రామాయణము
ఉత్తరకాండ -ముప్పదియెనిమిదవసర్గ
మహాబాహువైన రఘురాముడు ఇదేవిధముగా సభలో ఆసీనులై అందరిచే గౌరవింపబడుతూ పురజనులయొక్క జానపదులయొక్క,కార్యములను అన్నిటిని పర్యవేక్షించుచూ రాజ్యపాలన చేయుచుండెను . కొన్ని దినముల పిమ్మట తిరుగుప్రయామమునకు సిద్దమైన జనకమహారాజుతో శ్రీ రాముడు " మహారాజా ! అన్నివిధములుగా నీవే మాకు పెద్దదిక్కు నీ సహాయ సహకారములతో అండదండలతో మేము ప్రశాంతముగా ఉంటిమి . మేము సమర్పించే రత్నాభరణాదికములు దయతో స్వీకరింపుము . నీ ప్రయాణమునందు భారతసత్ర్యజ్ఞులు వెంటవుంది తోడ్పడుదురు " అని పలికెను . అప్పుడు జనకమహారాజు అందుకు సమ్మతించి శ్రీ రామునితో " అయోధ్యాపతీ! అపురూపమైన మీ దర్శనమునకు , వినయస్వభావములకును , నేను ఎంతో ముగ్దుడనైతిని . రాజా! నీవు మాకు బహూకరించే రత్నాధికములు అన్నింటిని హృదయపూర్వకముగా స్వీకరించెదను . ఆ సకల బహుమతులను మా అమ్మాయి సీతకు ఇచ్చివేయుచున్నాను ." అని పలికి అందరిని వీడ్కొని మిథిలకు బయలుదేరెను .
పిమ్మట శ్రీ రాముడు ప్రయాణమునకు సిద్ధమైయున్న భరతుని మేనమామ యగు యధాజిత్తు తో " రాజా! నరోత్తమా! నీవుమాకు ఆత్మీయబంధుడవు . మేము ప్రేమతో ఇచ్చే సంపదలను , రత్నాభరణములను స్వీకరించుము . లక్ష్మణుడు మీకు తోడుగా వస్తాడు " అని పలుకగా యధాజిత్తు కూడా అట్లే అని " రఘునందనా! ఈ సంపదను , రత్నాభరములను మీ వద్దనే ఉంచుము " అని పలికి లక్ష్మణునితో కలిసి పయనమయ్యెను . యధాజిత్తునకు వీడ్కోలు పలికిన పిమ్మట శ్రీ రాముడు తనకుమిత్రుడైన కాశీరాజఅయినటువంటి ప్రతర్ధునిని అక్కున చేర్చుకొని " రాజా! నా రాజ్యాభిషేకం సమయమున నీవు భరతునితో కలిసి ఎంతో సహాయ సహకారములు అందించితివి ". అని పలికి కాశీరాజుకి వీడ్కోలు పలికాడు . పిమ్మట శ్రీ రాముడు తనకొరకై వచ్చిన మూడువందలమందిరాజులకుకూడా వీడ్కోలు పలికెను .
రామాయణము ఉత్తరకాండ ముప్పైఎనిమిదవసర్గ సమాప్తము .
శశి,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు)తెలుగుపండితులు .
No comments:
Post a Comment