులను ,శిల్పులను ,చిత్రకారులను ,రసభావములను చక్కగా అభినయించు నటులను ,నర్తకులను ,సచ్చరిత్ర గల శాస్తాజ్ఞులను ,శాస్త్రములలోను అనుభవము నందు ఆరితేరిన వారిని పిలిపించి వారితో ఇట్లు అనెను ""మీరందరూ రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞ కార్యములలో నిమగ్నులు అవ్వండి వేలకొలది ఇటుకలను వెంటనే తెప్పించండి . యజ్ఞము చూచుటకు వచ్చిన రాజులకు మిక్కిలి ఎత్తయిన విశాలమైన భవనములు నిర్మించండి . బ్రాహ్మణుల కై వందలకొలది చక్కని గృహములను ఏర్పరచండి . అవి గాలులకు ,వానలకు తట్టుకొనునట్లు ధృడముగా వుండాలి . అందు వివిధములైన భక్ష్యాన్నపానములను సమకూర్చండి . 
అట్లే పుర జనులకు ,జానపదులకు నివాస యోగ్యమైన గృహములను నిర్మించి ,అనేక విధములైన తినుబండారాలను ,సర్వ సౌఖ్యములను విస్తారముగా సమకూర్చవలెను . ఎ మాత్రమూ అనాదరమును చూపక మర్యాదగా వారికి భోజన సత్కారములు చేయవలెను . అన్ని వర్ణముల వారికి తగిన విధముగా ఆదర సత్కారములను చేయండి . కామ ,క్రొధములకు లోనై ఎవ్వరిని చిన్నబుచ్చరాదు . యజ్ఞమునకు సంబందించిన పనులలో నిరతులైన శిల్పులను తదితరులను వయస్సును ,అర్హతను పాటించుచు గౌరవించవలెను  . వారినందరినీ ధనముతో ,ముష్టాన్న భోజనములతో సంతృప్తి పరచండి . అన్ని కార్యములను చక్కగా ఆచరించండి . ఎ విషయము నందు ఎట్టి లోపము రారాదు . మరో మాట ఈ పనులన్నీ మీరందరూ నిండు మనస్సుతో ప్రేమతో ఆచరించండి ". 
వారందరూ కలసి ముక్త కంటముతో వశిష్టుడి తో ఇట్లు పలికిరి "అట్లే మీ ఆజ్ఞలను ఎ లోపమూ వాటిల్లకుండా పాటిస్తాము" . పిమ్మట వశిష్ట మహర్షి సుమంత్రుని పిలిపించి ఇట్లు పలికెను "ఈ భూమండలమున కల ధార్మికులైన రాజులను ,పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను ,క్షత్రియులను వైశ్యులను ,శూద్రులను ఆహ్వానించుము . అన్ని దేశముల నుండియు జనులను సాదరముగా ఆహ్వానించుము . మిదిలాదిపతి అయిన జనక మహారాజు శూరుడు ,సత్యసంధనుడు ,సర్వ శాస్త్రముల నందు ,వేదాలలో నిష్ణాతుడు మహాపురుషుడు కావున ఆయనను స్వయముగా వెళ్లి ఆహ్వానించుము ,అట్లే సంతతము మధురభాషియు ,రాజుగారికి ఆప్త మిత్రుడు అయిన కాశీ రాజును స్వయముగా పిలువుము . పరమ ధార్మికుడు ,పెద్దవాడు రాజుగారికి మామ అయిన కేకేయ రాజును, ఆయన కుమారుడిని స్వయముగా ఆహ్వానించుము . అంగ దేశాధిపతి ,సత్పురుషుడు ,పూజ్యుడు ,గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడు ,దశరదునికి మిత్రుడు అయిన రోమపాదుని స్వయముగా ఆహ్వానించుము . ప్రాచీనులైన సింధు ,సౌవీర ,సౌరాష్ట్ర దేశాదిపతులను ,దక్షిణ దేశముల ప్రభువులను అందరిని దూతల ద్వారా ఆహ్వానించుము . ఇంకను ఈ భూమండలమున దశరదునికి మిత్రులైన రాజులను అందరికి పరివారముతో భందువులతో కూడి వచ్చునట్లు వీలయినంత త్వరగా ఆహ్వానించుము "
బుద్ధిశాలి అయిన సుమంత్రుడు వశిష్ట మహర్షి ఆదేశము ప్రకారము పేర్కొనిన మహీపాలురందరినీ ఆయన సూచన మేరకు స్వయముగా తీసుకు వచ్చుటకై వెంటనే బయలుదేరెను . యజ్ఞమునకు సంబందించిన పనులు నిర్వహించే వారందరూ అప్పటి వరకు తాము చేసిన పనులన్నీ భుద్దిశాలి అయిన వశిష్టునికి నివేదించెను . అందుకు ఆ విప్రోత్తముడు సంతుష్టుడై వారందరితో ఇలా పలికెను "ఎవ్వరికైనా ఏదైనా ఇచ్చునపుడు అనాదరము చూపరాదు . పరిహాసము చేయరాదు . చులకన భావముతో చేసిన దానము వలన దాతకు హాని కలుగుతుంది . " అప్పుడు  కొన్ని దినముల తర్వాత రాజులందరూ శ్రేష్టములైన రత్నములను ,మణులను ముత్యములను ,పగడములను ,అమూల్యమైన వస్త్రాభారణములను ,చందనాది పరిమళ ద్రవ్యములను దశరద మహారాజుకి కానుకగా ఇవ్వడానికి తీసుకొచ్చారు . వశిష్టుడు రాజుల రాకకు సంతుష్టుడై దశరదునితో ఇలా అనెను "ఓ మహారాజా మీ ఆహ్వానము అనుసరించి ,రాజులందరూ విచ్చేసిరి . ఆ మహారాజులందరికీ తగిన రీతిలో అతిధి సత్కారములు జరిపితిని . నియుక్తులైన కార్యకర్తలు అందరూ యజ్ఞమునకు అవసరమైన వస్తువులను సమకూర్చిరి . తీసుకురాబడిన ఆ వస్తువులన్నీ తగిన ప్రదేశములలో ఉంచబడినవి . ఈ సమీపమునే ఉన్న ఈ శాలకు యజ్ఞము చేయుటకు విచ్చేయండి . సంకల్ప మాత్రమునే అతి శీఘ్రముగా నిర్మింపబడిన ఈ శాలను చూడండి . "
రుశ్యశృంగుడు ,వశిష్టుల ఆదేశము ప్రకారము మంగళకరమైన తిది ,వారము నక్షత్రములతో కూడిన సుముహూర్తమున దశరద మహారాజు శంఖ దుందుభి ,మృదంగాది ,మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా వేద పండితుల స్వస్తి వచనములతో రాజ భవనము నుండి యజ్ఞ శాలకు బయలుదేరెను . అంతట వశిష్టుడు మొదలైన బ్రాహ్మనోత్తములందరును రుశ్యశృంగుని  ముందుంచుకుని ,యజ్ఞ వాటికకు చేరిరి . పిమ్మట దశరదుడు ,ఋత్విజులు మొదలైన వారందరూ శాస్త్రోక్తముగా యధాప్రకారము యజ్ఞ కర్మలను ఆచరించిరి . సకలైశ్వర్య సంపన్నుడైన దశరద మహారాజు ధర్మ పత్నులతో కూడి యజ్ఞ వాటికలో ప్రవేశించెను . పిమ్మట అతడు శాస్త ప్రకారము విధివిధానముగా  యజ్ఞ యజ్ఞ దీక్షను స్వీకరించెను . 


