రామాయణము
యుద్ధకాండ -------నూటమూడవసర్గ
పరాక్రమశాలి శత్రుసంహారదక్షుడు ఐన శ్రీ రాముడు లక్ష్మణుని పలుకులు విని వెంటనే తన ధనస్సును చేబూని రావణుని పై శరములను ప్రయోగించెను . రాక్షస రాజైన రావణుడు మరొక రధాన్ని అధిరోహించి శ్రీ రాముడి పై బాణములు వేసెను . శ్రీ రాముడు భూమి మీద ఉండి రావణుడు రథముపై ఉండి యుద్ధము చేయుట సరికాదని దేవ, గాంధర్వ,దానవులు , తమలో తాము అనుకొనిరి .
అప్పుడు దేవతల ప్రభవైన ఇంద్రుడు తన రధమును తీసుకు పోయి శ్రీరామునికి అప్పగింపుమని సారధియైన మాతలిని ఆదేశించెను . ఆ రధము యొక్క భాగములన్నీ బంగారముతో నిర్మితములై అనేక చిరు గంటలతో అలంకరించి ఉండెను . దానికి పూంచిన అశ్వములు దివ్యములు అవి బంగారు శిరో భూషణములు కలిగి యున్నవి . వాటికి తెల్లని వింజామరలు అమర్చబడియున్నవి . ఇంద్రుని యొక్క ఆదేశానుసారం మాతలి ఆ దివ్య రధమును ఎక్కి దివి నుండి భువికి చేరి శ్రీ రాముని సమక్షమున నిల్చెను . మాతలి శ్రీ రామునికి ప్రణమిల్లి ఆయనతో "దివ్యగుణ సంపన్నా! శత్రుసంహారక రామా ! ఈ యుద్ధమున మీ విజయమునకై దేవేంద్రుడు ఈ రధమును పంపెను . దీనితో పాటుగా ఈ మహాధనస్సును , అగ్ని జ్వాలల వలే మిరుమిట్లు గొలుపు చున్న ఈ కవచమును , సూర్యకిరణములవలె కాంతులీనుచున్న ఈ శరములను వాఢియైన ఈ శక్తి ఆయుధమును దేవేంద్రుడే మీకు సమర్పించెను . మహా వీరుడవైన ఓ ప్రభూ! ఈ రధమును అధిరోహింపును . నేను నీకు సారధిగా వుండుదును రావణుడిని జయింపుము" . మాతలి ఇలా విన్న పించిన పిమ్మట శ్రీ రాముడు మిక్కిలి గౌరవముతో ఆ రధమును ప్రదక్షిణ కావించి దాన్ని అధిరోహించెను .
పిమ్మట శ్రీ రాముడికి రావణునికి మధ్య గగుర్పాటును కూర్చుంటువంటి సంకుల సమరం జరిగింది . రాముడు రావణుడు ప్రయోగించిన గంధర్వాస్త్రమును గంధర్వాస్త్రముతోను ,దివ్యాస్త్రమును దివ్యాస్త్రముతోను భగ్నము చేసెను . పిమ్మట దుష్టుడైన రావణుడు మిక్కిలి కోపంతో అతి భయంకర మైన రాక్షసాస్త్రంను ప్రయోగించెను . ఆ అస్త్రము సర్పముల వలే మహా విషపూరితమై తమ పడగల పై గల మణులతో దశదిశలా వ్యాపించెను . వెంటనే శ్రీ రాముడు గరుడాస్త్రము ప్రయోగించెను. ఆ అస్త్రము నుండి గరుడ రూపములు బంగారు రెక్కలు కలిగి రాక్షసుడు ప్రయోగించిన అస్త్రము నుండి వెలువడిన నాగులను సంహరించెను . ఆలా తన అస్త్రములన్ని వ్యర్ధమై పోవుటచే రావణుడు మిక్కిలి కోపంతో శ్రీ రాముడిపై బాణములను వర్షములా కురిపించసాగెను .
రావణుడు తన బాణముతో మాతలిని గాయపరిచేను. రధ ధ్వజమును ముక్కలు చేసెను . రధమునకు కట్ట బడిన ఇంద్రాశ్వములను కూడా గాయపరిచెను . రావణుడి యొక్క యుద్ధ తీవ్రతను చూసిన దేవ , దానవ , గంధర్వులు, విచారమునకు లోనయ్యిరి . సిద్దులు మహర్షులు , వానర ప్రముఖులు విభీషణాదులు శ్రీ రాముని చూసి మిక్కిలి వ్యధచెందిరి . రావణుడు వరుసగా బాణములను ప్రయోగించుటచే దెబ్బ తినిన శ్రీ రాముడు శరములను సంధింప లేక పోయెను . అప్పుడు శ్రీ రాముడు కోపంతో కన్నులు ఎర్ర చేసెను .
రామాయణము ---------యుద్ధకాండ ----------నూటమూడవసర్గ --------------సమాప్తము .
శశి ,
ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు ), తెలుగుపండితులు .
No comments:
Post a Comment