రామాయణము
యుద్ధకాండ ---------నూటపదహారవసర్గ
వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరాముడి ఆదేశము విన్నవెంటనే , లంకా నగరము లోనికి ప్రవేశించెను . అక్కడి రాక్షసులు హనుమను పూజించిరి . పిమ్మట హనుమ అశోక వనము లోకి ప్రవేశించి , తైలసంస్కారములు లేక మిక్కిలి దీనంగా ఉన్న సీతా దేవిని చూసి ఆమెవద్దకు వెళ్లి తన గోత్రనామములను తెలిపి ఆమెకు నమస్కరించెను . హనుమ శరీరము కుంచించుకొని సీతాదేవి ఎదురుగా వినమ్రుడై నిలబడి ఉండెను . అప్పుడు సీతా దేవి ఆయనను గుర్తించి మిక్కిలి సంతోషించెను . అప్పుడు హనుమ " అమ్మా ! వైదేహి! రాముడూ , లక్ష్మణుడు కుశలమే , కపీన్ద్రుడైన సుగ్రీవుడు , యుద్ధమునకు తోడ్పడిన విభీషణుడు , వానర యోధులందరూ క్షెమమే , లోక కంటకుడైన రావణుని వధించి శ్రీ రామచంద్ర ప్రభువు నీ క్షేమ సమాచారముల గూర్చి తెలుసుకొనుటకై నన్ను ఇక్కడికి పంపెను . అమ్మా! ఇంక నీవు భీతిల్లవలదు ఎందుకంటే ఇప్పుడు లంకానగరమంతా భక్తి తత్పరుడైన విభీషణుని అధీనములో ఉన్నది . కావున నిశ్చింతగా ఉండుము . విభీషణుడు నీ దర్శనమునకై త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు " అని పలికెను .
హనుమంతుడు పలికిన మాటలు విని సీతాదేవి సంతోషంతో ఏమి మాట్లాడలేక పోయెను . తనకి సమాధానము చెప్పకుండా మౌనంగా ఉన్న సీతాదేవేరితో హనుమంతుడు " అమ్మా! ఇంకా ఏమిఆలోచిస్తున్నావు , నాతో మాట్లాడవేమి " అని పలికెను . అపుడు సీతా దేవి సంతోషంతో నిండిన గద్గద స్వరముతో " మారుతి నా పతిదేవుడు విజయము సాధించాడు . అనే సంతోషకరమైన వార్త విని సంతోషంలో మునిగిపోయాను . కనుక క్షణకాలం పాటు మాట్లాడలేకపోయాను . వానరోత్తమా! నాకు ఇంతటి ప్రియమైన సందేశమును తీసుకు వచ్చిన నిన్ను ఎలా అభినందించాలో నాకు తెలియటంలేదు . ఓ కపివర నాకు ఇంతటి మంచి వార్తను తీసుకువచ్చిన నీకు ఇవ్వదగిన బహుమానము నాకు ఈ భూలోకము నందేకాదు అంతరిక్షమునందేకాదు , చివరికి స్వర్గములో కూడా కనుపడుటలేదు . నీవు నాకు చేసిన మేలుకు వెండి బంగారములు కానీ , వివిధరత్నములు కానీ చివరికి త్రిలోకాదిపత్యము కూడా సాటికాజాలదు " అని పలికెను .
అప్పుడు సంతోషముతో హనుమ" అమ్మా ! ఈ రాక్షస స్త్రీలు ఇన్నాళ్లు నిన్ను ఎంతగానో బాధపెట్టారు . నీవు అనుమతిని ఇస్తే వీరందరిని ఇప్పుడే హతమారుస్తాను . " అని పలికెను . అప్పుడు సీతా దేవి " మారుతీ ! ఈ రాక్షస స్త్రీలు రావణుడి అధీనములో ఉన్నారు . రాజాజ్ఞలను పాటించుటయే వీరి కర్తవ్యము . అట్టి వీరిపై కోపము ఎందులకు ?నా దురదృష్టము వలనో లేక నేను ఇదివరకు చేసిన పాప ఫలితముగానో నాకు ఈ బాధలన్నీ కలిగినవి . ఈ రావణుడి దాసీలను నేను క్షమిస్తున్నాను . "అని పలికెను .
సీతాదేవి ఇలా పలుకగా అప్పుడు మారుతి "మాహాత్మురాలివి ,శ్రీరాముడి ధర్మపత్నివి ఐన నీవు కూడా ఆ స్వామీ లాగే శరణాగతవాత్సల్యము మొదలగు ఉత్తమ గుణములను కలిగివుండుట ఎంతేని సముచితము . ఇక నేను నా ప్రభువు వద్దకు వెళ్తాను . నీ సందేశమును తెలుపుము "అని పలికెను . అప్పుడు సీత 'వానరోత్తమా !నా పతిదేవుని చూడాలనుకుంటున్నాను . "అని పలికెను . అప్పుడు హనుమ ఆ తల్లికి సంతోషము కలిగేలా "అమ్మా !శ్రీరామచంద్రప్రభువును నీవు త్వరలోనే చూడగలవు "అని పలికి శ్రీరాముని వద్దకు వెళ్లెను .
No comments:
Post a Comment