రామాయణము బాలకాండ  పదమూడవ సర్గ సమాప్తము . 


                       శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 











 

Friday 17 June 2016

రామాయణము బాల కాండ -పన్నెండవ సర్గ

                          రామాయణము 

                      బాల కాండ -పన్నెండవ సర్గ 

రుశ్యశృంగుడు  అయోధ్యకు వచ్చిన  చాలా కాలము తర్వాత మనోహరమైన ఒక వసంత ఋతు ప్రారభంలో  దశరద మహారాజు అశ్వమేధ యాగము చేయ సంకల్పించెను . పిమ్మట దశరద మహారాజు దివ్య తేజశ్శాలి అయిన రుశ్యశృంగ మహామునికి పాదాభివందనము చేసి ,ఆయన అనుగ్రహము పొందెను . పుత్ర సంతాన ప్రాప్తికై యజ్ఞమునకు ప్రధాన రుత్విజుడిగా వుండుటకై ఆయనను అభ్యర్ధించెను . రుశ్యశృంగుడు అందుకు అంగీకరించి "యజ్ఞ ద్రవ్యములను సిద్దము చేయండి . యాగాశ్వాన్ని విడిచి పెట్టండి "అని రాజుతో చెప్పెను . అప్పుడు దశరదుడు మంత్రి ముఖ్యుడు అయిన సుమంత్రుని ఇట్లు  ఆదేశించెను . "సుమంత్రా! వేద పండితులను  ఋత్విజులును ఐన సుయజ్ఞుని ,వామదేవుని ,జాబాలిని ,కాశ్యపుని ,పురోహితుడైన వశిష్టుని అట్లే తదితర ద్విజోత్తములను శీగ్రముగా వెంట తీసుకు రా ". అనంతరము శీఘ్రగమనుడు  అయిన సుమంత్రుడు త్వర త్వరగా వెళ్లి వేదపారంగతులు అయిన బ్రాహ్మనోత్తములను అందరిని వెంట పెట్టుకుని వచ్చెను . ధర్మాత్ముడైన దశరద మహారాజు వారిని పూజించి ,ధర్మార్ధ సాధనకు ఉప యుక్తమగు మధుర వచనములు పలికెను . "పుత్రుల కొరకై తపనతో తహ తహలాడుచున్న నాకు మనః శాంతి కరువయినది . అందుకు అశ్వమేధ యాగమును చేయుటకు సంకల్పించితిని . ఈ యాగమును విధి విదానముగా చేయగోరుచున్నాను . రుశ్యశృంగుని ప్రభావముచే నా కోరికలు సిద్దించును . "
ఆ మాటలు విని ఆ బ్రాహ్మనోత్తములు అందరూ బాగు బాగు అని అభినందించి "అశ్వమేధ యాగము చేయవలెనని సత్సంకల్పము నీకు కలిగినందున అమిత పరాక్రమ శాలురు అయిన నలుగురు కొడుకులను పొందుతావు . "అని సాదరముగా పలికిరి . బ్రాహ్మణులు పలికిన ఈ మాటలు విని దశరదుడు మిక్కిలి సంతోషించి మంత్రులను ఉద్దేశించి "గురువుల ఆదేశానుసారము సామగ్రిని తెపించండి . నలుగురు ఋత్విజులు ముందు వెళుతూ వుండగా ,సమర్ధులైన 400 మంది యోధుల రక్షణలో యజ్ఞాశ్వమును విడిచిపెట్టండి . సరయు నదికి ఉత్తర తీరమున యజ్ఞ భూమిని సిద్దము చేయండి . క్రమము తప్పకుండా శాస్త్రోక్తముగా విఘ్న నివారకములు అయిన శాంతి కర్మలను జరిపించండి . నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు లేకుండా పరిసమాప్తి అగునట్లు చూడండి . కార్య నిర్వహణలో మీరు మిక్కిలి సమర్ధులు కదా  "అని పలికెను . 
ఆ మంత్రులు అందరూ మహారాజు యొక్క ఆజ్ఞలు విని "ప్రభువులు ఆశించినట్లే "అని ఆయనను ప్రశంసించుచు తదాజ్ఞలు నిర్వర్తించిరి . ఆ బ్రాహ్మనోత్తములు అందరూ దశరద మహారాజుని పొగిడారు . ఆయన ఆజ్ఞను తీసుకొని వారందరూ తమతమ నివాసాలకు వెళ్ళిరి . విప్రులందరూ వెళ్ళిన తర్వాత మిక్కిలి తేజశ్శాలి అయిన దశరదుడు మంత్రులందరినీ పంపివేసి ,తానుకూడా తన ప్రాసాదమునకు వెళ్ళెను . 

రామాయణము బాలకాండ పన్నెండవ సర్గ సమాప్తము . 


                      శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 

















 

Wednesday 15 June 2016

రామాయణము బాల కాండ -పదునొకండ సర్గ

                       రామాయణము 

                       బాల కాండ -పదునొకండ సర్గ 

ఓ రాజేంద్ర !ఆ సనత్కుమార మహర్షి ఇంకా ఇలా చెప్పెను . అది మీకు మంచి చేయునది దానిని చెబుతాను విను . 
ఇక్ష్వాకు రాజ వంశమున దశరదుడు అను పేరు కల ఒక మహా పురుషుడు జన్మిస్తాడు . అతడు ధార్మికుడై సర్వ శుభ లక్షణములతో సత్య సంధుడిగా ప్రసిద్ది గాంచును . అంగ రాజైన ధర్మ రధునితో అతనికి మైత్రి ఏర్పడును . దశరదుడికి శాంత అను కూతురు కలదు . అంగ రాజైన ధర్మరధుని కుమారుడు చిత్రరధుడు రోమపాదుడిగా ప్రసిద్దికెక్కును .  ఆయనకు దశరదుడి  కూతురును పెంచుకొనుటకు ఇచ్చును . ఆ రోమపాదుడి వద్దకు సుప్రసిద్దుడైన దశరద మహారాజు వెళ్ళును . పిమ్మట అతడు "ఓ ధర్మాత్ముడా !నాకు పుత్రా సంతానము లేదు . నాకు సంతాన ప్రాప్తికి ,వంశాభివ్రుద్దికి శాంత భర్త అయిన రుశ్యశృంగుడు మీ అనుమతి అయినచో నా కొరకు యజ్ఞము చేయును . "అని రోమపాదుని తో పలికెను . దశరద మహారాజు మాటలు విని రోమపాదుడు మనసులో తర్కించుకుని రుశ్యశృంగుని ఆయనతో పంపెను . దశరదుడు మనస్తాపము తీరినవాడై ఆ బ్రాహ్మనోత్తముని వెంట పెట్టుకుని వచ్చి మనస్పూర్తిగా యజ్ఞము చేసెను . ఆయనకు అమిత పరాక్రమశాలులు అయిన నలుగురు కుమారులు కలుగును . వారు వంశ ప్రతిష్టను ఇనుమడింప చేయుదురు . అన్ని లోకములనందు ఖ్యాతి వహించుదురు "అని సనత్కుమార మహర్షి పూర్వ కాలమున కృత యుగమున ఈ కధను తెలిపెను . 
ఓ నరోత్తమా మహారాజా !పుత్రార్దివైన నీవు పురోహితుల ద్వారా కాక స్వయముగా పరివారములతో వెళ్లి పుజ్యార్హుడైన ఆ రుశ్యశృంగ మహర్షిని సాదరముగా తీసుకురండు . సుమంత్రుడి మాటలు విని వశిష్టుని అనుమతి తీసుకొని ,దశరద మహారాజు రాణులతో ,మంత్రులతో కూడి రుశ్యశృంగుడు ఉన్న రోమపాదుని నగరముకు బయలుదేరెను . వన దృశ్యములను ,నదీ తీరములను దర్శించుచు క్రమముగా ఆ రాజు మునిపుంగవుడు ఉన్న ప్రదేశముకు చేరెను . రోమపాదుని నగరముకు చేరిన దశరదుడు ద్విజోత్తముడు ,విభాండకుడి కుమారుడు అయిన రుశ్యశృంగుని ,రోమపాదుని సమీపముగా వుండగా చూసేను . అప్పుడు రోమపాదుడు దశరద మహారాజుతో తనకు గల మైత్రిని పురస్కరించుకుని సముచితముగా ఆయనకు విశేష పూజలు గావించెను . ధీశాలి అయిన రుశ్యశృంగునికి రోమపాదుడు తనకు ,దశరదుడికి గల మైత్రిని తెలుపగా ,అప్పుడు రుశ్యశృంగుడు దశరదుడికి నమస్కరించెను . ఇట్లు సత్కారములు పొందిన దశరద మహారాజు అక్కడ ఏడెనిమిది దినములు ఉండి రోమపాదుడి తో ఇలా అనెను . 

"ఓ మహారాజా !నీ కూతురు అయిన శాంతను ,అల్లుడు రుశ్యశృంగుని నా నగరమునకు పంపు అక్కడ ఒక మహా యజ్ఞము చేయ సంకల్పించాను" . అని దశరదమహారాజు కోరగా రోమపాదుడు అంగీకరించి రుశ్యశృంగునితో ఈయనతో కలసి అయోధ్యకు వెళ్ళు అని చెప్పెను . ఆయన సరే అని చెప్పి భార్య తో సహా అయోధ్యకు బయలుదేరెను . దశరదుడు రోమపాదుని వద్ద సెలవు తీసుకుని అయోధ్యకు బయలుదేరెను . వేగముగా వెళ్ళు దూతలుచే తమ ఆగమన వార్తను పుర జనులకు సందేశము పంపెను . "నగరమునందు అంతటా పూలదండలతో ,అరటి స్తంభములతో ,ఆలంకరిమ్పుము . కస్తూరి కల్లాపితో సుగంధ దూప పరిమలములతో వీధులను గుభాలింప చేయండి . పతాకములను ఎగురవేయండి . " అని సందేశము పంపెను . పౌరులు రాజుగారి శుభాగమన ఆర్త విని మిక్కిలి సంతోషించిరి . రాజుగారి సందేశము ప్రకారము పూర్తిగా నగరమును అలంకరించెను . పిమ్మట దశరదుడు శంఖ దుందుభుల ద్వనుల మద్య విప్రోత్తముడైన రుశ్యశృంగుని ముందు ఉంచుకుని ,బాగా అలంకరింప బడిన నగరములో ప్రవేశించెను . దశరదుడు ఆయనను తన అంతః పురమునకు తీసుకొచ్చి శాస్త్రోక్తముగా పూజించెను . ఆయన రాకతో క్రుతార్దుడైనట్లు తలచెను . భర్తతో కూడి అంతః పురానికి విచ్చేసిన శాంతను చూసి అంతః పుర కాంతలు ఎంతో సంతోష పడిరి . ఆమె, ఆమె భర్త అక్కడ కొంత కాలము వుండిరి . 




