రామాయణము
ఉత్తరకాండ ----- ఇరువదిఐదవసర్గ
రావణుడు లంకయొక్క పశ్చిమద్వారమునకు చేరువలో గల నికుంభాల వనంలోకి తన అనుచరులతో సహా ప్రవేశించెను . తన కుమారుడైన మేఘనాధుడు , కృష్ణాజినము , కమండలం , శిఖ ధరించి ఒక యజ్ఞము చేయుచుండగా రావణుడు చూసేను . ఆ యజ్ఞము రాక్షసగురువు శుక్రాచార్యుడు చేయించుచున్నాడు . అప్పుడు రావణుడు తన కుమారుడైన మేఘనాధుని వద్దకు వెళ్లి అతని ప్రేమతో ఆలింగనము చేసుకొని " నాయనా ఏమి యజ్ఞము చేయుచున్నావు " అని అడిగెను . మౌనదీక్షలో ఉన్న మేఘనాధుడు మౌనంగా ఉండెను . అప్పుడు శుక్రాచార్ర్యుడు " మహారాజా! సకల సంపదల సంవృద్దికై ఆచిరింప బడుతున్న యజ్ఞము ఇది . అవి అగ్నిష్టోమము , అశ్వమేధము , బహుసువర్ణకాము, రాజసూయము , గోమేధము , వైష్ణవము , మహీవరాయజ్ఞము . మొత్తము ఏడు . ఇతడు వీటిని భక్తి శ్రద్దలతో ఆచరించి పరమేశ్వరుడి అనుగ్రహముతో ' ఒక దివ్య విమానమూ , తామసి అను మయా విద్యను బాణములు అక్షయముగా సృష్టింపగల రెండు తూణీరములు , ఒక చాపము , ఒక అస్త్రము 'పొందెను . " అని పలికెను . అప్పుడు రావణుడు కుమ్మరా ! నేను జయించిన శత్రువులైన దేవతలను నీవు పవిత్రద్రవ్యములతో పూజించుట ఏమి ? సరేలే , ఇదీ సత్కార్యమే మనము ఇంటికి వెళ్ళెదము . అని పలికి తన కుమారునితో, విభీషనుతో సహా తన భావమునకు చేరెను .
పిదప రావణుడు విమానంలో బంధిపబడిన స్త్రీ లందరిని కిందకు దింపించెను . వారందరు ఇంకనూ కన్నీరు కార్చుచూ గద్గద స్వరములతో ఏడ్చుచునే ఉండిరి . అది చూసిన విభీషణుడు " సోదరా ! నీవు తీసుకు వచ్చిన ఈ స్త్రీలను హింసించుట తగదని ఎరిగియు , శాస్త్ర మర్యాదలను అతిక్రమించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుచున్నావు . ఇలా చేయుట వలన నీకు అపకీర్తి వచ్చును సంపదలు నశించును . వంశ ప్రతిష్ట దెబ్బతినును. ఇట్టి పాప కర్మలను చేయవలననే ఆలోచన నీకు వచ్చుటకు మనము చేసిన పాపకర్మలే కారణము . మాల్యవంతుడు మన తల్లి కైకసికి పెదతండ్రి మనకు పూజ్యుడు . ఆయన పుత్రిక అయినా అనల కూతురు కుంభీనసి మన సోదరులందరికి చెల్లెలు . రాజా ! మధురాక్షసుడు అనువాడు ఆమెను బలవంతముగా అపహరించుకుని పోయెను . ఆసమయములో మేఘనాధుడు యజ్ఞదీక్షలో ఉన్నాడు . నేను తపస్సు నిమిత్తమై జలముల మధ్యఉన్నాను . కుంభకరుణుడు గాఢమైన నిద్రావస్థలో ఉన్నాడు . మధు రాక్షసుడు అదును చూసుకొని ఎదిరించిన మన మంత్రులను చంపి నిద్రించుచున్న కుంభీనసని ఎత్తుకొనిపోయినాడు . తదుపరి ఆ విషయము నీకు తెలిసిన్నప్పటికీ నీవు అతనిని చంపక ఊరుకుంటివి . పెడ బుద్దితో నీవు చేసిన ఆపనికి ఫలితమే ఇది " అని పలికెను .
విభీషణుడి మాటలు విన్న రావణుడు పశ్చాత్తాపపడుతూ నాలుగువేల అక్షౌహిణుల సైన్యముతో ,మేఘనాధుడితో కుంభకర్ణుడితో కలిసి మధురాక్షసుడిని వధించుటకు బయలుదేరేను . విభీషణుడు మాత్రము లంకలోని ఉండిపోయెను . పిమ్మట రావణుడు తన సైన్యముతో సహా మదుపురము చేరి అక్కడ తన సోదరి అగు కుంభీనస ను చూసేను . ఆమె తన అన్నను చూసిన వెంటనే అతడి పాదములకు ప్రణమిల్లెను . అప్పుడు రావణుడు ఆమె ను లేవనెత్తి "అమ్మా !బయపడకు ఇప్పుడు నేను చేయవలసిన పని ఏమి ?"అని ప్రశ్నించెను . అప్పుడు ఆమె "అన్నా !నీవు నన్ను నిజముగా అనుగ్రహింపదలిచినచో నా భర్తను చంపవద్దు . నన్ను కనికరింపుము . "అని అర్దించెను . అప్పుడు రావణుడు కుంభీనసకు అభయము ఇచ్చి తన బావగారిని గూర్చి అడిగెను . వెంటనే సంతోషముతో కుంభీనస నిద్రించుచున్న తన భర్త ను నిద్రలేపి తన అన్న వచ్చిన విషయము తెలిపెను . వెంటనే ఆ రాక్షసుడు రావణుని సమీపించి తగినవిధముగా గౌరవమర్యాదలు చేసెను . రావణుడు ఆ రాత్రికి అక్కడే బస చేసి మరునాడు ఉదయమే సైన్యముతో సహా కైలాసపర్వతమునకు వెళ్లెను .
రామాయణము ఉత్తరకాండ ఇరువదియైదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment