రామాయణము
ఉత్తరకాండ --------పదిహేనవసర్గ
కుబేరుడు తన సేనాపతి ఐన మని బ్రదుడు ని రావణునితో యుద్ధమునకు పంపెను . మణిభద్రుడు నాలుగు వేళా మంది యక్షసైనికులతో యుద్ధమునకు దిగెను . రాక్షసులు మాయోపాయములను పన్నుచూ యుద్ధము చేయుచుండిరి . యక్షులు మాత్రము ధర్మ యుద్ధమును కొనసాగించుచుండిరి . అందువలన యుద్దములో రాక్షసులదే పై చేయిగా ఉండెను . రావణుడు మణిభద్రుడపై విరుచుకుపడెను . రావణుడి ప్రతాపము తట్టుకొనలేక మణిభద్రుడు యుద్ధరంగము నుండి వెళ్లి పోయెను .
అది చూసిన కుబేరుడు సమరభూమికి వచ్చి రావణుడితో " దుర్మతీ ! , రావణా! నను నిను ఎంతగా వారించుచున్నాను నా మాటలు పెడచెవిన పెట్టుచున్నావు . నీ దుష్కర్మల ఫలముగా నరకము పొందిన పిమ్మట గాని నా మాటల విలువ నీకు తెలిసిరాదు . దుష్టుడు , అజ్ఞ్యానము వలన విషము త్రాగినప్పుడు అది ప్రమాదకరమైనదని ఎరుగడు . కానీ దాని దుష్ప్రభావము అనుబవములోకి వచ్చునప్పుడు మాత్రమే అతడు తెలుసుకొనగలడు . తల్లి తండ్రులను , గురువులను , అవమానపరిచినవాడు మరణించిన పిమ్మట నరక యాతనలు అనుభవించుట తధ్యము . దేహము ఉండగానే తపస్సు ఆచరింపని వాడు మూర్ఖుడు . ఇక నీతో మాటలు అనవసరం యుద్ధమునకు రా " అని పలికెను .
కుబేరుడు , రావణుడు తీవ్రముగా యుద్ధమును చేసుకొని సాగిరి . కుబేరుడు ఆగ్నేయాస్త్రము ప్రయోగించెను . రావణుడు నిర్వీర్యము చేసెను . ఇరువురు అనేక అస్త్రశస్త్రములతో తమ శక్తీ మేరా యుద్ధము చేసిరి . అయినను ఏ ఒక్కరు ఓడలేదు . లంకాధిపతి కుబేరున్ని నశింపచేయుటకై రాక్షస మాయను ఆశ్రయించెను . ఆ మాయ ద్వారా ఒక సారి పెద్దపులిలా , మరో సారి వరాహములా , మేఘములా, పర్వతములా , సముద్రములా , వృక్షంలా , ఇలా అనే రూపములలో కనపడెను . కానీ తన సహజ రూపములో మాత్రము కనపడలేదు . పిమ్మట రావణుడు పెద్ద గాధను తీసుకొని . కుభేరుణ్ణి తీవ్రముగా కొట్టెను . ఆ దెబ్బకు కుబేరుడు మూర్చిల్లి రథముపై పడిపోయెను . అప్పుడు పద్మము , సంకహము , మున్నగు నిధుల అధిష్టాన దేవతలు కుబేరుని చుట్టూ చేరి , ఆయనను నందన వనముకు తీసుకువచ్చి సేద తీర్చిరి రాక్షస రాజు ఆ ధన పతిని జయించి ఎంతగానో సంతోషించెను . పిమ్మట అతడు విజయ సూచకుమగా కుబేరుని పుష్పక విమానమును తీసుకొనెను . యజమాని కోరిక మేరకు సంచరించే ఆ పుష్పక విమానము రావణుడు తన మంత్రులతో సహా అధిరోహించెను .
రామాయణము -------ఉత్తరకాండ ------------పదిహేనవసర్గ ----------సమాప్తము
శశి ,
ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు)తెలుగుపండితులు .
No comments:
Post a Comment