రామాయణము బాల కాండ ఏకాదశ సర్గ సమాప్తము 


                   శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 








Tuesday 14 June 2016

రామాయణము బాల కాండ -పదవ సర్గ

                                రామాయణము 

                                   బాల కాండ -పదవ సర్గ 

రాజు కోరికపై సుమంత్రుడు ఇలా చెప్పెను . "మహారాజా !రోమ పాదుని మంత్రులు రుశ్య శృంగుని రప్పించిన విధము చెబుతాను వినండి ". మంత్రులతో కూడిన రోమపాదుడు తో పురోహితుడు ఇలా అనెను . "మేము చెప్పిన ఈ ఉపాయము వలన ఏ అపాయము జరగదు . రుశ్యశృంగుడు వనమున నివసించువాడు అతడు తపస్సు నందు ,వేదాధ్యాయనము నందు నిమగ్నమై ఉంటాడు . అతడు స్త్రీల స్వరూపముల గురించి గాని ,ఇంద్రియ సుఖముల గురించి ఎరుగడు . మానవుల చిత్తముల ను ఆకర్షించునట్టి విషయముల ద్వారా ఆయనను ఇక్కడకు రప్పిద్దాము . చక్కగా అలంకరించుకున్న అందమైన గణికలకు  బహుమానాలు ఇచ్చి వారిని పంపుదాము . వారు అక్కడికి వెళ్లి వివిదోపాయములతో రుశ్యశృంగుని ఆకర్షించి తీసుకు వస్తారు . రోమపాదుడు పురోహితుని సూచనలను ఆమోదించెను . పిమ్మట పురోహితుడు ,మంత్రులు ఆ విధముగానే చేసిరి . వారి ఆదేశము ప్రకారము స్త్రీలు ఆ మహా వనమున ప్రవేశించారు . ఆ ఆశ్రమ సమీపమునకు చేరి ,వారు నిత్యమూ ఆశ్రమ వాసియు ,జితేంద్రియుడు,ఋషి పుత్రుడు  అయిన రుశ్యశృంగ మహర్షి దర్శనముకై ప్రయత్నము చేయుచున్నారు . 
పితృ సేవలోనే సదా సంతుష్టుడై వుండు రుశ్యశృంగుడు ఆశ్రమము దాటి బయటకు రాలేదు . ఆ తపస్వి పుట్టింది మొదలు స్త్రీని గాని ,పురుషుడిని గాని ,నగరములకు గాని గ్రామములకు సంభందించిన వస్తువులను కాని మఱి ఏ ప్రాణిని కాని చూసి ఎరుగడు . ఒక రోజు రుశ్యశృంగుడు ఏదో పని మీద ఆ గణికలు ఉన్న ప్రాంతానికి వచ్చి వారిని చూసేను . చిత్ర విచిత్రములైన వేషములను ధరించిన ఆ సుందరీమణులు మధుర స్వరములతో గానము చేయుచు రుషిపుత్రుని సమీపించి ఇలా పలికిరి . "ఓ బ్రాహ్మనోత్తమా నీవు ఎవరు ?ఎవరి కుమారుడివి ?ఇక్కడ ఎందుకు ఉంటున్నావు ?ఈ నిర్జనమైన ఘోర అరణ్యములో ఒంటరిగా సంచరించుటకు కారణము ఏమిటి ?మేము వినాలనుకుంటున్నాము . "ఆ  రుశ్యశృంగుడు ఇదివరలో ఎప్పుడూ అట్టి ఆకర్షణీయమైన రూపములు కల స్త్రీలను చూసి ఎరుగడు . కనుక వారిని చూసిన సంతోష ములో తన తండ్రి గురించి వారితో ఇలా చెప్పెను . 
"మా తండ్రి విభాండక మహర్షి . నేను ఆయన కుమారుడను . నా పేరు రుశ్యశృంగుడు ఈ వనమున నా తపో జీవనము సుప్రసిద్దము . ఓ సౌందర్య మూర్తులారా ఇక్కడికి దగ్గరలోనే మా ఆశ్రమము వుంది . మా ఆశ్రమమునకు మీరందరూ రండి ". ఆయన మాటలు విని వారందరికీ ఆశ్రమము చూడాలనే కోరిక కలిగెను . వారందరూ ఆయనతో కలసి ఆశ్రమమునకు వెళ్ళిరి . ఆశ్రమమునకు వచ్చిన వారందరికీ అతడు అర్ఘ్య పాద్యములను ,కంద మూల ఫలములను సమర్పించెను . ఆ స్త్రీలు వాటిని స్వీకరించి "ఓ ద్విజోత్తమా మేము ఇస్తున్న ఈ ఫలములను కుడా స్వీకరింపు . నీకు మేలు జరుగుతుంది "అని లడ్డూలు మొదలైన ఆహార పదార్ధములను ఇచ్చిరి . తేజో మూర్తి అయిన రుశ్యశృంగుడు వాటిని తిని వనములలో నివసిన్చువారు రుచి చూడని ఫలములు ఇవి" అని భావించెను . ఆ గణికలు విభాండక మహర్షి ఏ క్షణములో వచ్చునో అని బయపడి మేము ఒక వ్రతము ఆచరించాలి అని సాకు చెప్పి ఆశ్రమము నుండి వెళ్ళిపోయెను . వారందరూ వెళ్ళిపోగా రుశ్యశృంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఖపడెను . మరునాడు మళ్లీ ఆ గణికలు ఉన్న ప్రదేశానికి వెళ్ళెను . తమ వద్దకు వస్తున్న ఆ విప్రుని చూసిన వెంటనే వారు సంతోషముతో పొంగిపోయారు . ఆయనను సమీపించి వారు అందరూ ఇలా పలికారు . 
ఓ మహాత్మా !మా ఆశ్రమానికి విచ్చేయండి . అక్కడ ఇక్కడ కంటే ఘనముగా సత్కారము జరుగును . "అని చెప్పిరి . వారి మాటలు విని అతడు వారి వెంట పోదలిచెను . ఆ వారంగనలు ఆయనను తన వెంట తీసుకుని అంగ దెశముకు వెళ్ళిరి . మహాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు ఆ రాజ్యమున కాలు మోపినంతనే వరుణుడు లోకమునకు ఆహ్లాదమును కూర్చుచు వర్షము కురిపించెను . అంతట రోమపాద మహారాజు తన రాజ్యమునకు వర్షమును తెచ్చిన మునికి ఎదురేగి భూమిపై సాగిలపడి వినమ్రతతో నమస్కారము చేసెను . ఆ రాజు భక్తి శ్రద్దలతో ఆ మునికి అర్ఘ్య పాద్యాదులను సమర్పించెను . పిమ్మట ఓ మునీశ్వరా !వారాంగనల ద్వారా మిమ్ము ఇక్కడికి రప్పించినందుకు ఆగ్రహపడకు మమ్ము అనుగ్రహించుము . అమీ రాజు రుశ్యశృంగుని వేడుకొనెను . మునితో కూడా అంతః పురమున ప్రవేశించిన పిదప ఆ రోమపాదుడు ప్రసన్నమనస్కుడై ,తన కూతురైన శాంతను ఆయనకు ఇచ్చి యధావిధిగా వివాహమొనర్చి ,ఆనందబరితుడయ్యేను . మహా తేజశ్శాలి అయిన ఆ రుశ్యశృంగుడు గౌరవాదులను అందుకోనుచు ,భార్య అయిన శాంతతో కూడి రాజాంతః పురమున సర్వ సుఖములతో నివసింప సాగెను . 

