రామాయణము
ఉత్తరకాండ ---------తొమ్మిదవసర్గ
కొంత కాలము తర్వాత సుమాలి పాతాళ లోకము నుండి భూమిపైకి వచ్చి పుష్పక విమానము పై వెళుతున్న కుభేరుణ్ని చూసేను . కుభేరుడు తన తండ్రి అగు విశ్రవసుని దర్శించుటకై స్వేచ్ఛగా వెళ్లుచుండగా సుమాలి ఆశ్చర్య పడి తిరిగి పాతాళమునకు ప్రవేశించెను . అతడు రాక్షసులతో బాగుగా ఆలోచించి తన కుమార్తె కైకసితో " అమ్మా ! నీకు పెళ్లీడు వచ్చినది వయస్సు మించిపోవుచున్నది . నీవు తిరస్కరిస్తావన్న భయముతో వరులు ఎవ్వరు నిను వివాహము చేసుకొనుటకు ముందుకు వచ్చుటలేదు కావున పుత్రి పులస్త్య నందనుడైన విశ్రవసుడు బ్రహ్మ వంశమునకు చెందిన వాడు ఆ ముని శ్రేష్ఠుడు నీకు తగిన వరుడు ఆయన్ను పతిగా కోరి సేవింపుము . కుభేరుని వంటి పుత్రులు నీకు కలిగెదరు " అని పలికెను .
అప్పుడా కైకసి తండ్రిపై గల గౌరవముతో మరుక్షణమే తప్ప మాచరించుచున్న విశ్రవసుని దగ్గరకు వెళ్లి తల వంచుకొని పాదాంగుష్ఠము తో పదే పదే నేలపై రాయ సాగెను . అది చూసిన విశ్రవసుడు " ఓ సుందరి నీవు ఎవరి కుమార్తెవు ? ఎక్కడినుండి వచ్చితివి ? ఇక్కడికి వచ్చుటకు గల కారణమేమిటి ? " అని ప్రశ్నించగా అప్పుడా కైకసి " మునీశ్వరా ! నా పేరు కైకసి నేను సుమాలి పుత్రికను . మా తండ్రి ఆదేశముపై నేను ఇక్కడకు వచ్చితిని . మిగిలిన విషయములను నీ తపఃప్రభావము వలన నీవే తెలుసుకొనగలవు . " అని పలికెను . అప్పుడు ఆ ముని ధ్యాన నిమగ్నుడై విషయమును గ్రహించి " ఓ కన్య ! నీవు నావలన పుత్రుని పొందవలెనని కోరికతో ఉన్నావు కానీ నీవు దారుణ మైన సంధ్యా సమయములో నా వద్దకు వచ్చావు . కనుక నీకు జన్మించే తనయులు గూర్చి తెలిపెదను వినుము భయంకర ఆకారములు కలిగి క్రూరకార్యములకు పాల్పడే రాక్షసులు నీకు పుత్రులుగా జన్మిస్తారు " అని పలికెను .
ఆ ముని మాటలు విన్న కైకసి అంజలి గటించి " మహాత్మా ! మీరు వేదవేత్తలు . మీనుండి దురాచారులైన పుత్రులను పొందుటకు నాకు సమ్మతము కాదు . నాపై కనికరము చూపించు " అని అర్ధించెను . అప్పుడు ఆ ముని నావలన నీకు కలిగే కుమారులలో చివరివాడు నా వంశమునకు తగినట్లుగా ధర్మాత్ముడు ఆగుతాడు . అని పలికెను . ఆ ముని అలా పలికిన తర్వాత కొంతకాలమునకు ఆ కైకసికి రాక్షస లక్షణములు కల కొడుకులు పుట్టెను . ఆ బాలురు పదితలలు ఇరువై భుజములు పొడుగు దంతాలను కలిగి ఉన్నాడు . అతడు జన్మించినపుడు . రక్త వర్షము కురిసినది . ఉల్కలు రాలినవి . సూర్య కాంతులు సన్నగిల్లినవి భూమి కంపించింది . గాలులు దారుణముగా వేయిచినవి ఇతనికి దశగ్రీవుడు అని పేరు పెట్టిరి .
అనంతరము కైకసికి పుట్టిన వాడు కుంభకరుణుడు . అతను మిక్కిలి బలశాలుడు అతిపెద్ద దేహము కలవాడు పిమ్మట ఆ కైకసికి వికృతమైన ముఖము కల కూతురు కలిగినది . ఆమె పేరు సూర్పనఖ కైకసికి చివరగా కలిగిన కుమారుడి పేరుని పేరు విభీషణుడు . అతడు మిక్కిలి ధర్మాత్ముడు . అతడు పుట్టినవెంటనే పుష్పవర్షము కురిసినది . విశ్రవసుని ఆశ్రమము కల ఆ మహారణ్యము నందు ,దశగ్రీవకుంభకర్ణులు ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యిరి . విభీషణుడు మాత్రము ధర్మాత్ముడై నియమనిష్టలతో వేదాధ్యయనము చేసేవాడు . పిదప కొంతకాలమునకు ధనాధిపతి ఐన కుబేరుడు తన తండ్రిని దర్శించుటకై ,పుష్పకవిమానముపై అచటికి వచ్చెను . రాక్షసియైన కైకసి తన కుమారుడగు దశగ్రీవునితో "కుమారా !నీ సోదరుడగు ఈ వైశ్రవణుడిని చూడుము . దివ్యమైన ఇతడి తేజోవైభవములను చూడుము . వరుసకు మీరిద్దరూ సోదరులు . అయినా నీ ఈ స్థితిని చూసుకొనుము . నాయనా !దశగ్రీవా !నీవు అమిత పరాక్రమశాలివి . నీవు కూడా వైశ్రవణుడి వలె తేజివైభవమూర్తివి అగుటకు యత్నించుము . "అని పలికెను . తల్లి మాటలను విన్న వెంటనే దశగ్రీవుడు "అమ్మా !నేను తేజోవైభవములను పొంది ,ఈ సోదరునితో సమానుడను కానీ ,ఇతని కంటే మించినవాడిని కానీ కాగలను . ఇది నా ప్రతిజ్ఞ "అని పలికెను . అనంతరము ఆ ఆవేశమును చల్లారనివ్వక దశగ్రీవుడు తమ్ములతో కలిసి తీవ్రముగా తపస్సు చేయుటకై గోకర్ణాశ్రమమునకు చేరెను . పిమ్మట తిరుగులేని కార్యశూరుడైన ఆ దశగ్రీవుడు సోదరులతో కలిసి తీవ్రముగా తపస్సు చేసి బ్రహ్మదేవుని సంతోషపరిచేను . బ్రహ్మ సంతుష్టుడై అతడికి అన్నివిధములుగా జయమును కలిగించే వరములను అనుగ్రహించెను .
రామాయణము ఉత్తరకాండ తొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment