రామాయణము
యుద్ధకాండ --------నూట పదునాల్గవ సర్గ
అట్లు విలపించుచున్న రాక్షస స్త్రీలలో రావణుడికి మిక్కిలి ప్రీతిపాత్రురాలు పెద్ద బార్య అయిన మండోదరి దీనంగా భర్తను పరిశీలించి చూసేను . అప్పుడు ఆమె " ప్రాణేశ్వరా ! ఇది స్వప్నమా? లేక నిజమా? మహావీరుడవైన నీవు రాముడి చేతిలో మరణించుట ఏమిటి? నీవు మృత్యుదేవతకే మృత్యువువు . అలాంటి నీవు మృత్యువాత ఎలాపడినావు. ? నీవు ముల్లోకాలలో సంపదలను అనుభవించినావు . త్రిలోక వాసులను భయబ్రాంతులకు గురిచేసినావు . లోక పాలురను జయించినావు నీ భుజబలముతో శంకరునితోపాటు కైలాస పర్వతమును కూడా ఎత్తినావు . సింహ గర్జనలను చేసి సకల ప్రాణులను భీతిల్ల చేసినావు . రాక్షసులకు నాయకుడవు , లంకాద్వీపమునకు సంరక్షకుడవు . ఇంతటి ప్రతిభాశాలివి . నా భర్తవు ఐన నిన్ను ఈ విధంగా చూసికూడా ఇంకా నేను జీవించే ఉన్నాను . దీనిని బట్టి నా హృదయము పాషాణము అనిపిస్తోంది .
మహా రాజా ! నేడు నీవు వీరస్వర్గము పొందితివి . నీవులేకుండా ఇంకనేను బ్రతకలేను . కాబట్టి నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు . నిస్సహాయురాలునైన నన్ను వదిలి నీవొక్కడవే ఎలా వెళ్లాలనుకుంటున్నావు. నేను ఎంతగా విలపించుచున్న నాతో మాట్లాడవేమి ? మేలి ముసుగు లేకుండా కాలినడక తో నగర ద్వారమునుండి బయటకు వచ్చినందుకు నాపై నీకు కోపము రాలేదుకదా ! నాధా ! పత్నులందరిపై నీకు గల ప్రేమ అపారము . మేలి ముసుగులు లేకుండా దీనులై ఏడ్చుచున్న నీ భార్యలందరిని ఒకసారి చూడు . వారిని ఓదార్చు లేదా కోపగించుకో . నీవు అసువులు కోల్పోయినా శోకముచే కుమిలిపోవుతున్న నాయీ హృదయము ఇంకను వేయిముక్కలుగా బ్రద్దలగుటలేదేమిటి ? " అని బిగ్గరగా విలపిస్తూ మూర్చిల్లి రక్తసిక్తమై ఉన్న రావణుడి వక్షస్థలముపై మండోదరి పడిపోయెను . ఆమె సపత్నులు లేవదీసి కూర్చోబెట్టి ఓదార్చిరి . అయినను ఆమె భోరుభోరుమని బిగ్గరగా ఏడవసాగెను .
రావణుడి భార్యలందరు ఈవిధంగా మిక్కిలిధీనముగా విలపించుచుండగా అది చూసినవారందరికి బాధతో గుండెలు బరువెక్కేను . కొద్దిసేపటికి శ్రీ రాముడు విభీషణుడితో " విభీషణా ! నీ సోదరుడగు రావణునికి దహనసంస్కారములకు సమయము మించిపోవుచున్నది . కావున ఆ ఏర్పాట్లు చేయుము . " అని పలికెను
శ్రీ రాముడి మాటలు విన్నంతనే విభీషణుడు త్వర త్వరగా రావణుడికి తగు రీతిలో దహన సంస్కారములు చేయుటకు ఏర్పాట్లు చేసెను . మంచిగంధముచెక్కతో , వట్టివేళ్ళు , పద్మకములు, మొదలైన సుగంధద్రవ్యములతో చితిని సిద్ధపరచిరి దానిపై మృగచర్మమును కప్పిరి . వేదమంత్రములతో సశాస్త్రీయముగా రావణుడికి విభీషణుడు దహనసంస్కారములు చేసెను .
తదుపరి విభీషణుడు స్నానము చేసి తడిబట్టలతోనే తన అన్న అయిన రావణుడికి తర్పణములు వదిలెను . పిదప అక్కడ ఉన్న స్త్రీలను తన మాటలతో ఓదార్చి లంకకు వెళ్ళమని పలికెను . వెంటనే ఆ రావణుడి పత్నులందరు లంకా నగరము లోకి ప్రవేశించిరి . పిమ్మట విభీషణుడు యుద్ధభూమిలో సైనిక శిభిరంలో ఉన్న శ్రీ రాముడి వద్దకు వెళ్లెను .
రామాయణము -----------యుద్ధకాండ -------------నూటపదునాల్గవసర్గ --------------సమాప్తము ------.
శశి ,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు), తెలుగుపండితులు.
No comments:
Post a Comment