రామాయణము బాలకాండ పదవ సర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 












 

Monday 13 June 2016

రామాయణము బాల కాండ -తొమ్మిదవ సర్గ

                                రామాయణము 

                                       బాల కాండ -తొమ్మిదవ సర్గ 

మంత్రి ,రధసారధి అయిన సుమంత్రుడు మహారాజు రాణులతో పలికిన మాటలు విని దశరదుడి తో ఏకాంతమున ఇలా చెప్పెను . "పుత్ర ప్రాప్తికై వశిష్టాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధ యాగ విషయమును నేను ఇది వరకు ఇతిహాస రూపములో విన్నాను . ఓ రాజా భవిష్యత్ సంఘటనలు దర్శింపగల సనత్కుమార మహర్షి మీకు పుత్ర ప్రాప్తిని గురించి ఋషుల సమక్షమున ఈ కధను తెలిపాడు . కశ్వప మహర్షి పుత్రుడు విభాండకుడు అతనికి రుశ్యశృంగుడు అను కుమారుడు కలిగి ఖ్యాతికెక్కేను . ఆ రుశ్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభాండకుని అనుసరించి ,వనములలోనే సంచరించుట వలన ఆయనకు ఆ వనములు ,అచటి కి వచ్చి వెళ్ళు ఋషులు తప్ప మఱియొక ప్రపంచమే తెలియదు . ఓ రాజా !ధర్మ శాస్తజ్ఞులు చే తెలుపబడి ,లోక ప్రసిద్దమైన బ్రహ్మచర్యము రెండు విధములు రుశ్యశృంగుడు ఈ రెండు విధములైన బ్రహ్మచర్యమును అనుసరించగలడు . అగ్ని కార్యములను ఒనర్చుచు ప్రసిద్దుడైన తండ్రిని ,గురువులను సేవించుచు మొదటి బ్రహ్మచర్యము పాటించుచు కొంత కాలము గడిపెను . 
ఈ కాలము నందు పరాక్రమమ వంతుడు ,మహా బలశాలి అయిన రోమపాదుడు అంగ రాజ్యమునకు ప్రభువు . ఆ రాజు ఒకప్పుడు  ధర్మమును తప్పినందువల్ల ఆ రాజ్యమంతట చాలా కాలము అనావృష్టి ఏర్పడెను . తీవ్రమైన ఆ క్షామ పరిస్థితులకు రాజు మిక్కిలి భాద పడుతూ వేద శాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిచి ఇట్లు పలికెను . "మీరందరూ సమస్త ధర్మములు తెలిసినవారు . లోక వృత్తాంతము తెలిసినవారు . ఈ అనావృష్టికి కారణమైన నా పాపములు తొలగుటకై తగిన ప్రాయశ్చిత్తములను ,వాటి నియమములను దయతో తెలపండి "వేద పండితులు అయిన బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణులు ఇలా చెప్పెను . "ఓ రాజా విభండక సుతుడు అయిన రుశ్యశృంగ మహర్షి ఏ విదముగా అయినా ఇక్కడికి రప్పించండి . రుశ్యశృంగుని పిలిపించి బాగుగా సత్కరించి మీ కుమార్త అయిన శాంత ను ఇచ్చి వివాహము చేయండి "అప్పుడు రాజు బ్రహ్మచర్య వరత నిష్ఠ లో ఉన్న ఆ మహర్షిని ఇక్కడకు రప్పించుట ఎలా ?అని ఆలోచనలో పడెను . అప్పుడు రాజు మంత్రులతో ఆలోచించి రుశ్యశృంగుని తీసుకు వచ్చుటకు బ్రాహ్మణులను పంపుటే సరి అని భావించి పురోహితుని,మంత్రులను సత్కరించి పంపుటకు నిశ్చయించుకొనెను . 
వారు రాజు మాటలకు కలవరపడి ,వినమ్రులై "రాజా విభాండక మహర్షి అంటే మాకు భయము కావున మేము అక్కడికి వెళ్ళలేము కాని రుశ్యశృంగుని రప్పించు ఉపాయము చెప్పెదము "అని రాజుకు నచ్చచేప్పెను . వారు ఆయనను తీసుకురావడానికి రాజుతో వుపాయమును  చెప్పెను . అప్పుడు అంగ రాజైన రోమపాదుడు గణికల (వేశ్యల )ద్వారా రుశ్యశృంగుని రప్పించెను . ఆయన రాకతో వర్షములు కురిసి అనావృష్టి తొలగెను . అనంతరము రాజు తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహము జరిపించెను . రుశ్యశృంగుడు మీకు కుడా అల్లుడే ఆ పుణ్యాత్ముని రాకతో మీకు పుత్రులు కలుగుతారు . సనత్కుమారుడు మీకు తెలిపిన వృత్తాంతము అంతా మీకు గుర్తుచేసితిని . "దానికి దశరదుడు సంతోషించి "రోమపాదుడు రుశ్యశృంగుని అంగ దేశమునకు రప్పించిన విధము వివరింపుము . "అని సుమంత్రుడు తో  పలికెను . 

రామాయణము బాల కాండ తొమ్మిదవ సర్గ సమాప్తము 



                         శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 














Sunday 12 June 2016

రామాయణము బాల కాండ -ఎనిమిదవ సర్గ

                రామాయణము 

               బాల కాండ -ఎనిమిదవ సర్గ 

ఇంతటి ప్రతిభాశాలి ,ధర్మజ్ఞుడు ,మహాత్ముడు ,అయిన ఆ దశరదుడికి వంశోద్దారాకుడైన పుత్రుడు లేకుండుటచే అతడు సంతానము కొఱకై పరితపించుచు ఉండెను . ఈ విధముగా చింతించుచు ఉన్న ఆ మహారాజుకి "సంతాన ప్రాప్తికి అశ్వమేధ యాగము చేయుట యుక్తముకదా "!అని తోచెను . ప్రజ్ఞాశాలి ,ధార్మికుడు ,అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ది కుశలురు అయిన మంత్రులందరితో కుడా సమాలోచన చేసి యాగము చేయుటే తగును అని నిశ్చయమునకు వచ్చెను . అంతట దశరదుడు గురువులు అందరిని తీసుకు రమ్మని మంత్రులకు ఆదేశించెను . పిమ్మట సుమంత్రుడు తక్షణమే త్వరత్వర గా వెళ్లి వేద పారంగతులు అయిన సుయజ్ఞుని ,వామ దేవుని ,జాబాలిని ,కాశ్యపుని ,పురోహిత ముఖ్యుడు అయిన వశిష్టుని అట్లే ఇతర బ్రాహ్మనోత్తములను రాజ భవనమునకు తీసుకుని వచ్చెను . దార్మికోత్తముడు అయిన దశరద మహారాజు అచటికి విచ్చేసిన వశిష్టాది బ్రాహ్మనోత్తములు అందరినీ పూజించి ధర్మార్ధ సహితములు అయిన వచనములను మధురముగా ఇట్లు పలికెను "పుత్రులు లేనందున తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరువైనది . అందుకు అశ్వమేధ యాగము చేయాలని నా సంకల్పము అందువలన విధి విదానముగా యజ్ఞ దీక్షను తీసుకోన దలచితిని . నేను కోరుకోనుచున్న ఈ అశ్వమేధ యాగము నిర్విఘ్నముగా  కొనసాగు వుపాయమును ఆలోచించండి ". 
వశిష్టుడు మొదలగు బ్రాహ్మనోత్తములు అందరూ రాజు గారి నోట వచ్చిన పలుకులకు బాగు బాగు అనుచూ మిక్కిలి సంతోషించిరి . వారందరూ పరమ ప్రీతులై దశరదునితో ఇట్లు అనిరి . "యజ్ఞమునకు అవసరమైన వస్తువులను అన్నింటినీ తెప్పించండి . యజ్ఞాశ్వమును విడవండి . ఓ రాజా పుత్రా సంతానము కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది . కావున మీరు ఆశించిన విధముగా పుత్రులను పొందగలరు ". దశరదుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని మిక్కిలి ప్రీతిచెందేను . పిమ్మట ఆ రాజు ఆనందాశ్రువులను రాలుస్తూ అమాత్యులతో ఇట్లు అనెను . "మా గురువులు ఆదేశించిన విధముగా యజ్ఞమునకు కావలిసిన వస్తువులను సమకూర్చండి . ఆధ్వర్యుడు మొదలగు ఋత్వికులు వెంట నడుచు చుండగా సమర్ధులైన యోదులచే రక్షింపబడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టండి . సరయు నదికి ఉత్తర తీరమున యజ్ఞ భూమిని సిద్ధ పరచండి . విఘ్న నివారకములు అయిన శాంతి కార్యములను క్రమముగాశాస్త్రోక్తముగా  చేయండి . ఈ అశ్వమేధ మహా యజ్ఞమును ఆచరించుట లో కష్టములు కాని అపచారములు కాని సంభవించు అవకాశమే లేకుంటే సామాన్యులు అయిన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేసేవారు . విద్వాంసులు అయిన బ్రహ్మ రాక్షసులు యజ్ఞ కార్యము నందలి దోషములను వెతుకుతారు . వారు యజ్ఞములను బంగపరుచుటకు ప్రయత్నిస్తారు . యజ్ఞము పాడయినచో కర్త వెంటనే నశిస్తాడు . నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి  లోపములు లేకుండా యధావిధిగా పరిసమాప్తి అయ్యేలా చూడండి . మీరు కార్య నిర్వహణ దక్షులు కదా ". 
ఆ మంత్రులు అందరూ మహారాజు ఆజ్ఞలు విని ఆయనను పొగుడుతూ ప్రభువులు ఆదేశించినట్లే చేస్తాము అని చెప్పారు . ధర్మజ్ఞులు అయిన ఆ బ్రాహ్మణులు అందరూ రాజును ఆశీర్వదించి ఆయన ఆజ్ఞను తీసుకొని తమతమ నివాసములకు వెళ్ళిరి . బ్రాహ్మనోత్తములను పంపిన తర్వాతా మహారాజు "ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞ ద్రవ్యములను సిద్దపరుచుడు "అని సచివులతో పలికెను . మహారాజు ఈ విధముగా పలికి అక్కడ ఉన్న మంత్రులను పంపివేసి సంతోషముతో తన మందిరమున ప్రవేశించెను . పిమ్మట ఆ మహారాజు తన ప్రియ పత్నులు అయిన కౌసల్యా మొదలగు వారి వద్దకు వెళ్లి "పుత్రా ప్రాప్తికై యజ్ఞమును చేయదలచితిని మీరు కూడా దీక్ష తీసుకోండి "అని పలికెను  . మిక్కిలి సంతోషకరములు అయిన ఆ పలుకులకు సుందరీమణులు అయిన ఆ రాణుల ముఖ పద్మములు మంచు తొలగిన పిమ్మట వికశించు కమలములు వలె ప్రకాశించెను . 

రామాయణము బాల కాండ ఎనిమిదవ సర్గ సమాప్తము 


         శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










రామాయణము బాల కాండము -ఏడవ సర్గ

                         రామాయణము 

                           బాల కాండము -ఏడవ సర్గ 

ఇక్ష్వాకు వంశజుడు ,మిక్కిలి ప్రతిభా వంతుడు అయిన ఆ దశరధ మహారాజు యొక్క అమాత్యులు (మంత్రులు )కార్య విచారణ లో దక్షులు . ఇతరుల అభిప్రాయములను గుర్తించడం లో సమర్ధులు . ఎల్లప్పుడూ రాజుకు మంచిని చేయుట అందే నిరతులు ,సద్గుణ సంపన్నులు . వీరుడు గొప్ప కీర్తి ప్రతిష్టలు కలవాడు అయిన దశరద మహా రాజు ఆస్థానము నందు 8 మంది మంత్రులు కలరు . దృష్టి ,జయంతుడు ,విజయుడు ,సిద్దార్ధుడు ,అర్ధసాధకుడు ,అశోకుడు ,మంత్ర పాలుడు ,సుమంత్రుడు అను వారు ఆ ఎనిమిది మంది మంత్రులు . వశిష్టుడు ,వామదేవుడు అను మహర్షులు ఇద్దరూ ఆ ఆస్థానము  నందు ప్రధాన పురోహితులుగా వుండిరి . ఇంకను జాబాలి మొదలగు పురోహితులు ,మంత్రులు వుండిరి . వారు న్యాయ శాస్త్రము ,దండ నీతి మొదలగు రాజ విద్యలలో నిపుణులు . ఆకృత్యములకు పాల్పడనివారు . నీతి కుశులురు . రాజకార్యముల అందు ఏమరుపాటు లేనివారు . త్రికరణ శుద్దికలవారు . తేజో మూర్తులు . క్షమా గుణము కలవారు . కీర్తి ప్రతిష్టలు కలవారు . చిరునవ్వుతో ముందుగా మాట్లాడువారు . కోపములవలన కాని ,కోరికల వలన కాని ,స్వార్ధ చింతన వలన కాని అసత్యమునకు వడిగట్టని వారు . స్వ రాష్త్రముల  అందు కాని పర రాష్ట్రముల అందు కాని జరిగిన జరుగుచున్న జరగబోవు విషయములు అన్నియు ఆ మంత్రులకు చారుల ద్వారా తెలుసుకుంటూనే వుంటారు . ఆ మంత్రులు సమస్త వ్యవహారముల అందు సమర్ధులు . మిత్రుల పట్ల తమ ప్రవర్తనకు సంబంధించి రాజ పరీక్షలలో నెగ్గినవారు . అపరాధము చేసిన వారు తమ సుతులు అయినప్పటికీ నిష్పక్షపాతముగా దండిన్చేవారు . వారు కోశాగారమున నింపుటకై ధనమును సమకూర్చుట ఎందును యోగ్యతలను బట్టీ వేతనములను ఇస్తూ చతురంగ బలములను సంరక్షించుట అందు జాగరూకులై ఉందురు . ఇంకను వారు శత్రువులును ఎదుర్కొనగల వీరులు సర్వదా శత్రువులును జయించుటకు వుత్సాహపడుచున్డువారు . అయినను శత్రువు నిరపరాధిఅయినచొ అతనిని దండించే వారు కాదు . రాజ నీతిని అనుసరించి శాసనములను ఆచరణ లో ఉంచేవారు . అందు వలన స్వదేశ వాసులైన సాధువులను రక్షించు వారు . 
దశరద మహారాజు గూడచారుల ద్వారా స్వదేశ ,పరదేశ పరిస్థితులను గమనించుచు అధర్మమునకు తావు లేకుండా ధర్మ యుక్తముగా ప్రజలను రంజింప చేయుచు దేశమును పాలించుచు ఉండెను . మహా దాతగా సత్యసందుడుగా ముల్ల్లోకాలలో ఖ్యాతికెక్కిన వాడై ఆ మహారాజు ఈ పృదివిని పరిపాలించుచు ఉండెను . దశరదునకు పెక్కు మంది రాజులు మిత్రులుగా వుండిరి . సామంత రాజులందరూ ఆయనకు పాదాక్రాంతులై వుండిరి . అతడు తన ప్రతాపముచే క్షుద్రులు అయిన శత్రువుల అందరిని రూపుమాపెను . శత్రువులలో ఆయన కంటే అధికుడు కాని ,ఆయనతో సమానుడు కాని ఎవ్వడూ లేడు . ఇంద్రుడు దేవలోకమువలె ఆ దశరదుదు భూలోకమును పరిపాలించుచు ఉండెను . రాజునకు హితము గుర్చుటకై తగిన విధములుగా మంత్రాలోచనలు చేయుటకు నియమింప బడినవారు . ప్రభు భక్తి పరాయణులు ,భుద్ది కుశులురు ,కార్య దక్షులు అయినట్టి మంత్రులతో కూడిన దశరద మహారాజు తేజోమయములు అయిన కిరణములతో ఒప్పుచున్న ఉదయ భానుని వలె ప్రకాశించుచు ఉండెను . 

రామాయణము  బాలకాండ ఏడవ సర్గ  సమాప్తము . 


