రామాయణము
ఉత్తరకాండ --------పదహారవసర్గ
అగస్త్యుడు ఇంకా ఇలా చెప్పుచున్నాడు " రామా! రావణుడు కుబేరున్ని జయించిన పిమ్మట అక్కడే గల శరవణ వనమునకు విమానముపయు వెళ్లెను . అది కుమారస్వామి జన్మించిన ప్రదేశము . పిమ్మట ఇంకా ముందుకు సాగెను . రమ్యమైన వనములతో ఉన్న ఒక పర్వతము పైకి చేరిన పిమ్మట విమానము అక్కడే గాలిలో నిలిచిపోయెను అది చూసిన రాక్షస రాజు ' మంత్రులారా ! ఈ విమానము ఇంత వరుకు నా ఆదేశానుసారం పయనించింది . కానీ ఇప్పుడు నా ప్రమేయము లేకుండానే ఆగిపోయింది . దీనికి కారణము ఏమై ఉంటుంది . ఒక వేళ ఈ పర్వతముపై దీనికి అడ్డంకులు ఏమైనా ఉన్నవేమో చూసిరండు ' అని పలికెను . అప్పుడు మారీచుడు తన ప్రభువుతో " రాజా ! ఏ కారణము లేకుండా ఈ పుష్పకము ఇలా ఆగిపోదు . ఇది కుబేరుడి యొక్క వాహనము . కనుక అతని ఆదేశము ప్రకారమే ఇది నడుచును . బహుశా ఈ పుష్పకములో కుబేరుడు లేక పోవుటచే ఇది ఆగిపోయి ఉండవచ్చును " అని పలికెను .
ఇంతలో పరమేశ్వరుడి అనుచరుడైన నందీశ్వరుడు ఆ శిఖరము పైకి వచ్చెను . అతడు పొట్టిగా వికృతముగా ఉండెను . ఆ నందీశ్వరుడు రావణునితో " దశగ్రీవా! ఈ పర్వతముపై సంఖరుడు , పార్వతీ దేవితో కలిసి విహరించుచున్నారు . ఇచటికి నాగ , యక్ష, గరుడ,గాంధర్వ ,దేవ , దానాలు మొదలగు ఏ ప్రాణులను ఈ పర్వతము మీదికి వెళ్ళరాదు . కనుక వెనుతిరుగుము . లేనిచో నీకు నాశనము తప్పదు . " అని హెచ్చరించెను . నందీశ్వరుని మాటలు వినిన వెంటనే రావణుడు మిక్కిలి కోపంతో ' ఎవడీ శంకరుడు ?'అని పలుకుచూ విమానము పై నుండి శిఖరము పైకి దిగెను . అక్కడ శూలపాణి ఐ అపార శంకరుని వాలే ఉన్న నందీశ్వరుడిని చూసేను . రావణుడు వానర ముఖంతో ఉన్న నందిని చూచి ఎగతాళిగా వికటాట్టహాసము చేసెను. దానికి కోపించిన నందీశ్వరుడు " దశాననా! నా వానర ముఖమును చూసి గెలిచేయుచూ పెద్దగా నవ్వితివి కావున నా వంటి రూపము గల వానరులు నిన్ను నీవంశమును నాశనము చేయుటకై జన్మింతురు . నాకములు దంతములు,ఆయుధముగా చేసుకొని నీ బలగర్వములను రూపుమాపెదరు . అంతే కాక నిన్ను నీ అమాత్యులను , నీ బంధుమిత్రులను , పరివారమును నుగ్గునుగ్గుచేసెదరు . వారి దాకా ఎందుకు ఇప్పుడు నేనే నిన్ను సంహరించి వేయగలను . కానీ నీ దుష్కర్మల ఫలితముగా నీవు ఇప్పటికే మృతతుల్యుడివి . " మహాత్ముడైన నందీశ్వరుడు ఈ విధముగా పలుకగా దేవదుందుభులు మ్రోగినవి . ఆకాశము నుండి పూలవాన కురిసినది .
దశాననుడు నందీశ్వరుని మాటలు లెక్క చేయక కైలాస పర్వత సమీపమునకు చేరి పెద్దగా " శంకరా ! నీ కారణుమగా నా పుష్పక విమానము ఆగిపోయినది . కనుక నీ ఈ పర్వతమును పెకలించివేసెదను . " అని అరిచి పర్వతము యొక్క కింది భాగమును తన భుజములను ఆనించి దానిని పైకి ఎత్తుటకు ప్రయత్నించెను . అప్పుడు ఆ పర్వతము కంపించ సాగెను . ప్రమదగణములు కంపించెను. పార్వతికూడా చలించి. పరమేశ్వరుడిని గట్టిగా పట్టుకొనెను . అప్పుడు పాపాత్ములను శిక్షించు వాడు ఐన పరమేశ్వరుడు తన కాలి బొటని వేలితో ఆ శైలమును అదిమెను . ఆ ఒత్తిడి వలన కొండా క్రింద ఉన్న రావణుడి బాహువులు నలిగిపోయినవి . భుజముల నొప్పి భరించలేనంతగా ఉండగా ఆ రాక్షసుడు బిగ్గరగా ఒక పొలికేక పెట్టెను . ఆ భయంకర నాదమునకు ముల్లోకములు గడగడలాడినవి . అప్పుడు విలవివిలలాడుతున్న రావణుడితో అతని మంత్రులు " రాజా ! దేవదేవుడు ఐన పరమేశ్వరుడిని స్తోత్రములతో సంతోష పరుచుము . ఇప్పుడా స్వామిని సారాను వేడుట తప్ప మరొక మార్గములేదు .
ఆ అమాత్యుల మాటలకు సమ్మతించి రావణుడు శంకరునకు ప్రణమిల్లి , సామవేదమంత్రములతో, వివిధ స్తోత్రములతో , ఒక వేయి సంవత్సరములపాటు పరమేశ్వరుడిని ఆర్తితో కీర్తించెను . అప్పుడు ఆ మహాదేవుడు ప్రీతుడై అతని భుజములనుండి శైలమును తప్పించి " దశాననా నీ సౌర్య పరాక్రమములకు మెచ్చితిని . నీవు చేసిన భీకర ధ్వనికి ముల్లోకములు గడగడలాడినవి . కనుక నేటి నుండి నీవు రావణుడు అనే పేరుతో పిలవపడతావు . నీవు వెళ్లుటకు అనుమతి ఇచ్చుచున్నాను " అని పలికెను . అప్పుడు రావణుడు " మహా దేవా ! నీవు సంతుష్టుడ వైనచో నాకు ఒక వరమును ప్రసాదింపుము . నాకు బ్రహ్మదేవునివలన దీర్గాయువు లభించినది . నేను అకాలమరణము పొందకుండా నన్ను అనుగ్రహించుము . అదేవిధముగా నాకు ఒక మహాత్రమును ప్రసాదించుము . " అని వేడుకొనెను . అప్పుడు పరమేశ్వరుడు అతనికి కాంతులు విరజిమ్మిచున్న చంద్రహాసము అనే పేరుకల ఒక ఖడ్గమును ప్రసాదించి " రావణా! ఎప్పుడు ఈ ఖడ్గమును అవమాన పరుచురాదు . ఎప్పుడైనా దీనిని పూజించుటలొ అశ్రద్ధ చోపినట్లైతే ఇది మళ్ళీ నా వద్దకే వచ్చి చేరును " అని చెప్పెను . అప్పడు రావణుడు మహాదేవుడికి ప్రణమిల్లి అక్కడ నుండి వెడలిపోయెను .
అనంతరము రావణుడు భూమిపై సంచరించుచు క్షత్రియులను బాధింపసాగెను . బల పరాక్రమ వంతులైన కొందరు క్షత్రియులు రావణుడిని ఎదిరించి సపరివారంగా నశించిరి . ఇతర రాజులు తమ పరాజయము ఒప్పుకొని రావణుడికి లొంగిపోయిరి .
No comments:
Post a Comment