రామాయణము
యుద్ధకాండ ----------నూటయారవసర్గ
తీవ్రముగా మృత్యుప్రేరితుడైన రావణుడు అజ్ఞానము వలన అత్యంత క్రుద్ధుడై కన్నులెర్రచేసి సారధితో "బుద్ది హీనుడా! నన్ను బలహీనుడుగా , పిరికివాడగా అస్ర్త కౌశలము కోల్పోయినవాడగా , తలచి నన్ను అవమానించి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించితివి . నా అభిప్రాయము తెలుసుకొనక నా ఈ రధమును దారి మళ్ళించితివి . నేను చిరకాలము ఆర్జించిన కీర్తిని , పరాక్రమమును , తేజస్సును , నేడు నాశనము చేసితివి . 'రావణుడు ఎట్టి పరిస్థితిలోను యుద్ధము నుండి వెను తిరిగడు ' అను లోక విశ్వాసము ఒమ్ము చేసావు . దుర్మతి నీవు శత్రువు నుండి లంచము తీసుకొని అతడికి వసమైనావని నా అనుమానము . లేనిచో ఈ రధమును శత్రువు ఎదురు నుండి పక్కకు మళ్లించేడి వాడవు కాదు. వెంటనే రధమును యుద్ధరంగమునకు మరల్చుము " అని పలికెను .
రావణుడు పరుషంగా ఇట్లు పలికిన పిమ్మట ఎల్లప్పుడూ అతని హితమునే కోరే ఆ సారధి తన రాజుని అనునయించుచూ ఇలా హిత వచనములు పలికెను . " మహారాజా! నేను భీతిల్లుట లేదు, శత్రువు యొక్క ప్రలోభములకు లోబడిన వాడను కాదు . ఏమర పాటుతో లేను . మీయందు గల గౌరవ భావము ఏ మాత్రము తగ్గలేదు . మీరు నాకు చేసిన ఉపకారములు మరువలేదు . నేను ఇప్పుడు చేసిన పని మీకు అప్రియముగా తోచవచ్చుఁ . కానీ మీ హితము కోరే నేను అలా చేసితిని . మహా సంగ్రామముయందు నీవు పూర్తిగా అలసినట్లు నేను గమనించాను . అప్పుడు నీలో శత్రువును ఎదుర్కొనగలిగిన యుద్ధోత్సాహము గాని, పరాక్రమము గాని లేదు . నీకు కొంత సేపు విశ్రాంతి అవసరము . నీ అలసటను దూరము చేయటానికే ఈ పని చేసాను . మీ యందు నాకు గల భక్తి కారణంగానే మీ క్షేమము కోరి ఈ పని చేసాను . శత్రు సంహారక ఇప్పుడు నేను ఏమి చేయవలనునో ఆజ్ఞాపింపుము . . త్రికరణశుద్ధిగా నీ ఆజ్ఞను శిరసావహించెదను" . రావణుడు తనసారధి పలికిన ఆ మాటలకు ఎంతో సంతోషించాడు . రణకుతూహలుడైన ఆ రావణుడు తన సారధిని పెక్కు రీతులా కొనియాడెను . "సారధి మన రధమును వెంటనే రామునకు ఎదురుగా పోనివ్వు . నేను రణమున శత్రువులను హతమార్చనిదే వెనుకకు మరలను" . అని పలికెను .
రాక్షస రాజైన రావణుడు ఇట్లు పలికిన పిమ్మట అతనికి తన చేతికి ఉన్న మేలైన హస్తాభరణమును బహూకరించెను . రావణుని ఆదేశానుసారం సారధి రధమును యుద్ధరంగమునకు మరల్చెను . అనంతరము రావణుని ఆజ్ఞ మేరకు గుఱ్ఱములను అదల్చెను . మరుక్షణమునే ఆ రాక్షస రాజుయొక్క రధము రాముని ముందు నిల్చెను .
రామాయణము -----------యుద్ధకాండ --------------నూటఅరవసర్గ -----------సమాప్తము -------------------------
శశి ,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ) తెలుగు పండితులు.
No comments:
Post a Comment