రామాయణము
ఉత్తరకాండ -ముప్పదిఐదవసర్గ
అప్పుడు శ్రీరామ చంద్రుడు సవినయముగా అంజలిఘటించి అగస్త్యమునితో " మహర్షీ ! వాలి , రావణులయొక్క బలపరాక్రమములు అత్యద్భుతమైనవి అందుసందేహములేదు . కానీ హనుమంతుని శక్తిసామర్ధ్యములముందు వీరిరువురు తీసికట్టే అని నాకు తోచుచున్నది . శౌర్యము ,దక్షత ,బలము ,ధైర్యము ,తెలివితేటలూ ,నేర్పుగా కార్యము సాధించుట ,పరాక్రమము ,శక్తి ఇవి అన్నియు హనుమలో గూడుకట్టుకుని వున్నవి . సముద్రమును దాటుట ,సీతాన్వేషణ ,అశోకవనధ్వంసము ,రావణుని సేనాపతులని ,మంత్రి కుమారులని ,ఎనుబదివేల కింకరులను ,అక్షకుమారుని నేలపాలు కావించుట ,లంకను భస్మము చేయుట ఈ కార్యములన్నియూ అనితరసాధ్యములు . ఇతడి వలనే లక్ష్మణుడు నాకు దక్కినాడు . ఇతడి వలెనే నేను సీతను రక్షించుకోగలిగాను . మరి ఇంతటి శక్తి సామర్ధ్యములు కలిగిన మారుతి వాలిసుగ్రీవులకు విరోధము కలిగినపుడు మారుతి ఎందుకు వాలిని మట్టుపెట్టి ,సుగ్రీవునికి సహాయము చేయలేదు ?దయచేసి నాకు తెలపండి "అని పలికెను .
అగస్త్యమహర్షి రామునితో " రఘువరా ! హనుమంతుని విషయములో నీవు పలికిన మాటలన్నీ యదార్థములే . వేగములో , బుద్ధికౌసల్యములో ఇతనితో సరితూగగలవాడు మరియెవ్వరు లేరు . రామా! పూర్వము ఈ వాయుసుతునకు మహర్షులు శశాపమిచ్చిరి . ఆ శాప ఫలితముగానే ఇతఁడు తన బలమును ఎరుగడు . రామా సుమేరు గిరికి ప్రభువైన కేసరి ఆయన భార్య అంజనా దేవి హనుమతల్లితండ్రులు ఈ హనుమంతుడు వాయుదేవుడి వర ప్రభావమున జన్మించాడు . ఇతడు వారిగింజ ముల్లువలె పింగళివర్ణము కలవాడు . ఇతడి చిన్న తనములో ఒకసారి అంజనాదేవి ఫలములకై అడవులకు వెళ్లెను . ఇతడు ఆకలిబాధ తట్టుకోనలేక ఉదయించుచున్న సుర్యుడిని పండుగా భావించి భాను మండలమువైపు ఎగిరెను . శిశువుగా ఉన్న హనుమ ఇట్లుఎగురుచుండగా చూసిన దేవదానవులు యక్షులు మిక్కిలి ఆశ్చర్యపడిరి కొన్ని వేలయోజనముల దూరము పయనించి సూర్యుడిని చేరెను . సర్వము తెలిసిన సూర్యభగవానుడు అతడికి తాపము కలిగించలేదు . ఆ సమయములోనే రాహువుకూడా సూర్యుణ్ణి పట్టుకొనుటకై అక్కడికి వచ్చి మారుతి స్పర్శకు భయపడి పారిపోయెను .
వెంటనే రాహువు ఇంద్రుడిని చేరి " ఇంద్రా ! నీవు నాకు ఇచ్చిన వరము ప్రకారము ఈరోజు గ్రహణము కావున నేను సూర్యుడిని మింగుటకు వెళ్ళాను . కానీ అప్పటికే అక్కడ మరియొక రాహువు ఉన్నాడు " అని పలికెను . ఆ మాటలు విన్న దేవేంద్రుడు తత్తరపడెను . సింహాసనము నుండి దిగ్గున లేచి ఐరావతము ఎక్కి సర్యుడినిచేరి అక్కడ హనుమను చేసెను . అప్పుడు హనుమ ఇంద్రుడి వెనకే వచ్చిన రాహువును చూసి అతడిని పెద్దపండుగా భావించి రాహువువైపుగా రాసాగేను . అదిచూసి రాహువు భయముతో ' ఇంద్రా! ఇంద్రా!' అని పెద్దగా అరవసాగెను . అప్పుడు మారుతిని ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టెను . ఆ దెబ్బకు అతడు ఒక పర్వతముపై పడిపోయెను . అతని ఎడమ దవడ దెబ్బతినెను . అది తెలిసిన వాయుదేవుడు ఇంద్రుడి యెడ మిక్కిలి కుపితుడాయెను . సకల ప్రాణులలో అంతర్గతుడైయున్న వాయుదేవుడు తన చలనమును ఉపసంహరించుకుని హనుమను తీసుకొని ఒక గృహలోకి ప్రవేశించెను .
వాయు ప్రకోపము వలన స్వాస ఆడక సకల ప్రాణులు కొయ్యబారిపోయెను . అప్పుడు గంధర్వులు దేవతలు , అసురులు , మానవులు బ్రహ్మదేవుని వద్దకు పరుగులు తీసి జరిగిన విషయమును మొరపెట్టుకొనిరి . అప్పుడు బ్రహ్మదేవుడు వారితో " నాయనలారా ! ఇంద్రుడు వాయుసుతుడైన హనుమను తన వజ్రాయుధముతో కొట్టెను . అందులకే వాయుదేవుడు కోపించినాడు . మనమందరము వాయుదేవునివద్దకు వెళ్లి ఆయనని ప్రసన్నము చేసుకొనుటయే మన ముఖ్యకర్తవ్యము. లేనిచో మనకు వినాశనం తప్పదు " అని పలికెను . పిమ్మట దేవతలందరు కలిసి వాయుదేవుడు ఉన్న ప్రదేశమునకు వెళ్లిరి .
రామాయణము ఉత్తరకాండ ముప్పదిఐదవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ), తెలుగుపండితులు .