                 శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










Saturday 11 June 2016

రామాయణము బాల కాండ -ఆరవ సర్గ

                            రామాయణము 

                            బాల కాండ -ఆరవ సర్గ                        

దశరద మహా రాజు వేదార్ధములను బాగుగా ఎరిగినవాడు .            శూరులను ,పండితులను ఆదరించి తన ఆస్థాన మందే ఉంచుకునే వాడు  . భావి పరిణామములను ముందుగా గుర్తించువాడు . మిక్కిలి ప్రతాపశాలి . పుర జనులకు ,తన ఆస్థానములోని వారికి ప్రియమును కూర్చువాడు . ఇక్ష్వాకు వంశములో అతిరధుడు . విద్యుక్తముగా యజ్ఞములు చేయువాడు . ధర్మకార్యములందు నిరతుడు . ప్రజలందరినీ అదుపులో ఉంచగలడు  . రాజర్షి ,ముల్లోకాలలో సుప్రసిద్దుడు . చతురంగ బలములు కలవాడు . శతృవులను తుదముట్టించే వాడు . సుప్రసిద్దులైన మిత్రులు కలవాడు . నిషిద్ద విషయముల అందు మనసు పెట్టనివాడు . ధన ,కనక ,వస్తు ,వాహనములను ,తదితర నిధులను కలిగి యుండుట అందు ఇంద్రునితో ,కుభేరునితో సమానుడు . అట్టి దశరద మహారాజు లోక పరిరక్షణ అందు మహా తేజశ్శాలి అయిన వైవస్వత మనువు వలె తన కోసల రాజ్యమును పరిపాలించెను . 
శ్రేష్ఠ మైన ఆ అయోధ్యా నగరము నందలి జనులు సుఖ శాంతులతో సంతోషముగా జీవించు చుండిరి . వారు ధర్మాత్ములు ,అనేక శాస్త్రములను అధ్యయనము చేసినవారు . తాము కష్ట పడి సంపాదించిన ధనముతోనే తృప్తి పడేవారు . సత్యమును పలికెడి వారు . ఆ మహా నగరము నందలి గృహస్తులలో ఒక్కడు కూడా సంపన్నుడు కానివాడు కాని ,గోవులు అశ్వములు ,ధన ధాన్య సమ్రుద్దియు లేనివాడు గాని లేడు . వారందరూ తమ సంపదను ధర్మకార్యములకు ,ధర్మ బద్దముగా అర్ధ ,కామ ,పురుషార్ధములను సాధించుటకు వినియోగించేవారు . ఆ పురము నందలి జనులలో కామాతురుడు కాని ,లోభికాని ,క్రూరుడు కాని ,విద్యా హీనుడు కాని ,నాస్తికుడు కాని ఎంత వెతికినా దొరకడు . అయోధ్య నందలి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనచే శ్రేష్ఠులు . ఇంద్రియ నిగ్రహము కలవారు ,సత్స్వభావము కలవారు . సదాచార సంపన్నులు ,మహర్షులవలె నిర్మల  హృదయులు . ఆ అయోధ్యలో చెవులకు ఆభరణములు లేనువాడు లేడు ,శిరస్త్రానము తలపాగా మొదలగున్నవి లేనివాడు లేడు . తన సంపదలకు తగ్గట్టుగా భోగములు అనుభవింపనివాడు కాని లేడు . అభ్యంగన స్నానము చేయని వాడు లేడు . చందనము మొదలగు సుగంధ ద్రవ్యములను పూసుకోనివాడు కాని లేడు . నుదుట తిలకమును కాని కస్తూరిని కాని బొట్టుగా ధరింప నివాడు లేడు . 
ఆ అయోధ్యా నగరము నందు అగ్ని కార్యములు చేయని వాడు కాని ,సోమ యాగములు ఆచరించనివాడు కాని ,విద్యలను అరకొరగా నేర్చినవాడు కాని లేడు . దొంగలు కాని వర్ణసంకరులు కానీ లేనే లేరు . ఆ నగరము నందు బ్రాహ్మణులు మొదలగు చాతుర్వర్ణముల వారు దేవతలను ,అతిధులను పూజించే వారు . చేసిన మేలును మరువని వారు . ప్రీతితో దానములు చేసే వారు . బ్రాహ్మణులు పాండిత్యము నందు శాస్థ్రవాధముల అందు శూరులు ,మిగిలిన వర్ణములు తమతమ రంగములలో వీరులు శూరులు . క్షత్రియులు బ్రాహ్మణుల యెడ గౌరవము కలిగి రాజ్య పాలన చేయుచుండెడివారు . వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞలను పాటించే వారు . శూద్రులు తమతమ ధర్మములను ఆచరించుచు పై మూడు వర్ణాల వారిని సేవించు చుండెడి వారు . కాంభోజ దేశపు జాతి గుర్రములతో ,బాహ్లిక దేశమునకు చెందిన ఉత్తమ ఆశ్వాలతో సింధు దేశమున జన్మించిన శ్రేష్టములైన గుఱ్ఱముల తో ఆ పురము విలసిల్లుచూ ఉండెను . వింధ్య పర్వతమున పుట్టిన మదపుటేనుగులు తో హిమవన్నగమున జన్మించిన మహా గజములతో దక్షిణ దిగ్గజమైన వామన జాతిలో ఉద్భవించినవి అగు భద్రగజములతోను ఆ పురము నిండి ఉండెను . ఆ నగరము వెలుపల కూడా రెండు యోజనముల మేర వ్యాపించి ఉండెను . సార్ధక నామదేయము కల ఆ అయోధ్య (ఇతరులు జయించుటకు సాద్యము కానిది )దశరద మహారాజు పాలించుచు ఉండెను . 
రాజ శిరోమణి ,మహా తేజశ్శాలి అయిన దశరద మహారాజు చంద్రుడి నక్షత్రములవలె శత్రువులను తేజో హీనులుగా చేయుచు పరిపాలించుచు ఉండెను . ఆ నగరము పేరుకు తగినట్లుగా దృఢమైన గడియలు కల కవాటముల తో ,చిత్రములైన గృహములతో ,శోభిల్లుచు ఉండెను . వేలకొలది పుర జనులు తో కళకళ లాడుచు శుభప్రదమైన ఆ పురి నిఇంద్ర సమానుడైన ఆ దశరద మహారాజు పరిపాలించుచు ఉండెను .


బాలకాండ ఆరవ సర్గ సమాప్తము 


                 శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు .