రామాయణము
ఉత్తరకాండ ---------పదవసర్గ
అప్పుడు శ్రీ రాముడు అగస్త్య మహర్షిని " మహాత్మా ! మిక్కిలి బలశాలురైన ఆ సోదరులు ఎంత కఠోరంగా తపస్సు చేసిరి . వారి తపశ్శచ్యర్య విధానములు ఎట్టివి " . అని అడిగెను . అప్పుడా మహర్షి "రఘురామా ! ఆ రాక్షస సోదరులు ముగ్గురు ధర్మ విధులను అనుసరించుచు వేరువేరు రీతులలో తపస్సు ను ఆరంభించిరి .
విభీషణుడు వేసవికాలంలో మండుటెండల్లో నాలుగువైపులా అగ్నిని ఉంచుకొని . సూర్యుడివైపు చూస్తూ తపస్సు చేయ సాగెను . వర్షాకాలంలో ఆరుబయట కూర్చొని జడివానలో సైతం తపస్సు చేసెను . చలికాలములో నీళ్లలో ఉండి తపస్సు చేసెను . అతడు ధర్మమునందు దృఢ మనస్కుడై పదివేల సంవత్సరములపాటు తపస్సు చేసెను .
ధర్మాత్ముడైన విభీషణుడు పవిత్రముగా తాపస ధర్మములు ఆచరించుచూ తపస్సు చేసెను . అతడు చివరి ఐదువేల సంవత్సరములు శిరస్సును బాహువులను పైకెత్తి సూర్యుడిని వీక్షించుచూ వేదమంత్రములు పటించుచూ ఒంటి కాలిపై దృఢ నిశ్చయముతో తపస్సు చేసెను .
పదివేల సంవత్సరములు నిరాహార దీక్షతో రావణుడు తపస్సు చేసెను . ప్రతి వేయి సంవత్సరములకు ఒక సారి అతడు తన శిరస్సును నరికి అగ్నికి ఆహుతి ఇచ్చుచుండెను . ఈ విధముగా తొమ్మిదివేల సంవత్సరములు తపస్సు గడుచునప్పటికీ తొమ్మిది శిరస్సులు అగ్నుకి ఆహుతి అయ్యెను . మిగిలిన వేయి సంవత్సరములు ముగియు సమయమున అతడు తన పదవ శిరస్సును చేధించుటకై సిద్దపడుచుండగా బ్రహ్మ దేవుడు దేవతలతో కలిసి ప్రత్యక్షమయ్యెను . అప్పుడు బ్రహ్మ దేవుడు రావణునితో " దశాననా ఇంతవరుకు నీవు చేసిన గోరా తపస్సుకు నేను ప్రసన్నుడనైతిని . ఒక వరము కోరుకొనుము . ఇప్పుడే నెరవేర్చెదను ". అని పలికెను .
అప్పుడు దశగ్రీవుడు బ్రహ్మ దేవునకు శిరసాప్రణమిల్లి హర్షపూర్ణమైన గద్గద స్వరముతో " మహాత్మా సమస్త ప్రాణులు నిత్యము మరణభీతితో తొట్రుపడుచుండును . ఈ లోకమున మృత్యువుతో సమానమైన శత్రువు ఉండదు కావున నేను అమరత్వము కోరుకొనుచున్నాను . " అని ప్రార్ధించగా బ్రహ్మ దేవుడు " రావణ ! పూర్తిగా అమరత్వము ప్రాప్తించుట అసాధ్యము . కనుక నీవు మరొక వరము కోరుకొనుము . అని పలికెను అప్పుడు రావణుడు" పితామహా !యక్ష, నాగ , గరుడ, దేవా, దానవులు మున్నగు వారి వలన నాకు మరణము లేకుండునట్లు అనుగ్రహింపుము . ఇతర ప్రాణులవలన నాకు ఎట్టి భయము లేదు . మానవులు నాకు గడ్డి పోచతో సమానము . " అని అభ్యర్ధించెను . అప్పుడు బ్రహ్మ దేవుడు " రాక్షస పుంగవా నీవు కోరిన రీతిగా ఈ వరమును అనుగ్రహించుచున్నాను . తపోధన మిక్కిలి సంతుష్టుడ నైన నేను నీకు మరోవారం కూడా ఇచ్చుచున్నాను . అది ఏమనగా నీవు ఇంతకు ముందు అగ్నిలో వేసిన నీ తొమ్మిది శిరస్సులు ఏడ తదముగా ఏర్పడును . అని పలికెను .
పిమ్మట బ్రహ్మ దేవుడు విభీషణుడితో " నాయనా విభీషణ చక్కని నీ తపో దీక్షకు సంతుష్టుడ నైతిని . కనుక నీకు నచ్చిన వారము కోరుకొనుము . " అని పలుకగా విభీషణుడు , బ్రహ్మ దేవునితో "పూజ్యుడా నేను ఎంతటి ఇక్కట్లు పాలైనను నా బుద్ది ధర్మమును వీడక దృఢముగా ధర్మమూ నందే ఉండునట్లు దీవించుము . " అని పలికెను .
విభీషణుడు పలికిన పరమ ధార్మిక వచనములను బ్రహ్మ దేవుడు ఎంతో ప్రీతితో " విభీషణ నీవు ప్రబలమైన ధర్మనిష్ఠ కలవాడవు . నీవు కోరినట్లు జరుగును . నీవు రాక్షసవంశమున జన్మించినా నీ బుద్ది ఎప్పుడు అధర్మమును తాకదు . నీకు అమరత్వము ప్రాప్తించును . " అని పలికెను .
కుంభ కర్ణునికి వరమిచ్చుటకు సిద్ధపడిన బ్రహ్మ దేవుడితో దేవతలందరు " స్వామి కుంభకర్ణునికి వరమిచ్చుట యుక్తము కాదు . ఈ దుష్టుడు లోకములను ఎంతగా గడగడ లాడించున్నాడో నీకును తెలుసును . మహాత్మా ! నందన వనములో ఏడుగురు అప్సరసలు , ఇంద్రుని అనుచరులు పదిమందిని అలాగే అనేక మంది ఋషులను మనుష్యులను ఇతడు భక్షించి వేసెను . వరములు పొందకముందే ఇటువంటి దుష్కార్యములకు వొడిగట్టినాడు . ఇక వారములు పొందితే ముల్లోకములను తిని వేయగలడు . దివ్య తజస్వి వరము నెపముతో ఇతనికి మోహము కలిగించుము . అలా చేసినచో లోకములకు మంచి జరుగునూ , అతడి అభీష్టములు నెరవేరును . అని పలికెను . దేవతల మానవుని ఆలకించిన బ్రహ్మ దేవుడు క్షణకాలం ఆలోచించెను . పిమ్మట అతడు సరస్వతీ దేవిని స్మరించెను . వెంటనే ఆ దేవి ప్రత్యక్షమై దేవా ! కర్తవ్యమును తెలుపుము . అని పలికెను . అప్పుడు బ్రహ్మదేవుడు "వాణీ ! దేవతల ప్రార్ధనను మన్నించి నీవు ఈ కుంభకరుణుని నాలిక పై ప్రవేశింపుము . " అని పలికెను . ' అట్లే 'అని ఆమె ఆ రాక్షసుని నాలిక పై ప్రవేశించెను . పిమ్మట బ్రహ్మదేవుడు కుభర్ణునితో " మహాబాహూ ! నీ అభీష్టాను సారము ఒక వరమును కోరుకొనుము అని పలికెను . అప్పుడు కుంభకర్ణుడి దేవదేవా ! నేను పెక్కు సంవత్సరములు నిద్రించునట్లు వారములు ప్రసాదింపుము . " అని ప్రార్ధించెను . అప్పుడు బ్రహ్మ దేవుడు తధాస్తు అని పలికి దేవతలతో కలిసి వెడలి పోయెను . పిమ్మట సరస్వతీ దేవికూడా అతడిని విడిచివెళ్లిపోయెను . అప్పుడు
కుంభకర్ణుడు మోహవిముక్తుడై సహజస్థితికి వచ్చెను . పిమ్మట కుంభకర్ణుడు ' నేను ఇట్టి వరము కోరుకుంటిని ఏమి ఇది దేవతల మాయ అయ్యి ఉంటుంది ' అని తనలో తాను అనుకొనెను . పిమ్మట ఆ ముగ్గురు సోదరులు శ్లేష్మాతకము అను పేరుగల తన తండ్రివనమునకు వెళ్లి . అచట హాయిగా నివసించసాగిరి .
రామాయణము ----------ఉత్తరకాండ -----------పడవసర్గ ------------సమాప్తము .
శశి.,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు ) తెలుగు పండితులు .
No comments:
Post a Comment